Wednesday 16 September 2015

Facebook ఇలా ఉపయోగిస్తే సరి... నవతెలంగాణ

 

 

 

ఇలా ఉప‌యోగిస్తే స‌రి

Sunday 13 September 2015

నవమ వార్షికోత్సవ శుభవేళ...




అక్కడ చాలామంది గుమిగూడి ఉన్నారు. ఎవరో పాప నీళ్లలో పడిందంట .. అందరూ నీళ్లలోకి తొంగి చూస్తూ ఆదుర్దాగా, కంగారుగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఎవరో దూకిన చప్పుడైంది. ఆ  దూకిన వ్యక్తి ఆ పాపను  పైకి తీసుకువచ్చాడు. అందరూ అభినందించారు. ప్రాణాలకు తెగించి పాపను కాపాడావు. గొప్పవాడివి అంటూ పొగిడేసారు. కాని ఆ వ్యక్తి చిరాకుపడుతూ ఎవడ్రా తొంగిచూస్తున్న నన్ను నీళ్లలోకి తోసింది. అసలే నాకు ఈత రాదు. ఐనా ప్రాణభయంతో ఈదుతూ పాపను కూడా లాక్కొచ్చాను అని కోపంగా అరుస్తూ వెళ్లిపోయాడు..

ఇలాగే టైమ్ పాస్ కోసం అంతర్జాలానికి వచ్చిన నన్ను బ్లాగుల్లోకి తోసేసినవాళ్లందరిమీద చాలా కోపంగా ఉంది. ముఖ్యంగా ఒక ఫ్రెండ్  టీవీ సీరియళ్లు, నవళ్లు, సస్పెన్స్ సీరియల్స్ తప్ప వేరే తెలుగు సాహిత్యమంటే తెలీని నన్ను నువ్వు రాయగలవు, రాయి, ఆలోచించు. రాయి అంటూ  నాచేత అక్షరయజ్ఞం మొదలెట్టించారు. నా ఆలోచనలు చాలావాటిని మెరుగుదిద్ది రాసేలా చేసారు. అలా అలా సాగిపోతుంది. ఇప్పుడు కాస్సేపు టీవీ చూద్దామన్నా, పడుకుందామన్నా తీరిక దొరకడంలేదు. వందిళ్ల పూజారి అన్నట్టు  ఒకటి కాగానే ఇంకో పని...ఇష్టమైన పనే కాని అప్పుడప్పుడు విసుగు రాదేంటి ఎవరికైనా..  అందుకే ఒక్కోసారి ఆ వ్యక్తి మీద చాలా కోపమొస్తుంది. తిట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఇలా రాయడం అలవాటు కాకుంటే ఎంచక్కా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సీరియల్స్ అన్నీ చూస్తూ హాయిగా ఉండేదాన్ని. ఏ టెన్షనూ లేకుండా టీవీ చూస్తూ, అఫ్పుడప్పుడు ఊరిమీద పడి తిరుగుతూ, కావలసినప్పుడల్లా నిద్రపోతూ ఉండేదాన్ని. ఎంత ఖాళీ సమయముండేది.. ఇప్పుడవన్నీ కుదరడం లేదు కదా.. కోపం రాదేంటి మరి..

సెప్టెంబరు నెల వస్తుందనగానే ప్రతీ సంవత్సరం నాలోని ఆలోచనలు,
జ్ఞాపకాలు  రింగులు.. రింగులు చుట్టుకుంటూ గిర్రున వెనక్కి వెళ్లిపోతుంటాయి. ఎందుకంటే నా జీవితంలో ఊహించని మలుపు తిప్పిన తెలుగు బ్లాగు ప్రయాణం ప్రారంభమైంది  ఇదే సెప్టెంబరు 14, 2006లో కాబట్టి. అసలైతే ఏదో ఏడాది లేదా రెండు లేదా మూడేళ్లకు బ్లాగు రాయడం ఆపేసేదాన్ని. కాని దిగినకొద్దీ నేర్చుకోవడానికి ఎన్నో నిధినిక్షేపాలు దొరుకుతుంటే ఎవరు మాత్రం వెనక్కు తిరుగుతారు. కంప్యూటర్ అంటే ఒక డబ్బా టీవీ, టైప్ రైటర్ అని తప్ప వేరే తెలీని నాకు ఓపికగా ఎన్నో సాంకేతిక విషయాలను, ఎప్పటికప్పుడు, అడిగినప్పుడల్లా వివరంగా నేర్పించిన వారెందరో.. నా పిచ్చి రాతలను రచనలుగా చేసుకోవడంలో ప్రోత్సహించి, తప్పులను ఎత్తి చూపి సరిదిద్దుకునేలా చేసిన సాహిత్య గురువు ... మధ్యలో కొన్ని ఆటంకాలు వచ్చినా మిత్రుల సాయంతో నా బ్లాగ్ ప్రయాణం ఆపకుండా కొనసాగించాను..  ఒకానొక సమయంలో నేనేంటి? నా జీవితం ఇలాగే గడిచిపోవాలా? పిల్లలు ఉద్యోగాల్లో చేరి, పెళ్లిల్లయ్యాక వాళ్లకు, వాళ్ల పిల్లలకు సేవలు చేయడం, టీవీ చూడడం, అందరి బాగోగులు చూడడమేనా నా పని? వేరే ఏమీ చేయలేనా? నా గుర్తింపు ఏంటి? అసలు నేనేమి చేయగలను? ఉద్యోగం చేయాలంటే పెద్ద చదువులు లేవు. పాండిత్యము లేదు. ఇప్పుడు చదువుకుని మాత్రం ఏం చేయాలి ?? చదివినదంతా టైమ్ పాస్ పుస్తకాలే. సస్పెన్స్ నవళ్లు, వార పత్రికలు .. పుట్టింటివైపు, అత్తింటివైపు పండితులనదగ్గవారు లేరు. తెలుగు  పాండిత్యం కాస్తైనా నాకు ఉందేమో అనుకోవడానికి. నేను ఎప్పటికీ ఫలానా వారి కూతురు, భార్య, తల్లి అని అనిపించుకోవాలా? ఎప్పుడు వారి మీద ఆధారపడాలా?? థూ!! యెదవ జన్మ.... నా బతుకింతే... ఇలా సమాధానం లేని ప్రశ్నలెన్నో ?? కాని వీటన్నింటికి సమాధానాలు కనుక్కొని నా ప్రస్థానాన్ని ప్రింట్ మీడియాకు, పత్రికా నిర్వహణకు, చివరకు పబ్లిషింగ్ రంగంలోకి మారడం వరకు మూలకారణమైన నా బ్లాగు నాకు ఎప్పటికీ అపురూపమే. ఎప్పుడే ఆలోచన వచ్చినా బ్లాగులో రాసేసేదాన్ని కాని  ఇప్పుడు ఆ ఆలోచనలు  కొన్ని పత్రికలకు మరికొన్ని ఫేస్బుక్ గోడమీదకు చేరిపోతున్నాయి. అందుకే బ్లాగుల్లో ముందులా రాయలేకపోతున్నానే అని దిగులుగా ఉంటుంది. రోజుకు మరో నాలుగు .. కనీసం రెంఢుగంటలైనా ఎక్కువుంటే బావుండు. ఎవరైనా అరువిస్తే బావుండు అని ఎన్నిసార్లు అనుకున్నానో... 


జీవితపు రెండవ భాగంలో మొదలెట్టిన ఈ జాలప్రయాణంలో మొదట ఒడిదుడుకులైనా ధైర్యంగా నిలదొక్కుకోవడం వల్ల అంతా విజయమే.. బ్లాగులు (Jyothi, జ్యోతి, షడ్రుచులు, బ్లాగ్ గురువు, పొద్దు గడి, చిత్రమాల, గీతలహరి, నైమిశారణ్యం, ఆముక్తమాల్యద, విజయవిలాసం) అన్నీ కలిపి  ఇంతవరకు సందర్శించిన ఆత్మీయబందువులు సుమారు 7 లక్షలవరకు ఉన్నారు) ఈ ప్రేమ, అభిమానమంతా నా స్వార్జితం .. నా సొంతం మరి... 


తొమ్మిదేళ్ల నా బ్లాగు సుందరి జ్యోతి నన్ను నేను పరిశీలించుకుని, విమర్శించుకుని, విశ్లేషించుకునేలా చేసి ఆ భావాలను అక్షరాలలో నిక్షిప్తం చేసుకునేలా చేసింది. ఎన్నో అందమైన భావాలకు నిలయమైంది. వివిధ సందర్భాలలో నా సంఘర్షణ, నా స్పందన అన్నీ తనలో దాచుకుంది. అప్పుడప్పుడు నాలోని వేదనకు, ప్రశ్నలకు చర్చావేదికగా మారింది.. నాకు నచ్చిన పాటలతో సరాగాలాడింది.  పద్యాల ఆటలాడింది. బొమ్మలతో మాటలాడింది.  భక్తిసాగరంలో ఓలలాడించింది.. నాకంటూ ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా అడుగులేసేలా చేసింది నా బ్లాగు.. అందుకే నిరంతరం నన్ను నేను నా బ్లాగులో చూసుకుంటూ ఉంటాను.... నా బ్లాగు నా హృదయభాను అన్నమాట. అందుకే ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటాను.. తెలుగు బ్లాగులవల్ల నాకంటే ఎక్కువగా లాభపడింది ఎవరూ లేరు అని. J ఆ మాత్రం గొప్ప చెప్పుకుంటే తప్పేంటంట.. 


నా పుట్టినరోజుతో పాటు నాకు పునర్జన్మని, మహత్తరమైన గుర్తింపునిచ్చిన నా బ్లాగు జ్యోతి కి తొమ్మిదవ హ్యాపీ హ్యాపీ బర్త్ డే  అన్నమాట..... ఈ సందర్భంగా నాకు తోడున్న, ప్రోత్సహించిన, అభినందించిన, సంతోషించిన ఆత్మీయ మిత్రులందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు..

శుభం భూయాత్......

Thursday 10 September 2015

మహాభారతము - తాతా శ్రీనివాసరావు




జె.వి.పబ్లికేషన్స్ నుండి రాబోతున్న తర్వాతి పుస్తకం మహాభారతం.




 బెంగాలీనుండి తెలుగులోకి అనువదింపబడిన ఈ పుస్తకంలో ఆదిపర్వం నుండి విరాట పర్వం వరకు సవివరంగా రాసారు శ్రీ తాతా శ్రీనివాసరావుగారు.
కవర్ డిజైన్: వాసు చెన్నుపల్లి Vasu Chennupalli
పేజీలు: 448
ధర: 200
కినిగెలో ఈ పుస్తకం ఉచితంగా లభిస్తుంది.. కాని ఇప్పుడే కాదు...

వీరులం... శూరులం..




 pic courtesy: Krishna Ashok


వీరులం... శూరులం..
ఎవరేమన్నా ఏమైనా చెక్కు చెదరని ధీరులం
అని విర్రవీగుతాం కాని ఇది నిజమేనా??
ఓ క్షణం గర్వం.. మరుక్షణం బలహీనం
ఒక్కోసారి సంతోషం.. మరోసారి దిగులు ..
ఇవి మనసు ఆడే ఆటలా? ఆ దేవుడి లీలలా?
తుఫానులను ఎదుర్కొన్న ధైర్యం
చిరుగాయానికే తల్లడిల్లి, కృంగిపోయి
చెల్లా చెదురై... అల్లకల్లోలమైపోగా..
అలసి సొలసిన మనసును సేదదీర్చేదెలా?
అక్కున జేర్చుకుని సాంత్వన నిచ్చేదెలా??
ఏమిటో ఈ మాయ??
కాలం చెప్పాల్సిన సమాధానాలకై
ప్రశ్నలు సంధించడమేగా మనసు చేయగలిగింది !!!!

నీలీ - ఆకుపచ్చ (భూమికి పునరాగమనం)

జె.వి.పబ్లికేషన్స్ నుండి వస్తోన్న కొత్త సైన్స్ ఫిక్షన్ నవల

నీలీ - ఆకుపచ్చ
(భూమికి పునరాగమనం)


అంగారక యాత్ర ముగించుకుని హనీ ఆమ్రపాలి భూమికి తిరిగొచ్చాడు. అసలు కుజగ్రహానికి ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఒక కలని నిజం చేసుకోవాలని. ఎన్నో సంవత్సరాల నుంచి స్వప్నాలలో ప్రత్యక్షమై అతన్ని ఆకర్షించి, శాసించి కుజగ్రహానికి రప్పించుకుంది అందాలరాశి అయిన 'సయోనీ'. ఆమెపై మోజుతో అక్కడికి వెళ్ళిన హనీ భ్రమలు తొలగిపోతాయి, అరుణ భూముల చక్రవర్తి సమూరా చేతిలో బందీ అవుతాడు. కుజుడి మీద ఉన్న ఒలింపస్‌ శిఖరం మీద దాచబడి ఉన్న అమరత్వం ప్రసాదించే ఔషధాన్ని తెచ్చి తనకివ్వాలని ఒత్తిడి చేస్తాడు సమూరా. ఎలాగొలా దాన్ని తెచ్చిస్తాడు హనీ. ఆ తరువాత మానవ కాలనీకి, మాంత్రిక రాజ్యం అరుణ భూములకి మధ్య ఎప్పట్నించో ఉన్న వైరం అకస్మాత్తుగా యుద్ధ రూపంలోకి మారడంతో, హనీ ఆ యుద్ధంలో పాలుపంచుకుంటాడు. కుజగ్రహపు మాంత్రికుల వద్ద శిక్షణ పొంది విశ్వశక్తిని కరతలామలకం చేసుకుంటాడు హనీ. ఈ క్రమంలో తనలో జన్యుసంబంధమైన ప్రత్యేక శక్తి వుందని, అది తనకి పుట్టుకతోనే లభించిందని తెలుసుకుంటాడు. అమృత ఔషధం తాగితే శక్తులు నశిస్తాయన్న నిజాన్ని దాచిపెట్టి, సమూరా ఆ ఔషధాన్ని సేవించేలా చేస్తాడు హనీ. దాంతో విశ్వాన్ని జయించాలన్న తన ఆశయం నెరవేరకపోయేసరికి హనీ మీద పగ పడతాడు సమూరా. కుజుడి మీద మానవులకి, అరుణ భూముల పాలకులకి మధ్య సంధి కుదిర్చి, అరుణ భూములకు తన స్నేహితుడు మీరోస్‌ని ప్రభువుగా చేస్తాడు హనీ. కుజగ్రహంమీద మానవులు హనీని సత్కరిస్తారు.. కాని చివరికి వాళ్ళు కూడా హనీని అనుమానించి వెంటాడుతారు. గురుడి ఉపగ్రహం గ్వానిమెడ్‌ నుంచి వచ్చిన ఏనిమాయిడ్‌‌ని మానవ సైనికాధికారి జనరల్‌ గ్యానీ అశ్వశాలనుంచి రక్షించే క్రమంలో మానవులకీ శత్రువవుతాడు. ఎలాగొలా తప్పించుకుని భూమికి చేరుతాడు.
తిరిగొచ్చాకా, ఇండికా సెంట్రల్ యూనివర్సిటీలో బయోమెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో అధ్యాపకుడిగా తన ఉద్యోగంలో కొనసాగుతూంటాడు. అయినా గ్రహాంతర దుష్ట మాంత్రికులు అతనిని వెంటాడడం ఆపరు. అతని గదిలో దొంగతనం జరుగుతుంది, అతని జీవితమే ప్రమాదంలో పడుతుంది. గ్రహాంతర దుష్ట మాంత్రికులే కాకుండా, ఎర్త్ కౌన్సిల్ కూడా హనీ ఆమ్రపాలికి అడ్డు తగులుతూనే ఉంటుంది.. భూమి మీద విశ్వశక్తిని ప్రయోగించడం నిషేధించిన కారణంగా ఎర్త్ కౌన్సిల్ హనీని ఓ కంట కనిపెడుతూ ఉంటుంది.

"కుజుడి కోసం" నవలకిది అద్భుతమైన కొనసాగింపు నీలీ - ఆకుపచ్చ... కథాస్థలం ఈసారి భూగ్రహం! హానీని వెంటాడి వేధించి పాపిష్టి పనులకు వాడుకోవాలని చూస్తారు కుజగ్రహపు దుష్ట మాంత్రికులు. అయితే ఇప్పుడు కూడా హనీదే గెలుపు..

చదవండి... మరో లోకాలకి తీసుకెళ్ళే ఈ సైన్స్ ఫిక్షన్‌ని!

డా. చిత్తర్వు మధుగారు రచించిన సైన్స్ ఫిక్షన్ నవల "కుజుడి కోసం"కి కొనసాగింపుగా వస్తోన్న కొత్త పుస్తకం... నీలీ – ఆకుపచ్చ నవల త్వరలో మీ ముందుకు రాబోతుంది.

Saturday 5 September 2015

మాలిక పత్రిక సెప్టెంబరు 2015 సంచిక విడుదల

Jyothivalaboju
Chief Editor and Content Head

దినదినాభివృద్ధి, పాఠకుల ఆదరణ, రచయితల చేయూతతో అందరినీ అలరిస్తున్న మాలిక పత్రిక సెప్టెంబర్ సంచిక విడుదలైంది. ఈ సంచికలోని విశేషాంశాలు...
స్పందన క్షీణిస్తున్న నేపధ్యంలో ఈ నెలనుండి మాలిక పదచంద్రిక నిలిపివేయబడుతోంది. మరో కొత్త ఆలోచనతో తయారైన ప్రహేళికతో త్వరలో కలుద్దాం..

మీ రచనలను పంపవలసిన చిరునామా: editor@maalika.org


01. మాలిక పదచంద్రిక
02. వీసా వెతలు
03. అనగా అనగా Rj వంశీ
04. చిగురాకు రెపరెపలు 8
05. శోధన 6
06. మాయానగరం 18
07. మన వాగ్గేయకారులు 3
08. ముఖారి 
09. రాగమాలిక - మోహన
10. Dead People Dont Speak 8
11. శుభోదయం 2
12. ఆరాధ్య 12
13. గిరిజాదేవి మరియు ఘోటో తరిణి
14. వసంతం - గతాలు, స్వగతాలు
15. అవగాహన
16. ఏక్ తారా
17. అక్షరసాక్ష్యం - రంగనాథ్ కవితలు
18. శశి కార్టూన్లు
19. ఘాటెక్కిన ఉల్లి కార్టూన్లు

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008