ఆఫీసుల్లో ఉండే కంప్యూటర్ ఇంటర్నెట్ ఈనాడు దాదాపు ప్రతీ ఇంటిలోకి వచ్చేసింది. సాంకేతిక నిపుణులే కాక ఉద్యోగాలు చేయని, కంప్యూటర్స్ గురించి తెలియనివారు, విశ్రాంత ఉద్యోగులు, గృహిణులు అందరూ ఉపయోగిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉపయోగానికే కాక కంప్యూటర్ , నెట్ ని తమకు తెలిసిన ఆలోచనలనన్నింటికి అవలీలగా వాడుకుంటున్నారు. అందులో ఒక ప్రముఖమైన భాగం బ్లాగులు. అసలు రాయడానికి ఏముంటాయిలే. మాట్లాడమంటే మాట్లాడటం కాని రాయమంటే మావల్ల కాదు. మేమేమన్నా రచయితలమా.. అబ్బే..
సభాస్థలికి చేరు మార్గ వివరాలు...
ఇలా అనుకునేవారికి అసలు బ్లాగులంటే ఏంటి? ఎలా రాయాలి. ఎందుకు రాయాలి. దానివల్ల ఉపయోగాలేంటి? బ్లాగుకు హంగులు ఆర్భాటాలు ఎలా జత చేయాలి వగైరా విషయాలన్నింటిని సవివరంగా రాసి పుస్తకంలా అందిస్తున్నారు . "బ్లాగుపుస్తకం" ... ఈ పుస్తకాన్ని రాసినవారు సుజాత , రహ్మాన్.. రేపు ఆదివారం ఈ బ్లాగు పుస్తకం ఆవిష్కరణ జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ పుస్తకావిష్కరణకు తప్పకుండా విచ్చేయవలసిందిగా అంతర్జాలంలో తెలుగు, తెలుగు బ్లాగులను చదివేవారందరికీ ఆహ్వానం పలుకుతున్నారు నిర్వాహకులు..
ప్రేమ.. అసలు ఈ పదానికి ఇదే సరైన అర్ధం అని ఎవరూ చెప్పలేరేమో. ఒక వస్తువు, పుస్తకం, దృశ్యం మీద అమితమైన ఇష్టం కలగడం సామాన్యమైన విషయం. అలాగే వాటిని ప్రేమించడం కూడా తప్పేమి కాదు. కాని స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అంటే నొసలు చిట్లిస్తారు అందరూ.. ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను అంటే అందరికి ఎన్నో సందేహాలు వస్తాయి. చాలా మంది అది ఆకర్షణ, వ్యామోహం తప్ప ఇంకేమీ కాదంటారు. అందుకేనేమో తొమ్మిదో తరగతి చదివే పిల్లలు కూడా ప్రేమించుకుంటున్నారు. పెళ్ళి చేసుకుంటామంటున్నారు. టెంత్ క్లాసు పిల్లల ప్రేమ గురించి సినిమాలు కూడా తీసేస్తున్నారు. యవ్వనంలో ఉన్నవారి మధ్య ఆకర్షణ ఉండడం సహజం. నచ్చినవారిని ప్రేమిస్తున్నాం అంటారు. కొందరు మాత్రమే తమ ప్రేమను పెద్దలతో పోరాడైనా పెళ్ళి వరకు తెచ్చుకుని కలిసి ఉంటారు. కాని పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఒకరినొకరు తెలుసుకున్నది లేదు, కలుసుకున్నదీ లేదు. పేరు, చదువు తప్ప అభిరుచులు వగైరా ఏమీ తెలీకుండానే పెళ్లిల్లు జరిగిపోతాయి. జీవితాంతం కలిసి ఉండాలి కనుక వారిద్దరి మధ్య ప్రేమ ఉంటుందో లేదో ప్రేమ అని చెప్పుకునే వైవాహిక బంధం ఏర్పడుతుంది. ఇందులో ఎంతమంది దంపతులు ఒకరి అభిరుచులు, ఆలోచనలు ఒకరు అర్ధం చేసుకుని వాళ్లని ప్రోత్సహిస్తూ, ఉత్తేజపరుస్తూ ఉంటారో లేదో సందేహమే. ఇక ఇందులో ప్రేమకు చోటెక్కడిది?. అలా ఉద్యోగం, ఇల్లు, చుట్టాలు, పిల్లలు అంటూ జీవితం సాగిపోతుంటుంది. ఇదే అన్యోన్య దాంపత్యం. అలాంటి సమయంలో ఏర్పడిన ఓ పరిచయం, క్రమేణా పెరిగి ఇష్టమై చివరికి ప్రేమగా మారుతుంది. అదే " తన్హాయి "
ఐనా మొగుడు మంచివాడే , బాగా చూసుకుంటాడు.. ఒక కూతురు, మంచి ఉద్యోగం, ఇల్లు అన్నీ ఉన్న తర్వాత కూడా ఈ కల్హరకు రోగమా? ఈ వయసులో ప్రేమలో పడడానికి ???
ఈ పుస్తకం మొదలుపెట్టాక సాధారణమైన కధలా అనిపించినా ముందుకు సాగుతున్న కొద్దీ అందులోని ప్రతీ సంఘటన మన కళ్లముందు జరుగుతుంది అన్నంత సహజంగా రాసారు రచయిత్రి. ఈ కథ అమెరికాలో జరిగింది కాబట్టి ఇలాంటి ఆలోచనలు అమెరికా వాళ్లకు, అక్కడ ఉన్నవాళ్ళకు మాత్రమే వస్తాయి అని అనుకోవడం తప్పు. ఈ ప్రేమ విశ్వవ్యాపితం. పెళ్లైనవాళ్లు వేరే వ్యక్తిని ప్రేమించడం దారుణం, చాలా తప్పు అనుకునేవారికి ఈ కథ అసహజంగానే ఉంటుంది. కాని ఇది మన చుట్టూ జరిగే సహజమైన కథ. అలా అని ప్రతీ వ్యక్తి పెళ్ళయ్యాక కూడా మరో వ్యక్తిని ప్రేమిస్తాడు అని కాదు. ఈ నవల చదువుతుంటే ఒక మామూలు ప్రేమ కథలా కాకుండా ఆ వ్యక్తులే మనతో మనసు విప్పి మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ప్రతీ ఆలోచనా నిజమే కదా అనిపిస్తుంది. ఇందులో హీరో విలన్ అంటూ లేరు.. ప్రతీ క్యారెక్టర్ కల్హర, కౌశిక్, చైతన్య, మృదుల.. ఎవరిదీ తప్పు లేదు అందరూ రైటే అనిపిస్తుంది. అసలు చదువుకునే సమయంలో కులాలు కలవవు, అమ్మా నాన్న ఒప్పుకోరని తెలిసిన కల్హర తనను ప్రేమించిన వ్యక్తిని కాదనుకుని, పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకుంటుంది. భర్త చెప్పినట్టుగా అతనికిష్టమైనట్టుగా సంసారం చేసూ ఉంటుంది. అతను చెప్పేవి నచ్చకున్నా, వాదించినా చివరికి ఒప్పుకుంటుంది కాని ఎదిరించదు. కాని అనుకోకుండా కౌశిక్తో పరిచయం కలిగి, ఇష్టంగా మారి ప్రేమలో పడడం అనేది చాలా సహజంగా జరిగిపోతుంది. ఒకవైపు కౌశిక్ని ప్రేమిస్తున్నా, తను తప్పు చేస్తున్నానేమో అన్న భావన ఆమెను అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది.
కల్హర కౌశిక్ని అమితంగా ప్రేమించినా మనసుతోపాటు శరీరాన్ని పంచుకోవాలని అనుకున్నా అలా చేయదు, భర్తను వదులుకోవడానికి ఇష్టపడదు. ఎంత చదువుకున్న, అమెరికాలో ఉన్నా కల్హర ఒక సాధారణ , మధ్యతరగతి యువతిలాగే తనకంటే ముందు తనవారి గురించి ఆలోచించింది. పెద్దలొద్దంటారని పెళ్లికి ముందు ప్రేమను వద్దనుకుంది. కాని స్వంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ, ఆ నిర్ణయం వల్ల ఎదురయ్యే సమస్యలను ఎదుర్కునే శక్తి సామర్ధ్యాలు ఉన్నా కూడా తెగించలేదు. కుటుంబాన్ని దాటి నిర్ణయం తీసుకోలేదు. అతనితో సన్నిహితంగా ఉండాలని కోరిక ఉన్నా ఉండలేక ప్రేమ, త్యాగం, కుటుంబం, కర్తవ్యం, మలినం, తప్పు ఒప్పుల గురించి అనుక్షణం తనని తాను ప్రశ్నించుకుంటూ ఉంటుంది. చర్చించుకుంటూ ఉంటుంది. కౌశిక్ కంటే కల్హర ఎక్కువగా మధనపడుతుంది. సగటు ఇల్లాలిగానే ఆలోచిస్తుంది ఎందుకంటే స్త్రీగా ఆమెకు సమాజం కొన్ని కాదు ఎన్నో హద్దులు, ఆంక్షలు విధించింది. సమాజం ఎంత అభివృద్ధి చెందినా ఈ సంకెళ్లు వదులు అయ్యాయేమో కాని ఇంకా వీడిపోలేదు. అందుకే పిరికిదనంతో ఈ విషయాన్ని దాచిపెట్టకుండా, అపరాధభావనతో ఉండలేక భర్త చైతన్యతో తాను కౌశిక్ని ప్రేమిస్తున్నా అని చెప్తుంది. అతను ఆమెను అర్ధం చేసుకోవాలనే ప్రయత్నం చేయకుండా, తన భార్య తనను కాక వేరొక వ్యక్తిని ప్రేమించింది అంటే తనలో లోపమేంటో అని ఆలోచిస్తాడు. నలుగురికి తెలిస్తే ఏమవుతుందో అని గాభరా పడతాడు . తన భార్య తనను గాక మరో పురుషుడిని ప్రేమిస్తుంది అనగానే అతని మనసులొ వచ్చిన ఆలోచన " Did u sleep with him?" అంటే అతని దృష్టిలో " to love, to make love" కి తేడా తెలిదు. ప్రేమ అనగానే శారీరక సంబంధం అనుకుని అది లేదని తెలిసాక స్తిమిత పడతాడు. ఒక మామూలు మధ్యతరగతి భర్తలా ప్రవర్తించాడు చైతన్య. అసలు ఆమెకు తాను సంపూర్ణమైన ప్రేమను ఇచ్చాడా అని అస్సలు ఆలోచించకుండా తన సంసారాన్ని చిందరవందర చేసుకుని అందరి దృష్టిలో తక్కువ కావడం భరించలేక ఇండియా వెళ్ళిపోదామంటాడు.
కౌశిక్ భార్య మృదుల కూడా అతన్ని చాలా ప్రేమిస్తుంది . అతని మనసులో తనొక్కదానికే స్థానం ఉండాలి అనుకుంటుంది. కల్హర, కౌశిక్ ల మధ్య సాన్నిహిత్యాన్ని అనుమానించి అది నిజమని తెలిసాక కృంగిపోతుంది. భార్య ప్రేమ విషయం తెలిసిన చైతన్య భారతదేశం వెళ్లిపోయి కొత్తగా మొదలుపెట్టి ఆమె జ్ఞాపకాలను చెరిపేయాలని అనుకుంటాడు. మృదుల మాత్రం కౌశిక్ భావాలను అర్ధం చేసుకోవాలని అనుకుంటుంది.. ఇష్టపడడం, ప్రేమించడం వంటి అనుభవాలు లేకుండా ఒకరికొకరు పూర్తిగా తెలుసుకుని అర్ధం చేసుకోకుండానే సంసారం బంధంలో ఉన్న కల్హర, కౌశిక్ల జీవితంలోకి ప్రేమ వచ్చి వారిని , వారి భాగస్వాముల జీవితాలను కూడా అల్లకల్లోలం చేస్తుంది. భాగస్వామికి దూరం కాలేరు, ప్రేమించినవారితో కలిసి ఉండలేరు. అందుకే చివరికి కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చి తమ ప్రేమను మర్చిపోవాలని నిర్ణయించుకుని వీడ్కోలు చెప్పుకుంటారు. కాని ఆ ప్రేమను నిజంగా మర్చిపోగలరా? మనుష్యులు దూరమైనంత మాత్రానా మనసు దూరమవుతుందా? ఈ ప్రేమ గురించి వారి జీవితంలో మళ్లీ ప్రస్తావన రాకుండా ఉంటుందా? నిజంగా వారు ప్రేమని మర్చిపోగలరా?? ప్రేమ , స్త్రీ పురుష సంబంధాలు, పవిత్రత, ఒకరి మనసులో ఒకరికే స్థానం ఉండాలి. ఎవరెలా ఉన్నా జీవితాంతం ప్రేమిస్తూనే ఉండాలి అనే భావాలూ ఉన్నంత కాలం ఈ సంఘర్షణలు తప్పవు.
“తన్హాయి” నవల ఇతివృత్తం తెలిసినవారు మొదట్లో అసలు పెళ్లైనవాళ్ల మద్య ప్రేమేంటి? తప్పుకదా అనిపించొచ్చు కాని రచయిత్రి కల్పన రెంటాల ఆ కధను చాలా సమర్ధవంతంగా నడిపించారు. ఇది అక్రమసంబంధాన్ని ప్రోత్సహించేట్టు కాక తమ జీవితంలో అనుకోకుండా ప్రేమలో పడిపోయిన ఇద్దరు వ్యక్తుల మానసిక స్థితి , సంఘర్షణ ఎలా ఉంటుందనేది ఎంతో హృద్యంగా చిత్రీకరించారు రచయిత్రి. కధలా చదవడం మొదలుపెట్టినా రాన్రాను అందులోని పాత్రల మనస్సుల్లోకి దూరిపోయి చదివినట్టు ఉంటుంది. భార్యా, భర్తల మధ్య సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని, పిల్లల పెంపకంలో వారి పాత్ర, ఉద్యోగం చేసే చోట ఎదుర్కునే సంఘటనలు అన్నీ కళ్లకు కట్టినట్టుగా చిత్రించారు రచయిత్రి. కల్హర, కౌశిక్ ల మధ్య ప్రేమ భావాలను వ్యక్తీకరిస్తున్నప్పుడు అబ్బా! ఎంత అందంగా ఉంది అభిపిస్తుంది. అలాగే వాళ్లు తమ ప్రేమని దాచుకోలేక , భాగస్వాములముందు బయటపడకుండా ఉండడానికి పడే తాపత్రయం, వారు కలవాలని ఉన్నా కలవలేని పరిస్ధితులతో క్షణక్షణం అనుభవించిన మనోవ్యదని చదువుతుంటే బాధగా ఉంటుంది. ఇలా ప్రేమలో పడడం మగవాడికి పర్వాలేదని అనుకున్నా ఒక పెళ్లైన స్త్రీ భర్త ఎలాటివాడైనా సర్దుకుపోవాలి తప్ప మరో పురుషుడి గురించి ఆలోచించ కూడదు అంటుంది సమాజం మన వివాహ వ్యవస్ధ. ఆడవాళ్లు ఇంట్లోనే ఉన్నా, పెద్ద పెద్ద చదువులు చదివి విదేశాల్లో ఉన్నా ఈ ఛట్రాలు ఆమెను ఎప్పటికి బంధించి ఉంటాయి.. చివరికి తమ ప్రేమను చంపుకుని సంసారాన్ని నిలుపుకుంటారు. ఇది అందరికి మంచిదేమో ఆ ఇద్దరికి తప్ప... కాని తప్పదు. ప్రేమ ఏ వయసులో కలిగినా తిప్పలు తప్పవు. కొన్ని మాత్రమే ఫలిస్తాయి.
ఈ నవలలో నాకు బాగా నచ్చిన వన్స్ మోర్ అనుకునే మాటలు..
కొన్ని ఫీలింగ్స్ అర్ధమయ్యేవి కావు. అనుభవంలోకి రావాలి. అనుక్షణికమై నిలవాలి. ఆ ఫీలింగ్ నామ, రూపరహితంగా ఉంటుంది. కొందరు దాన్ని ప్రేమ అంటే మరికొందరు మోహం అంటారు.
చెట్టు మొత్తం పూలతో నిండి చూడడానికి ఓ పెద్ద canopy లాగా అనిపిస్తుంది. ఆ పూలపందిరి కింద నుంచి నడిచి వెళ్లేటప్పుడు రాత్రి ఎవరో వచ్చి ప్రేమగా ఆ పూలచెట్టుని గట్టిగా హత్తుకొని ఒక ఊపు ఊపి వెళ్లిపోయినట్టు దానితో ఆ పూలరెక్కలన్నీ విషాదంగా నేలమీద వాలి ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది.
ఒక పని చేయాలని మనసుకి తీవ్రంగా అనిపించినప్పుడు ఆ చేస్తున్న పని ఒప్పే అనిపించేలా మన మనస్సు చాలా కన్వీనియంట్ గా, తెలివిగా మనకు నచ్చ చెపుతుంది. అది మనసు వేసే ట్రాప్. చాలామంది తెలిసో తెలియకో ఆ ట్రాప్ లో పడిపోతుంటారు. కొద్దిసేపటికో, కొద్ది కాలానికో కొందరు పైకి లేచి నిలబడతారు. కొందరు ఎప్పటికోగాని కళ్లు తెరవరు.
ప్రేమ ఎప్పుడూ ఒక బలమయిన, తీవ్రమయిన సునామి. నెమ్మదిగా, నదిలా పారుతూ మన దగ్గరికి రాదు. పెద్ద ఉప్పెనలా వస్తుంది. మనలని చుట్టేస్తుంది. పెనుగాలి ప్రళయంలా కమ్మేస్తుంది. ఆ గాలి ఉధృతిలో, అ ఉప్పెనలో కొట్టుకుపోతాము. అలా జరుగుతోందని కూడా మనకు తెలియని ఒకానొక మైకం అది.
కొన్ని కొన్ని భావాలకు, కొన్ని కొన్ని అనుభూతులకు కారణాలుండవు, దొరకవు.
ప్రేమ జీవితంలో ఒక భాగం.. ప్రేమే జీవితం అయ్యే అవకాశం, అదృష్టం అందరికి దక్కదు. నాకు దొరికిన దానితో తృప్తిపడి ఊరుకుంటాను. అందని దానికోసం నేను ఉన్నదాన్ని పోగొట్టుకోలేను..
స్నేహం, ప్రేమ, ఆప్యాయత అందరితో ఒకేలా ఉండదు. ఒకరితో పంచుకున్న విషయాలు ఇంకో ఫ్రెండ్ దగ్గర కనీసం ప్రస్తావించలేము కూడా. ప్రతీ స్నేహం భిన్న. ప్రతీ ప్రేమ విభిన్నం.
అందమైన సంపెంగపూలను అరిటాకులో పొట్లం కట్టినట్టుగా ప్రేమభావనలను, సంఘటనలను, సంఘర్షణలను “ తన్హాయి” గా అందించినందుకు ... కల్పన .. ధాంక్ యూ...
ప్రేమ అనగానే ఆడవాళ్ళూ, అమ్మలే గుర్తొస్తారు. కాని కూతురు మీద నాన్నకి అమితమైన ప్రేమ ఉంటుంది కాని అది పైకి కనపడనివ్వడు అని గతంలో కూడా చెప్పాను కదా.. మరి కొన్ని భావాలు. నాలో తనని తాను చూసుకుంటూ నా అభివృద్దిని చూసి ఆశ్చర్యపోతూ, ఆనందపడుతూ గర్విస్తున్న మా నాన్నకు, పెళ్ళయ్యాక కూడా కూతురు మీద బెంగ పెట్టుకుని ఎలా ఉందో అని రోజూ గుర్తు చేసుకునే మావారికి ఈ వ్యాసం అంకితం. పది రోజుల్లో ౭౦ ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్న మా నాన్నకు ఇంతకంటే మంచి బహుమతి ఇవ్వలేనేమో..
పిల్లలను తల్లి మాత్రమే ఎక్కువ ప్రేమిస్తుంది. తండ్రికి ప్రేమించడం తెలీదు అనుకుంటారు.. కాని తండ్రి కూడా తన పిల్లలను అమితంగా ప్రేమిస్తాడు. కాని అతను బయటకు చెప్పలేడు.. పిల్లల మీద తల్లిదండ్రులకు ఒకేవిధమైన ప్రేముంటుంది కాని వ్యక్తీకరణలోనే కాస్త తేడా ఉంటుంది. కుటుంబంలో తండ్రి బాధ్యత బయటకు వెళ్లి సంపాదించి, తన కుటుంబాన్ని పోషిస్తే తల్లి ఇల్లు, పిల్లల బాధ్యత తీసుకుంటుంది. అందుకే పిల్లలకు తల్లి ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. తల్లితండ్రులు, పిల్లల గురించి చెప్పుకుంటే.. సాధారణంగా అందరూ అనుకునే మాటే కొడుకు తల్లి పోలిక, కూతురు తండ్రి పోలిక అని. అలాగే తండ్రికి కొడుకు కంటే కూతురి మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుంది అంటారు.. ఇది నిజమే.. కొడుకు అనగానే వాడు చదువుకుని, సంపాదించి కుటుంబాన్ని చూసుకోవాల్సిన వంశోద్ధారకుడు.. మగాడు వాడి గురించి దిగులు పడాల్సిన పనిలేదు అనుకుంటాడు తండ్రి. కాని కూతురు అనగానే ఎన్నో భయాలు, జాగ్రత్తలు. తన కన్నబిడ్డలో తన కన్న తల్లిని, ఆ జగన్మాతను చూసుకుంటాడు. అల్లారుముద్దుగా అడిగినవన్నీ కొనిస్తాడు. ఎప్పటికైనా ఒక ఇంటికి వెళ్ళే ఆ చిన్నారిని అపురూపంగా పెంచుకుంటాడు. పిల్లలందరినీ సమానంగా ప్రేమించినా తండ్రికి కూతురిమీద ప్రేమ రవ్వంత ఎక్కువే. అల్లారుముద్దుగా పెంచి, పెద్ద చేసి చదువుచెప్పించడంతోపాటు ఆమెకు తగిన వరుడిని వెతికి పెళ్లిచేయడం అనేది తండ్రి బాధ్యతే కదా.
తన కూతురికి దొరికే అబ్బాయి ఎలాంటివాడో, ఆమెకు ఎటువంటి కష్టం కలగకుండా ప్రేమగా చూసుకుంటాడో లేదో, అడిగినవన్నీ ఇస్తాడో లేదో అనే బెంగ నిరంతరమూ వేధిస్తుంది. కూతురు చిన్నగా ఉన్నప్పటికనుండే ఆమె పెళ్ళి గురించి డబ్బులు వెనకేస్తాడు. అత్తవారింట్లో తన కూతురు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కాని ఈ ఆలోచనలన్నీ అతని మనసులోనే నిక్షిప్తమై ఉంటాయి. బయటకు చెప్పుకోడు, చర్చించడు. అప్పుడప్పుడు భార్యతో మాత్రం తన భావాలను పంచుకుంటాడు. తన కూతురిని ఎప్పటికీ కంటికిరెప్పలా చూసుకోలేడు కాబట్టి తనలా ప్రేమించి, కాపాడుకునే భర్తను ఆమె కోసం వెతికి తీసుకొస్తాడు. ఒకవేళ కూతురు ఎవరినైనా ప్రేమించానని చెప్పినా ఇవే అనుమానాలు. ఆ అనుమానాలు తీర్చుకునేదాకా పెళ్లికి ఒప్పుకోడు.
ప్రతి తండ్రి తన కూతురిని తన కంటే ఎక్కువ హోదాలో ఉండి తన బిడ్డకు ఎటువంటి లోటురాకుండా, ప్రేమగా చూసుకునేవాడు భర్తగా రావాలని కోరుకుంటాడు. ఈనాడు చాలామంది ఆస్తి, అంతస్థులకంటే కుటుంబ మర్యాద, చదువు, ఈడుజోడు ఉంటే చాలు తమ పిల్లనివ్వడానికి సరేనం టున్నారు. దీనికోసం తమ తాహతుకు మించిన కట్నం ఇవ్వడానికి కూడా వెనుకాడడంలేదు.
తండ్రీ కూతుళ్ళమధ్య అనుబంధం చెప్పాలంటే ఆ భావాలు భాషకు అతీతం. ముఖ్యంగా తన కూతురిని ఒక అయ్య చేతిలో పెట్టి కాపురానికి పంపుతున్నపుడు ఆ బాధ అనిర్వచనీయం. శకుంతలను అత్తవారింటికి పంపిస్తున్నపుడు కణ్వమహర్షి ఒక మాట అంటాడు. 34కేవలం పెంచిన తండ్రిని నాకే అమ్మాయి బయటకు వెళుతోందంటే ఇంత బాధగా వుందే.. మరింక కన్న తండ్రి బాధను ఎవరు చెప్పగలరు?-అని. ఆ అత్తవారిల్లు ఎలాంటిదో తెలుసుకుందుకు ఆ తండ్రి ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తాడో విక్రమ్సేథ్ రాసిన 3‘ద సూటబుల్ బాయ్’2కథ2 చదివితే తెలుస్తుంది. మనవాళ్ళు లోకరీతిలో ఒక మాట చెపుతూంటారు. 34్భర్యాభర్తలిద్దరూ ఒకరిమాట ఒకరు ఎప్పుడైనా వింటారా?2అనడిగితే... ఎందుకు వినరు? ఇల్లు కట్టేటపుడు భార్య మాట భర్త, పిల్లకి పెళ్లిచేసేటపుడు భర్త మాట భార్య వింటుంది2అని. అంటే దీని అర్థమేమిటంటే ఇల్లు ఎలా ఉండాలో ఇల్లాలికి తెలుస్తుంది, రాబోయే అల్లుడు ఎలా ఉండాలో తండ్రికి తెలుస్తుంది.. అని. అందుకని ప్రేమైకమూర్తి అయిన తండ్రికి కూతురి పెళ్లి బాధ్యత నిస్సంకోచంగా అప్పచెప్పెయ్యవచ్చు. ఎంత అభివృద్ధి చెందినా అత్తవారింట జరుగుతున్న అరాచకాలు, అకృత్యాలు మాత్రం తగ్గలేదు. ఇంకా కట్నం చావులు ఆగలేదు. అందుకే తన శక్తికి మించినదైనా అడిగినంత కట్నం ఇచ్చి పెళ్ళిచేయాలని ప్రతీ తండ్రీ కోరుకుంటున్నాడు. తర్వాత తను ఎన్ని కష్టాలు పడ్డా తన బిడ్డ సుఖంగా ఉంటే చాలనుకుంటాడు. కానీ కొందరు తండ్రులు మాత్రమే తమ కూతుళ్ళను సున్నిత మనస్కులుగా కాకుండా ధైర్యంగా, ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేలా ఉండాలని, ఎప్పుడుకూడా బేల కాకూడని చెబుతుంటారు. కాలంతో పాటు ఈనాడు తండ్రులు కూడా మారుతున్నారు అని చెప్పవచ్చు. కుటుంబ నిర్వహణకు తనకు తోడుగా భార్య కూడా సాయపడుతున్నపుడు తానెందుకు ఆమెకు సాయపడకూడదు అని పిల్లల బాధ్యత, పెంపకం గురించి చిన్నప్పటినుంచే తండ్రి తెలుసుకుంటున్నాడు. వాళ్ళకు తినిపించడం నుండి చదివించడం, ఆడించడం అన్నీ చేస్తున్నాడు. పిల్లల పొరపాట్లను సరిదిద్దటంలో కూడా తల్లి గారాబం, మెతకతనం చూపిస్తుంది. అదే, తండ్రి విషయానికి వస్తేవారి మాటలు, చర్యలు దృఢంగా ఉంటాయి. తండ్రి మాటలు, చేతలలో స్థిరత్వం, మందలింపులో కఠినత్వంతోపాటు అనురాగం కూడా ఉంటాయి. తండ్రి పిల్లలకు మమతతో పాటు, క్రమశిక్షణనూ నేర్పిస్తాడు. పిల్లలు స్కూలుకు వెళ్లకుండా ఎగ్గొట్టటానికి అనేక కారణాలు చెప్తున్నపుడు తల్లి మెత్తబడవచ్చు కానీ, తండ్రి నిర్ణయంలో మార్పు రాదు. తల్లిదండ్రులిద్దరూ తమ పిల్లల బాగుకోరేవారే అయినప్పటికీ తండ్రి పిల్లలతో వ్యవహరించే తీరు, తల్లి పెంపకానికి భిన్నంగా ఉంటుంది. పిల్లల విషయంలో తండ్రి మెత్తపడడు, రాజీ ధోరణిని అవలంభించడు. అందుకే చాలామంది పిల్లలు తండ్రితో మాట్లాడటానికి జంకుతారు. అమ్మకు చెప్పి అడిగిస్తారు. ఇది భయంతో కూడిన గౌరవం. తండ్రి గారాబం చేసినా, తప్పు చేస్తే మన్నించడని పిల్లలు జాగ్రత్త వహిస్తారు. తండ్రితో సాన్నిహిత్యం పెరుగుతున్న కొద్దీ, తండ్రి మాటలకు ప్రభావితులై తమ ప్రవర్తనను తామే సరిదిద్దుకోగలుగుతారు.
పూర్వకాలంలో ఆడపిల్లకు చాకలి పద్దులు రాసేంత చదువు వస్తే చాలు, ఎంత చదివినా ఆడపిల్ల వంటింట్లోనే మగ్గిపోవాల్సిందే కదా అని పెద్ద చదువులు చదివించలేదు. కాని నేడు కూతురు, కొడుకు అనే తేడా లేకుండా చదివిస్తున్నారు. తన కూతురు పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగస్థురాలు కావాలి, అందరిలో పేరు తెచ్చుకోవాలి అనుకుంటున్నారు తల్లితండ్రులు. కూతురికి కట్నం ఇచ్చి పెళ్లి చేయడం కంటే అదే డబ్బుతో ఆమెను పెద్ద చదువులు చదివించి ప్రయోజకురాలిని చేసి ఉన్నత స్థానంలో ఉండేలా చేయాలనుకుంటున్నాడు తండ్రి. అమ్మాయిలు కూడా ఎందులోనూ తక్కువ కారు. ఎవరి మీదా ఆధారపడకూడదు, తన కాళ్ళమీద తాను నిలబడి ఒక మంచి పదవిలో ఉండాలని కోరుకుంటున్నాడు తండ్రి. కొడుకు ప్రయోజకుడై తమను ఆదుకుంటాడు అని అనుకోవడంతోపాటు కూతురు ప్రయోజకురాలై తనను, తన కుటుంబాన్ని చూసుకుంటుంది అని అనుకుంటున్నారు. ప్రతి తండ్రికి తన కొడుకులు, కూతుళ్లు ఇద్దరిపై సమానమైన ప్రేమ ఉంటుంది. కాని కూతురిమీద మమకారం ఎక్కువే.
తన ఆడబిడ్డ తన ఇంటి మహాలక్ష్మి నా తల్లి అని చెప్పుకుంటాడు తండ్రి. బంగారం, అమ్మ... అనే చెప్పుకుంటాడు. అనుక్షణం ఆమెకు తోడుగా ఉండాలని కోరుకుంటాడు. ఈ మధ్యే విజయవాడలో నాగవైష్ణవి అనే చిన్నారి దారుణంగా హత్యకు గురైనపుడు అంతులేని విషాదానికి లోనై ఆమె తండ్రి ప్రభాకర్ గుండె పగిలి కూతురితో పాటు అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఇక, పెళ్ళై మరో ఇంటికి వెళ్లిపోయినా కూతురిమీద బెంగగానే ఉంటుంది తండ్రికి. ఎలా ఉందో, అత్తవారింట ఆమె అడిగినవన్నీ ఇస్తున్నారో లేదో, ఆమెను ఏ కష్టమూ రాకుండా చూసుకుంటారో లేదో అన్న బెంగ అతడ్ని సతాయిస్తూనే ఉంటుంది. అంతా బావుంటే ఫర్లేదు కానీ అత్తారింట కష్టాలు పడుతున్న కూతురి గురించి తెలిస్తే ఆ తండ్రి గుండె పగిలిపోతుంది. ఎటువంటి బాధలైనా మహిళ బయటకు చెప్పుకుని బిగ్గరగా ఏడ్చి తన భారాన్ని దింపుకుంటుంది కాని మగవాడు ఏడ్వకూడదు అంటారు కదా. ఆ మనోవేదన తన గుండెల్లో రగులుతుండగా దుఃఖాన్ని దాచుకుని కుమిలిపోతాడు తండ్రి.. అలా అని తండ్రులందరూ మంచివారే అనలేము. కుమార్తెల పట్ల అసహజంగా ప్రవర్తించే తండ్రులూ అక్కడక్కడ ఉన్నారు. వేరే కులంవాడిని ప్రేమించిందని సొంత కూతురిని అంతం చేసిన తండ్రులూ ఉన్నారు. కట్నం ఇవ్వాలి, ఖర్చుపెట్టాలి గనుక ఆడపిల్లల్నే వద్దనుకునేవారు ఇంకా మన సమాజంలో ఉన్నారు. వంశోద్ధారకుడిని చదివించి తన కష్టార్జితాన్ని రాసిచ్చినా జీవితపు చరమాంకంలో వృద్ధాశ్రమంలో పడేసి, లేదా ఇంటినుండి తన్ని తగలేసే కొడుకులు కోకొల్లలు మన దేశంలో. అత్తారింట తనకు అధికారం లేకున్నా తల్లిదండ్రుల పట్ల ప్రేమగా ఉండేది కూతురే కదా. అందుకే అన్నారు కంటే కూతుర్నే కను అని.
కవులు కూడా తమ రచనలను కన్నకూతురిలా భావించి, కాసులకు ఆశించి మహరాజులకు అంకితమీయకుండా సాక్షాత్తూ ఆ దేవదేవుడికే అంకితమిచ్చారు. పోతన తన భాగవత మహాకావ్యాన్ని శ్రీ మహావిష్ణువుకు అంకితమిస్తూ ఇలా అన్నాడు.
అధములైన రాజులకు అంకితమిచ్చి వారిచే పురములు, వాహనములు, సొమ్ములు పుచ్చుకుని తదనంతరం కష్టాలు పడడం ఇష్టంలేక నా భాగవతాన్ని మనస్ఫూర్తిగా ఆ శ్రీహరికే అంకితమిస్తున్నాను. అంతకంటే గొప్పవాడైన కృతికర్త ఉండునా? - అని పోతన తన భావాన్ని తెలిపాడు.
శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాధీశుడు. ఈయన పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండడమే కాక సాహిత్యానికి కూడా పెద్ద పీట వేయబడింది.ఈయన ఆంధ్రభోజుని గా మరియు కన్నడరాజ్య రమారమణగా కీర్తించబడ్డాడు. రాయలు స్వయంగా కవి, పండితుడు కూడా. అతను స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు. రాయలుకు సాహితీ సమరాంగన సార్వభౌముడు అనే బిరుదు కలిగినవాడు కూడా. రాయల ఆస్థానానికి భువన విజయం అనే పేరుంది. ఈ భువనవిజయంలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది కవులు ఉన్నారు. వారు అష్టదిగ్గజాలుగా ప్రసిద్ధి పొందారు. వీరందరిలో రాయలు ఆస్థానకవి, ఆంతరంగికుడుగా మసలిన అల్లసాని పెద్దన ఆంధ్రకవితా పితామహునిగా పేరు పొందాడు. భువన విజయంలో ఇతనికి జరిగినన్ని మర్యాదలు, సత్కారాలు మరే కవికి దక్కలేదన్నది సత్యం.
ఒకనాడు రాయలు భువనవిజయంలో బంగారు పళ్లెంలో పెట్టిన గండపెండేరాన్ని తెప్పించి సంస్కృతాంధ్రాలలో సమానంగా కవిత్వం చెప్పగలిగే వారు ఉంటే వచ్చి అందుకోమని చెప్పాడు. సభలో కవులందరూ మౌనంగా ఉన్నారు. అప్పుడు రాయలు ఆశ్చర్యంగా
రాజా! ఈ భూమండలంలో ఈ పెద్దన కంటే గొప్ప పండితుడు లేరని నీకు తెలీదా? నాకు ఇవ్వదలచిన వెంటనే ఇవ్వు అని అన్నాడు పెద్దన. తన పాండిత్యం మీద ఆయనకంత నమ్మకం మరి..
వెంటనే తన పాండిత్యాన్ని నిరూపించుకోవడానికి సంస్కృత, ఆంధ్రములో ఆశువుగా పెద్దన యీ ఉత్పలమాలిక చెప్పాడు. ఇది మామూలుగా నాలుగు పాదాలతో ఉండే వృత్తం కాదు. వృత్త మాలిక. అంటే అదే వృత్తం ప్రాసని భావాన్ని విడకుండా నిరాఘాటంగా అది వృత్తమాలిక అనబడుతుంది. కవికి భావావేశంలో అతడు చెప్పే వృత్తం ఆగకుండా నిరర్గళంగా సాగిపోతుందన్నమాట. అసలు, కవిత్వమంటే ఎలా ఉండాలో కవితాత్మకంగా శబ్దార్థాల మేలికలయికతో యిందులో చెప్పబడింది. ఈ పద్యానికి అర్థం చెప్పుకోవాలంటే కొంత శ్రమపడాలి. దీనికి వేల్చేరు నారాయణరావుగారు చేసిన ఆంగ్ల అనువాదం ఇక్కడ చూడవచ్చు: ఈ అద్భుత పద్యం యొక్క శ్రవ్యకాన్నిఇక్కడ వినొచ్చు.. ఒళ్ళు గగుర్పొడించే ఈ వృత్తమాలిక వినగానే శ్రీకృష్ణదేవరాయలు లేచి వచ్చి స్వయంగా తానే పెద్దన కాలికి గండపెండేరం తొడిగాడు.
పూఁత మెఱుంగులుం బసరుపూఁప బెడంగులుఁ జూపునట్టివా
కైతలు? జగ్గు నిగ్గు నెనగావలెఁ గమ్మనఁ గమ్మనన్వలెన్
రాతిరియున్ బవల్ మఱపురాని హొయల్ చెలి యారజంపు ని
ద్దా తరితీపులో యనఁగఁ దారసిలన్వలె లోఁ దలంచినన్
బాఁతిగఁ బై కొనన్ వలెను బైదలి కుత్తుకలోని పల్లటీ
కూఁతలనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్
జేతికొలందిఁ గౌగిటను జేర్చిన కన్నియ చిన్ని పొన్ని మే
Is poetry a surface sheen, the green delusion of unfolded buds? It must be real inside and out, exploding fragrance, an aching touch your body can't forget by day or night, like of your woman, whenever you think about it. It should come over you, it should murmur deep in the throat, as your lover in her dove-like moaning, and as you listen, yearning comes in all its beauty. If you take hold of it, your fingers tingle as if you were tracing the still-hidden breasts of a young girl, wholly embraced. If you sink your teeth into it, it should be succulent as the full lips of a ripe woman from another world, sitting on your knees. It should ring as when godly Sound strokes with her fingernails the strings of her veeNa, with its golden bulbs resting on her proud, white, pointed breasts, so that the rAga-notes resound. That is the pure Telugu mode.
If you use Sanskrit, then a rushing, gushing overflow of moonlight waves, luminous and cool, from Siva's crest, the mountain-born goddess beside him, enveloping actors and their works, the dramas spoken by Speech herself in the presence of the golden seed, pounding out the powerful rhythms, the beat of being, through drums and strings and chiming bells and thousands of ringing anklets dancing, drawing out the words, the fragrant and subtle winds wafting essence of unfolding lotus from the Ganges steaming in the sky should comfort your mind. You should shiver in pleasure again and again, each time you hear it, as rivulets of honeyed juices and butter and sweet milk flow together and mix their goodness more and more and more.
ఈ టపా విషయంలో సందేహాలు తీర్చిన చింతా రామక్రిష్ణగారికి, భైరవభట్ల కామేశ్వరరావుగారికి ధన్యవాదాలు.
మష్రూమ్, పనీర్, క్యాప్సికమ్ కుర్మా
-
మష్రూమ్ స్పెషల్స్ సీరీస్ లో ఈసారి ఒక మసాలా కుర్మా చేద్దామా? ఎప్పుడైనా
పార్టీ మూడ్ ఉన్నప్పుడు. స్పెషల్ సందర్భాలలో పులావ్ చేసుకుని ఈ కర్రీ
చేసుకుంటే అద్భుతం...