Sunday 26 May 2013

అమ్మ వేసిన పూలజడ

వేసవి మొదలైందంటే చాలు నాకు తప్పకుండా గుర్తొచ్చేవి మల్లెపూలు, మామిడిపళ్లు. ప్రతీరోజు మామిడిపళ్లు తినాల్సిందే. మల్లెపూలు  పెట్టుకోవాల్సిందే. చిన్నప్పటినుండి అలా అలవాటైపోయింది. ఇంకా ఈ వేసవి స్పెషల్ అంటే అమ్మవేసే మల్లెపూలజడ.. ఇప్పుడు వేసుకునే వయసు దాటిపోయినా అప్పటి అనుభూతి ఇంకా నిత్యనూతనమే కదా.. అమ్మవేసి (మల్లె)పూలజడ ఊసులు ఇవాళ్టి "నమస్తే తెలంగాణా" పేపర్లోని ఆదివారం ఎడిషన్ "బతుకమ్మ" లో








అమ్మ వేసిన పూలజడ

pulajada
పూలజడ అందానికి మాత్రమే ప్రతీక కాదు. అనుబంధానికీ, ఆప్యాయతకీ మారుపేరు. ఇప్పుడు డబ్బులు పెడితే నిముషాల్లో బ్యూటీషియన్లు పెళ్లికూతురు జడను అలంకరిస్తున్నారు. కానీ ఏం లాభం? అవి ఎంత అందంగా ఉన్నా అమ్మ కుట్టే పూలజడకు సాటి వస్తాయా?

జ్యోతి వలబోజు
పొడువాటి వాలుజడ... చివర జడగంటలు... తలనిండుగా మల్లెపూల దండలు ప్రతీ అమ్మాయికి అందాన్ని, నిండుదనాన్ని ఇస్తయి. కానీ, ఈ రోజుల్లో పొడుగు జడల అమ్మాయిలు కనపడటమే అరుదైపోయింది. ఒక రబ్బర్ బ్యాండ్ కట్టి వదిలేస్తున్నరు, తమ బెత్తెడు జుట్టును. కానీ, పాపం... ఈ జడలోని అందాలు, అది చేసే ఆగడాలు ఈనాటి అమ్మాయిలు తెలుసుకోకుండా ఉన్నరు. వాలుజడతో వయ్యారంగా కొట్టినా అది తన మీద ప్రేమే అనుకుని వెంట పడతరు కుర్రవాళ్ళు. ఇక కొత్త కాపురంలో వాలు జడ అప్పుడప్పుడు సరసానికి, చిలిపి యుద్ధానికి కూడా సై అంటది. నాగుపాము లాంటి జడలు ఇప్పుడు ఎంతమందికి ఉన్నయి? అంత ఓపిక ఎవరికున్నది? ఆ వాలు జడని పూలతో అలంకరిస్తే ఇంక దాని సౌందర్యం ఆస్వాదించే వాళ్లకే తెలుస్తది. పెళ్ళిలో కూడా పూలజడ వేసుకోవడం బరువైపోతుంది ఈనాటి అమ్మాయిలకు. ప్చ్!
ఇప్పటి సంగతులు ఇంతేగని, నా చిన్నప్పటి రోజులే గొప్పవి! ఎండాకాలం వచ్చిందంటే చాలు మల్లెపూలతో పూలజడ తయారు చేయించుకోవడం నాకు అలవాటు. అయితే, పూలజడ వేసుకోవడం పెళ్ళితోనే అంతమైనా ఆ మధుర జ్ఞాపకాలు ప్రతి వేసవిలో వెంటాడుతునే ఉంటయి. ఎండాకాలంలో మల్లెపూలు వచ్చాయంటే చాలు ఇప్పటికీ ఆ చిన్నప్పటి పూలజడ ముచ్చట్లు గుర్తుకొస్తయి.

అందరి సంగతి ఏమో కానీ మా అమ్మ మాత్రం ప్రతీ వేసవిలో మల్లెపూలు మొదలయ్యాయంటే చాలు కనీసం రెండు మూడుసార్లైనా పూలజడ వేసేది. ఇప్పట్లా రెడీమేడ్‌గా దొరికే విస్తరాకు మీద కుట్టి జడకు అతికించేది కాదు మా అమ్మ., అచ్చంగా నా జడకు డైరెక్టుగా కుట్టాల్సిందే. ఆ అనుభూతే వేరు!పూలజడ వేసుకునే రోజు కూడా ఒక ప్రత్యేకమైన రోజుగా ఉండేది. ఎండాకాలం సెలవుల్లో ఒకరోజు ఖరారు చేసుకొని పొద్దున్నే త్వరగా వంటపని, ఇంటిపని పూర్తి చేసుకొని అమ్మ మొజంజాహి మార్కెట్లో ఉన్న హోల్‌సేల్ పూల దుకాణాలకు వెళ్లేది. గట్టివి, పెద్దవి మల్లె మొగ్గలు ఓ అరకిలో, కనకంబరాలు, దవనం కొనుక్కొని వచ్చేది. ఇక మా అమ్మ స్నేహితులు వచ్చి జడ వేయడంలో సాయం చేసేవారు. నా జుట్టు లావుగా, పొడుగ్గానే ఉండేది. అయినా, ఇంకొంచెం పొడుగు ఉంటే బావుంటుందని అమ్మ చిన్న సవరం, చివర జడగంటలు పెట్టి గట్టిగా జడ అల్లేది. అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ చీపురు పుల్లలకు మొగ్గలు గుచ్చి ఇస్తే ముందు అనుకున్న డిజైన్ ప్రకారం నా జడకు కుట్టడం... నేను అసహనంతో కదిలితే ఓ మొట్టికాయ వేయడం....అటు ఇటూ తిరిగే తమ్ముళ్ళు నన్ను ఏదో ఒకటి అంటూ గేళి చేయడం-కనీసం మూడు గంటలు కూర్చుంటే కానీ జడ పూర్తయ్యేది కాదు.

ఒక్కోసారి ఒక్కో డిజైన్‌లో కుట్టేది అమ్మ. ఇక సాయంత్రం కాగానే మొహం కడుక్కొని పట్టు లంగా వేసుకుని, అమ్మ నగలు పెట్టుకుని ఫొటో స్టూడియో కెళ్ళి వెనకాల అద్దం పెట్టి మరీ ఫొటో దిగడం. (అద్దం ఉన్న స్టూడియో కోసం తిరిగేవాళ్ళం). అదో మరపురాని అనుభూతి. ఆ నాటి ఫొటోలు చూసుకుంటుంటే ఆప్పటి జ్ఞాపకాలు గిర్రున తిరుగుతాయి. డిసెంబర్‌లో వచ్చే నా పుట్టినరోజు నాడు కూడా పూలజడ వేసుకోవాలనిపించేది. స్కూలుకు బోలెడు మల్లెపూలు పెట్టుకొని వెళ్ళాలని చాలా కోరికగా ఉండేది. కానీ డిసెంబర్‌లో చామంతి పూలు మాత్రమే వచ్చేవి. దాంతో కూడా పూలజడ వేసుకోవచ్చు. కానీ, చాలా బరువు అని నిరాశ పడేదాన్ని. ‘నా పుట్టినరోజు మల్లెపూలు దొరికే ఎండాకాలంలో వస్తే ఎంత బాగుండో’ అని కూడా అనుకునేదాన్ని!చిన్నప్పుడు. బరువైన పూలజడతో నిద్రపోవడం కూడా కష్టంగానే ఉండేది. అయినా ఇష్టంగా భరించేదాన్ని. పొద్దున లేవగానే వాడిన, రంగు మారిన పూవులను చూసి ‘అయ్యో! అప్పుడే తీసేయాలా’ అని బాధ కలిగేది. పూలు తీసేసినా కూడా వాటి గుబాళింపు మూడునాలుగు రోజుల వరకు వెంట్రుకలను వదిలేది కాదు.

పెద్దయ్యాక అంటే ఇక పెళ్ళిలోనే పూలజడ వేసుకోవడం. నా ఎంగేజ్‌మెంట్‌కి మా నాన్న ‘రెడీమెడ్ పూలజడ తెప్పిస్తా’ అంటే కూడా మా అమ్మ తనే పూలజడ కుట్టడం, అంత బిజీలోనూ, ఇంటినిండా చుట్టాలున్నా కూడా తన బిడ్డకు తన చేతులతో పూలజడ కుట్టడం- అమ్మ అభిమానం, ఆప్యాయతల మధుర జ్ఞాపకం నా పూల జడ.ఇక పెళ్ళిలో అయితే పొద్దున్న ఒక డిజైను, రాత్రికి ఒక డిజైను. ఓహ్! ఆ ఆనందమే వేరు. అప్పుడప్పుడు పెళ్ళి ఫొటోలు చూస్తుంటే ఆ మల్లెపూల పరిమళం అలా లీలగా తేలివచ్చినట్లు అనిపిస్తుంది. నేను చివరగా పూలజడ వేసుకున్నది శ్రీమంతానికే. నేను ‘వద్దు’ అన్నా కూడా మా అమ్మ, ‘మళ్ళీ పూలజడ వేసుకుంటానో లేదో’ అని తన ఇష్టంతో పూలు తెచ్చి మరీ పూలజడ కుట్టింది. ఇవీ పూలజడ చుట్టూ నా జ్ఞ్ఞాపకాలు. మా అమ్మద్వారా పూలజడ కుట్టడం నాకూ అలవాటైంది. ఆ అలవాటుతోనే మా అమ్మాయికి, మాకు తెలిసిన వాళ్లకి కూడా నేనే పూలజడ వేసేదాన్ని. కానీ, ఈ కాలంలో అది కరువైపోయింది, బరువైపోయింది.

Thursday 23 May 2013

సూర్యదేవర రామ్మోహనరావుగారితో మాటా-మంతి



mail id: suryadevaranovelist@gmail.com
website: http://www.suryadevararammohanrao.com/index.html


నమస్కారం సూర్యదేవర రామ్మోహన్ గారు.. మా మాలిక పత్రికకోసం మీ నవలను సీరియల్ గా ఇవ్వడానికి, ఈ చిన్న మాటామంతి చేయడానికి ఒప్పుకున్నందుకు ముందుగా ధన్యవాదాలు..

1. ఎన్నో ఏళ్ళుగా ఆంధ్రుల అభిమాన , సంచలన రచయితగా పేరు పొందిన మీరు, మీ గురించి కొన్ని మాటలు చెప్పండి.
మాది కృష్ణాజిల్లాలోని మున్నలూరు గ్రామం. మా నాన్నగారు వ్యవసాయంతో పాటు చుట్టుపక్కల నలభై గ్రామాల వారికి  ఆయర్వేద వైద్యం చేసేవారు. అమ్మ గృహిణి. ఆరుగురిలో చిన్నవాడిని. నా భార్య గృహిణి. నాకు ఇధ్దరబ్బాయిలు అమెరికాలో చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలు చేస్తున్నారు.


2. మీ రచనా వ్యాసంగం ఎప్పుడు ఎలా మొదలైంది? అసలు ఈ రంగంలోకి రావాలని ఎందుకనిపించింది మీకు?? ప్రత్యేక కారణమేమైనా ఉందా?
 మా నాన్నగారు ఆయర్వేద, పశువైద్యం చేసేవారు. గోసంపదని కుటుంబ సంపదకంటే ఎక్కువగా భావించేవారు. మా కుటుంబ ఆస్తులను అమ్మి మరీ  ఆయర్వేద వైద్యం చేసేవారు. ఆయన వైద్య పరిజ్ఞానాన్ని గ్రంధస్తం చేస్తే బావుంటుందని నేను అంటే , మనవాళ్లలో రాయడం అనే ఆలోచన, ఆసక్తి ఎవరికీ లేదు. ఆ పని నువ్వే చేయాలిరా అన్నారు. అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను. నాన్నగారి ఈ మాటలే నాలో రాయాలనే కోరిక మొదలవ్వడానికి కారణం. అలా మొదలైన రచనాసక్తి డిగ్రీ చదివేటప్పుడు కూడా  కొనసాగింది. మొదట్లో జయశ్రీ, అనామిక పత్రికలలో చిన్న చిన్న కధలు ప్రచురించబడ్డాయి. 


3. ఓక సీరియల్ లేదా నవల రాయాలంటే దానికి టాపిక్ ఎలా ఎంచుకొంటారు. తర్వాత దాని గురించి ఎలా వర్క్ చేస్తారు?
నేను రాయడం మొదలుపెట్టినప్పటినుండి పుస్తకాలు, సమాచార సేకరణ మొదలుపెట్టాను. ముందుగా మా నాన్నగారి దగ్గరే బోలెడు సమాచారం ఉంది. ఆ తర్వాత కొందరు మిత్రులు సహాయ పడ్డారు. నాకు పురాణాలు, ప్రాచీన సంప్రదాయాలు, సంస్కృతి, ఇతిహాసాలు, వాటి గొప్పదనం చరిత్ర, ఆత్మశక్తి, మన పూర్వీకులు సాధించిన గొప్ప గొప్ప విజయాలు గురించి తెలుసుకోవడం చాలా ఇష్టం. వాటికి సంబంధించిన పుస్తకాలు, తాళపత్రగ్రందాలు నా దగ్గర ఎన్నో ఉన్నాయి. 


4. పత్రికలలో సీరియల్స్ రాసేటప్పుడు ప్రారంభం నుండి చివరి వరకు మొత్తం మీ చేతిలో ఉంటుందా? లేదా పత్రికలవాళ్లు అలా రాయాలి , ఇలా ఐతే బావుంటుంది అని అంటారా? దానికి మీ స్పందన ఎలా  ఉంటుంది? అసలు ఎప్పుడైనా మీకు  ఇలాంటి సందర్భం ఎదురైందా??
లక్కీగా నాకు ఇంతవరకు సీరియల్స్, నవలల విషయంలో ఎటువంటి సమస్యలు రాలేదు. నేను రాసే టాపిక్ మీద ఏ పత్రికవాళ్లు కూడా ఎటువంటి నిబంధనలు పెట్టలేదు. నేను ఉదయం, జ్యోతి, స్వాతి మొదలైన పత్రికలలో రెగ్యులర్ గా రాసాను. కాని ఎవ్వరూ కూడా నన్ను ఈ టాపిక్ మీద రాయాలి. ఇలా రాయాలి అని నిర్ధేశించలేదు. నా రచనల విషయంలో నాకు సంపూర్ణ స్వేచ్చ ఉంది ఇప్పటికీ కూడా. కాని అప్పట్లో ఆంధ్రభూమిలో సికరాజుగారు ఎడిటర్ గా ఉన్నప్పుడు రచయితలకు కొన్ని టాపిక్ లు ఇచ్చి కధలు, సీరియల్స్ వగైరా రాయమనేవారు. అది కూడా వాళ్లు చెప్పిన విధంగానే రాయమనేవారు. కొందరు రచయితలు అలాగే రాసారు కూడా . కాని నేనలా చేయలేదు. చేసే అవసరమూ రాలేదు.


5. రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా?  లేదా ఎవరి ప్రభావం ఐనా ఉందా..?
ముందే చెప్పాను కదా.. నేను రాయడానికి కారణం మా నాన్నగారి దగ్గరున్న విజ్ఞాన సంపదను భద్రపరచాలనే సదుద్ధేశ్యం.. ఇక ఎవరి ప్రభావమంటూ లేదు. అంతా నా స్వంత ఆలోచనలే..



6. మీ రచనా శైలి మొదటినుండి ఒకే విధంగా ఉందా? మార్చుకుంటూ వచ్చారా? ఈ శైలి మీకు నచ్చినట్టుగా ఉండాలనుకుంటారా? లేక పాఠకులు ఇష్టపడేట్టు ఉండాలనుకుంటారా?? ఒకవేళ అది బాలేదు, మీరు ఇలా రాస్తే బావుండేది. అని ఎవరినా పాఠకులు సలహాలు, సూచనలు ఇచ్చారా ? దానికి మీ స్పందన ఎలా ఉండింది??
తప్పకుండా మారుతుందండి. వయసు పెరుగుతున్న కొద్దీ ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. ఈ ప్రభావం వివిధ సంఘటనలు, అనుభవాల ఆధారంగా రచనా శైలి మీద కూడా పడుతుంది. నా రచనలు నాకు నచ్చి, పాఠకులు మెచ్చేవిధంగా ఉండాలనుకుంటాను. ఇప్పటివరకు అలాగే రాస్తూ వచ్చాను. కొన్నిసార్లు ఈ  సంధర్భం , ఆ సన్నివేశం ఇలా ఉంటే బావుండేదని   పాఠకులు చెప్తుంటారు. సద్విమర్శలను ఎఫ్పుడూ గౌరవిస్తాను.



7.  ఎన్నో ఏళ్లుగా రచనలు చేస్తున్నారు. మీకంటూ  ప్రత్యేకమైన లక్ష్యం పెట్టుకున్నారా?
నేను 1985 అంటే 28 ఏళ్లుగా రాస్తున్నాను. నవలా రచయితలందరిలో అత్యధికంగా ఇఫ్పటివరకు 96 నవలలు పూర్తి చేసాను. ఎఫ్పుడు కూడా ఒక లక్ష్యమంటూ పెట్టుకోలేదు. రాసుకుంటూ పోవడమే.. అసలు ఈ లక్ష్యాలు, రికార్డులు అంటే నాకు నచ్చదు. ఈ గిన్నీస్ రికార్డ్ కూడా పెద్ద ఫార్స్.. అంతా వ్యాపారం. ఒక రికార్డ్ సృష్టించాలనే కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు, గిన్నీస్ వాళ్లను పిలవడం. వాళ్ల అతిధి మర్యాదలు వగైరా అన్నీ వ్యాపారాత్మకమైనవే. ఈ రికార్డులవల్ల ఒరిగేదేమీ  లేదు. ఒక సమాజసేవ చేసినవారినో, పదిమందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసినవారినో గౌరవించి, బిరుదులు ఇచ్చి ప్రోత్సహిస్తే మంచిది కాని ఇలా రికార్డ్ కోసం ఎందుకూ పనికిరాని కార్యక్రమాలు, సాహసాలు చేయడం పిచ్చిపని అని అంటాను.


8.  నవలలు, సీరియళ్లు, కథా ప్రచురణల్లో మీరు గమనిస్తూ వచ్చిన మార్పు ఎలా ఉంది. అలాగే పాఠకులు, పత్రికలు, రచయితల విషయంలొ కూడా ఎటువంటి మార్పు గమనించారు?.
చాలా మార్పు వచ్చింది. 80, 90 దశకాలలో వారపత్రికలు, మాసపత్రికలలో కధలు, సీరియళ్ల ప్రభంజనం నడిచింది. ముఖ్యంగా మహిళలు సీరియళ్ల కోసమే పత్రికలను చదివేవారు. 95,, 96 వరకు ఆడవాళ్లు వివిధ పత్రికలు, నవలలు ఎక్కువగా చదివేవారు కాని ఆ తర్వాత మొదలైన టీవీ సీరియళ్లు పుస్తకాలను పక్కకు జరిపేసాయి. అదీకాక అప్పుడు విరివిగా రాసిన ఎందరో రచయితలు కూడా  మునుపట్లా రాయడం లేదనిపిస్తుంది. కాని కొత్త రచయితలు/ రచయిత్రులు వస్తున్నారు. ఇది మంచిదే కదా. ఈ మధ్యకాలంలో టీవీ సీరియళ్లు, ప్రోగ్రాములు కూడా జనాలకు విసుగును కలిగిస్తుండడంతో మళ్లీ పుస్తకాలవైపు మొగ్గు చూపుతున్నారు. సినిమాలు వినోదాన్ని ఇస్తాయి. టీవీ సీరియళ్లు కాలక్షేపాన్ని ఇస్తాయి. కాని పుస్తకాలు ఎప్పటికీ వినోదాన్ని, విజ్ఞానాన్ని, వికాసాన్ని ఇస్తాయి..


9. అప్పటి తరం, ఇప్పటి తరం పాఠకుల అభిరుచి ఏమైనా మారిందా? మీ రచనలకు వచ్చే స్పందనతో మీకు ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందనుకుంటా. అసలు కధలు, నవలలు  చదివినవారిని మారుస్తాయా?? వాళ్ల ఆలోచనలను తప్పు దారి పట్టిస్తాయంటారా? ఇది రచయిత తప్పు కాదే.. కాని అందరూ రచయితనే దోషిగా నిలబెడతారు..
అవును పాఠకుల అభిరుచి మారింది. అప్పట్లో క్రైమ్, సస్పెన్స్, ఫామిలీ, ఫాంటసీ కధలమీద మక్కువ చూపిన పాఠకులు ఇప్పుడు లేరు. కొత్తతరం వాళ్లకు తమకేం కావాలో బాగా తెలుసు. ఈనాటి తరం పాఠకులు ఎక్కువగా కెరీర్, ప్రేమ, విలాసాలు,ఆధ్యాత్మికం మొదలైన రచనలు కోరుకుంటున్నారు. ప్రాచీన సంప్రదాయాలు, రహస్యాలను గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. తన రచనవల్ల కలిగే పరిణామాలకు రచయితదే బాధ్యత. సమాజానికి చెడు చేసే రచనలు మంచివి కావు. 


10. మీ నవలలు ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటాయి. మామూలు ప్రేమ కథ, ఫామిలీ కథల్లా టైమ్ పాస్ కోసమన్నట్టు  కాకుండా ఎంతో పరిశోధన చేసి సవివరంగా రాస్తున్నారు. దీనికోసం మీరు చేసే హోంవర్క్ ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఆ ప్రాసెస్ లో మీరు ఎదుర్కొన్న కష్టసుఖాలు..
నా  దగ్గర మొదటినుండి మా నాన్నగారి దగ్గరనుంఢి సేకరించిన సమాచారం. పురాతన గ్రంధాలు, తాళపత్ర గ్రంధాలు ఉన్నాయి. కొందరు మిత్రులు కూడా నాకు ఎప్పటికప్పుడు సహాయం చేస్తుంటారు. అంతే కాక ఒక రచన చేసేటప్పుడు దానికి సంబందించిన సమాచారాన్ని సేకరించడానికి ఇంటర్నెట్ కూడ ఉపయోగిస్తాను. ఆయా ప్రదేశాలకు వెళ్లి వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుంటాను. ఇప్పటివరకు నేను రాసిన నవలలు మాడలింగ్, గుర్రప్పందాలు, ఆటోమొబైల్, పబ్లిసిటీ, పునర్జన్మ, ఆయుర్వేదం, జ్యోతిష్యం, సినిమారంగం, రాజకీయాలు. మూఢ నమ్మకాలు, మంత్ర తంత్రాలు, వశీకరణ యోగం, ఫోరెన్సిక్ సైన్స్, బ్రహ్మంగారి కాలజ్ఞానం, నిధి అన్వేషణ మొదలైన టాపిక్స్ మీద నవలలు రాసాను. మరో ఐదువందల నవలలు రాయగలిగినంత సమాచారం నా దగ్గర ఉంది..



11.   మరి మీ రచనలపైన తీవ్రమైన అభ్యంతరాలు తెలిపి, బెదిరింపులు గట్రా ఏమైనా జరిగాయా?
 నా రచనలలో నేను చెప్పే విషయాలన్నీ నిజమైనవే ఉంటాయి. మొదటినుండి ఏదైనా సరే నిర్భయంగా రాసేవాడిని.   కొన్ని రచనల మీద కేసులు కూడా పెట్టారు. ఐనా భయపడలేదు. ఎర్రసముద్రం నవల మీద 5-6 కేసులు  పెట్టారు.. కార్మికులని రెచ్చగొట్టటం తప్ప వారికి బాధ్యత నేర్పించటంలేదని నేను ఒక రాజకీయ పార్టీ మీద చేసిన విమర్శలు, చదువులేనివారు పదవులనలరిస్తే లాభంలేదని రాజకీయనాయకులని ఉద్దేశించి చేసిన విమర్శలు వివాదానికి కారణమయ్యాయి..


12. రాన్రానూ తెలుగు చదివేవారు తగ్గిపోతున్నారు. పుస్తకాలు అస్సలు చదవడంలేదు, కొనడం లేదు  అని ఎంతోమంది బాధపడుతున్నారు. కాని కొత్త కొత్త పుస్తకాల ప్రచురణ మాత్రం  ఆగడం లేదు. ఎన్నో కొత్త వార పత్రికలు, మాస పత్రికలు కూడా ప్రచురించబడుతున్నాయి. వీటి అమ్మకాలు, ఆదరణ ఎలా ఉన్నాయో తెలీదు మరి..
90ల దాకా తెలుగు చదివేవారు బాగానే ఉండేవారు. అయితే టీవీల ప్రభావం చేత పాఠకులు చదవటంకన్నా చూడటం మీద ఎక్కువ ఆసక్తి చూపించటం మొదలుపెట్టారు. అయితే ఆ టీవీ సీరియళ్ళు కూడా పాతబడి, వాటిమీద అందరికీ ఆసక్తి తగ్గిపోవటంతో మళ్ళీ పాఠకులు పుస్తక పఠనం వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఏదేమైనా సరే ప్రింట్ మీడియా స్థిరంగానే ఉంటుందని నా అభిప్రాయం


13. రీసెర్చ్ బేస్డ్ నవలలకు యండమూరి ఆద్యుడైతే మీరు రీసెర్చ్ తో పాటూ థీం బేస్ట్ నవలల్ని రాసి తెలుగు నవలల్ని స్థాయిని పెంచారు. ఇప్పటికీ ఇంగ్లీషులో అలాంటి నవలలు వస్తున్నాయి, అవి సినిమాలుగా కూడా రూపొందుతున్నాయి. కానీ తెలుగులో ఆ పరిస్థితి లేదు. కారణం ఏమిటి? సినిమాలవాళ్ళు కథల్లేవు కథల్లేవు అంటుంటారు కానీ మీర్రాసిన నవలలన్నీ సినిమాగా తియ్యదగ్గవే. అలాంటిది ఒకటోఅరా తప్ప మరివేటినీ సినిమాగా తియ్యలేదెందుకో?
పాఠకుల అభిరుచి, అవసరాలను దాటి వెళ్లినవాడు రచయిత అవుతాడు కాని పాఠకుల మనసులో ఉండలేడు. కన్నడ, మళయాళ పాఠకులు మారతారేమో కాని తెలుగు ప్రేక్షకులు మాత్రం మారలేదు. మారరు కూడా. సినిమాలు తీసేది ఎంటర్ టెయిన్మెంట్ కోసమే. అందుకు కధతో పాటు డాన్సులు, పాటలు, ఫైట్లు, పారిన్ లోకేషన్లు వగైరా తప్పనిసరి ఉండాలి. సినిమా కధలన్నీ అలాగే ఉండాలి. కాని నాకు ఈ సినిమాల మీద అంత ఆసక్తి లేదు అందుకే నా రచనలు సినిమాలు చేయమని నేను అడగలేదు. ఏ ప్రోడ్యూసర్ కూడా అంత ఆసక్తి చూపలేదు. రీసెర్చ్ బేస్డ్ నవలలకి ఆదరణ ఎప్పుడూ ఉందండీ. అదే లేకపోతే నా నవలలు సీరియళ్ళుగా అచ్చయ్యుండేవి కావు. నవలల రూపంలో కూడా అవి చాలా ఖ్యాతినే అర్జించాయి. నా ముందు తరాలవారు, తరువాతి తరంవారు రచనలు మానేసి వేరే పనులమీద ధ్యాస పెట్టినా నేను మాత్రం రచనలని వదలదలచుకోలేదు. చాలా ఇష్టంతో చేస్తున్న పని ఇది. తెలుగులో అత్యధికంగా పుస్తకాలు వ్రాసింది నేనే (దాదాపు వంద)


14. ఒక రచయిత రాసిన కథ కాని, నవల కాని అందులో చెప్పిన ఒక మాట లేదా సంఘటన పాఠకులందరినీ కాకున్నా కొందరినైనా తమ జీవితాలకు అన్వయినంపచేసుకుని ఆలోచింప చేస్తుంది. విదుర్‌నీతి సీరియల్ మొదటి భాగంలో ఆత్మహత్య గురించి మీరు చెప్పిన మాట లాగా .... అలా ఆలోచించి, ఫీల్ అయ్యి మీతో చెప్పినప్పుడు మీరెలా ఫీల్ అవుతారు??
చాలా సంతోషం కలుగుతుంది. తనకు నచ్చినట్టుకాకుండా  పాఠకులు నచ్చి, మెచ్చేవిధంగా రచనలు చేయాలి. చదివి మర్చిపోయేట్టు కాకుండా తన మాటలు ఆలోచింప చేస్తే ఏ రచయితైనా సంతోషిస్తాడు.



15. ఒక రచయిత తన కథ కాని నవల కాని తనకు నచ్చినట్టుగా రాయాలా? పాఠకులకు నచ్చేట్టుగా రాయాలా? కొంతమంది రాసినవి చాలా సులువుగా అందరికి అర్ధమైపోతాయి. కాని కొందరి రచనలు చాలా లోతుగా ఆలోచిస్తే కాని అర్ధం కావు. దానికోసం పాఠకులందరూ కష్టపడతారనుకోను.. అలాగని అవి మంచి రచనలు కావని అనను. నేనైతే ముందు రచయితకు తను రాసింది తనకు నచ్చాలంటాను.
రచయిత తను రాసింది ఎక్కువమంది పాఠకులకు చేరి అర్ధమైనప్పుడే ఆతని రచనయొక్క ముఖ్య ఉధ్ధేశ్యం నెరవేరుతుంది. కాని మాకు జర్నలిజంలో నేర్పిన పాఠంలో ముఖ్యమైనది Don’t over estimate or under estimate the Readers .. రచయితకు ఎన్ని గొప్పు భావాలున్నా వాటిని పాఠకులకు సులభంగా అర్ధమయ్యేలా రాయక తప్పదు. అర్ధమైతేనే కదా పాఠకులను చేరేది.



16. రచయితలకు అప్పుడు, ఇప్పుడు ఉన్న విలువ గౌరవం ఎలా ఉన్నాయి? మార్పు అంటే ఎవరిలో  కలిగింది. పాఠకులా? రచయితలా?
మంచి రచనలు చేసే రచయితలకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. 80 నుండి 95 వరకు రచయితల హవా నడిచింది. అఫ్పుడు కొందరు రచయితలకు బ్రహ్మరధం పట్టారు పాఠకులు. కాని ఈరోజు పాస్ట్  లైఫ్ అయిపోయింది. పుస్తకాలు కొని చదివే ఓపిక, సమయం ఉండడం లేదు. ఒకవేళ చదివే ఆసక్తి ఉన్నా ఐపోన్, ఐపాడ్ లలో చదువుకుంటున్నారు. కాని రచయితలంటే ఇప్పటికీ ఆ గౌరవం ఉంది.


17 . తెలుగు భాషతో పాటు అంతా సాంకేతికమైపోతున్న ఈ రోజుల్లో ప్రింట్ పత్రికలతో పాటు అంతర్జాల (నెట్) పత్రికలు, ప్రింట్ పుస్తకాలకు బదులు ebooks  విరివిగా వచ్చేసాయి. ఇవి క్రమక్రమంగా  వృద్ధి చెందే సూచనలు కనిపిస్తున్నాయి.  మరి వీటి ప్రభావం ఎలా ఉంటుంది.  చెట్లను కాపాడాలి, పర్యావరణాన్ని రక్షించాలి. పేపర్ వాడకం తగ్గించాలి అంటూ రాన్రానూ ప్రింట్ పత్రికలు, పుస్తకాలు కనుమరుగవుతాయేమో. ఈ పరిణామం మంచిదేనంటారా?
 అమెరికాలో మనకంటే సాంకేతికంగా ఎంత ముందంజలో ఉన్నా ఇప్పటికీ అక్కడ వాషింగ్టన్ పోస్ట్ లాంటి   పేపర్లు, ఎన్నో పత్రికలు, పుస్తకాలు కూడా విజయవంతంగా నడుస్తున్నాయి. మన దగ్గర కూడా పేపర్లు చదువుతున్నారు. పత్రికలు కూడా బాగానే చదువుతున్నారని తెలుస్తుంది. కాని 70 – 95 మధ్యలో బ్రహ్మాండమైన సాహిత్యం వెలువడింది. ఈ పరిణామానికి ఆద్యులు యద్ధనపూడి సులోచనరాణి అని చెప్పవచ్చు. ఆవిడ   మధ్యతరగతి పాఠకుల మనసుల్లో దాగి ఉన్న ఎన్నో ఆలోచనలు, కోరికలు వెలికి తీసి కధలు, సీరియళ్లుగా రాసారు. అవి అందరికి నచ్చాయి. తర్వాత కొమ్మూరి సాంబశివరావు, మధుబాబులాంటి రచయితలు డిటెక్టివ్ పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. ఈ పుస్తకాలను కూడా చాలామంది పాఠకులు ఇష్టపడేవారు. తర్వాత మల్లాది వెంకటకృష్ణమూర్తి. యండమూరి, ఆ తర్వాత నేను.. ఇలా ఒకరి తర్వాత ఒకరు తమ రచనలతో పాఠకుల మనసుల్లో ఓక చెరగని ముద్ర వేసుకున్నారు. మిగతావాళ్లు ముందులా ఎక్కువగా రాయడం లేదు. నేను మాత్రం రాస్తూనే ఉన్నాను. ఇఫ్పటికీ అందరికంటే ఎక్కువ నవలలు రాసాను. ముందు ముందు ఈ  పుస్తక పఠనం ఇంకా పెరుగుతుంది. దానికి ఈ సాంకేతిక విఫ్లవం దోహదపడుతుంది కూడా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు నెట్ లో రోజువారి తెలుగుపేపర్లు మనకంటే ముందుగానే చదివేస్తున్నారు. అలాగే పుస్తకాలను కూడా eబుక్స్ లా మరింత ప్రాచుర్యం పొందుతాయి అని నా నమ్మకం. అలాగే చదివే తీరికలేనివారు ఆడియో బుక్స్ ద్వారా కూడా కధలు, నవలలు వింటారు...

Wednesday 22 May 2013

మూడుపదులు నిండిన మా పెళ్లిపుస్తకం...






ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి మూడుముళ్లతో ఒక్కటైన అనురాగ బంధం
ఇద్దరూ కలిపి అల్లుకునే అందమైన జీవితం... బతుకంతా చదవాల్సిన మంచి పుస్తకం
జంటపఠనంలో బోధపడే అర్థం , స్నేహంతో మరింత పటిష్టం
సప్తపదిలో తొలి అడుగుకి మొదలైన అల్లిక... సంసార పడుగుపేకల్లో నేస్తున్న వస్త్రం
వన్నెల్లో ఇమిడిపోయే అనుభవాలు, అంచుల్లో అందమైన చిత్రాల అనుభూతులు
పోగులు కలబడి అక్కడక్కడా పడే ముడులు, ఓరిమితో విడదీసే చిక్కులు
ఉమ్మడి చరిత్రకి చుట్టిన పొరల్లో గతాన్ని తడిమితే తగిలే ఎన్నో గిల్లికజ్జాలు   
కలహాల విసవిసలు - మురిపాల మెరుపులు
విరహాల నిట్టూర్పులు - ప్రణయాల కవ్వింతలు
నీకు నేను నాకు నీవు అంటూ మొదలైన బంధం
చివరకు నీకు నేనే నాకు నీవే అంటూ కడ దాకా నడిచే తోడులో
విశదమయ్యే మంత్రం మూడు ముడుల్లో పడిన బీజం... అదే ఈ వివాహబంధం...
శ్రీరస్తూ శుభమస్తూ అంటూ గడుస్తున్నకొద్దీ మరింత పటిష్టంగా మారిన మా పెళ్లిపుస్తకానికి ఈనాడు 30 సంవత్సరాలు నిండాయి..

Tuesday 14 May 2013

గృహిణి ప్రతిభ ఎందులో తక్కువ???









ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలైనా కూడా మగవాళ్లు పనికెళ్తే మహిళలు కుటుంబ నిర్వహణ మొత్తం తీసుకునేవారు. ఇలా ఒక సంసారం సమతుల్యంతో చిన్న చిన్న ఒడిదుడుకులతో గడిచిపోయేది. కాని ఈనాడు కుటుంబం చిన్నదైనా, ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయినా పెరుగుతున్న ధరలు, ఖర్చులతో ఇధ్దరూ పని చేయక తప్పడం లేదు. ఈనాడు భార్యా, భర్తా ఇద్దరూ ఉద్యోగాలో, వ్యాపారమో చేయకుంటే ఇల్లు గడవడం. పిల్లల చదువులు , ఇంటికి కావలసిన సౌకర్యాల అమర్చుకోవడం అసాధ్యం కాకున్నా చాలా కష్టం.    కొందరు ఆడవాళ్లు  ఉన్నతవిద్య లేకున్నా,  ఉద్యోగం చేయలేకున్నా, తమ చేతనైన వృత్తులు, ప్రవృత్తులతో ఇంటినుండే పని చేస్తూ ఎంతో కొంత సంపాదిస్తున్నారు లేదా ఉన్నదాంట్లో గుట్టుగా సంసారం నడిపిస్తున్నారు.  ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉండే మహిళలకు ఎక్కువ విలువ లేదంటూ  ప్రముఖ రచయిత చేతన్ భగత్ ఒక సంచలన ప్రకటన చేసారు



 చేతన్ భగత్ అంటారు.. మా అమ్మ నలభై ఏళ్లు పని చేసింది. నా భార్య ఒక అంతర్జాతీయబాంకులో చాలా పెద్ద హోదాలో ఉంది. తను నా కోసం పుల్కాలు చేయదు. ఆ  పనిని డబ్బులిచ్చి బయటవాళ్లతో   ఔట్ సోర్సింగ్ చేయిస్తాం. ఐనా నాకు అదేమంత ముఖ్యమైన విషయం కాదు. కాని నా భార్య తన జీవితాన్ని వంటింట్లో గడిపితేనే నాకు నచ్చదు. ఒక స్త్రీ  కెరీర్ ఉమన్ ఐతే తన భర్తతో  తమ ఇద్దరి కెరీర్ గురించి, ఉద్యోగ, వ్యాపార సంబంధిత   విషయాలగురించి చర్చించగలదు. ఒక మామూలు గృహిణికంటే ఎక్కువ సమర్ధతతో కంపెనీలలో సమస్యలగురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలదు. ఆపీసుల్లోని రాజకీయాలను అర్ధం చేసుకుని అవసరమైనప్పుడు సరైన సలహా ఇవ్వగలదు. ఆర్ధికంగా కూడా ఖర్చులు, రాబడి, సేవింగ్స్ వగైరా విషయాలలో సరైన నిర్ణయం తీసుకుని అన్ని సౌకర్యాలతో ఉన్న ఇల్లు, ఇన్సెస్ట్ మెంట్స్,  సెలవుల సద్వినియోగం.  విహారయాత్రలు వగైరా స్వంతంగా నిర్వహించగలిగే  సామర్ధ్యం కలిగి ఉంటుంది. అలాగే  ఇంట్లో ఉండే ఆడవాళ్లలా కాకుంఢా ఉద్యోగం , వ్యాపారం మొదలైనవి చేసే మహిళ ప్రపంచానికి ఎక్కువగా చూస్తుంది. తన కుటుంబానికి  ఉపయోగపడే మరింత విజ్ఞానాన్ని, సమాచారాన్ని తీసుకురాగలదు. పనిచేసే మహిళల  పిల్లలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతారు. అమ్మ పెంపకంలో గారాబంగా పెరిగిన పిల్లలకంటే ఎన్నో విషయాలలో స్వతంత్రులై ఉంటారు. ఉద్యోగాలు చేసే మహిళలు తమ ఉద్యోగాలు, వృత్తులలో విజయవంతంగా ముందుకెళుతూ ఉంటారు. ప్రతీ విషయంలో మగాడి  మీద ఆధారపడనందుకు సంతృప్తిగా ఉంటారు. దీనివలన భార్యాభర్తలలో సామరస్యం ఉంటుంది. ఇలా విజయవంతంగా అన్ని రంగాలలో  మహిళలు మన దేశాన్ని అభివృద్ధి పధంలోకి తీసుకెళ్తున్నారు. దీనివలన మనకు వేడివేడి పుల్కాలు దొరక్కపోవచ్చు. అంతే..

ఈ విషయంలో చేతన్ భగత్ ఇంట్లో ఉండే గృహిణులను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు.. ఒక కుటుంబం యొక్క సమర్ధవంతమైన నిర్వహణ  భార్యాభర్తలిద్దరూ సంపాదించడమే కాదు.  పిల్లలను , తమ తిండిని కూడా పట్టించుకోకుండా సంపాదనే ముఖ్యమనుకునే స్ధాయికి దిగిపోయామా?  ఈరోజుల్లో ఇద్దరూ సంపాదిస్తే కాని ఇల్లు గడవదు. పిల్లలకు మంచి చదువులు, సొంత ఇల్లు, కారు, అధునాతన వస్తువులు, వగైరా వీలు కాదు. నిజమే. స్త్రీలకు కుటుంబ నిర్వహణకోసమే కాక ఆర్ధిక స్వావలంబన ఉండడం మంచిదే.  కాని సంపాదన లేని గృహిణులను పుల్కాలు మాత్రమే చేయగలిగేవారిగా అభివర్ణించడం ఎంతవరకు సమంజసం??

దాదాపు ప్రతీ ఉమ్మడి కుటుంబంలో తల్లిదండ్రులు, చదువుకునే తమ్ముళ్లు, పెళ్లిళ్లు చేయాల్సిన చెల్లెల్లు, పిల్లలు ఉంటారు. వారిని చూసుకోవడానికి మగవాడికి తన భార్య సహకారం ఎంతైనా అవసరముంటుంది. ఒకవేళ పిల్లలు మాత్రమే ఉన్నా వాళ్లకు ఒక వయసు వరకు తల్లి అండదండలు, ఆలంబన  ఉండాలి.. పెళ్లయ్యాక  భార్య పని చేయాలా వద్దా అనేది వారిద్దరూ చర్చించుకుని నిర్ణయించుకునే విషయం. బయటకెళ్లి పనిచేసి సంపాదించకుండా ఇంటి పనులు, బాధ్యతలకే ప్రాధాన్యం ఇచ్చే మహిళలకు ఎటువంటి విలువ లేదని చేతన్ భగత్ స్పష్టంగా చెప్తున్నారు.  వాళ్లు పుల్కాలు మాత్రమే చేయగలరని అతని ప్రగాఢ విశ్వాసం. ఎవరు ఎంత కష్టపడ్డా, సంపాదించినా,  కడుపునిండా తినడానికి, కుటుంబ సభ్యులు, పిల్లలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలనే కదా. మరి ఇల్లాలును పుల్కాలు చేసే  మనిషిగా మాత్రమే గుర్తించడం భావ్యమా??

ఉద్యోగం చేయకుండా ఇంటిపట్టున ఉండే ఇల్లాళ్లకు కూడా ఎన్నో బాధ్యతలు,సమస్యలు ఉంటాయి..  ఇంట్లో ఎటువంటి సమస్యలు లేకుండా  తన భార్య ఇంట్లో అన్నీ సమర్ధవంతంగా చూసుకుంటేనే పురుషుడు తన ఉధ్యోగ, వ్యాపార బాధ్యతలను విజయవంతంగా నిర్వహించగలుగుతాడు. ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా ఉంటేనే, మగవాడు పొద్దంతా కష్టపడ్డా ఇంటికి రాగానే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపగలుగుతాడు.  ఒక వ్యాపారంలో, పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉండే ఒడిదుడుకులు కుటుంబ నిర్వహణలో కూడా ఉంటాయి. ఉద్యోగం నచ్చకుంటే అది వదిలేసి వేరే ఉద్యోగం చూసుకోవచ్చు కాని కుటుంబం అలా కాదు. ఆ సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సిందే. అది ఒక తెలివైన ఇల్లాల్లి వల్లే సాధ్యమవుతుంది. నేటి ఇల్లాలు రుచిగా వంట చేయడం, ఇంటిని నీట్ గా ఉంచడం, పిల్లలను చదివించడం మాత్రమే కాదు వాళ్లను ఒక సంపూర్ణ వ్యక్తిత్వం కలిగిన  మంచి పౌరులుగా తయారుచేస్తుంది. బయటకెళ్లి ఉద్యోగం చేయకున్నా భర్తకు, ఇంటికి సంబంధించిన ఎటువంటి పనులైనా , చిన్న చిన్న సమస్యలైనా తనే చూసుకుంటుంది. అతనికి భారాన్ని తగ్గించాలని చూస్తుంది. పిల్లలకు చదివించిన అన్ని విషయాలు, వాళ్లు నేర్చుకోవాలనుకునే ఆటలు, కోర్సులకు తానే వెంట ఉండి తీసుకెళ్తుంది. బిల్లులు కట్టడం. బాంకు పనులు, ఆరోగ్య సమస్యలు మొదలైనవెన్నో ఉంటాయి. పిల్లలకు కావలసినవి అమర్చి వాళ్ల ప్రవర్తన, స్నేహితులు , ఆటపాటలు అన్నీ పర్యవేక్షించడం వల్ల వాళ్లు చెడు దారి పట్టి తమ జీవితాలను  పాడు చేసుకోకుంఢా ఉంటారు. పిల్లలను కని వాళ్లకు అవసరమైనవన్నీ డబ్బులతో కొనివ్వడమే తల్లిదండ్రుల ప్రేమ, కర్తవ్యం కాదు. దానికోసమే ఇద్దరూ పనిచేయాల్సిన అవసరం అస్సలు లేదు. అలా సంపాదన, కెరీర్ మాత్రమే ముఖ్యమనుకునేవాళ్లు , కుటుంబానికి అంత ప్రాముఖ్యం ఇవ్వనివాళ్లు తమను కన్నవారిని చూసే సమయం, తీరిక లేక వాళ్లను వృద్ధాశ్రమంలో, తాము కన్నవారిని కూడా ఆయాలకు అప్పగిస్తారు.

ఇంట్లో ఉండే గృహిణికి  ప్రపంచంతో ఎక్కువ పరిచయం లేకపోవడంతో ఆమెకుండేది మిడిమిడి జ్ఞానమే అనుకుంటే పొరపాటు. ఉన్నత విద్య లేని మహిళలు ఆధునిక, సాంకేతిక ఉపకరణాలను ఉపయోగించి అన్నీ కాకున్నా చాలా విషయాలు తెలుసుకుంటున్నారు. ఇంటినుండే చిన్న చిన్న వ్యాపారాలు మొదలెడుతున్నారు. కుటుంబ నిర్వహణలో, భర్తకు తోడుగా ఎంతో కొంత సంపాదిస్తున్నారు.  దీనికి వాళ్లు తమ కుటుంబాన్ని, పిల్లలను, వారి బాగోగులను పణంగా పెట్టడానికి ఇష్టపడడం లేదు. అంతే కాదు. పెళ్లి తర్వాత  పిల్లలను, అత్తామామలను చూసుకోవడానికి తమ ఉద్యోగాలను కూడా వదిలేసి గృహిణిలుగా మారిన మహిళలు ఎంతోమంది ఉన్నారు.  ఉద్యోగాలు చేసే  మహిళలకు  నిర్ణీత సమయంలో చేయాల్సిన టార్గెట్ ఒకటే ఉంటుంది. ఆపీసు పనివేళల ప్రకారం దానిని పూర్తి చేయాల్సి ఉంటుంది. కాని గృహిణి/housewife/ home maker నిత్యం పూర్తి చేయాల్సిన టార్గెట్లు ఎన్నో ఉంటాయి. లేకుంటే కొత్త పని వెతుక్కుని మరీ చేస్తుంది. అలాగే కుటుంబాన్ని, తమ ఉద్యోగాలను కూడా సమర్ధవంతంగా నిర్వహిస్తున్న మహిళలు నేడు కోకొల్లలుగా ఉన్నారు. ఒకదాని కోసం ఇంకొకటి ఎన్నటికీ త్యాగం చేయలేరు, చేయాలనే ఆలోచన కూడా రానివ్వరు అంతే కాని ప్రేమతో చేయాల్సిన పనులను కూడా ఔట్ సోర్సింగ్ చేద్దామనే ఆలోచన కుటుంబాన్ని ప్రేమించే ఏ  మహిళా ఒప్పుకోదు. ఇంటిపనులను ఆఖరుకు తినే తింఢిని కూడా డబ్బులిచ్చి బయటవాళ్లతో చేయించుకునే స్తోమత, ఆలోచన అందరికీ ఉండదు.  ఆచరణ యోగ్యం కాదు కూడా. ఐనా ఎంత సంపాదించినా ఈ జానెడు పొట్ట నింఫడానికే కదా.. మగవాడికి తన కుటుంబం, తన ఉద్యోగం రెండూ కూడా ఎంతో ముఖ్యమైనవి.  కాని భార్య తన కుటుంబ బాద్యతలను నెత్తినేసుకుని సగం బరువును తగ్గిస్తుంది. అతను తన కింద పనిచేసేవారిని అధికారంతో  కంట్రోల్ చేయగలడు. భయంతో పని చేయించగలడు. కాని భార్య పరిస్ధితి అలా కాదు. కుటుంబ సభ్యులు, పిల్లలను భయంతో, అధికారంతోకాకుండా ప్రేమతో, గౌరవంతో నెరవేర్చాలి. సమస్యలను తీవ్రం కాకుండా, భర్తకు అదనపు సమస్య కాకుండా చూసుకుంటుది. ఇలా ఉద్యోగాలు, వ్యాపారాలు చేయని మహిళలు చేసే పనికి వెల, విలువ కట్టడం అసాధ్యం. అసలు ఇల్లాలుకు ఆమె చేసే పనులకు ఎంత ఇవ్వాలి అని లెక్కలేస్తే ఎన్ని లక్షలు, కోట్లు అవుతాయో మరి. ఆవి చెల్లించడం సాధ్యమా??  మరి చేతన్ గారు తనకు మాత్రమే లాభం కలిగించి బోలెడు సంపాదించే భార్య మాత్రమే ముఖ్యమంటున్నారు.


















Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008