Sunday 29 December 2013

తెలుగు వెలుగులో .... సినీ సం"గీత" క్రాంతి



జీవితం చిత్రమైంది.. కష్టనష్టాలు, సుఃఖదుఃఖాలు. లాభనష్టాలు. ప్రేమలు, వైఫల్యాలు,... ఇలా ఎన్నో ఆటుపోట్లు, సంఘర్షణలతో రంగుల హరివిల్లులా సాగిపోతూంటుంది. కాని మనసు, శరీరం, ఆత్మకూడా సంగీతానికి, పాటకు స్పందిస్తాయంటారు. చిన్నపాటి సంతోషానికి మనసు తనలో తాను సన్నగా పాట పాడుకోవాలని ఆరాటపడుతుంది. కొందరు గొంతెత్తి పాడితే కొందరు గొంతు కలుపుతారు. సంతోషమే కాదు దుఃఖము, వేదన, సంఘర్షణల సమయంలో కూడా మనసు స్పందిస్తుంది. ఆ స్పందనకు అక్షరరూపమిచ్చినంత సులువుగా గానాన్ని జతచేయడం కాస్త కష్టమే. ఇలా మన జీవితంలో ప్రతీ సందర్భానికి  ఒక పాటను అన్వయించుకోవచ్చు. రాసుకోవచ్చు. పాడుకోవచ్చు కూడా.. 



 ఈ పాటలు జానపదాలైనా, పల్లెరాగాలైనా, సంప్రదాయ సంగీతమైనా .. ఒక్కోటి ఒక్కో భావన, సంధర్భం, స్పందనని తెలియజేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఇలాటివే మన సినిమాల్లోని పాటలు కూడా.. చాలా ఏళ్లుగా విడుదలైన తెలుగు సినిమాల్లో సామాన్యంగా ప్రేమగీతాలు, పిల్లల పాటలు, లాలిపాటలు, శృంగారగీతాలు, విషాదగీతాలు మొదలైనవి ఉండేవే. కాని మనవైన పండుగలను, వాటి సంబరాలను ఎన్నో అందమైన, శ్రావ్యమైన, జనరంజకము లైన పాటలుగా అందించారు చిత్రనిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు. ఈ పాటలు  ఆ సినిమా వరకే కాకుండా ఆయాపండుగల వేళలో రేడియో, టీవీల ద్వారా మనకు   పండుగ వాతావరణాన్ని సృష్టించి ఆనందోల్లాసాలు కలిగిస్తాయి.

మన భారతీయ సంస్కృతిలో పండుగలు ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. రుతువులకనుగుణంగా సంవత్సరం పొడువునా వేర్వేరు పండుగలు జరుపుకోవడం హిందువుల ఆచారం. ప్రతీ పండుగకు ఒక ప్రత్యేకత, దానికి సంబంధించిన నమ్మకాలు, ఆచారవ్యవహారాలు ఉంటాయి.  ఏడాది పొడుగునా ఎన్ని పండుగలున్నా తెలుగువారికి, అన్నదాతలైన రైతులకు, వ్యవసాయదారులకు అత్యంత ప్రాముఖ్యం,  ప్రీతికరమైన పండుగ సంక్రాంతి పండుగ.. రైతులు  వారి శ్రమకు తగ్గ ఫలసాయం లభించగానే సంతోషంగా జరుపుకునే అసలైన పండుగ ఇది.. రాత్రింబవళ్లూ కష్టపడి తన కష్టానికి ప్రతిఫలాన్ని గర్వంగా అందుకుని కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో తన సంతోషాన్ని  పంచుకోవడానికి సంబరాలు చేసుకుంటాడు దేశానికి వెన్నెముకగా నిలిచే రైతన్న. అంతేకాక ఈ సంబరాల సంక్రాంతికి, తెలుగువారికి అవినాభావ సంబంధముంది.  సంక్రాంతి నాటికి పల్లెల్లో పంటలు చేతికి రావడంతోపాటు  నూతన సంవత్సరంలో వచ్చే మొదటి తెలుగింటి పండుగ సంక్రాంతికి  పుట్టింటికి వచ్చిన కూతుళ్లు, అల్లుళ్ళు, పిల్లలు, బంధుమిత్రులతో   సంబరాలు చేసుకుంటూ, విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు..

ఇక మన తెలుగు చలనచిత్రాలలో కూడా ఈ సంక్రాంతి పండుగకు పెద్ద పీటే వేసారని చెప్పవచ్చు. సంవత్సరంలో తొలి పండుగ సంక్రాంతికి ఎంతోమంది తెలుగు సినీనటులు, నిర్మాతలు, దర్శకులు తమ   సినిమాలు విడుదల చేయాలని  ఆరాటపడుతుంటారు. మన  తెలుగు సినీ దర్శక, నిర్మాతలు సంక్రాంతి అనే శీర్షికతో సినిమాలు తీయడమే కాకుండా తమ చిత్రాలలో అవకాశం వున్న మేరకు సంక్రాంతి సంబరాల సన్నివేశాలకు, పాటలకు చోటిచ్చారు. ఆయా సందర్భాలకు అనుగుణంగా తెలుగు సినీకవులు సంక్రాంతి ఉత్సాహాన్ని తమ  పాటలలో నింపారు. సంక్రాంతి సినిమా పాటలలో కొన్ని పూర్తిగా ఆ వేడుకలకు అద్దం పట్టేవయితే - మరికొన్ని పల్లవులకో ఒకటి రెండు చరణాలకో పరిమితమయ్యేవిగా ఉన్నాయి.. తెలుగు సినిమాలలో సంక్రాంతికి సంబంధించిన తొలి పాట “రక్షరేఖ” (1949) చిత్రంలో పెట్టారు. బలిజేపల్లి లక్ష్మీకాంతం రాసిన ఈ పాట “పండుగ పొంగళ్ళు గంగమ్మా! పాలవెల్లి పొంగళ్లు, కమ్మ




 పాయసాలు పొంగే ఆరగింపు గంగమ్మ తల్లి” అనే పల్లవితో ఉంటుంది. “సంక్రాంతి” (1952) చిత్రానికి బలిజేపల్లి రాసిన “జేజేలమ్మా జేజేలు - సంక్రాంతిలక్ష్మికి జేజేలు” అనే పాట అప్పట్లో వీక్షకులకు కన్నులపండుగ చేసింది. ఆ తర్వాత  టి. ప్రకాశరావు దర్శకత్వంలో పీపుల్స్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించిన “పల్లెటూరు” (1952) చిత్రంలో కూడా  ఆ సంక్రాంతికి ఈ సంక్రాంతికి అనే పాటను ఘంటసాల, ఎం.ఎస్.రామారావుగారు పాడిన పాట మరువలేము. కాని ఈ పాటలో సంక్రాంతి ప్రస్తావన తప్ప  పండుగ విశేషాలు ఎక్కువగా లేవనే చెప్పవచ్చు....  ఇంకో చిత్రం నాగయ్య దర్శకత్వంలో అవరిండియా నిర్మించిన “నా యిల్లు” (1953) లో దేవులపల్లి కృష్ణశాస్ర్తిగారి  కలం నుంచి వెలువడిన గీతం  “గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో వచ్చేనమ్మా సంక్రాంతి” అంటూ సంక్రాంతి అందాలను ఎంతో రమ్యంగా వర్ణించారు. చిత్తూరు వి. నాగయ్య, అద్దేపల్లి రామారావు సంగీత దర్శకత్వంలో ఒలియో ఒలియో అంటూ ఎన్.ఎల్ గానసరస్వతి బృందం ముగ్గులు, గొబ్బిళ్లు, భోగిపళ్లు, డూ డూ బసవన్నలగురించి చెప్తూ పండుగ శోభను మన  కళ్ల ముందుకు తీసుకువచ్చారు...

ఇక  ప్రతీ సంవత్సరం సంక్రాంతి పండుగ అనగానే మనందరికీ తప్పకుండా గుర్తుకువచ్చే మొదటిపాట  “ఉండమ్మా బొట్టు పెడతా “ చిత్రం లోని “రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా” అనేది . దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారు రాసిన ఈ పాట స్వరబ్రహ్మ కె.వి.మహాదేవన్ స్వరపరచగా బాలసుబ్రహ్మణ్యం, సుశీల గానం చేసారు. . పౌష్యలక్ష్మి రూపంలో ఉన్న మహాలక్ష్మిని  తమ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తూ మొదలయ్యే ఈ పాటలో సంక్రాంతి పండుగకి సంబంధించిన అన్ని విశిష్టతలను,  తెలుగింటి సంక్రాంతి ఎలా ఉంటుందో తేట తెలుగు పదాలలో రమణీయంగా  తేట తెలుగుమాటలలో మన కళ్లకు కట్టినట్టు చూపించారు దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు.  ఈ పాట విన్నవారందరికీ కూడా సంక్రాంతిలక్ష్మిని తమ ఇంటికి ఆహ్వానిస్తున్న భావన కలుగుతుంది.

 సంక్రాంతి పండుగనాడు హరిదాసు ప్రతీ ఇంటి నుంచిబియ్యం దానంగా తీసుకుని ఆ ఇంట కొలువై, ఆ ఇంటివారందరినీ చల్లగా చూడమని ఆ కలుముల రాణిని ఆహ్వానిస్తున్నాడు. ఈ  పాట వింటుంటేనే  గ్రామీణ వాతావరణం మన కళ్లముందు సాక్షాత్కరిస్తుంది.. “కడివెడు నీళ్ళూ కలాపు చల్లీ గొబ్బిల్లోయ్ గొబ్బిల్లూ” అని గొబ్బిళ్లు తట్టుతూ పాటలు  పాడే  ఉషారైన ఆడపిల్లలూ, పాడిచ్చే గోవులకూ పసుపూ కుంకం, పని చేసే బసవనికీ పత్రీ పుష్పం అని ఆలపిస్తూ తమ ఇంటి గోసంపదను పూజించే అమ్మాయిలు ,   “గాదుల్లో ధాన్యం , కావిళ్ళ భాగ్యం.. కష్టించే కాపులకూ కలకాలం సౌఖ్యం”  అంటూ ఎన్ని రకాలుగా, ఎంత వేడుకగా జరుపుకున్నా అన్నదాతలైన రైతుల గాధులన్నీ ధాన్యంతో నిండుగా ఉండాలని వాళ్లతో పాటు మనమందరం మనస్ఫూర్తిగా కోరుకోవాలి.  అచ్చతెలుగు గ్రామీణ వాతావరణాన్ని అడుగడుగునా ప్రతిబింబించేలా చిత్రీకరించిన ఈ పాటలో .  మధురమైన సంగీతము, సాహిత్యం కలిసి, మన  మనసుకు హత్తుకునే  ఈ పాటన  ఎప్పటికి  మరపురాని  ఆణిముత్యం .

“మంచిరోజులు వచ్చాయి” చిత్రంలో  “ఈ నాటి సంక్రాంతి అసలైన పండగా” ఈ పాట సంక్రాంతి పండుగ విశేషాలని కాకుండా  కష్టజీవులకి, రైతులకి అది ఎంత ముఖ్యమైనదో  చెప్తుంది. కొసరాజు రచించిన ఈ పాట మొత్తం సోషలిస్ట్ భావాలతో రాసినట్టుగా కనిపిస్తుంది.. కష్ట జీవులకి మంచి రోజులు రావాలనీ, అవి తప్పకుండా వస్తాయని చెప్తూనే  పెత్తందార్ల ఆటలు,  వారి అధికారం సాగక కుక్కిన పేనల్లే మొహాలు చెల్లక దాక్కుంటారని ఎద్దేవా చేస్తూ నడుస్తుంది ఈ పాటలోని  సాహిత్యం.  సంక్రాంతి పండగంటే  ఉత్త సంబరాలే కాక కష్టపడేవారందరి పండుగ అన్న భావాన్ని ప్రతిబింబిస్తుంది ఈ పాట. ఈ పాట టి.చలపతిరావు స్వరకల్పనలో ఘంటసాల బృందం కలిసి ఆలపించారు.
ఇక ఈ సంక్రాంతి అనగానే తప్పనిసరిగా గుర్తు చేసుకునే పాట  “భోగిమంటలు”  సినిమాలోని  “భోగుల్లో భోగుల్లో” అంటూ సాగే ఈ పాట “  పల్లవిలో భోగి గురించి విశేషాలతో  మొదలవుతుంది. ఆచార్య ఆత్రేయ సాహిత్యంలో రమేష్ నాయుడు స్వరపరిచారు. సంక్రాంతి పండుగ అనగానే మూడురోజులపాటు జరిగే ఎన్నో సంబరాలు.  భోగి, సంక్రాంతి, కనుమ... ఒక్కోరోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. “తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో” అంటారు, భోగిమంటల ఎర్రని



 కాంతులు ఉదయాద్రిని నిద్రలేస్తున్న సూర్యుని కిరణాలతో పోటీ పడుతూ పైకెగస్తున్నాయని ఎంతందంగా చెప్పారు  ఆత్రేయ. గుమ్మడిపూలు పెట్టుకున్న గొబ్బెమ్మలనీ, హరిదాసు పలికే “హరిలో రంగ హరి “ అంటూ పలికిస్తూ సంక్రాంతి సంప్రదాయాలని పరిచయం చేస్తుందీ  పాట. ఇందులోని  పాత్రలు సరదాగా ఒకరినొకరు ఆట పట్టించుకోవడం,   బావా మరదళ్ల సరాగాలతో సరదాగా నడుస్తుంది ఈ పాట.  సినిమాలో ఈ పాటలో పల్లెల్లోని సంక్రాంతి సందడంతా కనుల (వీనుల)విందుగా చిత్రీకరించారు.

కొద్దికాలం క్రింద తెలుగు సినిమాలను గ్రామీణ వాతావరణంలో ఎక్కువగా చిత్రీకరించేవారు. వాటిలో సంక్రాంతి పాట తప్పకుండా చేర్చేవారు.  ఏడాదికో పండుగ, బ్రతుకంతా తొలి పండుగ అంటుంది “ఊరంతా సంక్రాంతి” లోని దాసరి పాట.  ఈ పాటలో సంక్రాంతి రైతులకే కాదు తెలుగు వారందరికి తొలిపండుగ . ఊరంతా కలిసి ఆడిపాడి సంబరాలు జరుపుకునే పండుగ అని చెప్తుంది   “సంబరాల సంకురాత్రి” అనే పాట. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి స్వరాలలో పండుగ విశేషాలను, ఆటపాటలు హుషారుగా అందించారు.

ముత్యాల ముగ్గుల్లో .. రతనాల గొబ్బిళ్ళూ” అంటూ మొదలై “ముద్ద బంతులూ, మువ్వ మోతలూ, నట్టింట కాలుపెట్టు పాడిపంటలూ”.. అంటూ సాగి సంక్రాంతి విశేషాన్ని చాటి చెప్తుంది “పండుగ” చిత్రం లోని ఈ పాట. పండుగలనగానే ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులు, ఆక్కాచెల్లెళ్లు ఒకచోట చేరి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. అందునా సంక్రాంతి అనగానే ఆడపడుచులు, అల్లుళ్లను మరింత అపురూపం చూసుకునే పుట్టింటివారికి చాలా ముఖ్యమైన పండుగ. కనీసం  ఈ వంకతోనైనా అందరూ సంతోషంగా ఒక్కచోట కలిస్తే ఉండే ఆనందం ఈ పాటలో కనిపిస్తుంది.  “వెండి ముగ్గులూ, పైడి కాంతులూ, పుట్టింట దీపమెట్టు ఆడపచులు. కలబోసి, విరబోసి బహుదండిగా మది నిండగా చలి పండుగే సంక్రాంతి.” అంటూ చక్కగా, హాయిగా సాగుతుంది ఈ పాట..  పండక్కి వచ్చిన బావ దగ్గరనించీ, పసిపిల్లల వరకూ రకరకాల బంధుత్వాలకు సంక్రాంతి పండుగ సంబరాలకి గల దగ్గరి పోలిక చూపుతూ చక్కని ప్రయోగం చేసారు గీత రచయిత చంద్రబోస్ గారు.  అంతే కాక ఈ బంధాలన్నీ కలబోసి, తెరతీసి మనకందిన సిరి సంపదే సంక్రాంతి అంటారు. సినిమా పాటలు కాలక్షేపానికి మాత్రమే కాదు మానవ, కుటుంబ విలువలను ప్రతిబింబించి  వాటిని మరువనీయకుండా చేసేవి కూడా ఉన్నాయి. అలాటిదే ఈ పాట కూడా. “మనవాళ్ళు నలుగురు ఉంటే దినమూ కనుమే కాదా, మనసును చూసే కన్నులుంటే పగలే వెన్నెలే రాదా” అంటూ కుటుంబం అంతా కలిసినప్పుడు జరిగేదే నిజమైన పండుగ అన్న భావన ఎంతో హృద్యంగా పలికించారు . మనం అనే మాట మరచి నువ్వు, నేను అనే భావనలు  పెరిగిపోయిన ఈనాటి తరానికి  కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు , మమకారాలతో ఉమ్మడి కుటుంబ ప్రాముఖ్యతని తెలిపే  చక్కటి చిత్రీకరణతో ఈ మధ్య కాలంలో పండుగల గురించి వచ్చిన పాటలలో ఇది ఎన్నదగిని పాట అని చెప్పక తప్పదు. కీరవాణి సంగీతం కూర్చగా  ఈ పాటని మనో, చిత్ర ఆలపించారు.

“సింధూరం” చిత్రంలోని “ఏడు మల్లెలెత్తు సుకుమారికీ” అనే పాటలో కూడా సంక్రాంతి సంబరాలని చాలా అందంగా, ఉత్సాహంగా జరుపుకున్నట్టు  చూపిస్తూ, సాహిత్యంలోనూ   పండుగకి సంబంధించిన ఎన్నో మంచి పదాలు వినిపించారు. దీనికి “భోగి పళ్ళు పోయాలి రోయ్ ఏమి దిష్టి తగిలిందో , హరిలో రంగా హరీ, సువ్వి సువ్వి గొబ్బెళ్ళు” పాటలు నిదర్శనాలు. ఇందులో  చాలా ప్రస్ఫుటంగా పండుగ మీదే సాహిత్యం అంతా నడుస్తుంది. ఈ పాటకి శ్రీ సంగీతం సమకూర్చగా, కృష్ణంరాజు, మాధవపెద్ది సత్యం మరియు బృందం ఆలపించారు.  “కుంకుడు స్నానాలూ, బూరెలూ, గంగిరెద్దు ఇంటికొచ్చేరో, గంగడోలు దువ్వి పంపరో” అని .. పాట చిత్రీకరణలో కూడా  ఎటు చూసినా  సంక్రాంతి పండుగ సరదాలూ, అంబారాలనంటే సంబరాలు ఎంతో కమనీయంగా సాగుతాయి. ఈ పాట చూసివారు ఎప్పుడెప్పుడు తమ పల్లెకు, తమవారింటికి వెళ్లిపోదామా అన్న ఉత్సాహాన్ని కలిగిస్తుంది. పాట మొత్తం సంగీతంలోనూ, సాహిత్యంలోనూ కూడా ఒక విధమైన హుషారు, చిలిపితనమూ కలబోసుకుని ఎంతో వైవిధ్యంగా ఉంటుంది...

 “సంక్రాంతి” సినిమాలో “డోలీ.. డోలీ...డోలీ రే” అంటూ మొదలై కుటుంబం అంతా కలిసి ఆనందంగా “సంక్రాంతి పండుగ చేద్దామా” అనే పాట... సినిమాలో సన్నివేశం కూడా సంక్రాంతి కావడం వల్ల  .  ఈ పాట ప్రారంభంలో సంక్రాంతి ప్రస్తావన వచ్చినా, మిగతా సాహిత్యంలో





పండుగ విశేషాలకంటే ఎక్కువగా  పాట అంతా ఉమ్మడి కుటుంబంలోని ఆనందాన్నీ, ఆత్మీయతని, అన్నదమ్ముల మధ్య కలగలసిన అనురాగాల సంబరాలనీ చూపిస్తూ సాగుతోంది.    ఎస్.ఏ రాజ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటని ఇ.ఎస్. మూర్తి రాసారు. శంకర్ మహదేవన్, చిత్ర బృందం ఆలపించారు.

సంక్రాంతి పండుగ అంటేనే ముంగిట ముత్యాల ముగ్గులు, రతనాల గొబ్బిళ్లు...  అన్నమయ్య కృష్ణుడికీ కొండలరాయనికీ అభేదం పాటిస్తూ  రాసిన కొలనిదోపరికి గొబ్బిళ్లు  కీర్తన తెలియనిదెవరికి. మార్గశిరమాసం. బాలికలు గుమ్మాల ముందు గొబ్బిళ్ళు పెట్టి వాటి చుట్టూ గుండ్రంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ నాట్యభంగిమలో పాడే ఈ పాట అతి మనోహరమైనది.  ఇదే “కొలని దోపరికి గొబ్బిళ్ళో”.. అంటూ సి.నా.రె “ఇండియన్ బ్యూటీ”  అనే సినిమాలో రాసిన  పాటలో సంక్రాంతి వైభవాన్ని గురించి ఎంతో అందంగా చెప్పారు. “సంక్రాంతి పండుగంట హో లాలా.. సంబరాలు అంబరాలనంటే వేళా” అంటూ ఆహ్లాదంగా సాగుతుంది. మధ్యలో ” రామా రఘురామా” అంటూ హరిదాసు వస్తాడు..  ఈ పాటలో  భోగి మంటలు, గాలిపటాలు, డూ డూ బసవన్నల గురించీ ప్రస్తావించారు రచయిత. అనితాకృష్ణ, బాలాజి బృందం పాడిన ఈ పాటకు  జోయ్ కాల్విన్ సంగీతం సమకూర్చారు.

సంక్రాంతికి, ఇంటి అళ్లుళ్లకు అవినాభావ సంబంధం ఉంది.  కొత్త అళ్లుళ్లు మరికాస్త ఎక్కువ సంబరం. పండుగనాడు కొత్తల్లుడిని ఆహ్వానించి మర్యాదలు చేయడం వగైరా తెలుగింట సర్వసాధారణం. కాని సంక్రాంతి పండుగపూట  “రాధమ్మ పెళ్లి” సినిమాలో  “సంకురాతిరి అల్లుడూ .. ముడుచుకూని కూసున్నడు.. మూతి ముడుచుకూని అంటూ”అంటూ అల్లరి చేస్తున్నారు మరదలి వరసైన అమ్మాయిలు..  ఇంకో పాట “ సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే” అంటూ  “సోగ్గాడి పెళ్లాం”  చిత్రంలోనిది.... సంక్రాంతి పండుగ గురించిన విశేషాలు, పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ అక్కడి వేడుకలు, పల్లెవాసుల ఆత్మీయతానురాగాలు, కల్మషాలు లేని వారి ప్రేమల గురించి చెప్తుంది. అందమైన రంగురంగుల రంగవల్లులు, గొబ్బిళ్లు, కొత్త ధాన్యాలు, కోడిపందాలతో ఉల్లాసంగా ఉన్న ఊరిగురించి  చెప్తున్నారు గీతరచయిత భువనచంద్ర.

సంక్రాంతి మీద చిత్రీకరించిన మరో పాట  “వారసుడొచ్చాడు” చిత్రంలోని  “ఏలాద్రి ఎంకన్న” పాట. కాని ఇందులో పండుగ కంటే వేడుకలు, సరసాలు, సరదాలు ఎక్కువగా కనిపిస్తాయి.. సంక్రాంతి శోభలన్నీ పల్లెలకే సొంతమేమో అనిపిస్తుంది “రాముడొచ్చాడు” సినిమాలోని “మా  పల్లె రేపల్లెంట” పాటలో.. సంక్రాంతి పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పకున్నా  వేటూరి మరోసారి అద్బుతంగా.. “మా పల్లె రేపల్లంట - ఈ పిల్లే రాధమ్మంట రేగుతుంటే భోగిమంట - రేగు పళ్ల విందులంట ... ... ... మంచ మేస్తే సంకురాత్రి తిరునాళ్ళలో పల్లె పచ్చగా పిల్ల వెచ్చగా వుండే పండుగ” అంటూ సాగుతుంది బాలసుబ్రహ్మణ్యం, చిత్ర స్వరంలో..  “గోగులు పూచే గోగులు పూచే” అంటూ మొదలయ్యే మురారి సినిమాలోని పాట తర్వాత రూపు మారిపోతుంది.. సంక్రాంతి గురించి ప్రస్తావన వచ్చిన మరోపాట  “ముగ్గురు మిత్రులు”   చిత్రంలో వేటూరి రచించిన ... “సంబరాలు సంబరాలు సంకురాత్రి సంబరాలు కోలో కోలో కోలాటము - కోకా రైకా చెలగాటము చిన్నా పెద్దా శ్రీమంతము - గుళ్లో గంటల సంగీతము మా లచ్చిమొస్తుంటె పేరంటము మాగాణి చేలల్లో పేరంటము” ... సంక్రాంతి పండుగ రోజుల్లోనే ముగ్గులు, గడపకు పసుపులు, గోపూజ మొదలైనవి చేయాలని కాకుండా నిత్యం సంక్రాంతి శోభలు ఉండాలని చెప్తున్నాయి ఈ పాటలు. “గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మడి, గోగులు దులిపే వారెవరమ్మా ఓ లచ్చా గుమ్మడీ, ముంగిట వేసిన ముగ్గులు చూడు, ముత్యాల ముగ్గులు చూడు” అంటూ సి నారాయణ రెడ్డి, “ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తయిదు కుంకుమ బ్రతుకంత ఛాయ. ఆర నైదో తనము ఏ చోట నుండు, అరుగులలికే వారి అరచేత నుండు, తీరైన సంపద ఎవరింట నుండు, దినదినము ముగ్గున్న లోగిళ్ళనుండు..., గోవు మాలక్ష్మికి కోటి దండాలు, కోరినంతా పాడి నిండు కడవల్లు, మొగుడు మెచ్చిన చాలు కాపురంలోన” అంటూ ఆరుద్ర “ముత్యాలముగ్గు” కోసం రాసిన పాటల్లో సంక్రాంతి వైభవం చూపించేసారు.

ఇలా సంక్రాంతి పండుగనాటి ప్రతీ వివరాన్ని, విశేషాన్ని అక్షరాలుగా మార్చి  తమ పాటల్లో పొదిగిన గీతరచయితలెందరో.. పండుగ అనే కాకుండా మన భావాలు, భావనలు, స్పందనలు, ఆవేశాలోచనలు అందమైన పదాల నగిషీ చెక్కి, సంగీతపు మెరుపును అద్ది మనకందించారు తెలుగు సినీ నిర్మాతలు, దర్శకుడు, నటులు కూడా.. ఎన్నో పాటలు సంధర్భోచితంగా రచించి, చిత్రీకరించడం వల్ల అవి కలకాలం సంగీత, సాహిత్య ప్రేమికుల గుండెల్లో ఎప్పటికి గుర్తుండిపోయాయి..  సంవత్సరంలో  వచ్చే తొలి తెలుగు  పండుగ  పుష్యమాసపు చలిలో  గిలిగిలిగింతలు  పెడుతూ  మన జీవితంలో అడుగు పెట్టే తెలుగువారందరికీ ముఖ్యమైన పెద్ద పండుగ సంక్రాంతి గురించి ఎంత చెప్పినా తక్కువే, అలాంటి సంక్రాంతిశోభ మీ ముంగిళ్ళలో పసిడి కాంతులు విరజిమ్మాలని, ఆటపాటల ఆనందాల కోలాహలాలతో మీ ఇంట పాటల పండుగగా నిలవాలని మనసారా కోరుకుంటూ .....


జ్యోతి వలబోజు

Sunday 22 December 2013

అనగనగా ఓ అమ్మాయి... హ్యాపీ బర్త్ డే




అనగనగా ఓ అమ్మాయి....


మొన్న... ఒక కూతురు, ఒక భార్య, ఒక అమ్మ,.....

నిన్న ... ప్రముఖ తెలుగు బ్లాగర్... రచయిత్రి, కాలమ్నిస్ట్

నేడు.. వెబ్ పత్రిక సంపాదకురాలు...ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

రేపు... సస్పెన్స్...


నా ఈ పయనంలో ఎన్నో ఆటుపోట్లు, సంతోషం -దుఃఖం, పొరాటం, గెలుపు - ఓటమి, విజయం - ఓటమి,  ఇలా సాగిపోతూ యాభై సంవత్సరాలు నిండాయి.. కొన్నేళ్ల క్రితం వరకు  నేనెవరు అనే ఆలోచన లేకుండా కాలం గడిపేసాను.. కాని ఒకానొక సమయంలో నేనెవరు అన్న ఆలోచన మొదలై నా గురించి నన్ను పరిశోధించుకుని, నాగురించి తెలుసుకుని, నన్ను నేను మెరుగుపరుచుకునేలా చేసింది. ఈ ప్రస్థానంలో నాకు తోడు నిలిచిన వారందరికి మనఃఫూర్వ ధన్యవాదాలు చెప్పడం తప్ప ఏమివ్వగలను??  ఈనాడు నాకంటూ ఒక గుర్తింపు, ఆదరణ, అభిమానం, గౌరవం,  ప్రేమను తలుచుకుంటే గర్వంగా, సంతృప్తిగా ఉంటుంది. నా జన్మ సార్ధకమైందనిపిస్తుంది. కాని ఇంకా ఏదో చేయాలనే తపన మాత్రం తగ్గడం లేదు. అందుకే రేపు అనేది సస్పెన్స్ గానే ఉంచుతున్నాను. .. ఒకోసారి అనిపిస్తుంది. నేను అందరిలా పెద్ద చదువులు చదివి, పెద్ద ఉధ్యోగం చేసి బోలెడు డబ్బులు సంపాదించి ఉంటే .... అవన్నీ చేయకుండా ఈ మధ్యే మొదలెట్టిన నా అసలైన ప్రయాణం సఫలమైందని నమ్ముతూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ


HAPPY BIRTHDAY TO ME, MYSELF.... JYOTHI...



వారం రోజుల క్రింద హైదరాబాదులో జరిగిన బ్నింగారి చీర పజ్యాల పుస్తకావిష్కరణ ఫోటోలు క్రింద  చూడండి..






Saturday 14 December 2013

చీర పజ్యాలు - పుస్తకావిష్కరణ


చీరస్తూ.. శుభమస్తూ అంటూ చీర పజ్యాల ఆవిష్కరణకు సాదర ఆహ్వానం:








చీర శతకం గురించి,,,


శ్రీమతి జ్యోతి వలబోజుగారికి బహిరంగ లేఖ!!!


మేడం... మీరే ముహూర్తాన మాలిక పత్రికలో "చీర సొగసు చూడ తరమా" అంటూ పద్యాలు రాయమన్నారోగానీ,

వాటిని విశ్లేషిస్తావా... అని నన్నడిగారోగానీ,

విశ్లేషించావు సర్లే.. నువ్వో నాలుగు పద్యాలు రాయని ఆదేశించారోగానీ,

శతకమై చీర పద్యాల మాల పూర్తవాలని బుర్ర మొరాయిచి మరేపని చెయ్యనివ్వలేదు! చీర మాయ అదని తెల్సుకునేటప్పటికి వంద పూర్తయి.. ఇంకా కంద దురదలా వదలని 'కందం' వరదలవుతోంది.అచ్చుకిచ్చి పిన్ వెయ్యకపోతే వెయ్యి దాటే ప్రమాదం కనిపించింది.

అంచేత... ముప్ఫై 2 పేజీల దగ్గర ఆగిపోమని మా ప్రింటింగ్ ప్రెస్ మిత్రుడు కంచేశారు.

రెండో భాగం రాసి మిమ్మల్నీ, పాఠక మిత్రుల్నీ హింసించను..

'సిస్తా'నేమోనని భయంగా వున్నమాట పచ్చి నిజం...

మధ్యమధ్యలో ఎవరైనా బాగోలేదంటే బ్రేకు పడుతుందన్న ఆశగా కొంత మంది మిత్రులకి చూపించాను. కొన్నింటికి నవ్వారు. కొన్ని నిజమే కదా అని నిట్టూర్చారు. కొన్నింటికైతే మా ఆవిడకివ్వాలి జెరాక్స్ తీసుకుంటా అన్నారు..

బాపుగారైతే.. ఓకే.. ప్రొసీడూ అని బొమ్మ వేసి మెయిల్ కొట్టారు..

ఇలా... మీరంటించిన సీమటపాకయగుత్తి వంద దాటి, పేలి ... పేట్రేగింది..
ఈ కథంతకీ.. మూలకారణంబైన.. మిమ్మల్ని అంత తేలిగ్గా వదల్రాదని.. 'చేసుకున్నవాళ్లకి చేసుకున్నంత మహాదేవా!' అన్నట్లు.. 'ఆవిష్కరణ శిక్ష' విధించాలని నిశ్చయించుకున్నాను.

ఒక మిత్రుడు.. నా బేంక్‌లోంచి డబ్బులు తీయకుండా. బేక్ కవర్ గమ్మత్తు చేశారు.

మరి విడుదల ముహూర్తం....?!

మా ప్రియమైన, మీకూ, అందరికీ ఇష్టమైన బాపుగారి పుట్టిన్రోజు..

"చీరస్తూ.. సుఖమస్తూ!!' అంటూ.. పైగా బాపురమణగార్లకి అంకితం చేయాలని డిసైడయిపోయా..

అసలీ తెలుగుతనం ఫతిఫలించే.. చీరలో కనిపించే.. అందమైన ఆడవాళ్లకి మరింత అందం 'చీర మాత్రమే' అని బుర్రకెక్కించిన వారిద్దరే ఇందుకు అర్హులుగా .... ఎంచి.... సమర్పించడానికి నిశ్చయించుకున్నాను. కొందరు గొప్పవాళ్లని మాత్రం ఈ పేరంటం జయప్రదం చెయ్యమని కోరాను. సరే అన్నారు..

అంచేత.. మీకు థేంక్స్‌లూ, స్వాగతాలూ చెప్పడానికి ఈ పొడుగాటి లేఖ! బహిరంగంగా ప్రేమలేఖ...


బ్నిం

Thursday 5 December 2013

మాలిక పత్రిక డిసెంబర్ 2013 సంచిక విడుదల



మాలిక పత్రిక ఈ సంవత్సరంలో   డిసెంబర్ 2013 సంచిక విడుదల అయింది. ఈ సంచికలో మీకు నచ్చే, మీరు మెచ్చే సీరియళ్లు, పుస్తక సమీక్షలు, కవితలు చోటు చేసుకున్నాయి. జనవరినుండి మరిన్ని కొత్త శీర్షికలు మిమ్మల్ని అలరించగలవు.
మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

 మాలిక పత్రిక ఈ  నెల సంచికలోని విశేషాలు:


0.  పుస్తకాల పండగ గురింఛిన సంపాదకీయం
పుస్తకం హస్తభూషణం

1. బ్నింగారు రచించగా ఝాన్సీ గళంలో ఈ సారి పెళ్లానికి ప్రేమలేఖ గురించి ఏం చెప్తున్నారో మరి
పెళ్లానికి ప్రేమలేఖ

2.  పసుపులేటి గీతగారు అద్దం గురించి చెప్పే ముచ్చట్లు
అద్దం

3. ఈసారి మోహనరావుగారు మధుశాల గురించి చెప్తున్నారు.
మధిర - మధుశాల

4. శ్రీమతి అంగులూరి అంజనీదేవిగారి సీరియల్ లో దేదీప్య, అభిరాంల మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారిందా..
మౌనరాగం - 2

5. అబ్దుల వాహెద్ గారు ఈసారి కూడా షకీల్ బదాయూనీ గజల్స్ వివరిస్తున్నారు.
గజల్స్ - షకీల్ బదాయూనీ

6. మంధా భానుమతిగారు చారిత్రక సాహిత్య కధలలో ఈసారి అఫురూపమైన స్నేహం గురించి చెప్తున్నారు.
తెలుగు వెలుగుల స్నేహం

7.  గాసిప్స్ కాదు ఉపయుక్తమైన Gausips అంటూ స్త్రీలలోని గర్భాశయ సమస్యలగురించి వివరాలు అందిస్తున్నారు డా.గౌతమి.
గర్భాశయపు సమస్యలు -1

8. ప్రముఖ రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మిగారి కొత్త పుస్తకం గురించి జి.ఎస్.లక్ష్మిగారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తున్నారు...
కొంచెం ఇష్టం - కొంచెం కష్టం

9. మీకు కవితలు తెలుసుకదా. పెద్ద కవితలు, చిన్న కవితలు కాక ఏకవాక్య కవితలను రచించి వాటిని ఒక పుస్తకంలా అచ్చువేసారు. మరి ఆ పుస్తకం గురించి జగద్ధాత్రి ఏం చేప్తున్నారో చూడండి..
ఏకవాక్యం రసాత్మకం

10.  మీకు హైదరాబాదు చుట్టుపక్కల ఎన్ని సందర్శనీయమైన ఆలయాలు ఉన్నాయో తెలుసా. ఒక్కరోజులోనే ఆ ఆలయాలకు వెళ్లి రావొచ్చు కూడా . నమ్మట్లేదా. ఐతే ఈ పుస్తకం గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే..
యాత్రాదీపిక  

11. సంగీత దర్శకుడు సురేష్ మాధవపెద్దిగారు ఈసారి సరిగమలు-గలగలలులో పెండ్యాల నాగేశ్వరరావుగారి గురించి తన అనుభవాల గురించి మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.
సరిగమలు - గలగలలు 3 - పెండ్యాల

12. ప్రధానమంత్రిమీద హత్యాయత్నం జరగబోతుందని చెప్పడానికి దిశ ఎంతగా ప్రయత్నించిన జరగవలసిన దారుణం జరిగిపోయింది.
సంభవం - 7

13. పాకిస్తాన్ లో చిక్కుపడ్డ చైతన్య, ప్రనూష మొదలైనవారు క్షేమంగా తిరిగివచ్చారా? అక్కడే సైన్యం చేతిలో హతమయ్యారా? ఈ సీరియల్ చివరిభాగంలో చదవండి..
ఆతడే ఆమె సైన్యం - 6





Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008