Tuesday 28 June 2011

కుశలమా???


కుశలమా???

మాట చెప్పలేని విషయాన్ని ఒక పదం చెప్తుంది. ఆ పదాలను కూర్చి రాసిన ఉత్తరం ఆ వ్యక్తి మనసులోని భావనను ఉన్నదున్నట్టుగా అవతలి వ్యక్తికి మోసుకెళ్తుంది. ఉత్తరాలు అనగానే ఒక కార్డు,కవరు,, ఎన్వలప్ మాత్రమే కాదు. అందులో ఎన్నో కబుర్లు, కథలు, ఊసులు, బిల్లులు,బకాయిలు కూడా. ఈ బిల్లులు, బకాయిలైతే అందరికీ ఉండేవే. ప్రతి నెల అవి రాక తప్పదు. వాటికి మనసుండదు. మాటలుండవు. ఉత్తరమంటే అవసరమైన విషయాన్ని మూడు ముక్కల్లో రాసి పడేయడమేనా.. చాలామందికి ఉత్తరాలు అవసరమైతే తప్ప రాసుకునేవి, వచ్చేవి కావు అనుకుంటారు. కాని కొందరికి ఉత్తరం అంటే ఒక భావతరంగం. మనసును విప్పి చెప్పుకునే సాన్నిహిత్యం. పలుకలేని ఊసులెన్నో పదాలుగా మార్చి పంచుకోవడం అనుకుంటారు ఎంతో మంది. అందులో నేనూ ఒకదాన్నే.

ప్రతీ విషయం ఎప్పటికప్పుడు మాట్లాడుకోలేము, ఆ మనిషి ఎదురైనప్పుడు గుర్తుండదు లేదా అన్నీ చెప్పలేము కూడా. కాని ఉత్తరం రాయడానికి కూర్చుంటెే మాత్రం ఆ భావప్రవాహం అలా సాగిపోతూనే ఉంటుంది. గొంతుదాటి రాలేని ఎన్నో మాటలు అక్షరాలుగా ఉత్తరంలో ఒదిగికూర్చుంటాయి. మన మనసులోని సందేశాన్ని ఉన్నదున్నట్టుగా అవతలి వ్యక్తికి అందజేస్తాయి. మొత్తం రాసాక చూసుకుంటే ఇదంతా మనమే రాసామా? అనుకుంటాం.. ఉత్తరాలు రాయడం, వచ్చిన వాటిని చదువుకుని మురిసిపోవడం. ఆ ఆలోచనల్లో మునిగిపోవడం చాలామందికి పరిపాటే. మన ఆలోచనలను అందరితో పంచుకోలేము. ఎందుకంటే వాటిని అందరూ ఒక్కలా అర్ధం చేసుకోలేకపోవచ్చు. కొందరికి అది సోదిలా ఉంటే మరి కొందరికి మనం చెప్పదల్చుకున్నది అర్ధం కాదు. కాని చాలా కొద్ది మంది మన శ్రేయోభిలాషులు మాత్రం ఆ ఉత్తరంలోని అంతరార్ధాన్ని పట్టుకుంటారు. మనం చెప్పలేకపోయిన విషయాన్ని కూడా అర్ధం చేసుకుంటారు. మన మనఃస్థితి ఆ పదాల్లో స్పష్టంగా కనిపిస్తుంది మరి. ఇంతకంటే వేరు మార్గం ఉందా మన సంతోషాన్ని, బాధను పంచుకోవడానికి.

ఉత్తరం అంటే కలం, కాగితం కాగితాలు. అసలు రాయడానికి కూర్చుంటే ఎన్ని కాగితాలైనా సరిపోవేమో. కాని అలా రాయగలగడం ఒక కళ. అది అందరికీ రాదు. కొందరి రాతలు, అందులోని మర్మం అర్ధం చేసుకున్నవారికి అవి శిలాక్షరాలై జీవితాంతం గుర్తుండిపోతాయి. అవి జీవిత పాఠాలే కావచ్చు, గుణపాటాలే కావొచ్చు. కాని ఈనాడు ఉత్తరాలు రాసే అవసరం అంతగా రావట్లేదు. సెల్ ఫోన్లు, ఈ మెయిల్ మొదలైనవి మనుష్యుల మధ్య దూరాన్ని తగ్గించాయి. ఏదైనా పని ఉంటే కాల్ చేస్తాం, మెయిల్ చేస్తాం కదా ఇంకా వేరే ఉత్తరాలు రాయడమా? అంటారు. కాని చదువు, ఉద్యోగానికి సంబంధించినవి మాత్రమే అవసరమైన విషయాలా?? అవి తప్ప మాట్లాడుకోవడానికి, మిత్రులతో పంచుకోవటానికి, చర్చించటానికి విషయలేమీ లేవా? (మనకంటే బ్లాగులున్నాయి అనుకోంఢి) ఒకరిపై ఒకరు అలిగినా, గిలి కజ్జాలు, అనుమానం, అపార్థాలు అయినా ఆ పరిస్థితిలో మాట్లాడడానికి మనస్కరించదు కాని అదే భావాలను ఉత్తరాల ద్వారా పంచుకుంటే ఆ కోపతాపాలు, అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంది.

చాలా రోజులకు వేడి కాఫీ తాగుతూ ఉదయించే సూర్యుడిని చూసారు. అప్పటి భావన, అనుభూతి ఒంటరిగా అనుభవించలేక ప్రియమైన నేస్తంతో పంచుకోవాలి అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఉత్తరం రాసేయండి. ఆ భావావేశం తర్వాత జీవన రంధిలో పడ్డాక ఉండదు. వినడానికి బానే ఉంది. ఇప్పుడు ఉత్తరం రాసి పోస్ట్ చేసి దాని రిప్లై కోసం ఎదురు చూసే ఓపిక ఎవరికుంది అంటారా? ఎందుకు మన ఇంట్లోనుండే కూర్చున్నచోటినుండే ఉత్తరం రాసే వీలుంది. ఈ మెయిల్ ద్వారా కూడా చక్కని భాషతో, ప్రేమాభిమానాలతో ఎదుటిమనిషి మన ముందు కూర్చున్నట్టే, మాట్లాడుతున్నట్టే ఉత్తరం రాయొచ్చు. అది ఆ వ్యక్తికి చేరడానికి కొద్ది నిమిషాలకంటే ఎక్కువ సమయం పట్టదు. అర్ధం చేసుకునే మనసుంటే ఉత్తరాలలోని ప్రేమాభిమానాల జడివానలో తడిసి ముద్దై మురిసిపోతారు. కాదంటారా? కాగితం మీద రాసిన ఉత్తరాలు రాసినవి దాచుకోవచ్చు. అప్పుడప్పుడు తీసి చదువుకోవచ్చు అనుకుంటారు కాని కంప్యూటర్ పై రాసే ఇ-ఉత్తరాలు కూడా అప్పుడప్పుడు చదువుకుని ఆ పాత జ్ఞాపకాలను నెమరు వెసుకోవచ్చు. ఎన్నో తలపులు, ఊహలు, ఊసులు, అనుభూతులను, స్నేహమాధుర్యాన్ని పంచి మనసును తట్టేవి ఉత్తరాలు.

నాకైతే అస్సలు ఉత్తరాలు రాసే అలవాటు లేదు. ఎవరికని రాయను. నాకు రాసేవాళ్ళు లేరు. మంచి ఫ్రెండ్ ఉంటే ఎన్నో ఊసులు చెప్పుకోవచ్చు కదా అనుకునేదాన్ని. కాని నాకు నేను తప్ప ఎవరూ లేరు. పెళ్ళయ్యాక సంసార జంజాటం తప్పనిసరి. పిల్లలకు లీవ్ లెటర్ మాత్రం రాసే పని పాడేది అప్పుడప్పుడు. కాని అంతర్జాలానికి వచ్చిన తర్వాత నా ప్రయాణమంతా ఇ ఉత్తరాల ద్వారానే జరిగింది. నా ఉత్తరాలలో ఎన్నెన్ని ఆలోచనలో , భావనలో, బాధ, సంతోషాలో చెప్పలేను. ఎవరితో చెప్పుకోలేని, అడగలేని ఎన్నో మాటలు ఉత్తరాల ద్వారా చెప్పుకున్నాను . అలాగే వాటికి పరిష్కారం తెలుసుకుని నన్ను నేను సరిదిద్దుకున్నాను. చెప్పాలంటే నా అంతరంగాన్ని, సంఘర్షణను నా ఉత్తరాలలో దాచుకున్నానేమో. అందుకే ఎప్పుడైనా ఒంటరిగా , దిగులుగా ఉన్నప్పుడు పాత ఉత్తరాలను తీసి చదువుకుంటాను. నన్ను నేనే ఓదార్చుకుని ముందుకు సాగిపోతాను. ఎందుకంటే ఆ ఉత్తరాలలో ఎన్నో పాఠాలు ఉన్నాయి. అవి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం ద్వారా నా మార్గాన్ని సవ్యంగా మార్చుకోగలుగుతున్నాను.


మరి మీకు ఉత్తరాలు రాసే అలవాటు ఉందా?? నాకైతే ఉంది. మొదలుపెట్టానంటే నేను ఎంత పెద్ద ఉత్తరం రాస్తానో నా ప్రియ నేస్తాలకు తెలుసు.

Tuesday 21 June 2011

మ్రోగింది వీణ .....

అసలు ఇప్పటి అమ్మాయిలకు మంచి అభిరుచి అనేది అస్సలు లేదు. చదువు, కంప్యూటర్లు, సినిమాలు, మొబైల్ లేదా ఐప్యాడ్ పెట్టుకుని పాటలు వినడం. మంచి వాయిద్యం నేర్చుకుందామని ఎంత మంది అనుకుంటున్నారు?. ఏమంటే మాకు టైం లేదు అంటారు. మా కాలంలో ఐతేనా??. .... అప్పట్లో స్కూల్లో, బాలభవన్ లో సంగీతం, వాయిద్యం నేర్చుకునే సదుపాయం ఉండేది. అసలైతే స్కూల్లో వారానికి ఒక రోజు సంగీతం క్లాసు కూడా ఉండేది. ఇంకా లైబ్రరీకి ఒక పీరియడ్ ఉండేది. మేము కూడా చదువుకుంటూనే ఆటలు, పోటీలు, సంగీతం, వక్తృత్వ పోటీలు అన్నీ పాల్గోనేవాళ్ళం. ఇంటికొచ్చి వేరే ఆటలు. ఏంటో ఈ నాటి పిల్లలు. చదువు తప్ప ఏది నేర్చుకుందామనే ఆసక్తి లేదు. అసలు సంగతి ఏంటి అంటే.. ముందుగా అందరికీ..

ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు..

ఈ సందర్భంగా ఒక మంచి మాట చెప్పుకుందాం. మాట్లాడుకుందాం. విందాం. చూద్దాం.. అర్ధం కాలేదా. చెప్తా వినండి. ఆ కాలంలో అంటే ఓ పాతిక సంవత్సరాల క్రింద దాదాపు ప్రతి సినిమాలో వీణ ,సితార్ పాటలు ఉండేవి గుర్తుందా. పెళ్లి చూపులు అనగానే వీణ పాట ఉండాల్సిందే. ఆ అమ్మాయి పాడుతూ వీణ వాయిస్తుంది. అంటే పెదాలు, చేతులు కదుపుతూ ఉంటుంది అన్నమాట. పెదాలైతే కలుస్తాయి కాని చేతుల నడక అస్సలు కలవాడు. పైనుండి కిందకు లాగడం తప్ప.. ఇది లాంగ్ షాట్ లో తెలీదులెండి.. కాని వాళ్ళ మొహాలు , హావభావాల సంగతి వదిలేస్తే కొన్ని మంచి పాటలు ఉన్నాయి. ముఖ్యంగా సుశీలమ్మ పాడినవి. ఈ అందమైన సాయంత్రం వాటిని ఓ సారి చూసేద్దామా.. అందమైన సాయంత్రం ఏంటి అంటారా? ఎండలు తగ్గి వాతావరణం చల్లబడి వానలు రావాలా వద్దా అని దోబూచులాడుతున్న వేళ అందమే కదా..

పాటలు వినేముందు ఒక మాట చెప్పనా.. డిగ్రీలో ఉండగానే నాకూ వీణ నేర్చుకోవాలనే కోరిక కలిగింది. సినిమాలు చూసి కాదులెండి. సరే నేను అడిగాక నాన్న కాదంటారా. తిరిగి తిరిగి ఏకాండి వీణ కొనిపించుకుని , ఒక టీచరమ్మ ని మాట్లాడుకుని నేర్చుకున్నాను. నా ఖర్మ కాలి ఆరు నెలలన్నా కాకముందే పెళ్లి కుదిరి ఆ వీణ అటకెక్కింది అనుకోండి. ఈ పెళ్లి చూపుల ప్రహసనంలో ఒకసారి ఏం జరిగిందంటే.. (నేస్తంలా సాగదీయను లెండి. క్లుప్తంగానే చెప్పేస్తాను) ఒక డాక్టరబ్బాయ్ తండ్రి వచ్చారు ఫలానావారి అమ్మాయి ఉందంటే అదీను పొడుగ్గా ఉందంట అని తెలిసి. ఆయన వచ్చినపుడు నా వీణ చూసారు. గుడ్ వీణ నేర్చుకుంటున్నావా? ఎంతవరకు వచ్చింది అని అడిగారు. చెప్పాను. సరే మళ్ళీ వస్తాం అబ్బాయిని తీసుకుని అని వెళ్ళిపోయారు. నాకు మండుకొచ్సింది. వీళ్ళు నన్ను సంతలో పశువులా చూడడానికి వస్తారా? పని పాటా లేదు. వచ్చి చూసి మెక్కి పోతారు అని తిట్టుకున్నా.. యిపుడు వీళ్ళు వస్తే నేను సినిమాల్లోలా టింగు టింగు మని వీణ వాయించాలా? చట్.. అస్సలు చేయను అని వాళ్ళు వస్తా అని చెప్పిన రోజే ఎవరూ చూడకుండా వీణ తీగలు తెంపేసా :). మళ్ళీ టీచరమ్మతో వేయించుకోవచ్చులే అని. లక్కీగా ఆ అబ్బాయి ఎవరినో ప్రేమించాడంట ... నేను రాను పో అన్నాడని ఎవరూ రాలేదనుకోండి. ..

ఇక పాటల సంగతి చూద్దామా... ఈ పాటలన్నీ నాకు చాలా ఇష్టమని అనుకోవద్దు. ఎదో వీణ పాటలు ఏమేమి ఉన్నాయని వెతికితే దొరికాయి. కొన్నిబావున్నాయి. కొన్ని ఒకే. కొన్ని ఊహూ..

సంఘం సినిమాలోని సుందరాంగ మరువగ లేనోయి




తెనాలి రామకృష్ణ లోని చందన చర్చిత




భూకైలాస్ లోని నా నోము ఫలించెనుగా




ఇద్దరు మిత్రులు లోని పాడవేల రాధికా




భార్యాభర్తలు లోని ఏమని పాడెదనో




నర్తనశాలలోని సఖియా వివరించవే




డాక్టర్ చక్రవర్తి లోని పాడమని నన్నడగవలెనా




మంచి కుటుంబంలోని మనసే అందాల బృందావనం




ఆత్మీయులు లోని మదిలో వీణలు మ్రోగే




అమాయకురాలులోని పాడెద నీనామమే




ప్రేమ్ నగర్ లోని ఎవరో రావాలి..




మీనా లోని శ్రీరామనామాలు



కొన్ని పాటల వీడియోలు దొరకలేదు.ఇలా వినేయండి పర్లేదు..

విచిత్ర దాంపత్యంలోని శ్రీ గౌరీ శ్రీ గౌరివే
జమిందారు గారి అమ్మాయిలోని మ్రోగింది వీణ
అభిమానవంతులు లోని వీణ పైన పలికిన
చక్రవాకం లోని వీణలోనా తీగలోనా
దేశోద్ధారకులు లోని వీణకు శ్రుతి లేదు
అభిమానవంతులు లోని వీణ పైన

Saturday 18 June 2011

నేను తెలుసుకున్న శ్రీకృష్ణదేవరాయలు




"దేశభాషలందు తెలుగు లెస్స" ఈ మాట వినగానే ప్రతి తెలుగువాడి హృదయం ఉప్పొంగుతుంది. కాని ఈ మాట వినగానే మనకు గుర్తొచ్చేది విజయనగర సామ్రాజ్యాధీశుడు, సాహితీ సమరాంగన సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు. తెలుగులో రచన చేయమని కన్నడ రాజుని ఆదేశించిన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు పలికినట్టు నానుడి. కాని క్రీ.శ.1430 ప్రాంతం వాడైన వినుకొండ వల్లభరాయని 'క్రీడాభిరామం' నాటికే ఈ నానుడి బహుళ ప్రచారంలో ఉందని తెలియవస్తుంది. రాజ్యవిస్తరణలో భాగంగా దక్షిణదేశ దిగ్విజయ యాత్ర చేస్తూ శ్రీకాకులంలో విడిది చేసాడు. స్వప్నంలో సాక్షాత్కరించిన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు స్వయంగా సంస్కృతకవియైన రాయలును అచ్చ తెలుగుభాషలో తన భక్తురాలి కథను దివ్యప్రబంధంగా రచించుమని ఆదేశించాడు. అదే ఆముక్తమాల్యద.. ఆ సమయంలో పలికిన పలుకులివి..

చరిత్రలో మనకు ఎందరో ప్రసిద్ధిచెందిన చక్రవర్తులు, సంస్థానాధీశులు, మహా వీరులు ఉన్నారు. అందరూ రాజ్యాభిలాష కలవారే. అయినా కొందరు మాత్రం ధర్మరక్షణ, కళారాధన, సాహితీసృష్టిపై విశేష కృషి చేసారు. ఇటువంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోదగిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. విజయనగర సామ్రాజ్యాధినేతగా, మహావీరుడిగా ధర్మసంస్థాపన, ప్రజాసంక్షేమం కోసం పాటుపడిన మహామనిషిగా పేరుపొందాడు. శ్రీకృష్ణదేవరాయలు సాహితీ సమరాంగన సార్వభౌముడని, అనేక అద్భుత కట్టడాలను నిర్మిచాడన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ అంశాలతో పాటు అంతగా పరిచయం లేని శ్రీకృష్ణదేవరాయల ధర్మదీక్ష, ఆధ్యాత్మికత మొదలైన అంశాలను సవివరంగా అందించారు కస్తూరి మురళీకృష్ణ తన శ్రీకృష్ణదేవరాయలు నవలలో . ఇందులో రాయల వ్యక్తిత్వాన్ని, కార్యదీక్షను, కళారాధనను నూతన కోణంలో ఆవిష్కరించిన రచన ఇది.

కృష్ణదేవరాయల చరిత్రా?? ఇది స్కూలు పిల్లలకైతే పాఠ్యాంశంగా పనికొస్తుంది .మనకెందుకులే అనుకుంటే పొరపాటే. ఒక మహారాజు అనగానే వంశపారంపర్యంగా వచ్చిన అధికారం, హోదా కాదు. రాచరికం అంటేనే కుట్రలు, కుతంత్రాలమయమైన ముళ్ళ కిరీటం. కృష్ణదేవుడు తన పుత్రుని రాజ్యాభిషేకానికి అడ్డుగ ఉన్నాడనే భయంతో అతని కళ్లు పెరికించమని తిమ్మరుసుకు ఆదేశిస్తాడు అతని అన్న వీరనరసింహుడు. తిమ్మరుసు అతనిని యుక్తిగా రక్షిస్తాడు. ఒకవైపు తురుష్కుల దాడి, మరోవైపు సామంతుల ధిక్కారస్వరంతో అల్లకల్లోలంగా ఉన్న సమయంలో రాజ్యాధికారం చేపట్టిన రాయలు సైనికులను మాతృభూమి రక్షణకు ఉత్తేజపరిచి ప్రతీ చోటా విజయం సాధించాదు. అలాగే సాహిత్యం, లలితకళలు, ధర్మసంరక్షణ విషయాలలో కూడా అమితమైన శ్రద్ధ కనబరచి ఎన్నో దేవాలయాలను అభివృద్ధి చేశాడు. స్వయంగా కవిపండితుడు కావడం వలన మదాలస ప్రబంధం, జ్ఞానచితామణి, రసమంజరి, ఆముక్తమాల్యద వంటి అద్భుతమైన రచనలెన్నో చేశాడు. చరిత్ర గురించిన రచనలు చేయడం అంత సులువు కాదు. ఊహాజనితమైన రాతలు కాక వాస్తవికమైన వివరాలు,విశేషాలను చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసి పాఠకులకు అందివ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో రచయిత సఫలురైనారని చెప్పవచ్చు.

సామాన్యుల శవాల గుట్టలపైనుండి నడుస్తూ వారి బలిదానాల ఫలితాలను రాజులు అనుభవిస్తారు. కాని మన ధర్మాన్ని నాశనం చేసి, మనల్ని అంతం చేయడానికి చుట్టుముట్టిన తురుష్కుల్ని తరిమి కొట్టండి. నాకోసం కాదు,, మీకోసం, మీ కుటుంబం కోసం పోరాడండి. అని నీరసించిన తన సైనికులను ఉత్తేజపరచి విజయలక్ష్మిని వరించాడు. అంతే కాదు మన ప్రజలకు కలలు కనడం నేర్పించాలి. రకరకాల భయాలతో, బాధలతో వారు తమ బ్రతుకుల్లోని ఆనందాన్ని మరచిపోయారు. సాహిత్యం, సంగీతం, గానం, నృత్యం వంటి లలితకళల ద్వారా జీవితంలోని ఆనందాలను వీరికి పరిచయం చేయాలి. అద్భుతమైన శిల్పాలతో సృష్టికి అందాలు అద్దాలి అని అనడమే కాడు అక్షరాలా ఆచరణలో పెట్టి ప్రజలలో ఉత్తమ భావాలు ఉన్నత ఆలోచనలు పెంపొందేలా చేశాడు రాయలు.

ఒక వ్యక్తి జీవిత విశేషాలనే కాదు ఆతని వ్యక్తిత్వంలోని ప్రత్యేక కోణాన్ని, ఆతని పరిపాలనా సామర్ధ్యాన్ని సరళమైన పదవిన్యాసంతో అందించారు రచయిత ఈ నవలలో. ఒక నాయకుడిగా తన అనుచరులను ఏ విధంగా ఉత్తేజపరుస్తాడు, పురాతన ఆలయాలను పునరుద్ధరింపజేసి వాటి నిర్వహణకోసం ఎటువంటి లోటు జరగకుండా ఏర్పాట్లు చేసి, ఎంతో నైపుణ్యంతో యుద్ధరచన చేసి శతృవులను యుక్తిగా మట్టుపెట్టి మహావీరుడిగా మన్ననలందిన రాయలు గురించి తెలుసుకోవలసిన సమాచారం ఎంతో ఉంది. ఇందులో రాయలు పలికిన మాటలు చదువుతుంటే జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కునేటప్పుడు సార్వభౌముడైనా , సామాన్యుడైనా ఒకటే కదా అనిపిస్తుంది.

నాకు కృష్ణదేవరాయలు స్కూలులోనే పరిచయం. అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో కనిపించేవాడు రాయలు. కాని ఆముక్తమాల్యద ద్వారా మరింత దగ్గరయ్యాడు . అందుకేనేమో అతని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనే ఉత్సుకత కలిగింది. కస్తూరి మురళీకృష్ణగారి శ్రీకృష్ణదేవరాయలు నవల నాకు తెలియని ఎన్నో విషయాలను తెలిపింది. మామూలుగా చిన్నప్పటినుండి నాకు చరిత్ర అంటేనే అంతగా ఆసక్తి లేదు. కాని ఈ నవలను మాత్రం కదలకుండా, వదలకుండా రెండు గంటల్లో పూర్తి చేసా.. అంత సరళమైన , ఆసక్తికరమైన రచన ఇది. ఈ నవల పాఠ్యాంశంగా ఉండాలని ఎందరో పాఠకులు భావించారు. అది అక్షరాలా నిజం అని నేను నమ్ముతున్నాను.

ఈమధ్యే విజాగ్‌లో జరిగిన పుస్తకావిష్కరణ సభలో ద్వానాశాస్త్రిగారు అన్నారంట. రాయలవారికి ఇద్దరే భార్యలు తిరుమలదేవి, చిన్నాదేవి. మూడో భార్య కూడా ఉంది అని చెప్పడం తప్పు కదా అని. రాయలు యవ్వనంలో ఉండగా చిన్నాదేవి అనే వేశ్యను వలచాడు. ఆమె రాచకన్య కాదు కాబట్టి తిమ్మరుసు సాళువ నరసింహుని పుత్రిక తిరుమలాదేవితో వివాహం జరిపించి పిమ్మట చిన్నాదేవిని కూడా చేపట్టమన్నాడు. చాలా కాలానికి గజపతి శతృత్వాన్ని బంధుత్వంగా మార్చుకోవడానికి తన కూతురు అన్నపూర్ణా దేవిని రాయలుకు ఇచ్చి వివాహము చేశాడని. మహామంత్రి తిమ్మరుసు సినిమాలో కూడా ఇలాగే చూపించారు. మరి ఇది ఎంతవరకు నిజమో విజ్ఞులే తెలపాలి.
ఇది సమీక్షా? ఇంత పెద్దగా ఉంటుందా? అంటారా?? అసలు చెప్పాలంటే మొత్తం పుస్తకమే ఇక్కడ రాసి పెట్టాలనుంది.కాని పుస్తకం కొని చదివితేనే అందం.చందం.. ఆనందమూనూ..

పుస్తకం వివరాలు :
శ్రీకృష్ణదేవరాయలు
రచయిత : కస్తూరి మురళీకృష్ణ
ప్రచురణ : కస్తూరి ప్రచురణలు
ధర : Rs. 60
పంపిణీదారులు : Navodaya Book House
Opp. Arya Samaj Mandir
Kachiguda ‘X’ Roads,
Hyderabad – 27
Ph. 040 – 24652387

ఆన్లైన్ లో కొనుక్కోవాలన్నా, అద్దెకు తీసుకోవాలన్నా : Kinige

Thursday 2 June 2011

మాలిక పత్రిక తరపునుండి రచయితలకు ఆహ్వానం





ఆత్మీయ పాఠకులకు నమస్సుమాంజలి. ఇప్పటికి రెండు సంచికల వయసుకల మాలిక పత్రిక ఆగస్టు నెలలో విడుదలయ్యే మూడోసంచికకు ముస్తాబవుతోంది. గత రెండు సంచికలను, వాటిపై వచ్చిన సలహాలు సూచనలను దృష్టిలో పెట్టుకుని శ్రావణ పౌర్ణమి సంచికను ఇంకా మెరుగుపరిచే ప్రయత్నంలో ప్రస్తుతం మాలిక బృందం నిమగ్నమై ఉంది. ఇంతవరకు మాలిక పత్రికలొ జనరంజకమైన వ్యాసాలు ప్రచురించాము.. ప్రియ పాఠకుల విమర్శలు, సూచనలతో మా లోపాలను సరిదిద్దుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేసాము. ఇంతకు ముందు చెప్పినట్టుగానే, మాలిక పత్రిక ముఖ్య ఆశయం ప్రతిభ ఉండీ, అవకాశాలు అంతగా లేని రచయితలను వెలుగులోకి తీసుకురావటం. అలాగే ఇప్పటికే పేరు పొందిన రచయితల రచనల ద్వారా కొత్తవారికి స్పూర్తినిస్తూ, పాఠకులకు కనువిందు చెయ్యటం. అన్నట్టు మా పత్రికకు ఇజాలేమీ లేదు. ఏ దృష్టికోణం ఉన్నవారయినా మాలిక పత్రికకు రచనలను పంపించవచ్చు.


ఇది న్యూస్ ప్రింట్, కాగితపు ఖర్చులవంటి ఇబ్బందులు లేని పత్రిక కాబట్టి సాధ్యమైనన్ని ఎక్కువ రచనలు ప్రచురించటానికే ప్రయత్నిస్తున్నాం. అయితే సాహిత్య సాంఘిక విషయాల మేళవింపు ఈ పత్రిక ముఖ్య లక్షణం కాబట్టి అక్కడడక్కడ కొన్ని మార్పులూ చేర్పులు ఉండవచ్చు. ఈ విషయంలో మేము రచయితల సహకారాన్ని కోరుతున్నాం. ఒక విషయాన్ని రచయితకు సాధ్యమైనంతలో ఎంత లోతుగా విశ్లేషిస్తే, పాఠకులనుండి అంత స్పందన ఉంటుంది. ఆ విశ్లేషణ రచయిత మినహా వేరేవరూ అదే దృష్టితో చెయ్యలేరు. కనుక తమ రచనలను తమకు సాధ్యమైనంతలో పాఠకులను మెప్పించేలా రచయితలు సృష్టిస్తారని ఆశిస్తూ, అలా సృష్టించే బాధ్యతను రచయితలకే వదిలి పెడుతున్నాం. ఒకవేళ మా సహాయం ఏమన్నా కావాల్సి వస్తే దాన్ని అందించటానికి మేమెప్పుడూ సిధ్ధమే.


ఇకపోతే మాలిక పత్రికకు రచనలను ఎవరికి, ఎలా పంపాలి అని చాలామంది అడుగుతున్నారు. మీరు మీ రచనలను editor@maalika.org కి ఈమెయిల్ ద్వారా పంపవచ్చు. రచనలు విధిగా తెలుగులోనే ఉండాలి, మీకిష్టమైన విషయంపై మీ రచన ఉండచ్చు. అయితే అసభ్యకరమైన, అభ్యంతరకరమైన రచనలు ఆమోదింపబడవు. ప్రచురణ విషయంలో తుది నిర్ణయం సంపాదకులదే.



పైన ఇచ్చిన ఈ మెయిల్ చిరునామాకి ఒక జాబు వ్రాయండి చాలు - మేము చెయ్యగలిగినది మేము తప్పకుండా చేస్తాం.

ఆగస్టు సంచికలో కొంతమంది ప్రఖ్యాత రచయితల రచనలు కూడా ఉండబోతున్నాయి. వివరాలు త్వరలో.

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008