Tuesday 25 January 2011

పిల్లలను కాస్త మాయ చేయండిలా!!


చిన్నపిల్లలున్నఇంత ప్రతి రోజూ వాళ్ళతో తినేలా చేయడం అంటే ఒక యుద్ధం లా ఉంటుంది. అందుకే వాళ్ళను కొంచం మాయ చేయాలి. నేను చేసి సక్సెస్ అయ్యాను మరి..



" బాబూ! ఈ ఒక్క ముద్ద తినరా. లేకుంటే నీరసమొస్తుంది."



" బుజ్జి. నీకు సాయంత్రం బర్గర్ కొనిస్తా కాని ఇప్పుడు కొంచం పెరుగన్నం తినమ్మా. లేకుంటే క్లాసులో ఎలా చదువుకుంటావ్?"



పిల్లలున్న ప్రతీ ఇంట్లో నిత్యం జరిగే తంతు ఇది. ఈరోజుల్లో పిల్లలను కడుపునిండా తినేలా చేయాలంటే తల్లితండ్రులకు పెద్ద యజ్ఞంలా ఉంటుంది. సాధారణంగా పిల్లల తిండి విషయం చూసుకునేది తల్లే. కాని పిల్లలు ఎంతగా సతాయిస్తున్నారంటే తండ్రి కూడా రంగంలోకి దిగక తప్పడం లేదు. పొద్దున్నే పాలు తాగండి, వేడి వేడి అన్నంలో ఇంత పప్పు, నెయ్యి వేసుకుని తినడర్రా అంటే అదేదో భయంకరమైన పదార్థంలా తప్పించుకుని పారిపోతున్నారు.మధ్యాహ్నం భోజనానికి ఇచ్చిన బాక్స్ కూడా సగం ఖాళీగానే ఉంటుంది. చిన్నారులు బండెడు పుస్తకాల బరువు, చదువులకు తగ్గట్టు శక్తి పుంజుకోవాలంటే సరియైన పోషకాహారం తినాలి. కాని వాళ్లు తినరు. ఆకలితో ఉంటారు కాని పెట్టింది మాత్రం తిననంటారు. ఇది చూసి ఏ తల్లి కలవరపడదు.


అన్నం తినమంటే తినరు కాని ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అనగానే వాళ్లకు ప్రాణం లేచొస్తుంది. బర్గర్ , పిజ్జా, చిప్స్, పఫ్స్ అనగానే ఎక్కడలేని హుషారుతో పరుగెత్తుకువస్తారు. దానికి తోడు కోక్ లాంటి డ్రింకులు. ఊరికే అవే కావాలని అడుగుగుతుంటే పోనీలే పాపం అలా ఐనా ఆకలి తీరుతుంది అని తినిపిస్తారు. కాని అదే అలవాటుగా మారితే మాత్రం పిల్లల ఆరోగ్యానికి హానికరం అవుతుంది. ఈ ఫాస్ట్ ఫుడ్ తరచూ తినడం మంచిది కాదు. అందులో వాడే చీజ్, వెన్న వంటివి అధిక క్యాలరీలు కలిగి ఉంటాయి. కొవ్వు కూడా ఎక్కువే. ఇంకా వాటిల్లో వాడే మైదా మొదలైనవి కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. పోషక పదార్థాల సంగతి పక్కనపెడితే అసలుకే మోసం వస్తుంది.



మరి ఏం చేయాలి? రోజూ వాళ్లతో ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది .. పిల్లలు సరియైన, పోషకాంశాలతో కూడిన ఆహారం తినేలా చేయడం అంత సులువు కాదు. కాని ఇది సాధ్యమే అని చెప్పవచ్చు. ఈ విషయంలో పిల్లలకంటే ముందు తల్లితండ్రులే మారి పిల్లలను మాయ చేయాలి. పిల్లలతో కాస్త తెలివిగా వ్యవహరిస్తూ వారి ఆహారపు అలవాట్లు అదుపు తప్పకుండా జాగ్రత్తపడాలి. వాళ్లకు నచ్చినట్టుగానే చేయాలి.. వాళ్లు తినే ఫాస్ట్ ఫుడ్ లోనే ఫోషకాలు ఉన్న తిండి పెట్టాలి. దానికోసం కొత్త కొత్త ప్రయోగాలు చేయక తప్పదు మరి. పిల్లలకు ఏ వయసులో ఎటువంటి ఆహరం ఇస్తే మంచిది అని ముందు తెలుసుకోవాలి. ఆ ఆహారాన్ని వాళ్లకు కంటికి ఇంపుగా, లేటేస్టుగా ఉండేలా తయారు చేసి ఇస్తే సరి. అది కొంచెం కష్టమే కాని అసాధ్యం మాత్రం కాదు. ఎలా చేసినా మనకు కావలసింది పిల్లలు వయసుకు తగ్గట్టుగా సంపూర్ణ పోషకాహారం తీసుకోవాలి.


చాలామంది పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు. కాని ఎదిగే పిల్లలకు పాలు ఒక సంపూర్ణ ఆహారం. వారి ఎముకలు ధృడంగా ఉండేందుకు ఎంతొ అవసరం. దాని కోసం బూస్ట్,బోర్నవిటా లాంటి ఎన్ని కొన్నా కూడా పాలగ్లాసు కనపడగానే పారిపోతారు. అలా వారి వెనకాల పరిగెత్తే బదులు ఆ పాలను వేరేవిధంగా ఎలా ఇవ్వొచ్చో ఆలొచించాలి. ఆ పాలల్లో ఒక్కోసారి ఒక్కో పండు ( మామిడి, స్ట్రాబెర్రీ, లీచీ, ) వేసి గ్రైండ్ చేసి మిల్క్ షేక్ లా ఇవ్వొచ్చు. నాలుగైదు రకాల పళ్లు ముక్కలు చెసి పాలు, పంచదార, యాలకులపొడి లేదా ఎస్సెన్స్ చుక్కలు వేసి ఫ్రూట్ సలాడ్ చేసి పెట్టొచ్చు. పాయసం, పరమాన్నం చేసి వేడిగా కాని, చల్లగా కాని ఇవ్వొచ్చు. అప్పుడప్పుడు చక్కెర బదులు బెల్లం వేయండి. పెరుగును తోడుపెట్టి చక్కెర కలిపి ఇవ్వండి. ఏదైన ఫ్లేవర్ వేసి చిలికేసి బటర్ మిల్క్ అని అందమైన గ్లాసులో పోసి స్ట్రా పెట్టి ఇవ్వండి. అలాగే పనీర్ తో కూరలు, వేపుళ్లు, కబాబ్, కట్లెట్ లాంటి స్నాక్స్ చేసి పెట్టొచ్చు. కొంతమంది పిల్లలకు పాలు అస్సలు పడవు. బలవంతంగా ఇస్తే వాంతి చేసుకుంటారు. వాళ్ల శరీరంలో అవసరమైననత లాక్టోజ్ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అప్పుడు వాళ్లకు పాలకు ప్రత్యామ్నాయంగా సోయా ఉత్పత్తులు పెట్టవచ్చు. పాలు తక్కువగా ఇచ్చి పెరుగు, సోయా ఉత్పత్తులు ఎక్కువగా ఇవ్వాలి.



ఇక చాలామంది పిల్లలకు కూరగాయలు, ఆకుకూరలు అంటే కూడా అస్సలు పడదు. పళ్లు తినమంటే వద్దంటారు. ఇవన్నీ తినకుంటే పిల్లలకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందక రోగనిరోధకశక్తి తగ్గి నీరసపడిపోతారని తల్లితండ్రుల బెంగ. అలాకాకుండా అదే కూరగాయలను పచ్చళ్లుగా చేసి పెట్టొచ్చు. కూరగాయలను కొద్దిగా ఉడికించి కబాబ్, కట్లెట్ లేదా పకోడీల్లా చేసి సాస్ తో ఇస్తే ఒక్కటి కూడా మిగల్చకుండా తినేస్తారు. పాలకూరలో కోడిగుడ్డు కలిపి కూర చేస్తే ఇష్టంతో తింటారు. పాలతో కస్టర్డ్ చేసి పళ్ల ముక్కలు కలిపి చల్లగా ఇస్తే నిమిషాల్లో ఖాళీ చేసి మళ్లీ కావాలని అడుగుతారు. అప్పుడప్పుడు జ్యూస్ చేసి, చాట్ మసాలా కలిపి ఇవ్వొచ్చు.


ఇవన్నీ బానే ఉన్నాయి మరి ఫాస్ట్ ఫుడ్ సంగతేంటి? మనం ఎన్ని తిప్పలు పడ్డా బర్గర్, పిజ్జా, నూడుల్స్ అంటారు. వాటిని కూడా కొద్దిపాటి మార్పులతో ఇంట్లోనే చేసి పెట్టాలి. మైక్రోవేవ్ ఓవెన్ ల వాడకం పెరిగిన ఈ రోజుల్లో ఇవి చేసుకోవడం అంత కష్టమేమి కాదు. బయట వాడే చీజ్ బదులు తక్కువ కొవ్వుశాతం ఉన్న వెన్నలేదా చీజ్ ఉపయోగించాలి. కూరగాయలతో కట్లెట్ చేసి బర్గర్లో పెట్టి ఇవ్వాలి. నూడుల్స్ కూడా కూరగాయలు, గుడ్లు వేసి వెరయిటీగా తయారు చేయొచ్చు. ఇన్ స్టెంట్ నూడుల్స్ చేసి సాంబార్ పోసి సాంబార్ నూడుల్స్ అని ఇవ్వండి . అదో వెరయిటీ రుచి. అలాగే చపాతీలు చేసి మధ్యలో వేయించిన కూరగాయలు, గుడ్డు, చికెన్ వంటివి స్టఫింగ్ చేసి మడిచి పేపర్ నాప్కిన్లో అందంగా చుట్టి "ఫ్రాంకీ" అనండి. పిల్లలు పరుగెత్తుకుని వచ్చి లాక్కుంటారు. పాస్టా, మాక్రోనీలతో కూరలు , పకోడీలు చేయండి. ఇలా అన్ని చిరుతిళ్లను పోషకాహారం చేస్తే సరి పిల్లలూ, తల్లితండ్రులూ అందరూ ఫుల్ హ్యాపీస్.


2 వ్యాఖ్యలు:

Admin

జ్యోతి గారు, ఎంత మాయ చేసిన మా అమ్మాయి తినటం లేదు. చాలా కష్టం అవుతుంది.

Ennela

మా మేనకొడలు ఫొన్ చేసింది..వాళ్ళ 5 అండ్ 3 యేళ్ళ పిల్లలు చదివే స్కూల్ లో కుర్కురే మాత్రమే పెట్టాలిట లంచ్ బాక్స్ లో....హాహ్హాహ్హా..నవ్వాలో యెడవాలో తెలీలేదు.....

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008