Friday 6 February 2015

e క్రేజీ రైటర్స్ ... ఆంధ్రజ్యోతి నవ్య


 
 
అంతర్జాలం పుణ్యమా అంటూ పలువురు సామాన్య మహిళలు రచయిత్రులయ్యారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం, అంకితభావం ఉంటే చాలు అయిదు పదుల వయసుదాటినా కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని నేర్చుకొని బ్లాగులు నిర్వహిస్తూ రచయిత్రులుగా ఎదిగి పలు పుస్తకాలు రాశారు. అలా రచయిత్రులుగా మారిన బ్లాగర్‌ల విశేషాలు...

జ్యోతి వలబోజు... 2006వ సంవత్సరం వరకు సాధారణ గృహిణి. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండగానే పెళ్లి కావటంతో చదువుకు అర్ధాంతరంగా బ్రేక్‌ పడింది. ఆపై ఇంటి బాధ్యతలు, పిల్లల ఆలనపాలనతో పాటు కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ పనులతో ఇంటికే పరిమితమయ్యారు. తీరికవేళల్లో టీవీ సీరియళ్లకు అతుక్కుపోయేవారు. పిల్లల చదువులు అయిపోయి వారికి పెళ్లిళ్లు అయి బాధ్యతలు తీరాక, భర్త సలహాపై ఆమె కంప్యూటర్‌ నేర్చుకున్నారు. ఆపై ఆమెకిష్టమైన అంశాలపై తెలుగులో పలు బ్లాగులు ఏర్పాటు చేసుకొని, నెటిజన్లతో భావాలను పంచుకునే వారు. అలా బ్లాగులు, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌లతో జత కలిసిన జ్యోతి తనకిష్టమైన తెలంగాణ ఇంటి వంటలపై రెండు పుస్తకాలను రాసి రచయిత్రిగా మారారు. ‘‘మా అమ్మమ్మ ఇంట్లో చిన్ననాటి నుంచి నేర్చుకున్న వివిధ వెజిటేరియన్‌, నాన్‌ వెజిటేరియన్‌ వంటకాలతో ‘తెలంగాణ ఇంటివంటలు’ పేరిట రెండు పుస్తకాలు రాసి, విడుదల చేశాను. అయిదు నెలల్లోనే నా పుస్తకాలు రెండోసారి ముద్రణకు నోచుకోవటం నాకెంతో సంతోషాన్నిచ్చింది. నా పుస్తకాలకు నేను డీటీపీ చేసుకోవటంతోపాటు ఫ్రూఫ్‌, కవర్‌పేజి డిజైన్‌లను కూడా నే నే చేసుకున్నా. భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు రాయటంతోపాటు ఇతర రచయిత్రుల పుస్తకాలను ముద్రించేందుకు జేవీ పబ్లిషర్స్‌ పేరిట పబ్లికేషన్‌ను ఆరంభించా’’నంటారు జ్యోతి.

ఎన్నెన్నో బ్లాగులు

జ్యోతి వలభోజు ‘జ్యోతి’ పేరిట మొదట బ్లాగును ఏర్పాటు చేసి తన అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకోవటం ఆరంభించారు. అలా తన కిష్టమైన వంటలు, పాటలు, ఆధ్యాత్మికం, ఫోటోలు, పజిల్స్‌, ఇలా ఒకటేమిటి? పలు అంశాలపై పలు బ్లాగులకు శ్రీకారం చుట్టారు. ‘పొద్దుగడి’, ‘జగన్నాటకం’, ‘అన్నపూర్ణ కుకరీ బ్లాగ్‌’, ‘హెల్త్‌ ఈజ్‌ వెల్త్‌’, ‘విజయవిలాపం’, ‘నైమిశారణ్యం’, ‘జడ శతకం’, ‘షడ్రుచులు’,  ‘గురవాయణం’, ‘చైత్రరథం’,  ‘అముక్తమాల్యద’ వంటి బ్లాగులతో తనకంటూ స్నేహితులను ఏర్పరచుకున్నారామె. బ్లాగులే కాదు వివిధ కథలతో ‘మాలిక’ పేరిట ఆన్‌లైన్‌ మాసపత్రికను ఏర్పాటు చేశారు. రేపటి గురించి చింత లేకుండా జీవితాన్ని ఆనందంగా గడిపేయడం అంటే నాకెంతో ఇష్టమంటున్న జ్యోతి మధురమైన ఆ పాత హిందీ, తెలుగు పాటలు వినడం, స్నేహం చేయడం, మనసులోని ఆలోచనలను రాతలుగా నిక్షిప్తం చేయడం అంటే ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

జ్యోతిలాగే మరెందరో..

జ్యోతిలాగే మరికొంతమంది రచయిత్రులు బ్లాగులు నిర్వహిస్తూ పుస్తక రచనలకు శ్రీకారం చుట్టారు. జ్ఞాన ప్రసూన ఎనిమిది పదుల వయసులో ఉండి ‘సురిచి’ పేరిట బ్లాగు నిర్వహిస్తూ పుస్తకరచనలు చేశారు. ఇలా మాలాకుమార్‌ సైతం బ్లాగర్‌ నుంచి రచయిత్రిగా ఎదిగారు. బ్లాగులు, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ల ద్వారా ఇలా నిత్యం తమ భావాలను పంచుకోవటమే కాదు... బ్లాగర్లు మరికొందరు ప్రముఖ రచయిత్రులతో కలిసి ‘ప్రమదాక్షరి’ పేరిట ఓ ఫేస్‌బుక్‌ గ్రూపుగా ఏర్పడటం విశేషం. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగుతున్న పుస్తకప్రదర ్శనలో పాఠకులను కలిసేందుకు వారిలో కొందరు.. మహిళా రచయిత్రులు కదిలివచ్చారు. ఈ పుస్తకప్రదర్శనలో 24 మంది ర చయిత్రులు తాము రాసిన పుస్తకాలను ప్రదర్శనకు ఉంచారు. ఈ స్టాల్‌ను పుస్తకాల అమ్మకాల కంటే పాఠకులతో ముఖాముఖి, పరిచయాలు, ఇతర రచయిత్రులతో పరిచయాలు, పలకరింపులతో సందడి నెలకొంది. మహిళా రచయిత్రులే నిర్వహిస్తున్న ఈ స్టాల్‌లో పుస్తకాలు విక్రయించటమే కాదు నచ్చిన రచయిత్రితో ఓ పలకరింపు, ఓ ఫోటోగ్రాఫ్‌, ఓ ఆటోగ్రాఫ్‌ ఇస్తూ పాఠకులను ఆకట్టుకుంటున్నారు.
నవ్య డెస్క్‌


ఎనిమిది పదుల వయసులో...

‘‘నా పేరు జ్ఞాన ప్రసూన. మాది హైదరాబాద్‌. నా ఇద్దరు కుమారులు కెనడాలో స్థిరపడటంతో ఓసారి వారిని చూసేందుకు అక్కడకు వెళ్లి ఆరునెలలున్నాను. అక్కడ ఇంట్లో అందరూ ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లడంతో నేనొక్కదాన్నే ఇంట్లో ఉండాలంటే బోర్‌గా ఉండేది. అప్పుడు నా మనవళ్ల సాయంతో పాత ల్యాప్‌టాప్‌ తీసుకొని నేర్చుకోవటం ఆరంభించాను. అలా 80 ఏళ్ల వయసులో కంప్యూటర్‌ నేర్చుకొని.. తెలుగులో బ్లాగు ఏర్పాటు చేసుకొని నా భావాలను వ్యక్తికరించేదాన్ని. దీంతోపాటు ఫేస్‌బుక్‌లో మహిళా రచయిత్రులతో ఛాటింగ్‌ చేస్తున్నాను. ‘గుడిగంటలు’ పేరిట పుస్తకం రాశాను. నాకు హిందీ భాషలో ప్రావీణ్యం ఉన్నందువల్ల హిందీ భాష నుంచి తెలుగులో అనువాద రచనలు చేస్తున్నాను. ఎంత వయసు వచ్చినా ఖాళీగా ఉండకుండా నచ్చిన రచనలు చేస్తుండటం నాకెంతో ఆనందాన్నిస్తుంది. లలిత కళల వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది..’’

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008