Wednesday 6 August 2008

పూజలా?? పాల వరదలా??

ఈరోజు నాగుల పంచమి. అన్ని గుళ్ళలో కోలాహలం. మంచిదే. కాని ఈ పండగ ముఖ్య ఉద్దేశ్యమేమిటి ? పుట్టలో పాలు పోస్తారు. కొన్నేళ్ళ క్రింద పుట్టలలో పాములుండేవి అవి తాగేవో. లేక స్నానం చేసేవో ఎవరు చూసారు గనక?  గిన్నెలో పెడితే వచ్చి తాగుతుంది కాని పుట్టలో పోస్తే అభిషేకమే కదా? అలా వందలమంది లీటర్ల కొద్ది పాలు పోస్తే పాము సంగతి దేవుడెరుగు ఆ పుట్ట మన్ను తడిసి కరిగిపోదా.  ఇక సిటీలో ఐతే పాము పుట్టలే ఉండవు. కొన్ని చోట్ల పుట్టలాంటి ఆకారం తయారు చేస్తారు. అందులో పోసే పాలు వృధాగా డ్రైనేజీలోకి వెళతాయి. ఇదేనా భక్తి. అలా అందరూ వెళ్ళి డ్రైనేజీలో పాలు పోసే బదులు గుడి బయట బిచ్చగాళ్ళకు పోస్తే కనీసం వాళ్ళకన్నా, వాళ్ళ పిల్లలకన్నా కొంచెం ఆకలి తీరుతుంది కదా?

పుట్ట దగ్గర పెట్టిన పూజా ద్రవ్యాలు మళ్ళీ శుభ్రం చేసి అమ్మేసుకుంటారు అక్కడున్న పనివాళ్ళు. మరి ఈ ఫూజా ఫలం ఎవరికి దక్కినట్టు. అసలే పాల ధర రోజు రోజుకు పెరిగిపోతుంటే ఇంట్లో ఖర్చు తగ్గించాలని పాలు తగ్గిస్తున్నారు ఎంతో మంది. కాని పండగల పేరుతో ఇలా పాలు అనవసరంగా పారబోయడం, అందునా డ్రైనేజీలో పోయడం సమంజసమా??  ఇలా పాముపుట్ట దగ్గర పాలు తూములోకి పోయే ఏర్పాటు చేయడం నా కళ్ళారా చూసాను.అందుకే ఈ బాధ.   ఇక ఇంటికొచ్చే పాములవాళ్ళు ఏదో వాళ్ళ పొట్టగడవడానికి పాములను తట్టలో పెట్టుకుని ఇలిల్లు తిరిగి డబ్బో, బట్టలో అడుక్కుంటారు. వాళ్ళను పట్టుకుపోతారు. అసలు ఇవి పూజలా?? ఇలా చేయమని దేవుడు అడిగాడా? 

12 వ్యాఖ్యలు:

Kathi Mahesh Kumar

నమ్మకాలు మూడనమ్మకాలైతే,
విజ్ఞులు మూర్ఖులౌతారు.
పుట్టలో పాముకి పాలుపొయ్యడం,
అదే పాము పుట్టదాటితే, పరారైపోవడం.
ఇంతేగా మన భక్తిపారవశ్యం!

పాలువృధా సంగతి తరువాత,
ముందీ మూర్ఖపు సంతను మేల్కొల్పండి.
పాలు పోతోంది డైనేజిలోకాదు
పాలుపోని ఈ జనత డ్యామేజ్డ్ బ్రెయిన్లో.

ఈ పిచ్చోళ్ళనా బిచ్చం పెట్టమంటున్నారు?
పిల్లలకు పాలుపొయ్యమంటున్నారు?
మానవత్వంకన్నా, పాముతత్వమే వీరికి సరైన సమాధానం.
పాలుతాగిన పాముచేతనే ఆశీర్వాదంతోపాటూ
వీరికి కొంత విషాన్ని కూడా ఇప్పిద్దాం.
ఇంతే సంగతులూ చిత్తగించవలెను.

Anonymous

టపాకాయలాంటి టపా రాసినందుకు అభినందనలు. నేను చదివిన (ఆన్నీ చదవలేదు) మీ టపాలలో అన్నింటికంటే ఇది ఉత్తమమైనది. జ్యోతి ,జ్వాలలా ఎగసి ప్రశ్నించిన తీరు అభినందనీయం. ఇలాంటి ఆలోచన రేకెత్తించే టపాలు రాసి స్ఫూర్తిజ్యోతిని వెలిగించాలని ఆకాంక్షిస్తున్నాను.

పెదరాయ్డు

మన పెద్దలు సంప్రదాయాలైతే పెట్టారుగాని వాటి అర్థాలను డాక్యుమెంట్ చెయ్యలేదు. అందుకే ఈ తిప్పలన్నీ.

Unknown

ఇలా అనుకుంటే పోతే చాలానే ఉంటాయి జ్యోతి గారు, మరి కొబ్బరికాయో??అన్ని గుళ్ళ సంగతీ తెలియదు కాని కనకదుర్గ గుడిలో కొట్టిన కొబ్బరికాయలను తీసుకెళ్ళి హోటల్స్ కిస్తారు వేలం వేసి. అది అందరికీ తెలిసినా మళ్ళీ కొడుతునే ఉంటారు, ఆ కొట్టటమూ గుడికి దూరంగానే, ఒక్కమాటలో చెప్పాలంటే కొన్ని అంతే

Sankar

పుట్టలో పాలే కాదండీ కోడిగుడ్డు కూడా వేస్తారు.. పాపం ఎన్ని పాములు చచ్చుంటాయో ఆ దెబ్బలకి.... నాకైతే నాగులచవితికి ఒక రోజు ముందే పాములన్నీ పుట్టల్లోంచి పారిపోయి మళ్ళీ ఐపోయాక తిరిగొస్తుంటయేమోనని అనుమానం :)

చైతన్య కృష్ణ పాటూరు

మీరు మరీనూ. బిచ్చగాళ్ళు మన కోరికలు తీరుస్తారా ఏమిటి. రాళ్ళకు అభిషేకం చేసి, పూజారికి లంచమిచ్చి దేవుడికి స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తే తీరతాయి కాని.

డ్రయినేజిలో పోయటం ఒక రకం. ఇవన్ని పోసి గుడినే డ్రైనేజిగా మారుస్తున్నారు. మధుర మీనాక్షి ఆలయంలో అమ్మవారికి లేత కొబ్బరి నీళ్ళతో అభిషేకిస్తారట. ఆ అభిషేకం నీళ్ళు మడుగులు కట్టి వాసన వస్తుంటే ఏం చెయ్యాలో తెలీక మదురై మునిసిపాలిటీ వాళ్ళకు అప్పజెప్పారు. వాళ్ళు పారబోయాలా వద్దా అని మీమాంశలో వుండగా తెలిసినదేమిటంటే, కొబ్బరి నీళ్ళు Bio-Gas తయారుచెయ్యటానికి బేషుగ్గా పనికివస్తుందని. ప్రస్తుతం మధుర మీనాక్షి ఆలయం పక్కన బయోగ్యాస్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నారు.

Kranthi M

చాలా బాగా చెప్పారు,అడిగారు జ్యోతి గారు.నా దృష్టిలో భక్తి అంటే అదేదో దేవుడేదో చేస్తాడని భయపడటంలాగా అనిపిస్తుంది.
మరి భక్తి కొద్దీ చేస్తుంటే మీరు చెప్పినట్టు మనిషి ఆకలి గురించి ఆలోచిస్తారు.కానీ ఇలా చేస్తున్నారంటే అది భయమేనేమో కదా?

@maheshgAru great view on the topic.really good view.

Anonymous

Ila anukunte chala dharma sandhelau vastayi... bhakthi tho nammakam tho chesthe devudu daanni grahisthadu.. manaki ila alochinche budhdhi ichhindi kooda devide gaa...

durgeswara

రాగిచెంబును ఆరుబయట ఉంచితే చిలుము పడుతుంది. దానిని శుభ్రపరచకుంటే దాని స్వరూపమే మారిపోతుంది. అలాగే అకాలాన్ననుసరించి అనాచారాలుకూడా సాంప్రదాయాలుగా చలామని అవుతాయి. ఇవి భయమువలన భయస్తులు స్వార్ధపరులవలన వారిమనసులోనుంచి వచ్చే భావనలు. భక్తివేరు, భయంవేరు. ఇది గమనించాలి. ఇటువంటి మురికి తొలిగించటానికే సద్గురువులు వేమన, వీరబ్రహ్మేంద్ర, మొదలగు రూపాలలో తమ బోధలు సాగించేది. ఇది మనం అనుకోవటమేకాదు. పదిమందిలో అదీ వ్యతిరేక భావన తో కాకుండా, జ్ఞాన వంతమయిన మన సనాతన ధర్మ రీతిలో ఇటువంటి అనాచారాలను గురించి చర్చ సాగించవచ్చు. ఇది మనందరి బాధ్యత కూడా.

కొత్త పాళీ

true.

San .D

రిలీజైన ప్రతీ ’ఫలానా’ స్టార్ సినిమాకీ కటౌట్లు పెట్టి గాలన్లు గాలన్లు పాలు
పొయ్యట్లేదా అభిమాన దేవుళ్ళు. వెర్రి వెయ్యి రకాలు.

.C

అందుకే మహాకవి అన్నాడు: "ఈ దేశంలో కుక్కా దేవుడే, పందీ దేవుడే... మనిషే ఎదవ!" అని. "మానవసేవే మాధవసేవ" లాంటివి చదివి "బాగుంది" అనుకోవటమే తప్పించి అంత కన్నా ఆలోచించటం/అమలు చెయ్యటం పెద్దలు నేర్చుకోవట్లేదు (కనుకనే) పిల్లలకీ నేర్పట్లేదు! ఈ సందర్భంగా గుర్తొచ్చిన గురువుగారి పాట:

తికమక మకతిక పఱుగులు ఎటుకేసి? నడవరా, నరవరా, నలుగురితో కలిసి!
శ్రీరామచందురుణ్ణి కోవెల్లో ఖైదు చేసి, రాకాసి రావణుణ్ణి గుండెల్లో కొలువు చేసి
తలతిక్కల భక్తితో తైతక్కల మనిషీ!

ఇదే పాటకి గురువుగారే మొదట వ్రాసిన working versionలో relevant lines: (నరుల సమూహం ... భక్తి ప్రవాహంలో...) సుడిగాలి లాగ రెచ్చి, గుడిలోకి తఱలి వచ్చి, మదిలోని బుఱద తెచ్చి ముదిఱేటి భక్తి పిచ్చి - అది నీ పాదాల పై వదిలిందిరా దేవా! ... భేరీలు పగులగొట్టి, బూరాలు ఎక్కుపెట్టి, పిలిచింది శక్తి కొద్దీ బీభత్సమైన భక్తి! ... గుడిలోన అడుగు పెట్టి, కోరికల కూత పెట్టి, వెనుతఱుముతుంటె భక్తి గుండెల్లొ గుబులు పుట్టి భగవంతుడే గడగడా వణకాలిరా నరుడా!

మీ (సహేతుకమైన) ఆవేదన చదవగానే గుర్తొచ్చి వ్రాసాను. అప్రస్తుతమనుకుంటే... మర్చిపోండి! :-D

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008