Wednesday, 23 March 2011

నవ్వు బహు "బ్లాగు"

నవ్వు బహు బ్లాగు

http://bulususubrahmanyam.blogspot.com/

తెలుగుమీద ఇప్పుడు బోలెడు అభిమానం ఉన్నా, చిన్నప్పుడు తెలుగంటే నాకు చాలా భయం ఉండేది. మా మాష్టార్లు, ఒకరిద్దరు తప్పితే, మాకు టిఫిన్లు బాగా పెట్టేవారు. పెసరట్టు, మినపరోస్ట్ వీపుమీద, కొంచెం లైట్ గాపడితే పెసరట్టు, అరచేతి ముద్రలు కూడా ముద్రిస్తే మినపరోస్ట్ అని అర్ధం. తొడమీద గిల్లితే పకోడి అనీ, మెలిపెట్టి గిల్లితే పునుకులు అనీ, బుగ్గమీద పొంగిస్తే బూరెలు అనీ, అరచేయి వెనక్కి తిప్పి ముణుకులు వాయగొడ్తే కజ్జికాయలు, మైసూర్ పాక్ అనీ అనేవాళ్ళం.



సంధులు, సమాసాలు, విభక్తులు, భక్తులతోటి కుస్తీ పడుతుంటే, తీరుబడిగా, చిద్విలాసంగా నవ్వుతూ గురువులు, లఘువులు మా మీదకు దూకేసాయి. తోడుగా గణాలను తెచ్చుకున్నాయి. యగణం, మగణం, భగణం అ౦టూ హోరెత్తించేశాయి. మేము బిత్తరపోయి చూస్తుంటే ఉత్పలమాలలు, చంపకమాలలు, వాటికి కాపలాగా శార్దూలాలు, మత్తేభాలు పైనపడ్డాయి వికటాట్టహాసాలతో. ఇంకా మేమేమైనా మిగిలి ఉంటే మీద పొయ్యడానికి సీసంలను తోడుతెచ్చుకున్నాయి. ఒకళ్ళా, ఇద్దరా కవులు కొల్లేటి చాంతాడంత లిస్టు. ఒక్కొక్కడు కనీసం ఓఅరడజను వ్రాసిపడేసాడు. ఎవరు, ఎందుకు, ఏంవ్రాసాడో ఎలా గుర్తుపెట్టుకోవడం? నానా అవస్తలు పడేవాళ్ళం. గురువులను, లఘువులను గుర్తి౦చడం ఓ యజ్ఞం లాగ ఉండేది. లఘువులు కొంచెం తేలిక అనిపించినా, గురువులు కష్టం అయ్యేది.



ఇలా తెలుగు బాష మీద తను చేసిన కర్రసాము గురించి చెప్పే శ్రీ బులుసు సుబ్రహ్మణ్యంగారు హైదరాబాదువాసి . ఉద్యోగ విరమణ తర్వాత తీరిక సమయంలో ఆరునెలలక్రింద మొదలుపెట్టిన నవ్వితే నవ్వండి బ్లాగు నిరంతరం చదువరులను నవ్విస్తూనే ఉంది. తెలుగేతర ప్రాంతాలలో ఉద్యోగం చేసి బాషాప్రావీణ్యం అంతగా రాదంటూనే ఆయన రాసే టపాలు ఒకదానికి మించి ఇంకొకటి అని ఒప్పుకోక తప్పదు. సహజంగా హాస్యప్రియుడిని కావడంతో అందరిని కాకున్నా పదిమందినైనా నవ్వించగలిగితే ధన్యుడను అంటున్నారు సుబ్రహ్మణ్యం. నవ్వు నాలుగువిధాల చేటు అన్నవాళ్లే నవ్వనివాడు రోగి అని కూడా అన్నారు. యాంత్రికంగా మారిన నేటి జీవనయాత్రలో నవ్వు చాలా ఖరీదైపోయింది. ఇటువంటి పరిస్దితుల్లో ఈ బ్లాగు టపాలు ఓ డోస్ గా వేసుకుంటే హాసం మందహాసంగా మారుతుందని చెప్పవచ్చు. అన్నింటికంటే అవతలివాళ్లను నవ్వించడం కష్టమేమో కాని సుబ్రహ్మణ్యంగారు నిరంతరం తన బ్లాగు టపాలతో నవ్వించక ఉండలేరు. ఈ మధ్యే పోలీసు అధికారులకు, సదరు మంత్రిగారికి ఉత్తరాలు రాసి బాధితులకు సాయం చేయమని చెప్పి మరీ, తన బ్లాగులో తన గేయాన్ని చదివించారు.

Wednesday, 16 March 2011

భావవ్యక్తీకరణకు వేదికలు తెలుగు బ్లాగులు


భావవ్యక్తీకరణకు వేదికలు తెలుగు బ్లాగులు



సురుచి కలగూరగంప వీవెనుడి టెక్నిక్కులు సరిగమలు సాహితి మనస్వి గీతలహరి సత్యశోధన మోహనరాగం అక్షరం తూర్పూ పడమర తూలిక భవదీయుడు సత్యాన్వేషి చదువరి నైమిశారన్యం తెలుగుపద్యం రాత గీత మనసులో మాట శ్రీలలిత నాతో నేను నా గురించి నా స్పందన బాతాఖానీ, రేఖాచిత్రం తెలుగుకళ ప్రసీద మంచుపల్లకి కొత్తపల్లి మాయాశశిరేఖ వెన్నెల సంతకం ఏటిగట్టు జ్యోతి నైమిశారణ్యం మనసులో అంతర్వాహిని హృదయస్పందన చిరుసవ్వడి మెంతిబద్దలు సత్యప్రియ దిరిసెన పుష్పాలు కృష్ణప్రియ జాజిపూలు బ్లాగాడిస్తా నెమలికన్ను తెలుగోడు జానుతెనుగు సొగసులు
కబుర్లు. ...

ఇవన్నీ తెలుగుబ్లాగుల పేర్లే...



శరవేగంతో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో మార్పులు తెచ్చింది. ఇంకా తీసుకొస్తుంది కూడా. ఈ రోజుల్లో టీవీ, ఫ్రిజ్ లా దాదాపు ప్రతీ ఇంట్లో కంప్యూటర్, ఇంటర్నెట్ తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు అది ఇంగ్లీషు భాష కోసమే కాక తెలుగు చదువులు, రాతలకు కూడా ఉపయోగింపబడుతుంది. రాయాలనుకునే వాడిని రచయితను చేస్తుంది ఈ బ్లాగు.. అసలు బ్లాగు అంటే ఏమిటి? అంతర్జాలంలో మనకంటూ ఒక అందమైన ఇల్లు కట్టుకుని, దానిని అన్ని హంగులతో అలంకరించి, మన భావవ్యక్తీకరణకు వేదిక చేసి పదిమందితో పంచునేదే బ్లాగు. అసలు బ్లాగు ఎందుకు రాయాలి? ప్రత్యేకంగా మనకంటూ ఒక బ్లాగు ఉండాలా? ఇంటి అడ్రస్సు లేదా ఉత్తరం రాయాలంటే ఓ మెయిల్ ఐడి ఉంటుంది చాలదా? మరి ఇదేంటి కొత్తగా?? అంటారా??..... కొత్త సినిమా చూసి వచ్చాం. అది పరమచెత్తగా ఉంది. ఆ చిత్ర నిర్మాత, దర్శకులు కనిపిస్తే చితక్కొట్టాలన్నంత కోపం, ఉక్రోషం కలుగుతుంది. సెలవుల్లో లెదా ఆఫీసులో ఓక మరచిపోలేని సంఘటన జరిగింది. నిత్యావసరాల ధరలు, అద్దె ఇంటి తిప్పలు, స్కూలు ఫీజులు, ఇలా ఎన్నో సమస్యలు. ఎన్నో ఆలోచనలు, మాటలు మనసులో తిరుగుతున్నాయి. ఎవరితోనైనా పంచుకుని చర్చించాలి. ఎలా? స్నేహితులను ప్రతీ విషయంలో డిస్టర్బ్ చేయలేము. ఐనా మనకు నచ్చిన , నచ్చని విషయాలపై మన స్నేహితులు కూడా మనలాగే స్పందిస్తారా? లేదు... అందుకే మన ఆలోచనలకు, భావనలకు ఒక అనువైన చోటు బ్లాగు. వెబ్‌లాగ్ అనే పదం తెలుగులో బ్లాగు గా స్థిరపడింది. ఇది మీ ఆంతరంగిక స్నేహితుడు లేదా స్నేహితురాలు అనుకోండి. మీరు ఏది చెప్పినా వింటుంది. మీరు తోచింది, చెప్పాలనుకున్నది, రాయాలనుకున్నది సులువుగా తెలుగులోనే రాయవచ్చు. మీ చిన్ననాటి జ్ఞాపకాలు, సంతోషాన్నిచ్చిన, బాధపెట్టిన సంఘటనలు, అలుపొచ్చేదాకా రాస్తూ పోవచ్చు. అవి చదివి వెంటనే స్పందించడానికి ఎంతోమంది సహృదయులైన పాఠకులు ఉన్నారు.



ఈనాడు వెయ్యికి పైగా తెలుగు బ్లాగులు ఉన్నాయి. కాని అందులో సుమారు వంద బ్లాగులలో మాత్రమే క్రమం తప్పకుండా రాస్తున్నారు. ఈ బ్లాగులలో కొన్ని ప్రత్యేక అంశాల మీద మాత్రమే వ్యాసాలు లేదా టపాలు కలిగి ఉంటాయి. అవి రాజకీయాలు, పద్యాలు, ఆధ్యాత్మికం, సినిమా,పాటలు, శాస్త్ర విజ్ఞానం, అల్లరి.... ఇలా ఎన్నో రాస్తుంటారు. మరి కొన్ని బ్లాగుల్లో తమకు తోచిన అంశాలు, లేదా మనసులో మెదలిన ఏదైనా సంఘటన, స్పందన, ఆవేశం, జ్ఞాపకాలు రాసుకుని చర్చిస్తారు, వాదిస్తారు.. బాధను పంచుకుని సేదతీరుతారు. చాలా మంది బ్లాగును తమ అంతరంగం లేదా హృదయభాను అని వ్యవహరిస్తారు. ఎంతోమంది బ్లాగు రచనల ద్వారా మంచి స్నేహితులను పొందారు. వారి మధ్య ఆత్మీయమైన అనుబంధం ఏర్పడింది. బ్లాగుల ద్వారా తమ రాతలను రచనలుగా చేసుకున్నవారెందరో. తాజా రాజకీయ సంక్షోభాలు, సంచలన వార్తలు , కొత్త సినిమా కబుర్లపై సమగ్రమైన చర్చలు కూడా బ్లాగుల ద్వారా జరుగుతుంటాయి. ఇక్కడ భావవ్యక్తీకరణకు, రచనలకు ఎటువంటి హద్దులు ఉండవు. నిజం చెప్పాలంటే బ్లాగు ఒక పత్రికలాంటింది. తమ ఆలోచనలను, రచనలను నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా తమ బ్లాగులో వెల్లడించే స్వాతంత్ర్యం ఆ రచయితకు ఉంటుంది. బ్లాగు రాతలు ఆ వ్యక్తి స్వభావం, ఆలోచనావిధానాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. ఈ బ్లాగులు రాసేవాళ్లందరూ సాంకేతిక నిపుణులు కారు. వీరిలో తెలుగు పండితులు, విశ్రాంత వ్యక్తులు, ఉద్యోగస్తులు,,విధ్యార్థులు, పత్రికా ప్రతినిధులు, రచయితలు , గృహిణులు ఉన్నారు. ప్రపంచంలోని వేర్వేరు దేశాలలో, అందనంత దూరంలో ఉన్నా, పరిచయం, చుట్టరికం లేకున్నా బ్లాగులోకంలో కలుసుకుని ముచ్చట్లాడుకుంటారు.



ఇతర భాషా బ్లాగుల్లో లాగా తెలుగు బ్లాగుల్లో ఉబుసుపోక చర్చలు, అనవసరపు గొడవలు ఎక్కువగా ఉండవు. అప్పుడప్పుడు వచ్చినా అవి తొందరగానే సమసిపోతాయి. వాస్తవ ప్రపంచం లాగే ఈ మిధ్యా ప్రపంచంలో కూడా మంచి, చెడు, అసూయా , ద్వేషం కనిపిస్తాయి. అది మనకు ఎంత అవసరమో ఏది అవసరమో అదే తీసుకుంటే సరి. బ్లాగింగులో అనే కాదు.. ఇంటర్నెట్ వాడే ప్రతీవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అనుక్షణం జాగరూకులై ఉండాలి. తెలుగు మీది అభిమానం, తమకు తెలిసిన విషయాన్ని పదుగురితో పంచుకోవాలనే ఆరాటం, తపన, తెలుగు రాయడానికి ఖర్చులేని ,సులువైన పద్ధతుల వల్ల ఎంతో మంది ఔత్సాహికులు, భాషాభిమానులు తెలుగులో బ్లాగులు మొదలెడుతున్నారు. ఆదాయం విషయంలో ఎటువంటి లాభం లేకున్నా సంతృప్తి విషయంలో మాత్రం ఈ తెలుగు బ్లాగర్లు చాలా లాభపడుతున్నారన్నది కాదనలేని సత్యం.



బ్లాగు మొదలుపెట్టి ,దాన్ని అందంగా అలంకరించి, అవసరమైన హంగులన్నీ చేర్చడం అంత కష్టమేమీ కాదు. ఈ క్రింది సైట్లలోకి వెళ్లి మీ బ్లాగును మొదలుపెట్టండి.

http://www.blogger.com

http://www.wordpress.com

http://www.blaagu.com

http://www. space.live.కామ్


బ్లాగులకు సంబంధించి అన్ని సమస్యలు, సందేహాలు చర్చించడానికి ఒక ప్రత్యేకమైన గూగుల్ గ్రూపు ఉంది.


https://groups.google.com/group/telugublog?hl=en


ఇక బ్లాగుకు సంబంధించిన అన్ని రకాల పాఠాలు ఇక్కడ లభిస్తాయి.


http://telugublogtutorial.blogspot.com



మరి ఆలస్యమెందుకు? మీ ఫోన్ నంబర్, సొంత ఇల్లులాగా అంతర్జాలంలో కూడా మీకంటూ ఒక బ్లాగ్ ఇల్లు కట్టుకోండి


Tuesday, 8 March 2011

మరుజన్మంటూ ఉంటే





మరుజన్మంటూ ఉంటే...

స్త్రీ అంటే ప్రకృతి, రంగులు, సౌందర్యం, అందం మాత్రమే కాదు స్త్రీ అంటే బాధ్యత, కష్టం, దుఖం, సహనం, ఓర్పు, క్షమాగుణం కూడా.. సృష్టిరచనలో, నిర్వహణలో స్త్రీ, పురుషుడు.... ఇద్దరి బాధ్యత సరిసమానంగా ఉంటుంది. వీరిలో ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. కాని తరతరాలుగా పితృస్వామ్య సమాజమే కొనసాగుతుంది. స్త్రీ ఎంత విద్యావంతురాలైనా, ధైర్యవంతురాలైనా ఆమెని ఎప్పటికప్పుడు అణగదొక్కాలనే చూస్తారు. తమని దాటిపోతే తమని లెక్కచెయదేమో అనే అహంభావం మగవాడికి, మొగుడికి ఉంటుంది. అందుకే మగవాళ్లకంటే ఆడవారు ఎప్పుడూ తక్కువ స్థాయిలోనే ఉండాలి , తాము చెప్పినట్టు వినాలి , చెప్పింది నోరు మూసుకుని పాటించాలి అని సమాజమే నిర్ణయించేసింది. వాస్తవానికి స్త్రీ ఎన్నటికి అబల కాదు. ఆమెలో కూడా అనంతమైన శక్తి ఉంది. దాన్ని గుర్తించి వెలికితీయాలి. అది అంత కష్టమేమి కాదు. ఈరోజు ఎందరో మహిళలు ఉన్నతపదవులు అలంకరించడంలోను , వివిధ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడంలో వారికి స్ఫూర్తి, ప్రోత్సాహం ఎవరిస్తున్నారు? అని ఆలోచిస్తే ముందుగా ఆమెను ప్రోత్సహించి ముందుకు నడిపించేది భర్త, స్నేహితులు.. దానికి తోడుగా ఆమెలోని సంకల్పం, ఆత్మస్థైర్యం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈనాడు మహిళలు రాణించని రంగం ఏదైనా ఉందా?. ఉద్యమాలైనా, రాజకీయాలైనా, పరిపాలనా బాధ్యతలైనా, అద్యాపక వృత్తి ఐనా, డాక్టరైనా, గాయని ఐనా, పోలీసైనా, మిలటరీ ఐనా సరే తాను కూడా చేయగలను అని ముందుకొస్తుంది మహిళ. ఉద్యోగాలు చేయకున్నా ఎందరో మహిళలు ఇంటినుండే తమకు తెలిసిన స్వయం ఉపాధి పధకాలు ప్రారంభిస్తున్నారు. మేమున్నది వంట చేయడానికి, ఇల్లు సర్దుకోవడానికి మాత్రమే కాదు అంటూ కుటుంబ నిర్వహణలో భర్తకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా వేర్వేరు దేశాలలో, వేర్వేరు వృత్తులలో ఉన్న తెలుగు మహిళాబ్లాగర్లను “మరుజన్మంటూ ఉంటే మీరేం కోరుకుంటారు” అని అడిగితే ఇలా చెప్పారు.




ఇంకో జన్మ అంటూ వుంటే, ఎంపిక చేసుకునే అవకాశం కూడా మన చేతుల్లోనే వుంటే నేను మళ్ళీ మానవి గానే పుడతాను. అయితే అది కేవలం స్త్రీ జన్మ గొప్పదనో, స్త్రీ కి మాత్రమే విలువ వుందనో కాదు. ఇవాల్టి సమాజం లో స్త్రీలకు బాధలు, కష్టాలు , ఇబ్బందులు ఇంకేవో వున్నాయని ఇంకో జన్మ లో మగవాడిగా పుట్టడం , పుట్టాలనుకోవడం సమస్యకి పరిష్కారం కాదు. అలాంటి అసమానతలు వున్న సమాజం పోవాలి. స్త్రీ పురుషులిద్దరూ స్వేచ్ఛగా,సమానంగా,సంతోషంగా బతకగలిగే సమాజం రావాలి. అలాంటి సమాజం లో కేవలం ఏదో ఒక జెండర్ కి మాత్రమే స్వేచ్ఛ పరిమితం కాకుండా మానవ జాతిమొత్తం ఎలాంటి బానిస సంకెళ్లు లేకుండా బతకగలగాలి. అలాంటి సమాజం లో మళ్ళీ మానవి గా పుట్టాలని ఉంది.
కల్పనా రెంటాల




ఆడజన్మంటే...
తేనెలోని తీయదనం..పూలలోని సౌకుమార్యం
తొలివెలుగులోని వెచ్చదనం..పిల్లగాలి చల్లదనం
తొలకరిలోని గిలిగింత..పౌర్ణమినాటి పులకరింత
కోయిలకూతలోని పలకరింత..అమ్మదనంలోని కమ్మదనం..
ఇవన్నీ, ఇలాంటివన్నీ, ఇలాంటివింకెన్నో కలిసి నిండురూపమిచ్చేదే ఆడజన్మంటే...
అంతేకాదు...పరిస్థితులు వికటిస్తే..
గులాబీ పక్కనున్న ముల్లులాగా
అల్లరి చేసే అబ్బాయిల పాలిట పీడకల
యాసిడ్ పోసే దుండగుల పాలిట కాళిక
కిరోసిన్ పోసే కృతఘ్నుల పాలిట భద్రకాళి
ఆడవారికి గౌరవమివ్వని మగవారిపాలిట మహంకాళి
అదీ ఆడజన్మంటే..
అన్ని గొప్ప విశేషాలున్నాయి కనుకనే నాకు ఆడజన్మంటే ఇష్టం. అందుకే మరుజన్మంటూ వుంటే నేను ఆడజన్మనే కోరుకుంటాను..
శ్రీలలిత..



నాకు మళ్ళీ మళ్ళీ ఆడ పిల్ల లాగా పుట్టడమే ఇష్టం .. ప్రస్తుతం మా వారు వంట, పిల్లల చదువులు అవీ యేవీ పెద్దగా పట్టించుకోరు.. ఒకసారి విసుగొచ్చి వచ్చే జన్మలో మగవాడిగా పుట్టి అన్ని పనులూ నా భార్యతో చేయించుకోవాలని ఉందని చెప్పాను..నా కంటే ఒక పది సంవత్సరాలు చిన్న అయిన జంటలని చూస్తే 50-50 గా పంచుకుంటున్నారు అన్ని పనులని.. ఇంకొన్నేళ్ళు పోతే తిరగేసి మగవాళ్ళే అన్ని పనులు చేస్తారట. అంటే నేను మళ్ళీ పుట్టే సమయానికల్లా పరిస్థితి మారుతుందిట...ఇలా చెప్పి మా వారు నేను మగవాడిగా పుట్టాలనే కోరికని ఎగిరి గంతేసి మరీ ఆనందించారు..అంత గొప్ప అవకాశాన్ని ఎలా ఇస్తానండీ ఆయనకీ....అందుకే మరుజన్మలో మళ్ళీ అమ్మాయిగా పుట్టేసి పనులన్నీ మా ఆయనతో చేయించి.. కాలు మీద కాలేసుకుని సిగరెట్టు అంటించుకుని..టీవీ లో మా మంచి సినిమాలు చూస్తూ ప్రపంచంలో యేం జరుగుతున్నా ఏమీ పట్టనట్టు నా లోకంలో నేనుండి జీవితం ధన్యం చేసుకుందామని ఇలా ఆడపిల్లగా పుట్టడానికి డిసైడ్ అయిపోయా మరి!
పైది సరదాకి చెప్పినదైనా నిజంగా అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ 'ఆడదె ఆధారం' అనుకోడానికి అవకాశమిచ్చిన ఆడపిల్లగానే మళ్ళీ మళ్ళీ పుట్టలని కోరుకుంటా.
ఎన్నెల




హక్కులు అనేవి ఒకళ్లు ఇచ్చేవి కావు...మనకి మనమై సంపాయించుకోవాల్సినవి. ఎవరో ఏదో అంటారని, ప్రపంచానికి భయపడి, కట్లుబాట్లకి లొంగి ఉంటూ ఇంకొకరి అధికారాన్ని ఒప్పుకునేటంతవరకూ స్త్రీలు ఎంత ఆర్థిక స్వాతంత్ర్యం సాధించినా కూడా విముక్తి లేదు. అయితే తెగింపు, ధైర్యం అనేవి ఆర్థిక స్వాతంత్ర్యంతోనే వస్తాయి. మనకి ఎవరూ ప్రోత్సాహం ఇవ్వక్కర్లేదు.. ఈ ప్రపచంలో నేనూ మనిషినే అని గుర్తిస్తే చాలు. మనకి మనమే ప్రోత్సాహం ఇచ్చుకోవాలి. ఇతరులని బాధపెట్టనంతవరకూ ఎవ్వరేమనుకున్నా i don't care అని అనుకోవాలి. సమాజానికి వెరుస్తున్నంతవరకు స్త్రీలకి విముక్తి లేదు. ఐనా కూడా నేను మళ్ళీ జన్మంటూ ఉంటే ఆడపిల్లగానే పుడతాను. ఆడ జన్మ అమోఘమైనది, మగ జన్మకు ఏమాత్రమూ తక్కువగాదు అని నిరూపించడానికైనా మళ్ళీ అమ్మాయిగానే పుడతాను. అలా పుట్టడంలో ఏ తప్పు లేదూ...మగవారితో సమానంగా బతకగలము అని నిరూపించడానికైనా స్త్రీగా పుట్టాలనుకుంటున్నాను. నేను స్త్రీగా పుట్టి నా ధైర్యంతో పది మంది స్త్రీలకి ధైర్యం కలిగించడానికైనా స్త్రీగానే పుట్టాలనుకుంటున్నాను. ఎన్ని జన్మలైనా ఆడపిల్లగానే పుట్టాలి...సమానత్వాన్ని సాధించేవరకూ ఆడపిల్లగానే పుట్టాలనుకుంటున్నాను.
సౌమ్య ఆలమూరు...




ఎంత అబివృధ్ధి చెందినా మన సమాజంలోనూ, చుట్టూ మనుషుల్లోనూ మార్పు అనేది కొరవడుతోంది. చిన్నతనంలో ఇంట్లోని మగపిల్లలతో పోటీపడలేని నిస్సహాయత, యుక్తవయసులో పోకిరీ అల్లర్లు-వేధింపులూ, ఉద్యోగినిగా మారాకా ఆఫీసుల్లోనూ అభద్రత, కష్టపడుతున్నాఇంట్లో లభించని ప్రోత్సాహం, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా తప్పని అత్తింటి పోరు, పెళ్ళి జరగకపోతే ఒకరకం విమర్శలు, పెళ్ళయి పిల్లలు కలగకపోయినా స్త్రీపైనే అభియోగాలు. ఇలా చెప్పుకుపోతే ఎన్నో. మనచుట్టు ఈ ఇబ్బందులన్నీ పడుతున్న స్త్రీలు 60% దాకా ఉంటారు. నేనూ స్త్రీ నే కాబట్టి స్త్రీలంటే గౌరవం, ఈ జన్మ పట్ల ప్రేమ ఉన్నాయి. కానీ మరు జన్మ అనే ప్రశ్న, ఆ ఛాయిస్ నాకు వస్తే మాత్రం సమాజంలో మార్పు రానంత వరకూ నేను మళ్ళీ అమ్మాయిగా పుట్టడానికి వెనకాడతాను. ఎందుకంటే ఈ జన్మలో నన్ను ఆదరించి ప్రేమించిన ఇదే తల్లిదండ్రులకు పుట్టకపోవచ్చు..
-తృష్ణ




"మరు జన్మంటూ వుంటే ముమ్మాటికి మళ్ళి అమ్మాయిగానే పుట్టించు తల్లీ. అనే కోరుకుంటాను. అమ్మాయితోనే అందం, ఆనందమూనూ,అందులోనూ అచ్చం పదహారణాల తెలుగమ్మాయిగానే,తేనెలూరే తెలుగు భాషలోని మధురిమను ఆస్వాదిస్తూ, అమ్మగా అమ్మదనాన్ని పొందుతూ, ఆప్యాయతతో ఆదరంగా ప్రతి శిశువుని పెంచకలిగితే అంతకంటె ఇంక ఏమి కావాలి? చదువు, సంస్కారం, మంచితనానికి ప్రధమ గురువు తల్లి.తల్లిని మించిన గురువు, హితుడు, దైవం, పరమాత్మ , ఎవరున్నారు? చెప్పండి. ఇవి అన్ని రంగరించి పెంచకలిగేది అమ్మాయే, ఆ అమ్మ. అలా పెరిగిన సమాజంలో కట్నాలు, వేధింపులు, సమస్యలు వుండనే వుండవుగా, ఒకవేళ వున్న ఇప్పటి జన్మలో ని అనుభవాలతో తేలికగా అధిగమించ వచ్చనే అనుకుంటున్నాను. అ! ఒక్కటి ప్రతి అమ్మాయి ఆర్ధికంగా ఎవరిమీద ఆధారపడకుండా తన కాళ్లమీద తాను నిలబడకలిగేలా చేయమని మాత్రం మనసా వాచా ఆ భగవంతుని కోరుకుంటున్నాను."
భమిడిపాటి సూర్యలక్ష్మి




నేను ఎన్ని జన్మలెత్తినా స్త్రీగానే పుట్టడానికి ఇష్టపడతాను. ఎన్ని సమస్యలేదురయినా ఎదుర్కోగల ఆత్మవిశ్వాసం నాకుంది. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందని నేను నమ్ముతాను. నేను మనిషిని నమ్ముతాను. ఆడపిల్లల్ని అగ్గిబరాటాల్లగా పెంచి చూడండి. నింగి నేలతో పాటు అడవిని జయించుకొస్తారు. నువ్వు అబలవి, ఏడవడమే నీ పని, ఎవడో కౌన్ కిస్కా గాడు మొగుడుగా వస్తాడు వాడిని అల్లుకోవడమే నీ పని అని మనం నూరిపోస్తుంటే వాళ్ళు ఎప్పటికీ సమస్యల్లోనే నలుగుతుంటారు. సమస్య ఆడవాళ్ళుగా పుట్టడంలో లేదు వాళ్ళని ఆడవాళ్ళుగా తయారుచేయడంలో ఉంది. నాకు స్త్రీగా బతకడమే ఇష్టం ఎప్పటికీ. అడవిలో మానులంటే నాకు మహా ప్రేమ. మహా మానుగా పుట్టడం నాకు ఇంకా ఇష్టం.
సత్యవతి కొండవీటి...




"నిజమే! ఒక్క మనదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అధికశాతం.. ఆర్ధికంగా, సామాజికంగా వెనుక బడిన వారిలో ఆడవారిమీద పెత్తనం చేసే వాళ్ళు, అణగ దొక్కాలనే వాళ్ళు, ఇప్పటికీ ఎక్కువే. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి కుటుంబాలలో అంత లేకపోయినా.. ఎప్పుడో ఒకప్పుడు ఆ వివక్షత అనుభవించామనే చెప్పచ్చు.. అదీ ఇరవయ్యో శతాబ్దం మధ్యలో, స్త్రీ విద్యాభివృద్ధికి సంధి యుగం అని చెప్పదగిన కాలంలో. నేనే డిగ్రీలో చేరడానికి మూడు రోజులు సత్యాగ్రహం చెయ్యవలసి వచ్చింది. ఆ తరువాత, ఎప్పుడు చదువు ఆపి పెళ్లి చేస్తారో అని బితుకు బితుకు మంటూ గడప వలసి రావడం నిజమే. చదువు మీద దృష్టి నిలపడానికి ఎంతో శ్రమ పడడం నిజమే. అదే అన్నయ్యలకి ఆ సమస్యే లేదు. ఏది కావాలంటే అది ఎక్కడైనా చదవచ్చు. చదువు కోసం చేసిన పోరాటానికి లభించిన బిరుదు.. "జగ మొండి." నేను అనుకున్నది సాధించడానికి ఇరవయ్యేళ్ళు పట్టింది.. అదీ వివాహమయ్యాక.. అర్ధం చేసుకున్న భాగస్వామి లభించడం వల్ల. ఇంత వివక్షత ఎదుర్కొన్నా కూడా మరుజన్మలో స్త్రీగానే జన్మించాలనుకుంటాను.. ఎందుకంటే.. ఏదైనా సాధించగల పట్టుదల, మానసిక స్థైర్యం స్త్రీకే ఉంటుంది. ముఖ్యంగా మాతృత్వం.. మరీ మరీ అనుభవించాలనే మధురమైన భావన.. తనివి తీరనిది కదా!"

మంథా భానుమతి...

Saturday, 5 March 2011

అంతర్జాలంలో తెలుగు (ఆంధ్రభూమి)

ఆంధ్రభూమి దినపత్రికవారు అంతర్జాలంలో తెలుగుకు సంబంధించిన విశేషాలు ప్రచురించ తలపెట్టారు. శీర్షికలో క్రమం తప్పకుండా అంతర్జాలంలో తెలుగుకు సంబంధించిన వార్తలు, వెబ్ సైట్లు, బ్లాగులు, బ్లాగు పరిచయాలు ఉంటాయి. అసలు కంప్యూటర్లో ఖర్చులేకుండా చాలా సులువుగా తెలుగు రాయవచ్చు అని చాలా మందికి తెలియదు. ఇంట్లో ఉన్న కంప్యూటర్లో తమ మాతృభాషలో చదువుకోవచ్చు,రాయవచ్చు ఎన్నో రచనలు , విశేషాలు తెలుసుకోవచ్చు అనే అంశాన్ని తెలియచేయడమే వ్యాస పరంపర ముఖ్య ఉద్దేశ్యం.


మరో గమనిక..







అంతర్జాలంలో తెలుగు


ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదిహేనుకోట్లమందికి పైగా మాట్లాడే భాష తెలుగు. కాని నేడు మాట నేర్చినది మొదలు మాతృభష కన్నా ఆంగ్లమే ముద్దుగా మారింది. సర్వం ఇంగ్లీషుమయమైన ఆధునిక కాలంలో తెలుగు మరుగునపడిపోతుంది. మీకు నచ్చిన పుస్తకం ఏదని అడిగితే ఎక్కువ శాతం ఇంగ్లీషు నవలల గురించే మాట్లాడుతున్నారు. ఇంగ్లీషులో చదవడం, మాట్లాడడం అలవాటైన తెలుగువారు ఇది మన భాష అని గర్వంగా చెప్పుకోవడం లేదు. ఈ తరం యువతకు తెలుగులో మాట్లాడడం వచ్చినా చదవడం , రాయడం కష్టం అంటున్నారు. అది విని మనసు కలుక్కుమంటుంది. రాబోయే తరం వారు తెలుగు అంటే ఏంటి? ఎలా ఉంటుంది? జిలేబిల్లా ఉంటుంది అదేనా ? అని అడుగుతారో అని సందేహం కలగక మానదు.



కాని అంతర్జాలం (ఇంటర్నెట్) ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చేసింది.ఇంతవరకు ఆ కుగ్రామంలో ఏ పని చేయాలన్నా ఇంగ్లీషు మాత్రమే ఉపయోగింపబడేది. కాని ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఇంటర్నేట్‌లో తెలుగు విస్తృతంగా వ్యాపించింది అని గర్వంగా చెప్పుకోగలం. తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించింది అని మురిసిపోయాం, గర్వపడ్డాం. సాంకేతిక పరిజ్ఞానం త్వరితగతిని అభివృద్ధి చెందుతున్న కారణంగా తెలుగుకు ఆధునిక హోదా లభించింది అని ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. ఎటువంటి ఉద్యమాలు, నినాదాలు లేకుండానే నేడు వెబ్ ప్రపంచంలో తెలుగు వెలిగిపోతుంది.



పెద్ద పెద్ద వ్యాపారస్తులకు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు మాత్రమే కంప్యూటర్ అవసరం అనే రోజులు పోయాయి. స్కూలు పిల్లలకు కూడా కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి అవసరమై పోయింది. ఈ కంప్యూటర్, అంతర్జాలం కేవలం ఇంగ్లీషు వచ్చినవాళ్లకు , సాంకేతిక నిపుణులకు మాత్రమే ఉపయోగపడుతుంది అనుకుంటే పొరపాటే. ఇప్పుడు కంప్యూటర్లో చాలా సులువుగా, ఎటువంటి ఖర్చు లేకుండా తెలుగు చదవవచ్చు, రాయవచ్చు. ఉత్తరాలు కూడా తెలుగులోనే రాసి పంపుకోవచ్చు. తెలుగు భాష మీద అభిమానం, నేర్చుకోవాలనే ఆసక్తి, రాయాలనే తపన ఉంటే చాలు. కొన్నేళ్లక్రితం వరకు ఇంటర్నెట్ ఇంగ్లీషులోనే ఉండేది. తెలుగు రాయాలన్నా, చదవాలన్నా కష్టంగా ఉండేది. తెలుగులో రాయడానికి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ కొనాల్సి వచ్చేది. ఇంటర్నెట్ లో తెలుగు వాడకం 90వ దశకం నుండి చివరినుండి మొదలై గత నాలుగేళ్లుగా అతి వేగంగా వ్యాప్తి చెందింది. మాతృభాష మీది అభిమానంతో ఎందరో సాఫ్ట్‌వేర్ నిపుణులు కృషి చేసి కంప్యూటర్లో తెలుగు చదవడం, రాయడం సులభతరం చేసారు. ఇంటర్నెట్ వాడకం ప్రతి ఇంటిలో తప్పనిసరిగా మారిన క్రమంలో తెలుగుబాషా వ్యాప్తి కూడా చాలా వేగంగా జరుగుతుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉన్న తెలుగువారు దగ్గరయ్యారు. ఎంచక్కా తమ మాతృభాషలోనే పరస్పర సంభాషణలు, ముచ్చట్లు , రచనలు చేస్తున్నారు.



ఐతే ముందుగా మనం మన కంప్యూటర్ కి తెలుగు నేర్పిద్దాం. లేకుంటే అది తెలుగును తెలుగులా చూపించదు మరి. మామూలుగా కంప్యూటర్లలో ఇంగ్లీషు వాడకం ఎక్కువగా ఉంటుంది. ఈ కంప్యూటర్లలో అంటే తెలుగు చదవాలంటే డబ్బాలుగా కనిపిస్తుంది. తెలుగు చదవాలన్నా ,రాయాలన్నా కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్లో లో తెలుగు ఎనేబుల్ చేయడం తెలుసుకుందాం.

Start Menu లోకి వెళ్లి Control Panel క్లిక్ చేయండి.

ఇప్పుడు Control Panel లో Regional and Languages ఆప్షన్ క్లిక్ చేయండి.

తర్వాత Regional and Languages Dialogue Box లో Languages ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని

Install files complex scripts అన్న ఆప్షన్ క్లిక్ చేయండి.

అప్పుడు అది XP సిడి అడుగుతుంది. సిడిని డ్రైవర్ లో పెట్టండి. అందులోనుండి కావలసిన ఫైల్స్ దించుకున్న తర్వాత సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన కంప్యూటర్లో తెలుగు ఇంచక్కా కనిపిస్తుంది.



మీ దగ్గర XP సిడి లేదా. ఐనా పర్లేదు. ఈ క్రింది సైటునుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

http://www.omicronlab.com/tools/icomplex-full.html

ఇక్కడినుండి ''iComplex_2.0.0.exe''

ఫైల్స్ డౌన్ లోడ్ చేసుకుని మీ సిస్టమ్ లో ఇన్ స్టాల్ చేసుకోండి. అంతే. దీనికోసం మొదటి సోపానాలు పాటించాల్సిన పనిలేదు. మీకు తెలుసా? విండోస్ XPలో కూడా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, ఫైర్‌ఫాక్స్ విహారిణుల్లో తెలుగు కనబడటం కోసం ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నోటుపాడ్ వంటి ఇతర ఉపకరణాలలో తెలుగు కోసం మాత్రమే ఈ కాంప్లెక్స్ సెట్టింగులని చేసుకోవాలి. కాబట్టి, తెలుగుని చూడడంలో సమస్య ఉంటేనే దీన్ని స్థాపించుకోండి (install). విండోస్ విస్టా మరియు విండోస్ 7 కంప్యూటర్లలలో తెలుగు కోసం మనం ప్రత్యేకంగా ఏమీ స్థాపించికోనవసరం అవసరం లేదు.

Windows XP తర్వాతి ఆపరేటింగ్ సిస్టమ్ లలో ఈ అవసరం ఉండదు. మన కంప్యూటర్ కు తెలుగు నేర్పించాము కదా. ఇక తెలుగులో ఎలా రాయాలో తెలుసుకుందాం. ముందుగా మనం అంతర్జాలంలో ఎటువంటి డౌన్లోడ్ చేసుకునే అవసరం లేకుండా సులువుగా తెలుగులో రాయగలిగే పద్ధతులు ఎన్ని ఉన్నాయో చూద్ధామా??


లేఖిని ... http://lekhini.org/


గూగుల్ ఇండిక్ లిప్యంతరీకరణ -- http://google.com/transliterate/indic/తెలుగు


క్విల్ పాడ్ --- http://quillpad.com/telugu/


ఈ ఉపకరణాలన్నీ కూడా అంతర్జాల సంధానం ఉన్నప్పుడే పనిచేస్తాయి. ఇందులో ఇంగ్లీషులో రాస్తుంటే అవే తెలుగులోకి మారిపోతాయి. ఇలా రాసుకున్నదాన్ని కాపీ చేసుకుని మనకు అవసరమైన చోట పేస్ట్ చేసుకుని సేవ్ చేయాలి. కంప్యూటర్లో కొత్తగా తెలుగు రాయడం మొదలుపెట్టినవారికి ఇవి చాలా ఉపయోగకరమైనవి, సులభమైనవి కూడా. ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు కూడా తెలుగులో రాసుకోవచ్చు. దీనికోసం బరహా, అక్షరమాల లాంటి సాఫ్ట్ వేర్ డౌన్లోడ్ చేసుకుని సిస్టమ్ లో సేవ్ చేసుకోవాలి. అవసరమైనప్పుడు తెలుగులో లేదా ఇంగ్లీషులోచాలా సులువుగా రాసుకోవచ్చు. ఇక ఎటువంటి సాఫ్ట్ వేర్ లేకుండా చిన్న మార్పులతో ఇన్ స్క్రిప్ట్ విధానంలో కూడా తెలుగులో రాయవచ్చు.

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008