Saturday, 29 June 2013

ఎవరేమీ అనుకున్నా....

ప్రతీ మనిషికి జీవితంలో పోరాటం తప్పదు. ఎంత ధనవంతులైనా, పేదలైనా, చదువుకున్నా, చదువుకోకున్నా కష్టాలు, సుఃఖాలు, సమస్యలు తప్పవు. కాని అలా సమస్యలు వచ్చినప్పుడు ఎదుటివాడి మీద నింద వేయడం పరిపాటి. వాళ్ల వల్లనే ఇలా జరిగింది. నా జీవితం నాశనం చేసారు. లేకుంటే నేను అందలం ఎక్కి ఉండేవాన్ని. ఈ సమస్యకు పరిష్కారం లేదు. చావు తప్ప వేరే మార్గం లేదు. వెదవ జీవితం ఎప్పుడూ ఒకరిమీద ఆధారపడి ఉండాలి. నాకంటూ స్వేచ్ఛ లేదు. సంతోషం లేదు.. నా జీవితంలో అసలు సంతోషం, విజయమనేది ఉంటుందా? ఎవ్వరూ నన్ను గుర్తించరు, నాకంటూ ప్రత్యేకమైన ప్రతిభ లేదు, ఆస్తిపాస్ధులు లేవు.. పెద్దలిచ్చిన మణులు, మాన్యాలు లేవు. ఉధ్యోగంలో వచ్చే జీతం ఏం సరిపోతుంది. నా జీవితమింతే ఎదుగుబొదుగు లేదు. ఇలాగే అసంతృప్తితో చావాల్సిందే. 

ఇలా ఎంతోమంది అనుకుంటుంటారు. కాని ఒక్కసారి ఈ జరుగుతున్న పరిణామాలలో నావంతు పాత్ర ఏముంది. నన్ను నేను ఎలా మార్చుకోగలను? పోరాడగలను? సమస్యలకు పరిష్కారం ఎలా ఆలోచించాలి? అంటూ ఆలోచన మొదలెడితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. పోరాడే శక్తి వస్తుంది. ఎంత పెద్ద సమస్య ఐనా చిన్నగానే ఉంటుంది. ఒకవేళ నష్టం వచ్చినా పర్లేదులే తర్వాత సరిదిద్దుకోవచ్చు. లేదా మనకింతే ప్రాప్తం. దానిగురించి బాధపడుతూ ఇక్కడే ఆగిపోకుండా వేరే పని చేద్దాం అన్న పాజిటివ్ ధింకింగ్ అలవడుతుంది. కాదంటారా? ఈ పాట వినండి. అందులో ప్రతీ లైన్ మళ్లీ మళ్లీ అర్ధం చేసుకోండి. మీ జీవితానికి అన్వయించుకోండి. పని చేస్తుంది.. సందేహమా?? ఇది అక్షరాలా సాధ్యమవుతుంది అనడానికి నేనే నిదర్శనం.. అందుకే ఎప్పుడైనా కాస్త దిగులుగా ఉన్నప్పుడు ఈ పాటను మళ్లీ మళ్లీ వింటాను. తొందరగా తేరుకుని మళ్లీ నా పనిలో పడతాను. మీరూ ట్రై చేయండి.. సమస్యలు తీరడానికి పూజలు, ఉంగరాలు, నోములు, వ్రతాలు చేసే బదులు లేదా చేస్తూనే మిమ్మల్ని మీరు ధృడంగా తయారు చేసుకోండి..



ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన
రాజు నువ్వే బంటూ నువ్వే మంత్రీ నువ్వే సైన్యం నువ్వే
ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడి లోన
పలకా నువ్వే బలపం నువ్వే ప్రశ్నా నువ్వే బదులూ నువ్వే..
అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలీ..
అనుకున్నది సాధించాలీ...

అవమానాలే ఆభరణాలు.. అనుమానాలే అనుకూలాలు..
సందేహాలే సందేశాలు.. ఛీత్కారాలే సత్కారాలూ...
అనుకోవాలీ.. అడుగేయాలీ ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలీ..
అలుపొస్తున్నా కలలే కన్నాపూల స్వర్గాన్ని అధిరోహించాలీ..
ఎవరికి వారే లోకంలో.. ఎవరికి పట్టని శోకం లో.. నీతో నువ్వే సాగాలీ..

బలమూ నువ్వే.. బలగం నువ్వే.. ఆటా నీదే.. గెలుపూ నీదే..
నారూ నువ్వే .. నీరూ నువ్వే.. కోతా నీకే.. పైరూ నీకే..
నింగీ లోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేనూ..
చెట్టు పైనా పూలూ మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేనూ..
ఒక ఉదయం ముందర చీకట్లూ.. విజయం ముందర ఇక్కట్లూ..
రావడమన్నది మామూలూ..

అంతర్ముఖం ... (నాలో నేను. నాకోసం నేను)




ప్రతి ఉదయం ఒక కొత్త ఆవిష్కరణా? లేక మరో పొరాటమా?.
ఏన్నో ప్రశ్నలకు జవాబులు వెతుకుతూ
సంఘర్షణలకు సమాయత్తమవుతూ
పోరాడడం,
సర్దుకుపోవడం, ఓడిపోవడం 
ఆ ఓటమిలోనే గెలిచానన్న అబద్ధపు తృప్తితో
అప్పుడప్పుడు మిణుకుమిణుకుమనే
సంతోషాల తారలకోసం ఎదురుచూస్తూ
అందరికోసం అన్నీ చేస్తూ, తనకోసం తాను అన్వేషిస్తూ
బంధాల(బంధనాల) చిక్కుముడులలో ఇరుక్కుని
అందులో ఉండలేక, బయటకు రాలేక
ఆ బంధాల(రంగుల)లో కలిసిపోవాలనే తాపత్రయంలో
వాటినే చుట్టుకుని ఒదిగిపోయి మురిసిపోతూ
స్వచ్చమైన తన శ్వేతవర్ణాన్నే
మర్చిపోయి .. ఊపిరాడక తల్లడిల్లగా...

Thursday, 27 June 2013

మాలిక పదచంద్రిక - 9 ... సమాధానాలు



మే 2013 మాలిక పద చంద్రిక – 9 సమాధానాలు
మే నెల పదచంద్రిక పూరణ ఈక్రింద ఇస్తున్నాము. కేవలం ఇద్దరే పూరించి పంపారు. వారు శ్రీమతి భమిడిపాటి సూర్యలక్ష్మిగారు, శ్రీ ఫణికుమార్ గారు(బ్లాగాగ్ని బ్లాగు కర్త).  ఇద్దరి తప్పులూ ఒకటే అవడం విశేషం.ఈసారి విజేతలెవ్వరూ లేరు..

  1. అడ్డం 1.పేరులో క్షీరం, రచనలో 14 అడ్డం ఈసోమేశ్వరుడి సొత్తు   --  పాలకొల్లు అని రాసారు. పాల్కురికి సరైన సమాధానం.
  2. అడ్డం 15    ఈయనది కృష్ణపక్షమే.. లేకపోతే ఆ కృతికి సింహావలోకం రాస్తాడా పొడి అక్షరాలలో  -- తకొ. తశి సరైన పదం. తల్లావఝ్ఝుల శివశంకర శాస్త్రి కి పొట్టి పేరు.
  3. నిలువు 16. 5 నిలువుతో చేరితే .. చివరికి మిగిలేది ఇంటిపేరే.  చివరికి మిగిలేది రాసిన బుచ్చిబాబు గారి ఇంటిపేరు శివరాజు.
సూర్యలక్ష్మిగారు అదనంగా చేసిన తేడా  14 నిలువు ద్విరుక్త అని రాయడం. ద్వితీయ (విభక్తి) అని ఉండాలి.

ఏదైనా ప్రత్యేకంగా చేద్దామని జ్యోతిగారు సూచించినమీదట పదచంద్రిక -9 ని సాహిత్య పదచంద్రికగా తయారు చేసాము. మరి కొందరు కూడా పూరించి ఉంటే పత్రికకూ, నాకూ కూడా ఉత్సాహంగా ఉండేది.

సత్యసాయి కొవ్వలి

Tuesday, 25 June 2013

“కవితామాలికా – మాలిక పత్రిక నుంచి ఓ వినూత్న ప్రయోగం"






ఎప్పటికప్పుడు కొత్తదనంతో పాఠకులను అలరించాలనుకునే  మాలిక పత్రిక మాట నిలబెట్టుకుంటూ జులై సంచికనుండి  ఓ కొత్త శీర్షికతో వస్తోంది   జూలైనుంచే కాకుండా  తరచుగా  (ఇప్పుడు మాలిక  మాసపత్రిక కాబోతోందన్నది మీకు తెలిసినవార్తే కదా ) కొత్త శీర్షికలతో, కొత్త ప్రయోగాల ఫీచర్స్ తో రాబోతోంది. ఇక సాహితీ పండగే పాఠకమహాశయులందరికీ... మీరు కూడా ఏమైనా కొత్త ఆలోచనలు,  ప్రయోగాలు చేస్తే బావుంటుందనుకుంటున్నారా. మీ ఆలోచననను మాకు పంపండి.. తప్పకుండా చేద్దాం..  editor@maalika.org

ఇక ప్రస్తుత వినూత్న ప్రయోగం విషయానికొస్తే. మీరు స్కూలులో ఉన్నప్పుడు వ్యాసరచన/essay writing చేసారు గుర్తుందా? టీచర్ ఒక టాపిక్ ఇస్తే ఎవరి ఆలోచన వారు రాసేవారు. ఇది అలాటిదే అనుకోండి. ఒక అంశం మీద వేర్వేరు వ్యక్తులు వేర్వేరు విధాలుగా ఆలోచిస్తారు. స్పందిస్తారు. ఇది వారి వారి అనుభవాలమీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే ...

ఈ జూలై సంచికలొ  ఒకే  థీమ్ పై ఐదుగురు కవయిత్రుల కవితలని విశ్లేషణాత్మకంగా అందించబోతున్నాం.
ఒకే థీమ్ ని కొంతమంది కవిమిత్రులకి ఇచ్చి ఆ థీమ్ ఆధారంగా టైటిల్ ఎంచుకుని కవితలందించమన్నాం. మా విన్నపాన్ని మన్నించి ఆ ఐదుగురు కవయిత్రులు మేం అడిగిన తేదీకల్లా కవితలనందించి సాహితీస్ఫూర్తిని ప్రదర్శిస్తూ సాంప్రదాయేతర పోటీతత్వానికి తమవంతు సహాయాన్ని అందించారు.

ఈనెల థీమ్ "కవిత్వంలో ఏకాంతం"

కవితా శీర్షిక కవయిత్రి నిర్ణయానికే వదిలేసాం.

ఆ ఐదుగురు కవయిత్రులూ : సాయిపద్మ, కవితాచక్ర, వనజ తాతినేని, జయశ్రీ నాయుడు, పూర్ణిమా సిరి.

కవితలు రాసిచ్చారు బానే ఉంది.  ఆ తర్వాత ఏంటి?? వారి కవితలనీ, వాటిపై విశ్లేషణతో కూడిన సమీక్షనీ మనకందిస్తున్నారు శ్రీనివాస్ వాసుదేవ్. ఇక మరో వారంలొ మాలికపత్రిక మీముందుంటుంది.  మా రెగ్యులర్ కథలూ, సీరియల్స్ తో పాటూ ఈ శీర్షిక కోసం కూడా ఎదురుచూస్తుండొచ్చు మీరు.

శీర్షిక కోసమే వేసిన ప్రత్యేక చిత్రం Krishna Ashok నుండి..

Wednesday, 19 June 2013

నా దేవుడు చనిపోయిన రోజు




కోర్కెలు శూన్యం.. బతుకంతా దైన్యం


యవ్వనం తొలి ప్రాయంలోకి అడుగుపెట్టే ఓ 14 ఏళ్ల బాలిక నోటివెంట ‘నాకేం కోరికలు లేవు’ అనే మాటలు వస్తే ఎలా ఉంటుంది? ఎన్నో ఆశలు. ఆకాంక్షలతో, చెంగుచెంగున సీతాకోకచిలుకల్లా ఎగరాల్సిన ఆ వయసులో ఏ కోరికలూ లేవంటే చిన్న వయసులోనే ఇంతటి నిర్వేదమా? అని ఆశ్చర్యపోతాం. కానీ, ‘‘ది డే మై గాడ్ డైడ్’’ అనే డాక్యుమెంటరీ చిత్రం చూస్తే మనకు ఆశ్చర్యం కాదు- ఆక్రోశం, ఆవేదన ఉప్పెనలా వస్తుంది. దేశ ఆర్థిక రాజధానిగా ప్రసిద్ధిచెందిన ముంబై వేశ్యావాటికల్లో మగ్గుతున్న అభం శుభం తెలియని ఆడపిల్లల జీవితాలకు నిలువుటద్దంగా నిలిచే ఈ డాక్యుమెంటరీకి ఆండ్రూ లెనిన్ దర్శకత్వం వహించారు. ఇందులో 14 ఏళ్ల బాలిక అనుభవించిన నరకం ఎంత దారుణంగా ఉందో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఏడేళ్ల వయసులో బిస్కెట్ ఇస్తామని ఆశ చూపించి తీసుకెళ్లి వేశ్యావాటికలో అమ్మేసి, చీకటి గదుల్లో బంధించి విచక్షణ లేకుండా ఇనుపరాడ్లతో కొట్టి విటులకు ఆమెను అప్పగిస్తారు. ఫలితంగా గర్భం వస్తే అబార్షన్ చేయించి, రక్తం స్రావం తగ్గకుండానే మళ్లీ వృత్తిలోకి తోసేసి వారి వికృత కామానికి బలిచేస్తూ ఉంటే, ఇంకేం కోరికలు ఉంటాయి? ఇది ఒక అమ్మాయి కథ కాదు. ఇలాంటివి, ఇంతకంటే దారుణమైన కథల్ని వేశ్యావాటికల్లో అమ్మాయిలు వినిపిస్తారు.
ఆడపిల్ల ఇంటికి దీపం అంటాం. లక్ష్మీదేవికి ప్రతిరూపం అని అపురూపంగా చూసుకుంటాం. తల్లిదండ్రులు, తోబుట్టువుల ప్రేమలో సంతోషంగా పెరగాల్సిన కొంతమంది అమ్మాయల జీవితాలు చిందరవందర అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అమ్మాయిలు అదృశ్యమవుతున్నారు. వాళ్ల శరీరాలకు పాతిక నుంచి యాభైవేలకు వెలకట్టి వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు. నేపాల్‌తో పాటు మన దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పదిహేనేళ్లలోపు ఆడపిల్లలను మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ముంబైలోని కామాటిపురా వేశ్యావాటికల్లో అమ్మేస్తున్నారు. మన రాష్ట్రంలోని అనంతపురం లాంటి కరవు ప్రాంతాల నుంచి కూడా బాలికలను ఈ వేశ్యావాటికలకు తరలిస్తున్నారు.
వ్యభిచారం ఓ వ్యాపారం మాదిరి రష్యా, ఆసియా, యూరప్, ఆఫ్రికా, అమెరికాలోనూ జరుగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు యాభైవేల మంది అమ్మాయిలను అమెరికాకు తరలిస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది. ఒకసారి ఈ మురికి కూపాల్లో చేరినవాళ్లకు విముక్తి అనేది ఉండదు. వేశ్యావాటికల్లో మైనర్ బాలికలకు అబార్షన్లు చేయించడం సర్వసాధారణం. అది కూడా నకిలీ డాక్టర్లే చేస్తారు. ఆ తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నా విశ్రాంతి కూడా ఇవ్వకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తారు. వీళ్లకు రోజుకు ఒక్కపూట ఆహారం, వారానికోసారి మాత్రమే స్నానం చేసే వీలుంటుంది. శుభ్రతలేని పరిసరాలు, తగిన తిండి లేక అమ్మాయిల ఆరోగ్యాలు పాడవుతుంటాయి. రకరకాల ఇనె్ఫక్షన్లు, ఎయిడ్స్‌లాంటి రోగాలు కమ్ముకున్నా వైద్యం చేయించే నాథుడే ఉండడు. రక్షించే పోలీసులు కూడా భక్షించేవారే. మైనర్ బాలికలను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళతారు. విముక్తి లభిస్తుందని సంబరపడినంత సమయం కూడా ఉండదు. వ్యభిచార గృహ నిర్వాహకులు జరిమానా కట్టి వాళ్లను విడిపించుకుని వెళ్లాక మళ్లీ అవే కష్టాలు. ఖర్మకాలి పిల్లలు పుడితే వాళ్లు కూడా అక్కడే ఉండక తప్పదు. వేశ్యావాటికల్లో మగ్గే మహిళలు తమ జీవితాలు నాశనమైనా, తమ పిల్లలైనా మంచి జీవితం గడపాలని, చదువుకోవాలని కోరుకుంటున్నారు. తమ శత్రువులకు కూడా ఇలాంటి దుస్థితి రాకూడదని కోరుకుంటున్నారు. ఈ డాక్యుమెంటరీలో బాధిత అమ్మాయిలే స్వయంగా చెప్పినవి వింటుంటే ఎవరికైనా కోపం, ఆవేదన కలుగుతుంది. కాగా, తమ దేశం నుంచి అపహరించుకు పోయన ఆడపిల్లల కోసం అనురాధా కొయిరాలా నేపాల్‌లో ‘‘మైత్రీ’’ అనే శరణాలయాన్ని స్థాపించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. వేశ్యావాటికల నుండి తప్పించుకున్న ఆడపిల్లలకు వసతి కల్పించి వారికి ఓ దారిని చూపిస్తున్నారు. అలా బయటకొచ్చిన కొందరు అమ్మాయిలు తమ కుటుంబాలను తిరిగి కలుసుకున్నారు. కొందరు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఆ మురికికూపం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించి బందీలైన మరికొంతమంది అమ్మాయిలను పోలీసుల సాయంతో బయటకు తీసుకొచ్చారు. ఈ సామాజిక దురవస్థను సమూలంగా అంతం చేయడానికి, శాశ్వత పరిష్కారం కోసం ‘మైత్రీ’ శరణాలయం నిర్వాహకులు యథాశక్తిన ప్రయత్నిస్తున్నారు.

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008