Tuesday, 2 November 2010

ఇదేనా జీవితం? నవంబర్ 2010 కంప్యూటర్ ఎరా ఎడిటోరియల్

చిన్నప్పటినుండి మన లక్ష్యాలు చాలా చిన్నవి. చదువులో గొప్ప ర్యాంకులు, ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం, అర్ధం చేసుకునే లైఫ్ పార్ట్ నర్, పిల్లలు, సంసారం, సెలవుల్లో సినిమాలూ, సరదాలూ, మళ్లీ పిల్లల సెటిల్‌మెంట్, వారి పెళ్లిళ్లు, వృద్ధాప్యం, సాఫీగా సాగిపోతే చాలుననే భరోసా.... ఇవి ఉంటే చాలు జీవితం నెట్టుకురావడానికి! అంతకన్నా ఏ ఆలోచనా మనకు తట్టదు. ఇంచుమించు అందరి జీవితాలు అంతే... ఓ మూసలో సౌకర్యవంతంగా సాగిపోతూ ఉంటాయి. ప్రతీ క్షణం మనకు సామాజిక, ఆర్ధిక భద్రత ఉంటే చాలు. ఆ భద్రత సాధించడానికే మన జీవితం సృష్టించబడింది అన్నట్లు ఆ కొద్దిపాటి లక్ష్యాల కోసమే అమూల్యమైన జీవితాన్ని త్యాగం చేస్తుంటాం. చివరకు పిల్లలకూ అదే హితబోధ ... ఎంతో మందిని చూస్తుంటాను. అందరూ చెప్పేదొక్కటే.. ‘బాగా చదువుకో, బాగా సంపాదించు, లైఫ్‌లో సెటిల్ అవు '. అంతకన్నా జీవితం లేదా? ఒక మనిషి సాధించడానికీ, తనని తాను ఈ ప్రపంచంలో ఓ అద్భుతమైన శక్తిగా నిలబెట్టుకోవడానికి ఇంకేమీ ఉన్నతమైన లక్ష్యాలు లేవా? డబ్బూ, సామాజిక హోదా జీవిత పరమావధులు కావు. అవి మనకు సౌఖ్యాలు అందిస్తాయంతే. ప్రతీ మనిషిలోనూ నిగూఢంగా ఎన్నో శక్తియుక్తులు కేంద్రీకృతమై ఉంటాయి. ఎక్కడా ఎవరూ వాటిని తట్టిలేపడానికి ప్రయత్నించరు. స్టీరియోఫోనిక్‌గా జీవించమని ప్రబోధించేవారే గాని!

మనం గొప్పవాళ్ల పేర్లు చెప్పుకుంటూ ఉంటాం. వాళ్లు మాట్లాడిన మాటల్ని చిలకపలుకుల్లా వల్లె వేస్తుంటాం. వారంత గొప్పవారు ఎలా అయ్యారు? అసలు ఈ ప్రపంచంలో మన ఉనికిని నిలబెట్టుకోవడానికీ, 'యెస్.. నేను ఫలానా... నేను ఈ ప్రపంచానికి ది బెస్ట్ అందించగలుగుతున్నాను.. ఈ పనిని నేను తప్ప మరొకరు చెయ్యలేరు' అని ధీమాగా చెప్పుకోగలగడానికి మనకింకేమీ మార్గాలు లేవా? అస్సలు అందరితో పోల్చుకుంటూ, అందరికన్నా నాలుగు రాళ్లు ఎక్కువ సంపాదించడమో, కొద్దిగా ఎక్కువ పేరు తెచ్చుకోవడమో చేయగలిగితే చాలు అని సంతృప్తిపడగలుగుతున్నామంటే ఎంత అల్పసంతోషులమో అర్ధమవట్లేదూ? ఇంత చిన్న లక్ష్యాలకు ఇన్నేళ్ల జీవితం అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. ఆర్ధిక, సామాజిక భరోసాలను చూసుకుంటూ, ఆస్థిపాస్థులను లెక్కించుకుంటూ జీవితం వెళ్లదీయడానికి మనం పుట్టింది సౌకర్యాలు అమర్చుకోవడానికీ, సౌఖ్యాలు అనుభవించడానికీ కాదు! సౌకర్యాలు, సౌఖ్యాలు మనదైన ప్రపంచాన్ని సృష్టించుకునే క్రమంలో మనకు భారం తగ్గించేందుకే తప్ప అవే జీవితం కాదు. వాటిని దక్కించుకోవడంతోనే జీవితాన్ని సరిపుచ్చుతున్నామంటే ఈ ప్రపంచంలొ మన బ్రతుకు మనం బ్రతికేసి ఎందుకూ కొరగాని జీవితాన్ని గడిపేసి వెళుతున్నామన్నమాట. అంతకన్నా మనం చేయడానికి చాలా ఉంది ఈ ప్రపంచంలో! అదేంటో కొంత మనసు పెట్టి ఆలోచించగలిగితే స్ఫురిస్తుంది. సామాజిక భద్రతను కాపాడుకుంటూనే ఈ ప్రపంచంలో మన ప్రత్యేకతను నిలబెట్టుకోవచ్చు. అంతేగాని సామాజిక భద్రత సాధన కోసమే జీవితం ధారపోయాల్సిన పనిలేదు. విజ్ఞులైన కొద్దిమంది పెద్దలైనా ఈ ప్రపంచానికి భవిష్యత్ తరాలనుండి ఏం కావాలో ఆలోచించగలిగి, వారికి స్టీరియోఫోనిక్ జీవితాల బదులు, ఆదర్శవంతమైన జీవనవిధానాన్ని, సందేశాన్ని బోధించగలిగితే చాలు. ప్రతీ వ్యక్తిలోని అద్భుత శక్తియుక్తులు మనం కళ్లారా చూస్తాం. ప్రపంచానికి మేలు జరుగుతుంది.

మీ నల్లమోతు శ్రీధర్

Friday, 29 October 2010

హ్యాపీ బర్త్ డే నేస్తమా...







.వె! కష్టకాలమందు కడగళ్ళ వానలో
తడసి అలసి యున్న తరుణమందు
సేద దీర్చి, నాకు బోధను జేసిన
మాట మరువగలనె! మాన్య మూర్తి!

.వె! మంచి పంచి ఇచ్చు మనుజులు యెందరు?
మార్గదర్శి గాను మదిని నిలిచి
మంచి గంధమోలె పంచిన నెయ్యము
వీడదెపుడు తావి, వీసమయిన.

.వె! జన్మ దినము నేడు! సన్మంగళము నీకు!
జయము గలుగునెపుడు జగతి యందు,
ఆది దేవుడిచ్చు ఆయువు నిండుగ!
శుభము గలుగు నీకు నభయ మిదియె!

Tuesday, 26 October 2010

టంటంట టంటంట

ఒకరోజు భోజరాజు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా సభకు వచ్చాడు. సింహాసనం మీద కూర్చుని "టంటంట" అంటూ కూనిరాగం తీయసాగాడు. అలా కూనిరాగం తీస్తూనే సభకు వచ్చిన కవులను, మంత్రులను పలకరించాడు. ఈ వింత చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కాని ఇదేంటని అడగడానికి ధైర్యం చాలడంలేదు. మంత్రి సభను ప్రారంభించడానికి మహారాజు అనుమతి కోరి సభలోని కవులకు ఆనాటి సమస్యను ఇవ్వమన్నాడు.. దానికి కూడా రాజు ""టంటంట టంటం - టంటంట టంటః " " అన్నాడు. ఇది ఆఖరి పాదంగా తీసుకొని మిగిలిన మూడు పాదాలు చెప్పి శ్లోకాన్ని పూర్తి చేయమన్నాడు. అది విన్న కొందరు కవులకు కోపం వచ్చింది, కొందరికి ఆశ్చర్యమేసింది. మరికొందరు మహారాజుకు మతిపోయిందేమో అనుకున్నారు కూడ. కాని మహాకవి కాళిదాసు మాత్రం ఎటువంటి భావం చూపకుండా నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అప్పుడు మహారాజు " మహాకవీ! " "టంటంట టంటం - టంటంట టంటః " " ఇంద్ర వజ్ర వృత్తంలో పాదం ఇది. ఈ వృత్తం మీకు కొట్టినపిండి కదా కానివ్వండి మరి " అన్నాడు.

కాళిదాసు ఊరుకుంటాడా? కొద్ది క్షణాలు ఆలోచించుకుని ఇలా చెప్పాడు.

"రాజ్యాభిషేకే మద విహ్వలాయా:
హస్తాత్ చ్యుత: హేమ ఘట: యువత్యా!
సోపాన మార్గేషు కరోతి శబ్దం
"
టంటంట టంటం - టంటంట టంటః "

రాజుగారికి పరిచారికలు స్నానం చేయిస్తున్నారు. వారిలో ఒక పరిచారిక రాజుగారి అందాన్ని చూస్తూ మైమరచి తన చేతిలోని బంగారుగిన్నె జారవిడిచింది. ఆ గిన్నె స్నానఘట్టం మెట్ల మీదుగా దొర్లుతూ, రాజుగారు చెప్పినట్టు..."టంటంట.. టంటంట.. టంటంట.. టంటంట " అని మోత చేసింది .. అంతే..

ఎంతైనా మహాకవి . రాజుగారి మన:స్థితి తెలిసినవాడు కదా..

అసలు చందస్సు గుర్తుపెట్టుకోవడానికి ఇలా ఓ కూనిరాగం కొండగుర్తుగా పెట్టుకుంటే బావుంటుంది కదా. ఎలాగంటారా?? గుర్వులూ, లఘువులూ, గణాలు అంటూ కష్టపడి గుర్తుపెట్టుకునే బదులు హాయిగా టటట లేదా లలలా అంటూ పద్యపాదం గుర్తుపెట్టుకుంటే సరి.

ఉదా.. ఉత్పలమాల లో భరనభభరవ అని బట్టీయం పట్టేబదులు ఇలా ఐతే ఎలా ఉంటుంది చూడండి..

టాటట, టాటటా, టటట, టాటట, టాటట,టాటటా, టటా!
బూవులు గోట మీ టుతఱిఁ బోయెడు తేఁటుల మ్రోఁత కా మి శం

మరో విధానం చూద్దాం..
మత్తేభంలో సభరనమయవ అని గణాలు గుర్తుపెట్టుకునే బదులు ఇలా ప్రయత్నించి చూడండి.
లలలా లాలల లాలలా లలల లా లాలా లలాలాలలా
అరి చూ చున్ హరి చూచు సూ చకము లై అందంద మందార కే

మరి ఆలస్యమెందుకు? మీరు ఈ కొత్త ప్రయోగం మొదలెట్టండి..

Sunday, 17 October 2010

అమ్మలగన్నయమ్మ...


శ్రీలన్ భక్తులపాలు సేసి; మహదాశీర్వాదముల్ కొల్పి; నీ
మ్రోలన్ భక్తిగ వ్రాల జేసి; సుజనామోదంబుగా నుండగా
లీలన్ జేతువు భక్తులన్ కరుణతో లీలావతీ! నీ కృపన్
జాలన్ వర్ణన సేయగా ననుపమా! ఛాముండికా! శాంభవీ!



నవ దుర్గా మహనీయ భావముల నానందంబుగాఁ జూపగా
నవ మాసంబులు మ్రోయు తల్లివిగ నానా రూప సంపూజ్యగా;
ధవళాక్షీ వర సౌమ్య రూపవతిగా; దాక్షాయినీ! వెల్గెదే?
శివసన్మానస హారిణీ! మముల నాశీర్వాదమున్ దేల్చుమా!



కాల విచిత్ర చక్రమున కల్పనలెవ్వియొ? గమ్య మెద్దియో?
చాల మెఱుంగ మేము. నెఱ జాణవు నీవ! మహేశ్వరీ! కృపన్
జాలము సేయకమ్మ! వివశత్వులఁ గాంచుమ! కావుమా! మహా
భీల మదాది రుగ్మతల పీచ మడంచుమ. భక్త బాంధవీ!
జ్యోతిస్వరూపిణిగ; భీతాపహారిణిగ; నీతి ప్రదీపిని వనన్
నీ తీరు జూపగ గుణాతీతుడే పొగడ; భాతిన్ కవిత్వ మగుచున్
శ్వేతాశ్వధాటిగ ప్రభాతారు ణాద్భుత ప్రపూ తామృతాంశ మనగా
మాతా! జనింప గదె? నా తప్పులన్ మరచి; మాన్యత్వముం గొలుపగా!

దుర్గమ మైన నీ హృదయ దుర్గము నీశ్వరుడేలు గాదే! మా
దుర్గ వటంచు మ్రొక్కితిమి దుష్టత బాపి; గ్రహింప రాదొకో?
భర్గుఁడు భక్త బాంధవుఁడు. భార్గవి వీవు గణించి; మమ్ము నీ
వర్గమునందు చేర్చి; వర భక్తి ప్రపత్తుల గొల్వఁ జేయుమా!




పద్యరచన: చింతా రామకృష్ణ
పద్యగానం : సనత్ శ్రీపతి


Wednesday, 13 October 2010

పాటలపల్లకి

ఇవాళ ఒక ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను. మా ఇద్దరిది ఒకే కులం. అదేనండి ఇద్దరం హైదరాబాదు వాళ్ళం, ఇంకా వనితా కాలేజి విద్యార్థినులం అన్నమాట. కాని పరిచయం అయింది ఆరునెలల క్రింద మాత్రమే. తను దుర్గ. సరే తను ఏం చేస్తుంది అంటే. పూసలు మొదలైనవాటితో ఎన్నో రకాలైన నగలు చేస్తుంది కూడాను. ఆ నగలన్నీ ఇక్కడ చూడొచ్చు. ఒకవైపు భయంకరమైన వ్యాధి తనపై తరచూ దాడి చేసి హింసిస్తున్నా కూడా తట్టుకుని, ధైర్యంగా ఎదుర్కుంటూ, మధురమైన పాటలతో teluguone సైట్లో పాటల పల్లకి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఆ పాటల పల్లకి రెండో వార్షికోత్సవ సందర్భంగా చేసిన ప్రత్యేక కార్యక్రమం. ముందుగా తన గురించి తన మాటల్లోనే తెలుసుకుందాం..

పాటలపల్లకి, నా అనుభవాలు - దుర్గ

నేను పాటలపల్లకి గత 2 ఏళ్ళుగా టోరి వారికి చేస్తున్నాను. పాటలపల్లకి ప్రత్యేకత యెమిటంటే మనం అరుదుగా వినే పాటలు, పాత, కొత్త పాటలు మంచి సాహిత్యం, మంచి సంగీతం కలిగి వున్న పాటలను ఎన్నుకొని వాటికి నా వ్యాఖ్యానాన్ని జోడించి రాసి ప్రసారం చేస్తూ ప్రారంబించడం జరిగింది. తర్వతర్వాత మరి కొన్ని విషయాలు నాకు తెలియకుండానే చోటు చేసుకోవడం జరిగాయి. శ్రోతలు నాకు ఆత్మీయులయ్యారు, సో అందుకని వారితో అన్ని కబుర్లు, కాకరకాయలు, ముచ్చట్లు పెట్టడం అలవాటయ్యింది. కాని నాకు మొదటి వార్షికోత్సవం వరకు నా ప్రోగ్రాం ఎవరైనా వింటున్నారో లేదో, ఎవరికైనా నచ్చిందో లేదొ నాకు తెలియదు. శ్రోతలకిష్టమైన పాటలు పంపిస్తే నేను నా వ్యాఖ్యానాన్ని జోడించి మొదటి వార్షికోత్సవంలో ప్రసారం చేస్తానన్ని ప్రకటించడంతో నా అనుమానాలన్ని పటాపంచలు చేస్తూ ప్రపంచం నలుమూలలనుండి కేవలం పాటలు కోరడమే కాదు, పాటలపల్లకి వారి జీవితాల్లో ఎలా ముఖ్యమైన భాగమైపోయిందో ఎంతో మంది శ్రోతలు వారి అభిప్రాయాలు రాసి నన్ను వారి అభిమానంతో ఉక్కిరి బిక్కిరి చేసేసారు.
నా అనారోగ్యం వల్ల ఒకోసారి మానేద్దామా అని ప్రోగ్రాం చేయలేనప్పుడు ఆలోచన వచ్చినా మళ్ళీ నొప్పి తగ్గగానే ఎప్పుడెప్పుడు ప్రోగ్రాం చేద్దామా ఈసారి శ్రోతలతో ఏం కబుర్లు చెబుదామా అనే ఆతృత పెరిగేది.

2వ వార్షికోత్సవం ఒక ప్రఖ్యాత సినీ గేయ రచయిత ఇంటర్వ్యూ చేసి శ్రోతలను ఆశ్చర్యంలో ముంచేద్దామనుకున్న నా ప్రయత్నం ఫలించలేదు అందువల్ల మళ్ళీ అదే అయిడియాని వుపయోగించుకున్నా ఈ సారి కొంచం ప్రత్యేకంగా వుండాలని శ్రోతలను బాగా కదిలించిన, స్ఫుర్తిని కలిగించిన, ప్రేమ భావాలను మేల్కొలిపినా, ఒక్క మాటలో చెప్పాలంటే వారిని బాగా ప్రభావితం చేసిన పాటలను పంపించమన్నాను. మా నాన్నగారికి, మా నాన్నలాంటి నాన్నలందరికి అంకితం చేసిన కార్యక్రమం విని ఎంతో మంది సుమారుగా నేనెదుర్కున్న పరిస్థితులనే వారు ఎదుర్కున్నారని వారి అనుభవాలను నాతో పంచుకున్న శ్రోతలందరికి, అలా పంచుకుంటూ మంచి స్నేహితులుగా అయిన వారికి మన:స్ఫుర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాటలపల్లకి గురించి చెబితే సరిపోదు ప్రతి ఒక్కరూ వినాలి, విని ఎవరికివారే అనుభూతిని పొందాలి. టోరిలో ప్రసారమయ్యే పాటలపల్లకి దుర్గ కార్యక్రమం కాదు పాటని ఇష్టపడే ప్రతి ఒక్కరి సొత్తు పాటలపల్లకి!

మరి ఆ మధురమైన పాటలు విందామా..




Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008

Jump to TOP