Thursday 17 January 2013

ప్రవాహమే గంగా ప్రవాహమే ....




                        
మనం ఎన్నో పాటలు వింటున్నాం. కాని కొన్ని పాటలు బాగా నచ్చుతాయి. మరి కొన్ని ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. ఆ పాటల్లో ఉన్న శక్తి ఏమో కాని మనలో తీవ్రమైన స్పందనను కలిగిస్తాయి. వాటిని మన జీవితానికి అన్వయించుకుంటాం. సంతోషిస్తాం, బాధపడతాం, ఆలోచిస్తాం  దానికి కారణం ఆ పాటలోని సాహిత్యం, సంగీతం, గాన మాధుర్యం. ఏదైనా కావొచ్చు. అన్నీ కాలిసి కావొచ్చు. కాని ఈ పాటలు చూడకుండా వింటేనే బావుంటాయి. అలాంటి కొన్ని పాటలలో నాకు బాగా నచ్చిన పాట విరించినై, చాంగురే, తర్వాత "స్వరరాగ గంగా ప్రవాహమే" ఈ పాట విన్నప్పుడల్లా ఏదో తెలియని జలదరింపు, ఆవేశం నాలో కలుగుతుంది. నన్ను ఆకట్టుకున్నది సాహిత్యమా అంటే ఈ పాట అర్ధమే తెలీదు. జేసుదాస్ స్వరం, రవి సంగీతం ప్రభావం చూపించాయి అని అనుకుంటాను. పాటలోని సాహిత్యం యొక్క అర్ధాన్ని తెలుసుకుంటే బావుంటుంది అని రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నాను. ఇది తెలుగు, సంస్కృతంలో ఉండడం వల్ల ఎవరూ చెప్పలేకపోయారు. చివరికి సంస్కృత ఉపాధ్యాయులు, సినీ గేయ రచయితలను అడిగినా తెలీదన్నారు. లాభం లేదు ఈ అద్భుతమైన పాట రాసిన వేటూరిగారినే అడగక తప్పదు అనుకున్నా. ఆయనేమో కొంపలు మునిగిపోయినట్టు అమరలోకానికి వెళ్ళిపోయారు. నేను వెళ్ళడానికి  వీలుకాదు  ఇంకా సమయముంది. ఎలా? ఎలా? అనుకుంటుంటే నా తిప్పలు చూసిన ఆయనే తన అంతరంగాన్ని వెల్లడించిన ప్రతి నాకు పంపే ఏర్పాటు చేసారు... మరి ఈ పాట గురించి వేటూరి గారి మాటల్లోనే తెలుసుకుందాం.. ఎవరి రచనగురించి వాళ్లే సరియైన రీతిలో  వివరించగలరేమో? పదేళ్ల క్రింద హాసం పత్రికలో వచ్చిన వ్యాసం ఆధారంగా...

స్వర రాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే  
ప్రాప్తే వసంతే త్రికాలికే
పలికే కుహు గీతికా
గాన సరసీరుహమాలికా        !! స్వర రాగ !!

గమపని గమపని గమపని గమపని
మపనిస మపనిస మపనిస మపనిస
పనిసగ సగసని సనిపమ పమగమ గ

కొండల లోపల నిండిన నింగిలో
ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
పిల్లన గ్రోవిలో పిలవని మోవిలో
కురిసెను రాగం ఈనాటికి
మట్టింటి రాయే మాణిక్యమైపోయె
సంగీత రత్నాకరానా
స్వర సప్తకాలే కెరటాలు కాగా
ఆ గంగ పొంగింది లోన          !! స్వర రాగ !!

సని సని సగగస గసగస పమపమ
మగమగ పమపమ నిసనిప సనిసని

చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమవీధి
వినిపించు రాగాలనంతాలులే
ఈ చక్రవాకాలు ఎగిరే చక్కోరాలు
జగమంత విహరించు రాగాలులే
పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు
పులకింతలా పుష్యరాగాలులే
మలిసందె దీపాలు గుడిగంట నాదాలు
మౌనాక్షరీ గాన వేదాలులే     !! స్వర రాగ !!

ఒక చిత్రం కమర్షియల్‌గా హిట్ అయిందంటే అందులో పాటలు కూడా ప్రజల నోళ్ళల్లో పదికాలాల పాటు బ్రతికుంటాయని అందరికీ తెలిసిందే. కాని అందుకు భిన్నంగా సినిమా హిట్ కాకున్నా అందులోని పాటలు మాత్రం సూపర్ హిట్ ఐన సందర్భాలు ఉన్నాయి.   ఆ కోవకు చెందిన "సరిగమలు" సినిమాలో నేను రాసినటువంటి పాటలు కూడా చాలామంది పెద్దలు, సాహితీపరులు, సంగీత విద్వాంసులు అందరికీ కూడా ప్రియమైనాయి. అందులో ఒకటి "స్వరరాగ గంగా ప్రవాహమే" అనే పల్లవితో ప్రారంభమైన పాట యేసుదాస్ గారు పాడింది. ఈ చిత్రంలోని పాటలు ఇంత ప్రసిద్ధి పొందటానికి మూలకారకుడు మహా సంగీత విద్వాంసుడు, మా అందరికీ పూజనీయుడైనటువంటి రవి. ఆయన ఇచ్చిన ట్యూన్లలో ఉన్న శక్తే నాతో అటువంటి అద్భుతమైన పాటలు రాయించింది. ముఖ్యంగా ఈ పాట పాడేటప్పుడు జీవితంలో ఎదురుదెబ్బలు, ఏడుపుదెబ్బలు ఎన్నో తిన్నటువంటి హీరో క్యారెక్టర్ చాలా కాలంగా మూతపడిపోయిన తన గొంతు విప్పి తనవారి ముందు రాగ ప్రస్తారం చేసి తన హృదయంలో ఉన్నటువంటి ఆవేదనని, ఆక్రోశాన్ని, అనుబంధాన్ని కూడా కలిపి వెల్లడించేటువంటి సందర్భం. వసంతం వస్తే కాని చెట్లు చిగురించవు, కోయిల గళం విప్పి పాడలేదు. 


స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే
 మనసులోతులనుండి వస్తున్న స్వరరాగాలు గంగా ప్రవాహంలా  జీవుని అంగము (శరీరము), ఆత్మలనుసంధాన చేసేవిధంగా మహా ఉదృతితో వస్తున్నాయి. 

"ప్రాప్తే వసతేతి కాలే పలికే కుహు గీతిక గాన సరసీరుహ మాలిక"
వసంతకాలంలోనే గళం విప్పి మనసారా పాడే కోయిలలు కుహు గీతాలు, గానమనే పద్మాల మాలికను అందిస్తున్నాయి . కాకులేవో, కోకిలలేవో తెలిపేటువంటి సందర్భం వసంతకాల ప్రాదుర్భావమే అని మహాలాక్షణికులు చెప్తున్నారు.

కుండల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
శూన్యం అయినటువంటిది ఆకాశం అది సర్వవ్యాపి. ఈ శరీరాలు కూడా కుండలవంటివే. వేదాంతంలో మనకు ఆదిశంకరాచార్యులు ప్రవచించినటువంటి ఘటాకాశ సిద్ధాంతం ప్రకారం అన్ని శరీర్రాల్లోనూ ఎక్కడైతే వాక్యూం ఉందో అక్కడల్లా ఆకాశం ఉంది. ఆకాశం అంటేనే శూన్యం. ఆకాశం శూన్యం గగనం అంటారు కనుక ఈ కుండల లోపల నిండిన మేఘం ఇన్నాళ్లకి ఉరిమింది. ఈ శూన్యంలో ఒక నీటి మేఘం అది ఇన్నాళ్లకి ఉరిమింది. ఒక శబ్దం. ఒక నాదం ఇన్నాళ్లకి పుట్టింది. ఆకాశంలోంచి శబ్దం కానీ, వెలుగు కానీ పుడుతుంది. అదే విధంగా మేఘానికి రాగానికి ఉన్న సంబంధం సంగీత శాస్త్రం చెప్పింది. మేఘమల్హర్ రాగం మనకు తెలిసిందే. కనుక శూన్యం అయినటువంటి నాలో నిండిన ఆకాశంలోంచి ఓక మేఘం ఇన్నాళ్లకి గర్జించింది. అంటే నేను పాడగల్గుతున్నాను అని చెప్పడం.

పిల్లనగ్రోవిలో పిలవని మోవిలో కురిసెను రాగం ఈనాటికి.
పిల్లనగ్రోవి, మోవి కలిసినప్పుడే రాగం అనే దానికి ఆకృతి ఏర్పడుతుంది. ఇక్కడ పిల్లనగ్రోవి ఆ అమ్మాయి. అమ్మాయి కళ్ళలో ఓ చైతన్యం, ఒక రాగం, ఒక నాదం, ఒక స్పందన, ఓక నాట్యం, ఒక అభినయం తిరుగుతున్నాయి. ఇన్నాళ్ళూ పిలువలేదు ఈ మోవి. ఆ పిల్లనగ్రోవికి స్పర్శలేదు. ఈ పాటతో ఆ పిల్లనగ్రోవికి (పిల్లను పిల్లనగ్రోవితో పోల్చడం అక్షర రమ్యత కోసం ఉపయోగించింది) ఈ నాటికి ఈ పిల్లనగ్రోవిలో కూడా ఒక రాగం ఏర్పడ్డది అని చెప్పడం.

మట్టింటి రాయే మాణిక్యమై పోయే సంగీత రత్నాకరాన.
ఈ పొంగి పొరలుతున్నటువంటి అనంతమైన ఈ సంగీత రత్నాకరంలో మట్టిల్లే పుట్టిల్లుగా ఉన్నటువంటి రాయి కూడా మాణిక్యం అయిపోతుంది. ఈ సంగీత సముద్రంలో ఒక రాయి ఈ సంగీత పరమైనటువంటి కెరటాల యొక్క ఒరవడిలో ఒక రత్నమైపోతోంది. నిశ్చేతనమైన శరీరంలోంచి సచేతనమైన ఒక అభిసారిక, ఒక అభినేత్రి పుట్టుకొస్తుందని చెప్పడం.

స్వరసప్తకాలే కెరటాలుగా ఆ గంగ పొంగింది లోన
ఏడు స్వరాలు మనకి. ఈ ఏడు స్వరాలు సంగీత రత్నాకరంలో కెరటాలు అయినాయి. అయినప్పటికి ఆ రత్నాకరుని సప్తస్వరాలనే బాహువుల్లో  ప్రవేశించాలని గంగ ఉప్పొంగి పొరలి పొరలి ఆ సంగమం కోసం వస్తోంది అని చెప్పడం.

రెండో చరణం:
 చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమవీధి  వినిపించు రాగాలనంతాలులే 

చైత్రమాసం బహువర్ణ సముచ్చయం.  పూసే పువ్వులు, మెరిసే చిగురుటాకులు ఇవన్నీ కూడా గానకళకు ప్రాణదర్పణాలు. వాటిలో అనేకరకమైనటువంటి రంగులు. అవి చైతన్యానికి గుర్తు. అంతకు ముందు లేని రంగులు నిద్ర మేల్కొని ఒక వికాసానికి, ఎక్స్‌ప్రెషన్‌కి మోడులు చిగురించడం, ఆ చిగురించిన కొమ్మలో నుండి పువ్వులు పుట్టుకొని రావడం. సంగీతానికి వర్ణాలు ఉన్నవి. అవి ఆ వర్ణంపై ఉన్నప్పుడు ఆ దేవత, ఆ రంగు, ఆ దేవతను పూజించవలసిన పువ్వులు, అప్పుడు చదవవలసిన మంత్రం. అప్పుడు ఆచరించవలసినటువంటి క్రతువు. ఇవన్నీ కూడా స్ఫురింప చేసేదే మంత్రశాస్త్రం. కనుక ఈ మంత్ర శాస్త్రం కూడా వర్ణానికి ప్రాధాన్యత గలదే. వేదమంత్రం మనం చదివేటప్పుడు సవర్ణంగా చదవాలి అంటారు. సుస్వరంగా చదవాలి అంటారు. దానికొక శృతి ఉంది. వేదగానం, వేదం అనేది అనూచనంగా పరంపరగా తరతరాలుగా వసోంది. అది పుస్తకాల్లో నిధిగా ఉండి రావడంలేదు. గురువు శిష్యుడికి సుస్వరంగా చెబితే ఆ స్వరం ఆ శృతిలో ఈ శిష్యుడు నేర్చుకొని అది ఇతనిలో వర్ధిల్లి ఇతని జీవితకాలం చివరికి మరో శిష్యుని దగ్గరికి వెళ్లి పరంపరగా వస్తునటువంటిది కాబట్టి ఈ వర్ణాలు ఏవయితే రాగానికి ప్రేరేపణలో అవి అనంతమయినటువంటివి. సృష్టిలో ఎన్ని వర్ణాలు ఉన్నాయంటే మనం కొన్నింటికే పేర్లు పెట్టుకున్నాం. కొన్నింటికి పేర్లు పెట్టుకోలేదు. ఒకే వర్ణంగా కనిపించే దాంట్లో అనేక వివర్ణాలు ఉన్నాయి. లఘు వర్ణాలున్నాయి. వాటిని మనం షేడ్స్ అంటాం. కలర్స్ అంటే అవే.. అవి కలనేత చీరలో రెండు రంగులు కలుసుకుంటే పుట్టే మూడోరంగు ఎటువంటిదో అటువంటి వర్ణాలు అన్నమాట. అదే విధంగా మేళకర్తలలోంచి జన్యమైన రాగాలలో కూడా అనేక రాగాల యొక్క స్పర్శ కలిగి అవి ఇంకొక రాగంగా తయారవడం అనేది ఉంది. నాదానికి, శబ్దానికి మధ్య, రాగానికి, స్వరానికి మధ్య ఇంకొక రాగం... ఇది సప్త స్వరాలలో ఇమిడినదైనప్పటికీ కొత్త వికాసంతో రాగం పుట్టుకొస్తుంది. ఇలా రాగాలు అనంతాలు అని సంగీత రత్నాకరం చెబుతుంది. మన శక్తి కొద్ది, మన ఊహ కొద్ది మనకి ప్రాప్తమయ్యే వరకు రాగాలు పుడుతూనే ఉంటాయ్. అది మనం చేసేటువంటి రాగారాధన మీద, నాదోపాసన మీద ఆధారపడి ఉంటుంది. 

ఈ చక్రవాకాలు ఎగిరే చకోరాలు, జగమంత విహరించే నాదాలులే

అదేవిధంగా సృష్టిలో అన్వేషణ,  పరిశోధన చేస్తున్నకొద్దీ కొత్త కొత్త రంగులు, కొత్త కొత్త వికాసాలు, కొత్త కొత్త ఎరేంజ్‌మెంట్స్ ఎన్నెన్నో కనిపిస్తాయనేది మనకు తెలిసిన విషయమే. పక్షులను తీసుకుంటే రకరకాల పక్షులు సాయంత్రం గూళ్లకు చేరేటప్పుడు ఎన్నెన్ని శృతుల్లో జిలిబిలిగా ఎంత చక్కని స్వరధునిని మనకు వినిపిస్తాయో అందరికీ తెలిసిందే .

ఒక ఆంగ్ల మహాకవి బహుశా 'షెల్లీ' అనుకుంటాను. Art, thou a bird of a wandering voice! అన్నాడు. ఆ పక్షి కనిపించదు. కానీ దాని గానం వినిపిస్తూ ఉంటుంది. ఏ చెట్టు కొమ్మల్లో దాగి ఉంటుందో తెలియదు. ఆ ఎగిరే పక్షిలో ఉందో లేదో తెలియదు. ఎక్కడుంటుందో తెలియదు కానీ ఆది గానరూపమై, నాదరూపమై చెవిలోనుంచి హృదయానికి, హృదయం నుంచి ఆత్మకు వెళ్లిపోయి  అక్కడ గూడుకట్టుకుంటుంది.

ఈ చక్రవాకాలు ఎగిరే చకోరాలు జగమంత విహరించు  రాగాలులే

అటువంటి ఎన్నో పక్షులు, వర్షాకాలంలో చక్రవాకాలు, కార్తీకమాసంలో ఆశ్వయుజ మాసంలో చకోరాలు, అవి చేసే వింత వింత ఆలాపనలు, వసంతంలో కోకిలలు చేసే కుహుకుహు రావాలు, మేఘదర్శనంతో నెమళ్ళు చేసే కేంకరాలు, ఆయా వేళలకు.. ఆయా వేదాలని వినిపిస్తూ.. వింత వింత కోరికల్ని విన్నవించుకునేటటువంటి, ఎంతో అందమైనటువంటి, ఎన్నో స్వరాలతో కూడుకున్నటువంటివే. రాగమే పక్షి రూపంలో విహరిస్తూ ఉంటుంది. నువ్వు పక్షివా లేక ఒక గుప్పెడు రూపం పొందిన రాగానివా? రెక్కలు కట్టుకుని ఎగిరే రాగాలా అన్నట్టుగా ఉన్నటువంటి ఈ సృష్టిని గూర్చి చెప్పటం.

పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు,

ఒక పక్షి పిలుస్తుంటుంది. అది హొరైజన్‌లోకి వెళ్ళిపోయి ప్రతిద్వనిగా మారి మళ్ళీ వెనక్కి వచ్చి ఏదైతే ప్రశ్నగా వెళుతుందో అదే బదులుగా తిరిగి వస్తుంటుంది. 'యద్భావం తద్భవతి' అన్నట్తు ఏది ప్రశ్నో అదే బదులు. అట్లా శకుంత పక్షులు దిగంతాలలో గానం చేస్తుంటే, సంధ్యా రాగాలలో, కొండల్లోంచి, కోనల్లోంచి, లోయల్లోంచి వచ్చి మనకు ఎదలోయల్లో ప్రతిద్వని వినిపించడం అనేది జరుగుతుంది. తద్వారా కలిగే పులకింతలు అంటే జీవికి కలిగేటటువంటి జీవలక్షణమైన జలదరింపులు ... అంటే బతికున్నతనానికి, బతికున్నాం అనటానికి ఒక నిదర్శనంగా మిగిలేటటువంటి ఒక అనుభూతి.

పులకింతలా పుష్యరాగాలులే
ఇక్కడ పుష్యరాగం అంటే ఇక్కడ గోమేధికమో, పుష్యరాగమనే  రత్నమో, రాయో కాదు. పుష్యమాసంలో నిద్రాణమైనటువంటి  ప్రకృతి నుంచి ఒక వికాసం  ప్రారంభమవుతుంది. కప్పేసిన మంచులో నుంచి కన్ను తెరిచి చూసే ఒక వికాసం ఒక మొగ్గ రూపంలో, పువ్వు రూపంలో, పిందె రూపంలో, కాయ రూపాంలో, పండు రూపంలో, ధాన్యంలో కంకి రూపంలో నిద్రాణమైన స్థితి అన్నమాట. ఆ వచ్చేటటువంటి దాన్ని పుష్యరాగంగా పేర్కొన్నాను. అంటే ఆ పులకింతతో పుష్యరాగం మరొకదానికి, మరొక సృష్టికి పురుడు పోయటం జరుగుతుంది అని చెప్పటం ఇదొక మౌనరాగం!

 మలిసందె దీపాలు గుడిగంట నాదాలు  మౌనాక్షరీ గాన వేదాలులే   

మలిసంధ్యలో హొరైజన్‌లో వెలిగే దీపం అది మహామౌనం. వెలుగెప్పుడూ మౌనమే. వెలుగు కూడా వేదమే. వేదం వెలుగు కాబట్టి, వెలుగునిచ్చేది వేదం కాబట్టి, వెలుగు రూపంలోనే ఉంటుంది. అందుకనే దాని అక్షరరూపంలో రాయడం జరగలేదు. అదొక గానరూపంగా, నిరక్షరంగా, అనుభూతికి దొరకని ఒక అవ్యక్త మాధుర్యంతో వెలిబుచ్చాల్సిందే. మలిసంధ్య దీపాలు అంటే అసురసంధ్య వెలుగులు కావచ్చు. ఇక గుడిగంట నాదాలు... ఒక దేవలోకాన్ని, ఒక దివ్యానుభూతిని, ఏదో ఒక పుణ్యమైన పురుషార్ధ రూపమైన ఒక ఉత్తరస్థితిని ఆ గుడిగంటనాదం వినిపిస్తుంది. కానీ  ఆ ధ్వని మనలో కలిగించే మౌనం మాత్రం చాలా పెద్దది. ప్రకంపనం ఆగిపోయిన తర్వాత కూడా లోఫలికి వెళుతుండగా అది విడిచిన ముద్ర ఎక్కడికో తీసుకువెళ్తుంది. అంతటి శక్తి దీనికి  ఉంది. అదే మౌనాక్షరీ గానవేదాలులే.. గానం ఎప్పుడూ వినిపిస్తుంది అనుకోవటం కూడ పొరపాటు. గానం ఎప్పుడూ వినిపించదు. కొన్ని గానాలు ఊహాగానాలు అంటాం మనం. అవి వినిపిస్తాయా? వినిపించవు. అట్లాగే ఈ మౌనాక్షరీ గానం. అక్కడ అక్షరాలు ఉండవు ఏదో ఉంటుంది. అక్షరానికి, అక్షరానికి మధ్య శూన్యం అనగా ఆకాశం అందులో ఏదో ఉంటుంది. అందులో సూర్యుడు ఉండొచ్చు, చంద్రుడు ఉండొచ్చు, తారలుండొచ్చు. అది  ఏమైనా ఉండొచ్చు. అది ఉరమవచ్చు. మెరవనూ వచ్చు. అసలు గానం అంటే ఏమిటి? నాదం అంటే ఏమిటి? నాదం పుడుతుంది. అది మీలో మీకు మాత్రమే పరిమితం. తద్వారా దాని బాహ్యమైన ఎక్స్‌ప్రెషన్ మాత్రం గానం. అనంతమైన రాగాల రూపంలో ప్రస్తరించి బయటకు వచ్చేదే గానం. ధ్వని వేరు. శబ్దం వేరు. శబ్దం అంటే వాయిస్.

ఈ సరిగమల్లో రాసిన ప్రతి పాటకీ నా మనసులో గూడు కట్టుకున్న భావాలు.. అమృతోపమానమైనటువంటి సంగీత ప్రవాహంలో ఈ అక్షరాలుగా పూల పడవల్లే తేలిపోతూ మీ హృదయ తీరాలకు చేరాయి.

వేటూరి సుందరరామమూర్తి.







Saturday 12 January 2013

సంప్రదాయ ముగ్గులు - కినిగె ebook

సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 15 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి.

ఇక సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ, నెలరోజులు గజగజ వణికించే చలిని కూడా లెక్క చేయక స్త్రీలు తమ ఇంటిముందు కల్లాపి చల్లి రోజకో రకమైన ముగ్గు వేసి, రంగులు, గొబ్బెమ్మలు, పూలతో అలంకరిస్తారు. మరి అందరికి ముగ్గులు రావు కదా అంటారా?? కినిగె వారి సహకారంతో ఐతే నాకు వచ్చిన, తెలిసిన, తెలుసుకున్న ముగ్గులతో ఓ ముగ్గుల పుస్తకం తయారు చేసాను. ఇది eబుక్. ఈ పుస్తకం కొనుక్కుని కాని, అద్దెకు తీసుకుని కాని ప్రపంచంలో ఎక్కడున్నా మీ కంప్యూటర్ లోకి దింపుకుని ముగ్గులు నేర్చుకోండి.. మీకు ముగ్గులు వేసే ఆసక్తి లేదు అనుకుంటే మీవాళ్లకు, మీ ఇంట్లోవాళ్లకు, స్నేహితులకు బహుమతిగా కూడా ఇవ్వొచ్చు.. ఎలాగంటే ఈ లింకులో చూడండి..






సంప్రదాయ ముగ్గులు
సంప్రదాయ ముగ్గులు On Kinige

Monday 7 January 2013

మాలిక పత్రిక 2013 - మార్గశిర సంచిక విడుదల

మాలిక పత్రిక మార్గశిర సంచిక విడుదల చేయబడింది. ఇప్పటినుంఢి ఈ పత్రిక ఖచ్చితంగా రెండు నెలలకు ఒకసారి ప్రచురించబడుతుంది. ఇటీవల మాలిక పత్రిక తరఫున నిర్వహించబడిన అంతర్జాల అవధానం కార్యక్రమం విశేష ఆదరణ పొందింది. ముందు ముందు ఇటువంటి సాహితీ కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి మాలిక పత్రిక యోచిస్తూ ఉంది.  మీకేమైనా ఆళోచన ఉంటే మమ్మల్ని సంప్రదించగలరు.

మాలిక పత్రికకు మీ రచనలకు ఎల్లప్పుడు స్వాగతం. మీ రచనలను మాకు  పంపాల్సిన చిరునామా:
editor@maalika.org


ఈ సంచికలోని రచనలు:

0. సంపాదకీయం: మార్పు
1. మూడవ కన్ను ఒక అంతర్నేత్రం
2. కుబేరుడు
3. గోదాదేవి ఆవిర్భావ వైభవం
4. పదచంద్రిక
5. తెలుగు సినిమాల్లో జానపద కధలు
6. మానస సరోవరము మరియి కైలాస పర్వత యాత్ర
7. చాకలి తిప్పడు ” ( ఏకపాత్రాభినయం )
8. ఓ, ఓరీ, ఓయీ, ఓసీ— సంబోధనా ప్రథమా విభక్తి….
9. మంచి నడవడితో జీవించడం మనకు సాధ్యమేనా ?
10. ‘భరతముని భూలోక పర్యటన’….
11. బాలల కథా సాహిత్యంలో మానవతా విలువలు
12.దార్శనికుడు – కవి
13. ఇల్లెక్కడ?
14. శ్రీ లక్ష్మీ హృదయం
15. మహాభాగ్యం
16.బాకీ

Wednesday 2 January 2013

‘పుట్టింటి జోక్యం’ శ్రుతిమించితే అనర్థాలే!


  • -జ్యోతి వలబోజు
  • 02/01/2013

ఆలుమగల అనురాగానికి గుర్తుగా నవమాసాలు మోసి బిడ్డను కంటుంది స్ర్తి. పిల్లలు తను చెప్పినట్టుగా ఉండాలని అనుకుంటుంది ఆ తల్లి. ఆ మమకారం, ప్రేమ, స్వార్థం- పిల్లలు పెరిగి పెళ్ళిళ్ళు అయ్యాక కూడా తగ్గకుండా అలాగే ఉంటుంది ఆమెలో. కొడుకు పెళ్లయ్యాక తనను మరచిపోతాడేమో, పట్టించుకోడేమో అని కోడలిని అనుమానిస్తుంది, సాధిస్తుంది ఆ తల్లి. అలాగే, కూతురికి పెళ్లి అయ్యాక- తన బిడ్డను అత్తవారింట ఎలా చూసుకుంటున్నారో? అనే బెంగ, అనుమానం తల్లిని పీడిస్తాయ. పరాయ ఇల్లు కాబట్టి తన కూతురిని సరిగ్గా చూసుకోరు.. గౌరవించరు, ఇంటిపనంతా చేయిస్తారు. ఆస్తిపాస్తులు సమానంగా ఇవ్వరు అంటూ ఎన్నో ఆలోచనలు. కుమార్తె ఉంటున్న అత్తవారింట- అందరూ చాలా తెలివైనవారు, తన కూతురు మాత్రం చాలా అమాయకురాలు అని భావిస్తుంది. కూతురిని అనుక్షణం గమనిస్తూ, హెచ్చరిస్తూ ఉంటుంది. తల్లి ప్రేమలో మునిగిపోయిన అమ్మాయి కొత్త ఇంట్లో ఇమిడపోలేక పోతుంది. తల్లి చెప్పిందే సరైనదని, అత్తగారింట్లో ఎవరు ఏం చెప్పినా, చేసినా తప్పుగానే భావిస్తుంది. అత్తారింట్లో జరిగే అన్ని సంఘటనల్ని ఎప్పటికప్పుడు తల్లికి చేరవేస్తుంది. తన కూతురి తప్పు ఉందోలేదో తెలుసుకోకుండా ఆ తల్లి ఇంకా రెచ్చగొడుతుంది. ఈ గొడవలు ముదిరి ఆ కుటుంబంలో అల్లకల్లోలం సృష్టిస్తాయి. ఇలాంటి చిన్న చిన్న మనస్పర్థల వల్ల కోర్టు కేసులు తప్పడం లేదు.
అత్తవారింట తనకు మనశ్శాంతి లేదని, కట్నం కోసం సతాయిస్తున్నారని కొందరు కోడళ్లు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయ. కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలు ఎక్కడైనా ఉంటాయి. వాటిని గడప దాటకుండా పరిష్కరించుకోవడం ఇల్లాలి ధర్మం. అత్తవారింట వేధింపులు ఉన్నప్పుడు పుట్టింటివారినుంచి సహాయం తీసుకోవడం తప్పేమీ కాదు. ఐపిసి సెక్షన్ 498ఎ కింద నమోదవుతున్న కేసులలో ఎక్కువశాతం అ మ్మాయి పుట్టింటివారి జోక్యం వల్లనే అన్న వాదనలు లేకపోలేదు. కుమార్తె పెళ్లయ్యాక పుటింటివారి జోక్యం ఎంతవరకు ఉండాలి? అసలు ఉండాలా? వద్దా? అనే విషయమై కొంతమంది అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.




భరద్వాజ్ వెలకన్ని,
సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్, అమెరికా
ప్రస్తుత తరం అటు పురాతనమూ ఇటు ఆధునికమూ కాని భావజాలంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ సందిగ్ధత కొత్తగా పెళ్ళయిన జంటలలో ఎక్కువగా కనిపిస్తోంది. నూతన దంపతులకు పెద్దవారి మార్గదర్శనం చాలావరకూ అవసరమే. సంసారిక జీవనంలో ఇతరుల మతిమీరిన జోక్యంవల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువగా కలుగుతోంది. పుట్టింటిని వదిలి వేరే అలవాట్లు, జీవన విధానం ఎదురయ్యే అత్తవారింట అడుగుపెట్టే కూతురికి సరైన శిక్షణ ఇవ్వటం తల్లి బాధ్యతే. ఒకవేళ కూతురు దుర్భరమైన స్థితిలో ఉంటే ఆమెకి అండగా నిలబడటం ఆ తల్లి కర్తవ్యం. ఇంతవరకూ అయితే కూతుళ్ళ సంసారాలలో తల్లుల జోక్యం ఫరవాలేదు.
దాంపత్యంలో ఎదురయ్యే సమస్యల కారణంగా కొంతమంది ఆడపిల్లలు తమ తల్లులపై ఎక్కువగానే ఆధారపడుతున్నారు. దీనిని సాకుగా తీసుకుని ఆ తల్లులు తమ కూతుళ్ళ సంసారాలమీద పెత్తనం చెయ్యటానికి ప్రయత్నిస్తున్నారు. తమ కూతుళ్ళకి, వియ్యాలవారికి మధ్య విభేదాలు సృష్టించి తద్వారా తమ ఆధిపత్యం చాటుకోవాలనుకునే తల్లులు కూడా కోకొల్లలు. సజావుగా సాగాల్సిన సంసారాలకి అతిపెద్ద ఆటంకాలు వీరే. టూకీగా చెప్పాలంటే కూతురికి సరైన మార్గనిర్దేశం చేసే తల్లుల జోక్యం కొంతవరకూ అవసరమైనా ఎక్కువగా జోక్యం చేసుకోవటం భావ్యం కాదు.



నీలిమ,
గృహిణి, బెంగళూరు
అమ్మాయికి పెళ్లయ్యాక తల్లిజోక్యం ఉండటంలో తప్పేమీ లేదు. కొన్ని సందర్భాలలో అది అవసరం కూడా. మితిమీరిన చొరవ ఎప్పుడూ ప్రమాదమే. ఒక్కోసారి పెద్దల కారణంగా కాపురంలో గొడవలు పెరిగే అవకాశం ఉంటుంది. కూతురి తప్పు ఉంటే సరిదిద్దాలి. అలా కాకుండా- నీకేం తక్కువ? ఎందుకు మాటలు పడతావ్? నువ్వే అంత చాకిరీ ఎందుకు చేయాలి- అని అహం నూరిపోసి ఆడపిల్లల మనసును విషపూరితం చేసే వారూ ఉన్నారు. ఆవేశం క్షణికమే, కానీ భర్త తోడు జీవితాంతం ఉండేది. ఒకరు చెప్పినట్టు వినడం కంటే తన జీవితం గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. క్షణికమైన ఆవేశంలో భార్యాభర్తలు దూరమైతే నష్టపోయేది వాళ్ళ పిల్లలే. వారు కూడా ఎంతో మానసిక హింస అనుభవిస్తారు.
కూతురి పెళ్లయ్యాక కూడా తన మాటేవినాలి, అత్తవారింట తన కూతురి మాటే నెగ్గాలి. పెత్తనం చెలాయించాలి-అని తల్లి కోరుకోవడం చాలా దారుణం. అమ్మాయి కూడా తల్లిని ఎక్కువగా జోక్యం చేసుకోనివ్వకూడదు.


రామకృష్ణ పుక్కళ్ల
కార్టూనిస్ట్, వైజాగ్
పుట్టింటి సంప్రదాయాల్ని జీర్ణించుకుని గారాబంగా పెరిగిన అమ్మాయిలు, పెళ్లయ్యాక మెట్టినింటి సంప్రదాయాలతో సర్దుకుపోగలరో లేదో అనే ఆందోళన తల్లిదండ్రులలో కలగడం సహజం. కుమార్తెపై కొందరు తల్లులు అనవసరంగా ఆందోళన చెందడానికి అనేక కారణాలు ఉన్నాయ. పెళ్ళయ్యాక కూతురుని చూడకుండా ఉండలేమన్న మితిమీరిన మమకారం ఒకటైతే, మంచి ఉద్యోగంలో స్థిరపడి సంపాదించే కూతురి ఐదంకెల జీతం మరొకటిగా చెప్పవచ్చు.
మెట్టినింటిలో అడుగుపెట్టిన కొత్త పెళ్లికూతురుకి ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు తప్పనిసరవుతాయి. అత్త మనసుని, ఆ కుటుంబ సభ్యుల వ్యవహార శెలి, వారి అలవాట్లు అర్థం చేసుకుని తదనుగుణంగా నడుచుకోక తప్పదు. కూతురు అత్తారింటికి వెళ్లిపోయాక, ఆమె కాపురం ఎలా సాగుతున్నదో అన్న ఆతృతతో పదే పదే ఫోన్లు చేసి పలుకరించనిదే తల్లి మనసు కుదుటపడదు. కూతురి విషయంలో ఉన్నదానికీ లేనిదానికీ ఆందోళన పడకూడదు. పరోక్షంగా కూతురిలో- మెట్టినిల్లంటే ఏవగింపు కలిగించిన వారవుతాము.
తల్లి చేసే అతి గారాబం వలన కూతురి వైవాహిక జీవితం విడాకులు వరకూ దారిసిన సంఘటనలు కూడా ఉన్నాయి. భర్త ఉద్యోగ నిమిత్తమై విదేశాలకు వెళ్లినపుడు తనను బయటకు వెళ్లి చదవనీయలేదనే కోపంతో పుట్టింటికి వెళ్లిపోయింది ఓ అమ్మాయి. ఆమె తల్లి కూడా కూతురు అత్తారింట్లో చాలా కష్టాలు పడుతుందని నమ్మి కూతురినే సమర్థించింది, తనతోనే ఉంచుకుంది. తర్వాత ఆ కూతురు చదువుకుని మంచి జీతంతో ఉద్యోగం సంపాదించుకుని తల్లికి సహాయంగా ఉంది. ఆమె అల్లుడు వచ్చి తన భార్యను తీసికెళతానన్నా కూతురి జీతం మీద ఆశతో పంపకుండా అల్లుడినే ఇల్లరికం ఉండమని చెప్పింది. ఈ గొడవ పెద్దదై విడాకులకు దారి తీసింది. అబ్బాయి ఏడాదిలోపే మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. విడాకులు తీసుకుని ఆరేళ్లయినా ఆ అమ్మాయి ఒంటరిగానే ఉంది.
కూతురి కాపురంలో తల్లుల జోక్యం చేసుకుంటే అపుడపుడు అవి బెడిసికొట్టి అనర్థాలకు దారితీయవచ్చు. కూతురు ఓ ఇంటి ఇల్లాలిగా వెళ్లాక అక్కడ ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను తల్లిదండ్రులు భూతద్దంలో చూడకుండా, ఆడపిల్లలకు సర్దిచెప్పి సామరస్య వాతావరణం నెలకొల్పే ప్రయత్నాలు చేయాలి. కూతురు కాపురంలో విపత్కర పరిస్థితులు, జటిలమైన సమస్యలు, అనూహ్యమైన సంఘటనలు తలెత్తితే తప్ప, మామూలు సంఘటనలు జఠిగినప్పుడు తల్లిదండ్రులు అస్సలు తలదూర్చకూడదు.


సుమన్ సయానీ,
సైకాలజిస్ట్, గ్లోబల్ హాస్పిటల్స్, హైదరాబాద్
ఆడపిల్లలు పెళ్లయ్యాక తల్లిదండ్రుల నీడలో భద్రంగా ఉన్నట్టు భావించరాదు. పెళ్లి ఒక కొత్త బాధ్యతను మోసుకొస్తుంది. పెళ్లితో జీవితాంతం కలిసి ఉండే బంధాలు కూడా మొదలవుతాయి. ఇవన్నీ తను స్వంతంగా చేసుకోవాలి తప్ప కడదాగా అమ్మా నాన్నా అని అనకూడదు. చిన్న చిన్న విషయాలను తల్లిదండ్రులదగ్గరకు తీసుకువెళ్ళడం మంచిది కాదు. వీలైనంతవరకూ తన విచక్షణ, తెలివితేటలతో పరిష్కరించుకోవాలి. చాలా తీవ్రమైన సమస్యలను, తప్పనిసరి అనుకున్నప్పుడు మాత్రమే పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలి. తల్లిదండ్రులు కూడా ప్రతీ విషయంలో జోక్యం కలుగజేసుకుని అనవసరంగా కూతురి కాపురంలో సమస్యలు సృష్టించడం శ్రేయస్కరం కాదు. ఒక్కోసారి తమ ఇంటి సమస్యలను కన్నవాళ్ళతో చెప్పుకుని బాధపడడం కూడా మంచిది కాదేమో. అవి మరింత తీవ్రమై జటిలంగా మారే ప్రమాదం ఉంది. తల్లి అనవసర జోక్యం కారణంగా కూతురి కాపురంలో చాలా తీవ్రమైన సమస్యలు ఉత్పన్నమైన సంఘటనలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా తల్లి తన కూతురికి చిన్నపాటి కష్టమొచ్చినా తీవ్రంగా స్పందిస్తుంది. ఎటువంటి సమస్యలైనా మనం పరిష్కరించుకోలేమనిపించినప్పుడు పుట్టింటివాళ్ళకు, బంధువులకు చెప్పే బదులు ముఖ్యమైన స్నేహితులతో పంచుకోవడం చాలా మంచిది. బంధువులు అనవసరంగా ఉద్రేకపడి సరైన సమాధానం ఇవ్వలేకపోవచ్చు. కానీ స్నేహితులు సమస్యను అన్ని కోణాలనుండి పరిశీలించి, విశే్లషించి సరైన పరిష్కారం చూపిస్తారు.

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008