Thursday 30 September 2010

ఓం నమశ్శివాయ: .. నారాయణాయ:

"ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందు; పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం
బెవ్వ; డనాది మధ్యలయుడెవ్వడు; సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్".

దేవుడంటే ఒక అతీంద్రియ శక్తి. ఇది అందరికి తెలుసు. అలా అని ఆ దేవుడు మనతోనే ఉన్నాడు. మనస్ఫూర్తిగా నమ్మితే మనకు ఎప్పుడూ తోడుంటాడు అని ఎంతమంది నమ్ముతారు. కొందరు భయంతో దేవుడిని ప్రార్ధిస్తారు, కొందరు అవసరార్ధం, కొందరిది మూఢ నమ్మకమైతే కొందరిది ఆత్మ సమర్పణ . ఆ దేవుడి గురించి తెలుసుకోవడం అనేది ఒక అంతస్సంఘర్షణ . ఇందులో ఎంతమంది సఫలులవుతారు. ప్రయత్నం చేయడంలో నష్టమేమి లేదుగా.

దేవుడు అంటే కృష్ణుడు, రాముడు, శ్రీనివాసుడు, శివుడు, వినాయకుడు అని వేర్వేరుగా ఉండరు. ఆ రూపాలలో ఉన్నవారిని పూజిస్తే ఆ దేవుడే మనను కరుణిస్తాడు అని అంటారు. ఆ దేవదేవుని చూడాలంటే సర్వం త్యజించి హిమాలయాలకు, అడవులకు వెళ్లి తపస్సు చెయాల్సిన పనిలేదు. మన వ్యక్తిగత కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహిస్తూనే దేవుడిని అన్వేషించొచ్చు. మరి అతను ఎలా ఉంటాడు? అతని ఆశీర్వాదం ఎలా పొందాలి? ఎలా పూజించాలి? ఇలా ఎన్నో సందేహాలు. కాని నమ్మితే ఆ దేవుడు మనలోనే ఉన్నాడు. మనం చేసే మంచిపనులే అతనికి నీరాజనాలు, నైవేద్యాలు. అతడు మనం చేసే పాపపుణ్యాలు గమనిస్తూనే ఉంటాడు. అవసరమైనప్పుడు ఆదుకోవడానికి ఎవరినో ఒకరిని పంపిస్తాడు. అలాగే తప్పు చేస్తే, ద్రోహం చేస్తే శిక్షించేది కూడా ఆ పరమాత్మే.



ఆ పరమాత్మ మనను సృష్టించినా మనమెలా చెప్తే అలా చేస్తాడు. పసిపాపను చేసి జో అచ్చుతానంద అని జోలపాడినా చిరునవ్వులు చిందిస్తాడు. మనకు నచ్చినట్టుగా అలంకరించినా మురిసిపోతాడు. బంటు రీతి కొలువు ఈయవయ్యా అని వేడుకున్నా సరే అంటాడు. చివరికి ఎవడబ్బ సొమ్మని కులికేవు అని తిట్టినా కోపగించక కాపాడతాడు.


నా ఈ ఆలోచనలన్నీ పుస్తకాలు చదివితే వచ్చినవి కావు. ప్రత్యక్షంగా అనుభవించినవి, చూసినవి. దేవుడంటే గుడిలో కూర్చోబెట్టి పూజించ పనిలేదు. మనసులో నిలుపుకుంటే చాలు. మోహామాయలను విడనాడి పరమాత్మను శరణుజొచ్చితే అంతా శుభమే కలుగుతుంది. నిన్న అనుకోకుండా విన్న నాలుగు పాటలు నాచేత ఈ టపా రాయించాయి. ముఖ్యంగా చివరి రెండు పాటలు శివస్థుతులు. ఈ పాటల సాహిత్యం, సంగీతం, స్వరమాధుర్యం అద్భుతం అని చెప్పవచ్చు..



ఓం మహా ప్రాణదీపం శివం శివం
మహోంకార రూపం శివం శివం
మహా సూర్య చంద్రాగ్ని నేత్రం పవిత్రం
మహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రం
మహా కాంతి బీజం మహా దివ్య తేజం
భవాని సమేతం భజే మంజునాథం.


ఓమ్మ్ ఓమ్మ్మ..ఓమ్మ్మ్మమ్మ్
నమశ్శంకరాయాచ మయస్కరాయచ
నమశ్శివాయచ శివతరాయచ భవహరాయచ

మహా ప్రాణ దీపం శివం శివం
భజే మంజునాధం శివం శివం

అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం
త్రిదశ హృదయంగమం చతురుదధిసంగమం
పంచ భూతాత్మకం షట్చత్రునాశకం
సప్త స్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం
నవరస మనోహరం
దశ దిశాసువిమలం
ఏకాదశోజ్వలం ఏకనాధేశ్వరం
ప్రస్థుతి వశంకరం ప్రణథ జన కింకరం
దుర్జన భయంకరం సజ్జన శుభంకరం
ప్రాణిభవ తారకం ప్రకృతి విభ తారకం
భువన భవ్య భవ దాయకం భాగ్యత్మకం రక్షకం

ఈశం సురేశం రుషేశం పరేశం
నటేశం గౌరీశం గణేశం భూతేశం
మహ మధుర పంచాక్షరీ మంత్ర మాధ్యం మహా హర్ష
వర్ష ప్రవర్షం సుశీర్షం

ఓం నమో హరాయచ స్వర హరాయచ పుర హరాయచ
రుద్రాయచ భద్రాయచ ఇంద్రాయచ నిత్యాయచ నిర్ ణిద్రాయచ


మహా ప్రాణ దీపం శివం శివం
భజే మంజునాధం శివం శివం

డం డం డండం డ డం డడం డ్ఢంకా నినాద నవ తాండవాడంబరం
తద్ధిమి తకదిమ్మి ధిద్ధిమ్మి ధిమిధిమ్మి సంగీత
సాహిత్య సుమ కమల బంబరం
ఓంకార హ్రీంకార శ్రీంకార హ్రైంకార మంత్ర బీజాక్షరం మంజునాధేశ్వరం
రుగ్వేద మాధ్యం యజుర్వేద వేద్యం కామ ప్రదీపం అధర్మ
ప్రభాతం పురాణేతిహాస ప్రశస్తం విశుద్ధం
ప్రపంచైక సూత్రం విభుద్ధం సుహిద్ధం
న కారం మ కారం శికారం వకారం యకారం నిరాకార
సాకార సారం మహా కాల కాలం మహా నీలకంఠం
మహానంధ గంధం మహాట్టాట్టహాసం జఠాఝూట రంగైక గంగా
సుచిత్రం జ్వల రుద్ర నేత్రం సుమిత్రం సుగోత్రం
మహాకాశ భాసన్ మహా భానులింగం
మహాభర్తృవర్ణం సువర్ణం ప్రవర్ణం
సౌరాష్ట్ర సుందరం సోమనాధేశ్వరం
శ్రీశైల మందిరం శ్రీమల్లికార్జునం
ఉజ్జయినిపుర మహా కాళేశ్వరం
వైద్యనాధేశ్వరం మహా భీమేశ్వరం
అమర లింగేశ్వరం రామ లింగేశ్వరం
కాశి విశ్వేశ్వరం పరం ఘృశ్మేశ్వరం
త్రయంభకాదీశ్వరం నాగలింగేశ్వరం
శ్రీఈఈఈఈఈఈ కేదారలింగేశ్వరం
అనిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం
వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం
అఖిలలింగాత్మకం అగ్నిహోమాత్మకం
అనాదిం అమేయం అజేయం అచిత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం
ధర్మస్థల క్షేత్ర పర పరంజ్యోతిం
ధర్మస్థల క్షేత్ర పర పరంజ్యోతిం


ఓం.. నమ స్సోమాయచ సౌమ్యాయచ భవ్యాయచ భాగ్యాయచ
శాంతాయచ శౌర్యాయచ యోగాయచ భోగాయచ కాలాయచ
కాంతాయచ రమ్యాయచ గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ
శర్వాయచ సర్వాయ చ..

శ్రీమంజునాధ సినిమాలో శంకర్ మహాదేవన్ ఊపిరి బిగపట్టి పాడిన ఈ పాట విని ఒళ్లు పులకరించనిదెవ్వరికి . నరుడైనా ఆ నటేశ్వరుడైనా..

అలాంటిదే మరో పాట ఇపుడు వచ్చింది. ఖలేజా సినిమాలో రమేశ్, కారుణ్య పాడిన గీతం ఇది. దేవుడు లేడు. మానవుడే గొప్పవాడు సృష్టికి ప్రతిసృష్టి చేయగలడు. మరమనుషులు, క్లోనింగుల ద్వారా ఏదో సాధించాం అని మిడిసిపడుతుంటారు. నిజంగా మనిషి దేవుడి కంటే గొప్పవాడా??


ఓం నమో శివ రుద్రాయ ఓం నమో శితి కంఠాయ
ఓం నమో హర నాగాభరణాయ ప్రణవాయ
ఢమ ఢమ ఢమరుక నాదానందాయ
ఓం నమో నిఠలాక్షాయ ఓం నమో భస్మాంగాయా
ఓం నమో హిమశైలావరణాయ ప్రమథాయ
ధిమి ధిమి తాండవకేళీ లోలాయ

సదాశివా సన్యాసీ తాపసి కైలాసవాసీ..
నీ పాద ముద్రలు మోసీ పొంగిపోయినాదె పల్లె కాశీ..
హె!.. సూపుల సుక్కాని దారిగా చుక్కల తీవాసీ మీదిగా
సూడసక్కని సామి దిగినాడురా ఏసెయ్ రా ఊరూ వాడా దండోరా
ఏ రంగుల హంగుల పొడలేదురా
ఈడు జంగమ శంకర శివుడేనురా
నిప్పు గొంతున నీలపు మచ్చ సాచ్చిగా
నీ తాపం శాపం తీర్చేవాడేరా...
పైపైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీల
లోకాలనేలేటోడూ నీకు సాయం కాకపోడూ
ఏయ్ నీలోనే కొలువున్నోడూ నిన్ను దాటీ పోనేపోడూ

ఓం నమః శివ జై జై జై ఓం నమః శివ జై జై జై
ఓం నమః శివ grove to the trance and say జై జై జై
sing along sing శివ శంభో all the way
ఓం నమః శివ జై జై జై heal the world is all we pray
save our lives and take our pain away జై జై జై ..
sing along sing శివ శంభో all the way

సదాశివ సన్యాసీ తాపసి కైలాసవాసీ..
నీ పాద ముద్రలు మోసీ పొంగిపోయినాదె పల్లె కాశీ..

ఎక్కడ వీడుంటే నిండుగా అక్కడ నేలంతా పండగ
చుట్టు పక్కల చీకటి పెళ్ళగించగా
అడుగేశాడంటా కాచే దొరలాగా
మంచును మంటను ఒక్క తీరుగ
లెక్క సేయ్యనే సేయ్యని శంకరయ్యగా
ఉక్కు కంచెగా ఊపిరి నిలిపాడురా మనకండా దండా వీడే నికరంగా
సామీ అంటే హామీ తనై ఉంటాడురా చివరంటా..
లోకాలనేలేటోడూ నీకు సాయం కాకపోడూ
ఏయ్ నీలోనే కొలువున్నోడూ నిన్ను దాటీ పోనేపోడూ

ఓం నమః శివ జై జై జై ఓం నమః శివ జై జై జై
ఓం నమః శివ grove to the trance and say జై జై జై
sing along sing శివ శంభో all the way
ఓం నమః శివ జై జై జై heal the world is all we pray
save our lives and take our pain away జై జై జై ..
sing along sing శివ శంభో all the way
ఈ శంకరుడు ఎంతటి నిరాడంభరుడు. ఒళ్లంతా బూడిద పూసుకుంటాడు, మెడలో నాగులనే ఆభరణాలు ధరించి, ఢమరుకం చేతపట్టి హిమాలయాల్లో తిరుగుతుంటాడు. ఆ తాపసి, బైరాగి కాలి స్పర్శతో కాశీ పట్టణం పొంగిపోయింది. ఏ హంగు లేకుండా , గొంతున నిప్పుని ధరించి మచ్చ తెచ్చుకున్న జంగమదేవర వచ్చాడు. మంటను, మంచును ఒక్కటిగా చూసే ఆ శంకరయ్య అందరికీ అండా దండా అయ్యి కాపాడతాడు. లోకాలన్నింటిని ఏలే ఆ స్వామి ఎవ్వరిని దాటిపోలేడు. సాయం చేయకుండా ఉండడు అని . ఆ దేవదేవుడిపై ఎంత నమ్మకమో కదా. అదే అందరికి కావలసింది. చక్కని జనపదాలతో, అమాయకమైన పల్లెపదాలతో ఈ పాట అద్భుతంగా ఉంది అంటే కాదంటారా? నిజంగా ఈ రెండు పాటలు ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. తనివితీరడంలేదు. రాసిన రామజోగయ్యశాస్త్రి, సంగీతం అందించిన మణిశర్మలకు మనసారా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా.

Monday 27 September 2010

గుర్తుకొస్తున్నాయి....




ఎప్పుడూ గుర్తులేదు అంటాము కాని అందరికీ ఎన్నో సంగతులు గుర్తుంటాయి. అవి సంతోషమైనా, బాధ కలిగించేదైనా సరే... ఏవైనా ఎప్పటికి మన మనసు పొరల్లో దాగి ఉంటాయి. అప్పుడప్పుడు మనల్ని పలకరిస్తుంటాయి. ఆ జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుని ఆ సంఘటనల్లోకి వెళ్లిపోతాం. అలాంటి మరపురాని విషయాలెన్నో... ఎన్నెన్నో..

గుర్తొస్తున్నాయి అంటూ గతంలో ఎన్నో టపాలు రాసాను. వేసవి సెలవులకు సంబంధించినవైనా, చిన్నప్పటి ఆటలైనా, సైకిల్ నేర్చుకున్న విధం, అమ్మా నాన్నకు చేసిన పండగ ఐనా గుర్తుకు రాగానే బ్లాగులో నిక్షిప్తం చేసుకున్నాను. అలాగే పదో క్లాసు అనుభవాలు కూడా. దాని తర్వాత ఇంటర్ విషయాలు మరచిపోలేనివి..

పదవతరగతి వరకి అంతా జైలు జీవితమే. రోజూ స్కూలు డ్రెస్సు, నూనె రాసి బిగించి కట్టిన రెండు జడలు, హోం వర్క్, టెస్టులు, మార్కులు, పుస్తకాల మోతకోలు అన్నింటికి మించి పొద్దున్నే లెగడం తయారవడం, స్కూలుకు పరుగెత్తడం(అదేనండి రిక్షాలో). అందుకే ఇంటర్ కి రాగానే స్వేచ్చ దొరికినట్టుగా ఉండేది. ముఖ్యంగా రెండు జడలు, స్కూలు డ్రెస్, బరువైన పుస్తకల సంచీ అవసరం లేదనే సంతోషం. టెంత్ కాగానే కాలేజీలలో అప్లికేషన్ పెట్టడం చాలా కొత్తగా ఇంకా చెప్పాలంటే గొప్పగా ఉండేది. అంటే చదువులో మన లెవెల్ పెరిగిందన్న గర్వం అన్నమాట. ఇక ఏ గ్రూప్ తీసుకోవాలి అంటే నాకు లెక్కలు ఇష్టమే కాని ఆల్జీబ్రా అంటే హడల్. అందుకే B.P.C తీసుకున్నా. సికిందరాబాద్ St.Francis కాలేజీలో సీట్ దొరికింది. అది క్రిస్టియన్ అమ్మాయిల కాలేజీ ఐనా మా క్లాస్మేట్స్ కొందరు ఉన్నారు కాబట్టి బావుంటుంది అని చేరిపోయాను. ఈ విషయమై నాకు సలహాలు ఇచ్చేవారు ఎవరూ లేరు ఆ కాలంలో.. స్కూలులాగానే అక్కడా ఉదయం పది గంటలకు గేట్ బంద్. సాయంత్రం బెల్ కొట్టాకే గేట్ తెరిచేవారు. అంతవరకు జైలులో ఉన్నట్టే. చిన్నప్పటినుండి అలవాటైన జీవితం కాబట్టి మాకు తేడా తెలీలేదు.

ఒకటో రెండో పుస్తకలతో కాలేజీ ప్రస్థానం మొదలైంది. ఇంతకు ముందు సబ్జెక్టుకు ఒకే టీచర్ ఉంటే ఇపుడు ఇద్దరు ముగ్గురు. ప్రతి పీరియడ్ కాగానే క్లాసులు మారడం మాత్రం భలే ఉండేది. అప్పట్లో ఒక ప్రముఖ వ్యక్తి మాకు లెక్చరర్ గా ఉండేవారు అంటే ఇప్పటికీ సంతోషంగా ఉంటుంది. ఆవిడ చాలా అందంగా ఉండేవారు కూడా. అమ్మాయిలందరికీ ఆ లెక్చరర్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఆవిడ అప్పటి క్రికెట్ ప్లేయర్ శివరామక్రిష్ణన్ వదిన అని తెలిసి ఓహో అనుకున్నాం. కాని ఆవిడ ఎం.ఎస్.సుబ్బలక్ష్మి దత్తపుత్రిక గౌరిగారని తర్వాత తెలిసింది. ఇక క్రికెట్ గురించి నాకు తెలిసింది కూడా అప్పుడే. కొత్తబిచ్చగాడు పొద్దెరగడన్నట్టు ఇంట్లో ఉన్న బుల్లి రేడియో బ్యాగులో వేసుకొచ్చేదాన్ని. లాస్ట్ బెంచిలో కూర్చుని లెక్చరర్ రాకముందు,వెళ్లిపోయాక స్కోర్ వినడం.. అప్పుడు గవాస్కర్, విశ్వనాద్, శ్రీకాంత్, కిర్మాని ఫామ్ లో ఉండేవారు. ఇక కపిల్ అప్పుడే వచ్చాడు. అప్పుడు కపిల్ అంటే అమ్మాయిలందరికీ సూపర్ హీరో. నాకు మాత్రం గవాస్కర్ నచ్చేవాడు. పొట్టివాడైనా గట్టివాడే అన్నట్టు క్యాప్టెన్ ఇంకా బ్యాట్ పట్టుకున్నాడంటే పరుగుల వర్షం కురిపించేవాడు మరి.

ఇంటర్లో చెప్పుకోవలసింది ఏంటంటే ప్రాక్టికల్స్. స్కూలులో సైన్స్ ప్రాక్టికల్స్ అంటే ఏడాదికి రెండు మూడుసార్లు చూపించి ఉండవచ్చు. కాని ఇక్కడ బాటనీ, జూవాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఫిజిక్స్ ప్రాక్టికల్స్ అంతగా నచ్చలేదు. మిగతావి మాత్రం బాగా ఎంజాయ్ చేసాను. కెమిస్ట్రీ ల్యాబ్లో మనకంటూ ఒక టేబిల్ , కెమికల్స్ అన్నీ ఉండేవి. ఇందులో నాకు చాలా ఇష్టమైంది ఈక్వేషన్ గుర్తులేదు కాని లెక్చరర్ లేనప్పుడు కూడా చేసేదాన్ని. అందులో బంగారు దారాల్లాగా వచ్చేవి . ఇంకోటి నైట్రిక్ యాసిడ్ అనుకుంటా. అది వేళ్లకు గోరింటాకులా పెట్టుకునేదాన్ని. అలా పెట్టుకుంటే ఎర్రబడేది. తర్వాత ఆ తోలు కూడా ఊడిపోయేదనుకోండి. :) బాటనీ ప్రాక్టికల్స్ కూడా ఆసక్తిగా ఉండేవి. మాకు కాలేజి ప్రిన్సిపల్ ఈ సబ్జెక్ట్ చెప్పేవారు. ఏవో చెట్లు, పూలు అని తెలుసు కాని వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం భలే ఉండేది. ఇక ఏముంది కనపడ్డ చెట్టు కొమ్మలు ఒక పువ్వుతో పాటు కోసి పుస్తకంలో భద్రంగా పెట్టి , ఆ సిస్టర్ కి చూపించడం వాటి పేరు, వివరాలు తెలుసుకోవడం. ఇక ఫైనల్ ప్రాక్టికల్స్ అప్పుడైతే రికార్డ్ బుక్ కోసం తప్పనిసరై , వెతికి వెతికి లాభం లేదని పబ్లిక్ గార్డెన్ కి వెళ్లా.. అక్కడి తోటమాలిని కాస్త బ్రతిమాలితే సరే అని వెంట వచ్చి అక్కడ అడిగిన చేట్లు ,పూల కొమ్మలు కట్ చేసి ఇచ్చాడు. బోలేడు పూలు, కొమ్మలతో కాలేజీకి వెళితే మా ఫ్రెండ్స్ చుట్టుముట్టారు. నాకు ఇవ్వవా అని. మిగిలితే ఇస్తా అని అన్ని తీసికెళ్లి మా లెక్చరర్ ముందు పెట్టా. ఆవిడ తెగ నవ్వారు ఇన్ని ఎక్కడివి అని. అందులో సగం మాత్రమే మాకు పనికొచ్చేవిగా ఉన్నాయి. నాకు కావలసినవి ఉంచుకొని ముఖ్యమైన ఫ్రెండ్స్ కి మిగతావి ఇచ్చా.. ఇక వాటికి తగ్గట్టు రికార్డ్ బుక్ తయారు చేయడం కూడ పెద్ద పనే.. కాని నాకు మొదటినుండి ద్రాయింగ్ అంటే ఇష్టమే కాబట్టి పదికి ఎనిమిదికి తక్కువ కాకుండా మార్కులు వచ్చేవి.
ఇక మిగిలింది జూవాలజీ ప్రాక్టికల్స్. ఇవైతే భలే సరదాగా ఉండేది. బొద్దింకలు, వానపాములు, కప్పలు కోయాలిగా. అసలు ఇన్ని రోజులు బొమ్మలలో చూసి చదివి ఓహో ఇలా ఉంటాయన్నమాట అని అనుకునేవాళ్లం. ఇప్పుడు ప్రత్యక్షంగా చూడొచ్చు అనే ఉత్సుకత .. మొదటి క్లాసులొనే బొద్దింకను కట్ చేయాలి అనేవాళ్లు. అసలు ఈ ప్రాక్టికల్స్ క్లాసుకోసం ఒక డిసెక్షన్ బాక్స్. దాన్లో కత్తులు , కటార్లు.. ఓహో! అదో గొప్ప ఫీలింగులెండి.. :).. ఒకమ్మాయైతే కప్పను కట్ చేసే క్లాసులో డామ్మని పడిపోయింది. అంత నాజూకన్నమాట. మనం అలా కాదుగా(ఇంట్లో అమ్మ పక్కన ఉండి చికెన్ కట్ చేసే అలవాటు ఉంది) బానే చేసేదాన్ని. ఈ జూవాలజీ ఫైనల్ పరీక్షలో మాత్రం కొంచం సతాయించేది. ఏదో ఒక ఎముక ఇచ్చి దాని గురించి రాయమంటారు. బొమ్మలేయమంటారు. చచ్చే చావొచ్చేది. ఎలారా? దేవుడా?అనుకుని ఒక ఐడియా వేసా. లాబ్ అటెండర్ కి రెండు రూపాయలు ఇచ్చి ఒక కప్ప తీసుకున్నా. దానికి మత్తుమందు ఇప్పించి కవర్లో పెట్టుకుని ఇంటికి తెచ్చా. బస్ లో ఇంటికి వచ్చినంత సేపు గుండె దడగానే ఉండేది. ఆ రష్ లో ఎక్కడ అది ఎగిరిపడుతుందో అని.. నయం అది బుద్ధిగా బజ్జుంది. ఇంటికొచ్చాక ఆ కవర్ అలాగే పెట్టేసి తిని నిద్రపోయా. సాయంత్రం లేచి ఆ కప్పను నీళ్లలో వేస్తే ఏముంది? అప్పటికే అది స్వర్గస్థురాలైపోయింది. ఏం చేద్దాం అని ఆలోచించి .. చించి.. ముక్కలు చేసి ఎండబెట్టా. వారం రోజులయ్యాక వాటి ఎముకలను బాగా స్టడీ చేసి ఫలానా ఎముక ఇలా ఉంటుంది. ఆ కప్ప పుర్రె ఇలా ఉంటుంది అని కొండగుర్తులు పెట్టేసుకున్నా. అసలైతే ఈ పరీక్షలప్పుడు అంతా ఎత్తిపోతల పధకాలు, కోడింగ్ ప్రాసెస్సులే . ఒకే క్లాసులో చదువుతున్నప్పుడు ఆ మాత్రం ఒకరికొకరు సాయం చేసుకోకుంటే ఎలా??

ఇక ఇంటర్లో ఎక్కువ ఆటలు లేవు కాని ఇంగ్లీషు పుస్తకాలు పరిచయం అయ్యాయి. మరీ ఎక్కువ ఊహించుకోకండి. కామిక్స్ అన్నమాట. అమర్ చిత్ర కథ ఇంకా టింటిన్. అప్పుడైతే అమర్ చిత్ర కథ పుస్తకాలు రెండు రూపాయలకు ఒకటి అమ్మేవారు. అమ్మ బస్ కోసం ఇచ్చిన డబ్బులు మిగిల్చి ఈ కామిక్స్ కొనేదాన్ని. ఇక టింటిన్ పుస్తకాలు అక్కడే ఒక స్టేషనరీ షాప్ లో అద్దెకు తీసుకునేదాన్ని. చాలా మంది Enid Blyton పుస్తకాలు కొనేవారు. నాకేమో అంత పెద్ద పుస్తకాలు అర్ధమయ్యేవి కావు అనేకంటే చదవాలంటె బద్ధకం. అదే తెలుగు నవల ఐతేనా గంటలొ అవగొట్టేసేదాన్ని.

అప్పట్లో ఎంసెట్ అని అంతగా క్రేజ్ లేదు. ఎవరో కొద్దిమంది మాత్రమే గుంటూర్ వెళ్లి కోచింగ్ తీసుకునేవాళ్లు. మనకంత సీన్ లేదు. ఈ సైన్సు మనకు పడదు అని డిసైడ్ ఐపోయాను. అప్పుడు చెన్నారెడ్డి హయాం. మా నాన్నగారికి తెలిసిన ఆరోగ్యమంత్రి లక్షరూపాయలకు డాక్టర్ సీట్ ఇప్పిస్తానన్నాడంట. చత్! లక్షరూపాయలు పెట్టి సీటు కొనుక్కోవడమేంటి?! (అప్పుడు బంగారం పన్నెండొందలు మరి) అదే డబ్బు పెడితే మంచి వ్యాపారం చేసుకోవచ్చు. లేదా బ్యాంకులో వేసుకుంటే నెల నెలా వడ్డీ వస్తుంది అని వద్దన్నా. ( అబ్బో! ఆ కాలంలో ఎన్ని తెలివితేటలో కదా).. మావారు ఇప్పటికి వెక్కిరిస్తుంటారు. నువ్వు కాని డాక్టర్ అయ్యుంటే ఎంత మందిని బలవంతంగా మందులు మింగించి చంపేదానివో అని.. ప్చ్.. మా అబ్బాయేమో. మమ్మీ! ఇంట్లో అందరం ఇంజనీర్లమయ్యాం. నువ్వు తాత చెప్పినట్టు డాక్టర్ చదివి ఉంటే ఎంత బాగుండేది కదా అంటుంటాడు. అందుకే అన్నారు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అని. ఎవరూ మన టాలెంటును అర్ధం చేసుకోరూ?? (ఇక్కడ భానుప్రియను ఊహించుకోండి)


ఇప్పటికీ ఈ జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. మరపురాని అనుభూతులు కదా. సైన్శ్, లెక్కలు మనవల్ల కాదుగాని ఈజీగా ఉంటుందని బి.కాం లో చేరిపోయా వనితా కాలేజీలో.

Wednesday 22 September 2010

మనసును చదివే స్నేహితుడు




నేటి ఆధునిక లేదా అభివృద్ధి చెందిన సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం ఆర్ధిక సంబంధాలను మెరుగు పరిచింది. కాని మానవ సంబంధాలను దూరం చేసింది. దీనివలన రక్తసంబంధీకులు కూడా దూరమై పరిచయస్తుల్లా మారుతున్నారు. కాదంటారా?? ఈ బిజి బిజీ జీవితంలో ఎన్నో సందేహాలు, సమస్యలు, సందిగ్ధాలు. ఒక్కోసారి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు తల్లడిల్లి వాటికి కారణాలు తెలుసుకోకుండా పరిష్కారం వెతకకుండా మనమే పెద్దవిగా చేసుకుంటున్నాము. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలీక అయోమయంలొ పడిపోతాం. అటువంటప్పుడు మన బాధను, ఆవేదనను, సందేహాలను మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఒక తోడు కావాలనుకుంటాం. మన సమస్యను చర్చించుకోవడానికి లేదా దాని కారణం తెలుసుకోవడానికి ఆ స్నేహితుడు సాయపడతాడు. అటువంటి తోడు ఒక మంచి పుస్తకమైతే ఎలా ఉంటుంది. అలాంటి పుస్తకమే కొమ్మూరి రవికిరణ్ రచించిన " సౌందర్యం"

డా.కొమ్మూరి వేణుగోపాలరావుగారి కుమారుడు కొమ్మూరి రవికిరణ్ రాసిన ఈ నవల మన మనసును చదివే స్నేహితుడు అని అనవచ్చు. ఇది ఒక వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పే పుస్తకం కాదు. నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సంఘటనలు, సమస్యలకు మనకే తెలియని ఎన్నో సలహాలు, విశ్లేషణలు ఉన్నాయి. ఒక మధ్యతరగతి కుటుంబం, వారి చుట్టుపక్కల ఉండే మనుష్యుల మధ్య అల్లిన అందమైన కథ ఈ నవల . ఎవరికి వారు "నా" అనే స్వార్ధంతో బ్రతుకుతున్నారు. కుటుంబం అంటే తన భార్య,పిల్లలు మాత్రమే కాదు స్నేహితులు, బంధువులు కూడా మనవారే అని చాలా హృద్యంగా వివరించారు రచయిత. మనం ఎదుటివారినుంది ప్రేమాభిమానాలను ఆశీంచడంకంటే మనమే నిస్వార్ధంగా వాటిని అందించడంలో ఉన్న లాభం లెక్కకట్టలేనిది. ప్రతీ వ్యక్తికి అంతో ఇంతో సమస్యలు ఉంటాయి. అలా అని ప్రతీ దానికి కృంగిపోకుండా వాటికి పరిష్కారం కనుక్కుని అందరిని కలుపుకుంటూ సాగిపోవడమే జీవిత పరమార్ధం.

ఈ నవలలోని నాయకుడు మురళి. అతని ద్వారా మనకు ఎన్నో పాఠాలు చెప్పారు రచయిత. ఉద్యోగంలో తప్పని పోటీ, జీవితంలో ఇంక సాధించగలిగేది ఏముందని నిరాశపడ్డ స్నేహితుడికి కర్తవ్యం బోధిస్తాడు తనకోసం కాకుండా ఇతరులకోసం జీవించడంలో ఉన్న ఆనందం ఎలాంటిదో చెప్తాడు , నాకు ఎవరూ లేరు నేను ఒంటరివాడిని అన్న మేనమామకు "చుట్టూ అద్భుతమైన విశాలమైన జగత్తులో మనకంటూ ఎందరో ఉన్నారు.ఐనా ఎవరితో కలవక ఒంటరిగా ఉండేవాడు అత్యంత జాలిగొలిపే వ్యక్తి అని చురక పెడతాడు.. బంధువులు, స్నేహితులు , ఆప్యాయతలు, అనురాగాలు కనపడడంలేదు అని చెప్పే బదులు అవి మనమే అందరికి పంచిపెడితే నష్టమేమున్నది. ఇలా అందరినీ తన బంధువులుగా చేసుకుంటూ ప్రేమ,ఆప్యాయతలను పంచుతాడు మురళి. ఒక్క వ్యక్తిలొ ఇన్ని గొప్ప గుణాలా అని అనిపించవచ్చు. కాని ఆలోచిస్తే ఇవి గొప్ప లక్షణాలు కావు. అందరూ మరచిపోయిన, తెలుసుకోవలసిన జీవిత సత్యాలు. ఇవి తెలియకే ఈ నిరాశ, నిస్పృహలు, ద్వేషాలు. వీటి మూలంగా చాలా మంది ఎదుర్కునే ప్రధాన సమస్య "డిప్రెషన్" ఈ పదం తరచూ వినపడుతుంది. ఆ డిప్రెషన్ పోగొట్టుకోవడం మన చేతిలోనే ఉంది అని తెలియచెప్పే మంచి స్నేహితుడిని ఇంటికి తెచ్చుకోండి. ఇది తప్పకుండా మన వెంటే ఉండవలసిన పుస్తకం.

ఈ పుస్తకం కొని నాలుగు నెలలైనా దానిని ఇప్పటికి పది సార్లు చదివి ఉంటాను. నాకు కలిగే సందేహాలు, అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవాలని ఇంతకు ముందు వ్యక్తిత్వ వికాసం, మానసిక శాస్త్రం అని ఎన్నో పుస్తకాలు కొన్నాను. కాని ఈ పుస్తకం చదువుతుంటే ఒక నవల , ఒక కుటుంబ గాధ చదువుతున్నట్టుగా లేదు. ఒక సైకియాట్రిస్ట్ మన ఎదురుగా కూర్చుని మన మనసును చదివినట్టుగానే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తన మాటలతో వివరిస్తున్నట్టు ఉంటుంది.

Saturday 18 September 2010

ఇంట్లో పొట్లం , A Lip-smacking tuck




సమోసా అంటే తెలీని వారుండరు కదా. మరి సమోసా ఎలా చేస్తారు. బంగాళదుంప కూర తో లేదా కొన్ని కూరగాయలతో చేస్తారు. ఇది కాక మరిన్ని విభిన్నమైన సమోసాల గురించి ఈరోజు సాక్షిలో ప్రచురించబడ్డాయి. మరి మీరూ ట్రై చేయండి..



ఈ రోజే deccan chronicle పేపర్లో ప్రచురించబడిన మరో వంటకం మీకోసం..





మరో ప్రచురణ..

Tuesday 14 September 2010

వార్షికోత్సవ సంబరాలు


స్వాగతం.. సుస్వాగతం.. ముందుగా నన్ను, నా బ్లాగులను అభిమానించి, ఆదరిస్తున్న వీక్షకులందరికీ వందనం. అభివందనం..  సినిమా నిక్కుతూ నీల్గుతూ యాభై రోజులు నడిచినా, జయంతి, వర్ధంతికి వేడుకలు జరిపినా, ఓదార్పు యాత్రలు, రేట్లు పెరిగినా ధర్నాలు, నీళ్లు రాకున్నా బందులు  రోజూ న్యూస్ చానెళ్లలో ఏదో ఒక హంగామా, వేడుకలు గట్రా చూసి నాకో ఐడియా వచ్చింది. నేనెందుకు నా బ్లాగు వార్షికోత్సవ వేడుకలు కూడా జరుపుకోకూడదు. 4 ఇయర్స్ ఇన్ ది ఇండస్ట్రీ. ఎన్ని చూసాను?. అందుకే ఎవరేమనుకున్నా, ఎంత ఫీలైనా సరే ఈ సారి బ్లాగు వార్షికోత్సవాలు సింపుల్గా కాకుండా కాస్త భారీగా జరుపుకోవాలని నిర్ణయించేసుకున్నా. మీరు గమనించే ఉంటారు.

ఇక కార్యక్రమలోకి వస్తే.. కొంచం గతం చెప్పుకుందాం. కొత్తవాళ్లకి మ్యాటర్ తెలీదు, అర్ధంకాదుగా.. నాలుగేళ్ల క్రింద టైంపాస్ కోసం బ్లాగు మొదలెట్టి ఇదిగో ఇప్పుడిలా ఉన్నాను. నా బ్లాగు ప్రయాణం గురించి తెలుసుకోవాలంటే కింది లింకులు చదవండి.ముందే చెప్తున్నా తీరిగ్గా కూర్చోవాలి. బోలెడు ముచ్చట్లు చెప్పాలిగా.  ఇంత మంచి సంతోష సమయం కదా ఆ మాత్రం ఉత్సాహం ఉండదేంటి? స్టేజి ఎక్కాక మైకు ఎవరు వదుల్తారంట? ఇన్నేళ్లు నన్ను భరించారు. ఇప్పుడు భరించండి మరి. బోర్ కొడితే పాప్ కార్న్ తినడానికి వెళ్లిరండి.

ప్రధమ వార్షికోత్సవం
ద్వితీయ వార్షికోత్సవం
తృతీయ వార్షికోత్సవం

ఏదొ సరదాగా ఆటలు పాటలతొ టైం పాస్ చేద్దామనుకుంటే బ్లాగు మొదలెట్టించేసారు. అదేంటోగాని ముందునుండి నా మాటకు, రాతకు మోత ఎక్కువ. అందుకే నా బ్లాగు తొందరగానే పాకడం నుండి వేగంగా నడక మొదలుపెట్టింది . ఒంటరిగా ఉండలేక తోడుగా తన చుట్టూ మరికొన్ని బ్లాగులను తయారుచేసుకుని ఎంజాయ్ చేయసాగింది. నేనేం చేసేది మరి. టైం అలా గడిచిపొయింది. ఈ నాలుగేళ్ల ప్రయాణంలో నాకు అవసరమైనప్పుడల్లా  నో అనకుండా సహాయం చేసి, కొండొకచో నాకు సానపట్టిన మిత్రులందరికీ మన:పూర్వక ధన్యవాదాలు. అలాగే నిరంతరం నన్ను ప్రోత్సహించి, నేను చేసే పొరపాట్లను వేలెత్తి చూపి, సరిచేసుకునేట్టు చేస్తున్న ఆత్మీయ మిత్రులకు కృతజ్ఞతలు. స్నేహితులు లేని ఒంటరిదాన్ని అనుకున్న నాకు ఈనాడు ప్రపంచం మొత్తంలో స్నేహితులున్నారు. నన్ను అభిమానిస్తున్నారు అని తలుచుకుంటే  గర్వంగా ఉంటుంది. తెలిసి ఎప్పుడూ తప్పు చేయను. తెలియక చేసిన పొరపాట్లకు మన్నించండి. మీ అభిమానం నేను బ్లాగులు రాస్తున్నంతవరకు (ఎంతవరకో నాకే తెలీదు మరి) ఉండాలని కోరుకుంటున్నాను.

ఇక చివరిగా నా బ్లాగు ఆదాయవివరాలు చెప్పొద్దా. ఇది నా స్వార్జితమైన,అభిమానంతో నిండిన అమూల్యమైన ఆస్థి.

నేను రాసిన, రాస్తున్న బ్లాగులు - 12
ఇంతవరకు రాసిన టపాలు - 2100
బ్లాగు వీక్షకులు:

Jyothi - 80,660
జ్యోతి - 1,01,950
నైమిశారణ్యం - 40,102
ఆముక్తమాల్యద - 1,584
ఛైత్రరధం - 2,771
గీతలహరి - 13,261
బ్లాగ్ గురువు - 5,457
ఫొద్దు గడి - స్లిప్పుల సర్వీస్ - 5,368
షడ్రుచులు - 74, 310
shadruchulu /telugu - 2,04,811
shadruchulu/english 0 1,02,602

ఇంత అభిమానం చూపించినవారందరికి మరోసారి కృతజ్ఞతలు..

Saturday 11 September 2010

వినాయక చవితి, రంజాన్ శుభాకాంక్షలు


మొదటిసారిగా మేము మట్టి వినాయకుడిని తెచ్చాం. రంగులు ,హంగులు లేకున్నా చాలా బావున్నాడు. మరీ బోసిగా ఉంటే బాగోదని కాసింత అలంకారం చేసాను. మిత్రులందరికీ వినాయక చవితి శుబాకాంక్షలు.

శ్రీ గణనాధం భజామ్యహం
శ్రీకరం చింతితార్థ ఫలదం
శ్రీ గురు గుహాగ్రజం అగ్ర పూజ్యం̣
శ్రీ కంఠాత్మజం శ్రిత సామ్రాజ్యం

రంజిత నాటక రంగ తోషణం
సింజిత వర మణిమయ భూషణం
ఆంజనేయావతారం సుభాషణం
కుంజర ముఖం త్యాగరాజ పోషణం



ముస్లీము సోదర సోదరీమణులకు రంజాన్ పర్వదినాన ఈద్ ముబారక్. అల్లా అందరిని చల్లగా చూడాలి.

అదేంటోగాని ఈసారి ఇద్దరు దేవుళ్ళు ఒకేరోజు పండగ జరుపుకుంటున్నారు. అందరు కలిసిమెలిసి సంతోషంగా ఉండండి అని చెప్తున్నారు. కాని.. ఒకాయనేమో చంద్రుడిని చూడొద్దు అంటాడు. ఇంకోయానేమో చంద్రుడు వచ్చాకే పండగ అంటాడు. ప్చ్..

Wednesday 1 September 2010

అంతర్జాలంలో తెలుగు వెలుగులు

అంతర్జాలంలో తెలుగు విరివిగా వాడబడుతున్నది. బ్లాగులు, వెబ్ సైట్లు, పత్రికలు వగైరా మన తెలుగులోనే లభ్యమవుతున్నాయి. కాని ... ఇంకా చాలా మందికి కంప్యూటర్లో తెలుగు చాలా సులువుగా రాయొచ్చు అని తెలీదు. అది తెలియజేయడానికే ఈ వ్యాసం. సెప్టెంబర్ నెల చిత్ర మాసపత్రికలో ప్రచురించబడింది..





తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించినందుకు అందరం పొంగిపోయాము. కాని తెలుగుభాషకు సాంకేతిక హోదా కూడా లభించింది అని చెప్పవచ్చు. ఎందుకంటే సాంకేతికంగా అభివృద్ది చెందుతున్న ఈరోజుల్లో తెలుగుని కూడా సాంకేతికంగా వ్యాప్తి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.. ఈ దిక్కున కృషి మొదలైంది కూడా. స్కూలు పిల్లలకు కూడా కంప్యూటర్, ఇంటర్నెట్ లేదా అంతర్జాలం వాడకం తప్పనిసరి అయిన రోజులివి.


కాని వాటి వాడకానికి ఇంగ్లీషు మాత్రమే అవసరం అనే అపోహ ఉంది. కొన్నేళ్ల క్రితం వరకు ఈ మాట అక్షరాలా సత్యమే అని చెప్పవచ్చు. కాని ఔత్సాహికులైన తెలుగు భాషాభిమానులు ఈ మాట అబద్ధమని నిరూపించేసారు. . ఉద్యోగ, వ్యాపార రీత్యా తెలుగువారు ప్రపంచమంతటా విస్తరించి ఉన్నారు. వారందరిని కూడా అంతర్జాలంలోని తెలుగు విజ్ఞానం, పత్రికలు, బ్లాగులు ఒకచోట చేరుస్తున్నాయి. తమ భావాలు, ప్రతిభాపాఠవాలు మరికొందరితో పంచుకునేలా చేస్తున్నాయి. ఈ రోజు ఎటువంటి ఖర్చు , శ్రమ , ఉన్నత విద్య లేకుండా కంప్యూటర్లో చాలా సులువుగా తెలుగు చదవవచ్చు, రాయవచ్చు. కొద్దిపాటి ఆసక్తి, పట్టుదల ఉంటే కాగితం మీద రాసినంత సులువుగా కంప్యూటర్లో, ఇంటర్నెట్టులో (అంతర్జాలంలో) తెలుగులోనే పాటలు, పద్యాలు, కథలు, కవితలు ఏదైనా అలవోకగా రాసేయొచ్చు.

ఐనా ఇంటర్నెట్ లో తెలుగుకు సంబంధించిన సమాచారం ఏముంది అని పరిశీలిస్తే... అంతర్జాలంలో తెలుగు పద్యాలకు, పుస్తకాలకు, సినిమాలకు సంబంధించి ప్రత్యేకమైన వెబ్ సైట్లు ఉన్నాయి. సాహితీ సౌరభాలు వెదజల్లే వెబ్ పత్రికలు, రాయాలనుకునే ప్రతి వ్యక్తిని ఒక రచయితగా చేసే బ్లాగులు. ఇలా ఎన్నో ఉన్నాయి... అన్నట్టు మనం తెలుగులోనే ఉత్తరాలు కూడా రాసుకోవచ్చండోయ్.. నేటి తరానికి నిత్యావసరమైన కంప్యూటర్ మరియు అంతర్జాలంలో తెలుగు వాడకం కూడా గణనీయంగా పెరిగిందనే చెప్పవచ్చు. అసలు కంప్యూటర్లో తెలుగు చదవడం, రాయడం సాధ్యమేనా? మాకు అంత మంచి ఇంగ్లీషు రాదు అంటారా?? ఈ విషయాలు తెలుసుకుంటే ఈ అభిప్రాయం తప్పని మీరే అంటారు..


ముందుగా మనం అంతర్జాలంలోనే ఎటువంటి డౌన్లోడ్ చేసుకునే అవసరం లేకుండా సులువుగా తెలుగులో రాయగలిగే పద్ధతులు ఎన్ని ఉన్నాయో చూద్ధామా??

1. లేఖిని (http://lekhini.org/ )

ఇందులో మీరు పైన బాక్స్ లో తెలుగుని ఇంగ్లీషులో టైప్ చేస్తుంటే క్రింద పెట్టెలో తెలుగులోకి మారిపోయి ఉంటుంది. అది కాపీ చేసుకుని మనకు కావలసిన చోట సేవ్ చేసుకోవచ్చు

2. గూగుల్ ఇండిక్ లిప్యంతరీకరణ (http://google.com/transliterate/indic/telugu )
ఇందులో మీరు ఇంగ్లీషులో టైప్ చేస్తుండగానే తెలుగులోకి మారిపోతుంది. కాపీ పేస్ట్ చేసుకోవచ్చు లేదా ఈ సాఫ్ట్ వేర్ డౌన్లోడ్ చేసుకుంటే నెట్ కనెక్షన్ లేకున్నా మీరు తెలుగులో వ్యాసాలు రాసుకోవచ్చు.

3. క్విల్ పాడ్ (http://quillpad.com/home.html )
ఇక్కడ కూడా మీరు ఇంగ్లీషులో టైప్ చేస్తుంటే తెలుగులోకి మారిపోతుంది.

4. యంత్రం ( http://type.yanthram.com/te )

ఈ ఉపకరణాలన్నీ కూడా అంతర్జాల సంధానం ఉన్నప్పుడే పనిచేస్తాయి. ఇందులో ఇంగ్లీషులో రాస్తుంటే అవే తెలుగులోకి మారిపోతాయి. ఇలా రాసుకున్నదాన్ని కాపీ చేసుకుని మనకు అవసరమైన చోట పేస్ట్ చేసుకుని సేవ్ చేయాలి. కంప్యూటర్లో కొత్తగా తెలుగు రాయడం మొదలుపెట్టినవారికి ఇవి చాలా ఉపయోగకరమైనవి, సులభమైనవి కూడా.

ఇంటర్నెట్ కనెక్ట్ కాకున్నా కూడా తెలుగులో రాసుకోవచ్చు. దీనికోసం బరహా అనే సాఫ్ట్ వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ సాఫ్ట్ వేర్ మన సిస్టమ్ లో ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత చాలా సులువుగా తెలుగులో రాసుకోవచ్చు. మనం ఇంగ్లీషులో టైప్ చేస్తుంటే అది తెలుగులోకి మారిపోతుంది. ఉదా.. namaskaaram - నమస్కారం.. raama – రామ, seeta – సీత.. ..

కంప్యూటర్లో తెలుగు, బ్లాగులకు సంబందించిన ట్యుటోరియల్స్ కోసం...
బ్లాగ్ గురువు (http://telugublogtutorial.blogspot.com )

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008