Monday 30 August 2010

మనుషుల్ని కాదు.. మనసుల్ని గెలుద్దాం.. సెప్టెంబర్ 2010 కంప్యూటర్ ఎరా సంపాదకీయం

ఎంతో ఆత్మీయంగా ఉండే ఇద్దరు మిత్రుల మధ్య ఏ పనుల వత్తిడో, చిన్నపాటి అభిప్రాయబేధమో తలెత్తితే అది క్రమేపీ పూడ్చలేనంత అగాధమవడానికి ఏతావాతా ఎన్నో కారణాలుండొచ్చు. కానీ అన్నింటి కన్నా పెద్ద కారణం మాత్రం అపసవ్యమైన వారిద్దరి ఆలోచనాధోరణే! ఈ ప్రపంచంలో ఒక మనిషి మనకు దగ్గరవ్వాలంటే ఎన్నో మనస్తత్వ విశ్లేషణలు, నిజనిర్థారణలూ అవసరం అవుతున్నాయి. అదే కొద్దిగా తేడా వస్తే చాలు.. ఎలాంటి సంజాయిషీలూ, క్షమించడాలూ లేకుండా క్షణకాలంలో వారికి దూరమైపోతున్నాం. ఓ మనస్పర్థ వస్తే చాలు.. తప్పయినా ఒప్పయినా మనం అనుసరించే పద్ధతే కరెక్ట్‌ అని ఫిక్స్‌ అయిపోతున్నాం. అందుకే మనసుల మధ్య ఏర్పడే అగాధాన్ని పూడ్చుకోవాల్సింది పోయి మొండిపట్టుదలతో బింకంగా హఠమేస్తున్నాం.. ‘మనకేం అవసరం.. వస్తే వాళ్లే వస్తారులే’ అన్న అహం కమ్ముకుపోతుంది. అంతా సక్రమంగా ఉన్నప్పుడు ఆ ఇద్దరూ ఒకరికొకరు ఎంతో సాయం చేసుకుని ఉంటారు. ఓ చిన్న అపార్థం బుర్రని తొలవడం మొదలు.. ‘వాళ్లు మనకు చేసిందానికన్నా మనం వాళ్లకు ఎంతో సాయం చేశామని.. మనం లేనిదే వాళ్లకు జరుగుబాటు కాదని’ గత జ్ఞాపకాలను ప్రేమతో మానేసి ద్వేషంతో గుర్తుకుతెచ్చుకుంటాం. గతంలో అవతలి వారి చిరునవ్వులకు పులకించిపోయిన మనసు కాస్తా ద్వేషంతో ఆ జ్ఞాపకాలు గుర్తుకువచ్చినప్పుడు ఆ నవ్వులనే గుర్తు చేసుకుని మరీ చిటపటలాడుతుంది.


హ్యూమన్‌ సైకాలజీ, బాడీ లాంగ్వేజ్‌లు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తో మనుషుల మనసుల్ని త్వరగా గెలవగలిగే మెళుకువలు అలవర్చుకుంటున్నాం. కానీ అందులో ఎక్కడా చిక్కదనం లేదు. ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో రిసెప్షనిస్ట్‌ నవ్వుకీ మన నవ్వుకీ తేడానే లేదు. రెండు నవ్వులూ అరక్షణమే విచ్చుకుంటాయి. అంతలోనే మూసుకుపోతాయి. కృత్రిమ హావభావాలతో కూడిన అచ్ఛమైన ప్రొఫెషలిజం! ఇంత సులభంగా మనుషులకు దగ్గరవగలిగే మనం, ఇంత సులభంగా మనల్ని మనం మార్కెట్‌ చేసుకోగలిగే మనం.. గాఢమైన అనుబంధాలను ఎందుకు పెనవేసుకోలేకపోతున్నాం? అందమైన చిరునవ్వులు, పొందికైన మాటలూ, ముచ్చటగొలిపే ముఖకవళికలు, ఆకర్షణీయమైన ఆహార్యం.. అన్నీ స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకుని మరీ నేర్చుకుంటున్నాం. ఎందరినో పరిచయం చేసుకుంటున్నాం, సాన్నిహిత్యం పెంచుకుంటున్నాం, అనుబంధపు మాయమాటలతో ఒకరినొకరు మోసపుచ్చుకుంటూ అవసరాలు తీర్చుకుంటున్నాం.. రైలు ప్రయాణంలో స్టేషన్‌ వస్తే దిగిపోయే ప్రయాణీకుల్లా అంతే అవలీలగా తప్పుకుపోతున్నాం. మరో రైలు, మరో మజిలీ, మరికొన్ని స్నేహాలూ.. జీవితం సాగిపోతూనే ఉంటుంది. కొత్త మనుషులు కలుస్తూనే ఉంటారు. అవసరాలు తీర్చేసుకుని ఏదో ఒక సాకుతో ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుని దూరమవుతూనే ఉంటారు. స్నేహంలో అవసరాలు ఒక భాగం మాత్రమే.. అవసరాలు తీర్చుకోవడానికే స్నేహం ముసుగు వేసుకోవలసి వస్తే ఆ అవసరాలు తీరగానే ఆ స్నేహానికి నూకలు చెల్లినట్లే! అందుకే మనుషుల్ని ప్రేమిద్దాం, అభిమానిద్దాం, సహకరించుకుందాం.. అంతే తప్ప మనుషుల్ని జీవితంలో పైకెదగడానికి పావులుగా వాడుకునే నైపుణ్యతలు ఎన్ని అలవర్చుకున్నా మనసులో స్వచ్ఛత లేనప్పుడు ఆ అనుబంధాలకు బలమెక్కడ?

మీ
నల్లమోతు శ్రీధర్

Saturday 28 August 2010

e బంధం



చదువులు, ఉద్యోగం కోసం ఉన్నవాళ్లని వదులుకుని విదేశాల్లో ఉన్న కొందరు మిత్రులతో మాట్లాడిన తర్వాత కలిగిన బాధ..  మాకేంటి సంతోషంగా ఉన్నాం అనుకున్నా అందరి మనసుల్లో ఏదో తెలియని దిగులు, ఒంటరితనం..


ఆ వ్యక్తిని చూడగానే పెదవులపై చిరునవ్వు
కళ్లల్లో, మనసులో కనిపించే సంతోషం
బావున్నారా అని మనసారా పలకరింపు
కరచాలనం, ఆలింగనంతో గట్టిపడే అనుబంధం

ఇది ఆనాటి మాటా? ఈనాటి మాటా?
లేక కలల్లో, కళ్లలో దాగిన అందమైన ఊహా?
మనుష్యులు దూరమైనా, సాంకేతికంగా దగ్గరయ్యామని
అందరూ మురిసిపోతున్న ఈ జీవితం ఒక e జీవితం..

వేలమైళ్ల దూరాన ఉన్నా
కనురెప్పపాటులో వినిపిస్తున్న సెల్ ఫోన్లు
వెబ్ కెమెరాద్వారా చూపిస్తున్న కంప్యూటర్లు
మాటలను, రూపాలను సునాయాసంగా
చేరవేస్తున్నా ఏదో తెలియని లోటు, దిగులు

మాటలను మోసుకెళ్లే మొబైల్
మనసును చేరవేసే మెయిల్
ఒక్క మౌస్ క్లిక్కుతో ప్రపంచాన్ని
మన ముంగిట జేర్చే ఇంటర్నెట్

 స్నేహితులతో బలాదూర్‌గా తిరిగిన స్మృతులు
అక్క, తమ్ముడు, చెల్లి కూర్చుని చెప్పుకున్న కబుర్లు
పిల్లల అల్లరి కేరింతలు, పెద్దల ఆజమాయిషీలు
వీటన్నింటిని అచ్చంగా అలాగే మోసుకెళ్లగలదా?

తమని తాము ఆధునికంగా మార్చుకున్నామని
తమ చుట్టూ ఒక అదృశ్య వలయాన్ని ఏర్పరచుకుని
చిరునవ్వులను, ఆప్యాయతాలింగనాలను, పరామర్షలను
సన్నిహితులతో ముచ్చట్లు, పోట్లాటలు , కలయికలు
అన్నీ మరచి.. అందరూ ఉన్నారనుకుని ఏకాకిగా మారుతున్నారా??

Wednesday 25 August 2010

గుత్తివంకాయ కూరోయ్




తెలుగువారందరికీ ప్రియమైన శాకము వంకాయ. లేతగా నవనవలాడే వంకాయలతో రకరకాల వంటకాలు చేయడం మనవారి ప్రత్యేకత. అసలు ఈ వంకాయ తినడానికే కాదు ప్రేమ వ్యక్తపరచడానికి కూడా పనికొస్తుందంటారు.
'గుత్తొంకాయ కూరోయ్ బావా
కోరి వండినానోయ్ బావా
కూర లోపల నా వలపంతా
కూరిపెట్టినానోయ్ బావా!
కోరికతో తినవోయ్ బావా...'' తన ప్రేమనంతా కూరి గుత్తొంకాయ కూర చేసాను అని బావను పిలుస్తుంది ఈ వెర్రిపిల్ల.



అల్లం పచ్చిమిర్చి,కొత్తిమిర వేసి వండినా, మసాలా కూరి గుత్తిగా వండినా, నిప్పులపై కాల్చి పచ్చడి చేసినా అదిరిపోయే రుచి గలది ఈ ముద్దుల వంకాయ.

వంకాయ వంటి కూరయు
పంకజముఖి సీతవంటి భామామణియున్ అని పెద్దలు ఊరకే అన్నారా

Get this widget | Track details | eSnips Social DNA


ఈ సోదంతా ఎందుకంటారా? అదేం లేదండి.. ఇంతకు ముందే గుత్తి వంకాయ కూరా చేసా. ఈ వంకాయ మీద పాటలున్నట్టు గుర్తొచ్చింది. మరి వినుకోండి ఈ గుత్తొంకాయ పాటలు.. ముందుగా ఓ చిన్న తునక.


భలే మంచి కూర పసందైన కూర
మసాలాతో కూరిన వంకాయ కూర .. మసాలా కూరిన గుత్తి వంకాయ కూర

ఇంటిలోని అందరిని రారమ్మని పిలిచే కూర
ఘుమఘుమలతో చుట్టుపక్కల గుభాలించే కూర
చూడగానే నోరూరించే వేడి వంకాయ కూర



మరి ఈ పాట రాసింది, పాడింది ఎవరో చెప్పగలరా??



గుత్తి వంకాయ కూరోయ్ బావా

గుత్తి వంకాయ కూరోయ్ బావా
కోరి వండినానోయ్ బావా ||గుత్తి||

కూర లోపల నా వలపంతా
కూరపెట్టి నానోయ్ బావా
కోరికతో తినవోయ్ బావా ||గుత్తి||

తీయని పాయసమోయ్ బావా
తీరుగ వండానోయ్ బావా
పాయసములో ప్రేమనియేటి
పాలు పోసినానోయ్ బావా
బాగని మెచ్చాలోయ్ బావా ||గుత్తి||

కమ్మని పూరీలోయ్ బావా
కరకర వేచానోయ్ బావా
కరకర వేచిన పూరీల తన
కాంక్ష వేసినానోయ్ బావా
కనికరించి తినవోయ్ బావా ||గుత్తి||

వెన్నెల యిదిగోనోయ్ బావా
కన్నుల కింపౌనోయ్ బావా
వెన్నెలలో నా కన్నెవలపనే
వెన్న కలిపినానోయ్ బావా
వేగముగ రావోయ్ బావా ||గుత్తి||

పూవుల సజ్జదిగో
మల్లెపూవుల పరచిందోయ్ బావా
పూవులలో నాయవ్వనమంతా
పొదిపి పెట్టినానోయ్ బావా
పదవోయ్ పవళింతాం బావా

పాటలతో పాటు కొన్ని వంకాయ వంటకాలు. ఇక్కడ...

Monday 23 August 2010

అంకెలలో పద్య సంకెలలు

బ్లాగు మొదలెట్టిన తొలిరోజులలో రాసిన వ్యాసం ఇది. దాదాపు మూడేళ్ల క్రింద అనుకుంటా పొద్దులో ప్రచురించబడింది. పాత మెయిల్స్ చూస్తుంటే ఈ వ్యాసం కనపడింది. సరే మరోసారి చదువుకుందామని ఇలా టపాయించేస్తున్నాను. ఆచార్య తిరుమలగారి నవ్వుటద్దాలు పుస్తకంలోని ఒక రచన ఆధారంగా ఈ వ్యాసం రాసాను.


అంకెలతో సాహిత్యానికి చాలా సంబంధం ఉంది. ఈ మహా సృష్టిని అంకెల ఆధారంతోనే గుర్తిస్తాము . జ్ణానానికి సంఖ్య ఆధారం. కాని అంకెకు ప్రత్యేక అస్థిత్వమంటూ లేదు.అసలు అంకెల ఆధారిత పేర్లు ఎన్నో . ఏకావ్రతుడు, త్రివిక్రముడు,చతుర్ముఖుడు, పాంచాలి, సప్తాశ్వుడు, అష్టావక్రుడు, నవనాధుడు, దశకంఠుడు మొదలైనవి. మన కవులు కవితలల్లడానికి ఇదీ అని ఒక వస్తువు కాని విషయం కాని ఆలోచించరు. కనపడ్డ ప్రతి దానిపై చమత్కార పద్యాలల్లగల్ల ధీమంతులు .


ఆధ్యుడున్న యప్పు డందరు పూజ్యులే
లెక్క మీద సున్న లెక్కినట్లు
అతడు పోవు వెనుక నంద రపూజ్యులే
లెక్కలేక సున్న లేగినట్లు!!

అని ఓ కవి గొప్పవాడిని అనుసరించే జనులను సున్నాతో పోల్చాడు. సున్నాకి ఎదైనా అంకెతో కూడినప్పుడే తప్ప ప్రత్యేకంగా విలువ లేదు కదా !


మేమేమి తక్కువ తిన్నాం అంటూ ఇంకో కవి హనుమత్సందేశాన్ని అంకెల్లో దాచి మరీ గంభీరంగా చెప్పాడు.


అంచిత చతుర్ధ జాతుడు
పంచమ మార్గమున నేగి ప్రధమ తనూజన్
గాంచి తృతీయం బక్కడ
నుంచి ద్వితీయంబుదాటి యొప్పుగ వచ్చెన్!!

ఈ పద్యాన్ని పంచభూతములతో అన్యయించుకొని చెప్పుకోవాలి.1.భూమి 2. నీరు 3. అగ్ని 4. వాయువు 5. ఆకాశాలు .

చతుర్ధజాతుడు అనగా వాయుపుత్రుడైన హనుమంతుడు పంచమ మార్గమున(ఆకాశ మార్గాన ) వెళ్ళి, ప్రధమ తనూజను(భూమిపుత్రి సీత) చూసి , తృతీయంబు(అగ్ని)నక్కడ నుంచి అంటే లంకా దహనం చేసి ద్వితీయంబు( నీరు-సముద్రం) దాటి తిరిగొచ్చాడు అని అర్ధం. ఒప్పుకుంటారా కవి సామర్ధ్యాన్ని .


గద్వాల సోమరాజుని పొగడుతూ ఓ కవి ఎంత గమ్మత్తుగా ఆకాశానికెత్తేసాడో చూద్దామా!!

నలుగురు బలికిరి సరియని
నలుగురు బలి కిరి సురూప నయ దాన ధరా
వలయ ధురా చరణోన్నతి
పొలుపుగ గద్వాల సోమ భూపాల నకున్!!

గద్వాల రాజు (సురూప) అందంలో నలుడు , (నయ) బుద్ధిలో గురుడు అంటే బృహస్పతి, దానంలో 'బలి " చక్రవర్తి, ధరావలయాని(భూమిని) మోయటంలో (కిరి) వరహావతారంగా అని అంటే నలు-గురు- బలి-కిరి ట.


ఇలాంటి వాళ్ళని చూసి ఒళ్ళు మండిన ఆడిదం సూరకవి దేవుడితో మొర పెట్టుకున్నాడంట..


దేవునాన మున్ను దేశాన కొకరుండు
ఇప్పుడూర నూర నింట నింట
నేడ్వు రార్వు రేడ్వు రెనమండ్రు తొమ్మండ్రు
పదువు రైరి కవులు పద్మనాభ!!


ఇదివరకు దేశానికొక్క కవి ఉంటే నేడు ఇంటికి పదిమంది తయారయ్యారు భగవంతుడా!!


భావ కవిత్వాన్ని అభావ కవిత్వంగా జమ కట్టి హేళన చేస్తూ అనంత పంతుల రామలింగస్వామిగారు ఇలా అన్నారు.

రెండు కాకులు కూర్చుంటె బండ మీద
నొండెగిరిపోయె నంత నందొండు మిగిలె
రెండవది పోయె పిదప నందొండు లేదు
బండ మాత్రము పాప మందుండి పోయె!!

కాని ఇది చూస్తూ ఊరకుండని కొందరు ప్రబుద్ధులు ఈ హేళనలోనుండి కూడా వేదాంత పరమైన అర్ధాన్ని చెప్పి భావ కవిత్వానికి కూడా ఒక అర్ధం ఉంటుందని ఋజువు చేశారు . ఇందులో జీవాత్మ, పరమాత్మ అనే కాకులు బండ అనే శరీరంలో ఉన్నాయి. జీవాత్మ ఎగిరిపోయి పరమాత్మలో కలియగానే పాపం బండ లాంటి శరీరం మిగిలిపోయిందంట .


ఇక ఈ కవులు సుందర సుకుమారి స్త్రీని కూడా వదలకుండా అంకెలతో ఆటలాడారు. ఎలా అంటారా ?? ఆమె ముఖం మీదె లెక్కలేసారు మన శృంగార ప్రియులు.

అనువై నెన్నుదు రొంటు గాఁ బదునొకండై బొమల్ జంటగా
ఘనతం బోల్పగ రెండు రెండు తొమ్ముదులునై కర్ణద్వయం బొప్పగా
గ పూర్ణస్థితి బర్వులీల నెసగంగా నింతయుంగూడ దా
దిన సంఖ్యం దిలకింప నిండు నెలగా దీపించు మో మింతికిన్!!


ఆమె నుదురు ఒకటిలా, కనుబొమలు పదకొండులా చెవులు రెండు తొమ్మిదుల్లా వుండి పూర్ణిమ నాటి చంద్రునిలా ముఖం ప్రకాశిస్తుందని ఆయన గారి వెర్రి సంబరం. అర్ధం కాలేదు కదా!


1 2 3 4 5 6 7 8 9 10

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦


ఆమె నుదురు 1 , కనుబొమలు 11 , చెవులు 99 లా ఉన్నాయి .
1+11+9+9 = 30 అయి పూర్ణిమ నాటి చంద్రునిలా ఉందని కవి చమత్కారం .


పెళ్ళికాని యువకులకు కవి కస్తూరి రంగనాధుడు ఎటువంటి కన్యను చూసి వివాహం చేసుకోవాలో చెప్తున్నారు.


కన్యకునైదు జంఘలును కన్యకు నేడు విశాల నేత్రముల్
కన్యకు నాల్గు కన్బొమలు కన్యకు నారు కుచద్వయంబులున్
కన్యకు ద్వాదశంబరయగా వర మధ్యము గల్గినట్టి యా
కన్యకు నీకునుం బదియు గావలె కస్తూరి రంగ నాయకా!!



ఈ పద్యం ఖగోళశాస్త్ర పరిజ్ణానంతో అర్ధం చేసుకోవాలి. ఖగోళంలో 12 రాశులున్నాయి . 1. మేషం 2. వృషభం 3. మిధునం 4 . కర్కాటకం 5. సింహం 6. కన్య 7. తుల 8. వృశ్చికం 9. ధనుస్సు ౧10. మకరం 11. కుంభం 12 మీనం. ఇప్పుడు 'కన్య' రాశి నుండి మొదలుపెడితే ఐదో రాశి మకరం (మొసలి వంటి పిక్కలు), ఏడో రాశి మీనం ( చేపల్లాంటి కళ్ళు), నాలుగో రాశి ధనుస్సు( విల్లు వంటి కనుబొమలు), ఆరో రాశి కుంభం ( కుంభాల వంటి కుచాలు), పన్నెండో రాశి సింహం(నడుము ), పదో రాశి మిధునం (జంట). ఈ లక్షణాలు కలిగిన కన్య నీకు జంట కావాలని కోరిన కవి ఇలా 'రాశి' పోశాడు.


మేము మాత్రం తక్కువ తిన్నామా అంటూ తిరుపతి వేంకట కవులు తమ 'శ్రవణానందం ' కావ్యంలో ఒక స్త్రీకి ఎంత విలువ కట్టారో చూడండి.

పలుకొక్కటియే సేయు పదివందల వరాలు
వాలు చూపులు రెండు వేలు సేయు
నగవొక్కటియెసేయు నాల్గువేల వరాలు
విర్రవీగుట లారువేలు సేయు
పదమొక్కటియె సేయు పదివేల వరహాలు
లావణ్యమది యొక లక్ష సేయు
బలుసోయగమె సేయు పది లక్షల వరాలు
కులుకు నడక తీరు కోటి సేయు
ముద్దు గుల్కెడు నెమ్మోము మూడుకోట్లు
నాస సొబగెన్న డెబ్బది నాల్గు కోట్లు
నుదుటి సింధూర నామమ్ము నూరు కోట్లు
నీకు వెల జెప్ప శక్యమే నీలవేణి!!


సంఖ్యాగత శ్లోకాలు కొన్ని చూద్దాం!

లాల యేత్ పంచవర్షాణి - దశ వర్షాణి తాడయేత్
ప్రాప్తేత్తు షోడశే వర్షే - పుత్రం మిత్రవ దాచరేత్!!

కొడుకుని ఐదేళ్ళవరకు బుజ్జగించాలి. పదేళ్ళ వరకు కొట్టి బుద్ధి చెప్పాలి . పదహారో ఏటి నుండి స్నేహితునిలా చూడాలని పై శ్లోకం చెప్తుంది. ఎందుకంటే పుట్టినవాడు శూరుడో, పండితుడో , మహా వక్తో,దాతో కావాలి గాని పరమ శుంఠ కాకూడదు కదా! కాని అది కూడా దుర్లభమంటుంది ఈ శ్లోకం …..


శతేషు జాయతే శూరః సహస్రేషు చ పండితః
వక్తా దశ సహస్రేషు దాతా భవతి వా నవాః


అంటే వందమందిలో ఒక పండితుడు, పదివేల మందిలో ఒక మహావక్త పుడతారేమో గాని దాత అనేవాడుంటో లేదో అని సందేహ పడుతున్నా అటువంటి కోవకు చెంది వుండాలంటే మనిషికి కొన్ని నియమాలు ఉండాలి .అవి ఏవంటే….


శత విహాయ భోక్తవ్యం - సహస్రం స్నాన మాచరేత్
లక్షం విహాయ దాతవ్యం - కోటిం త్యక్త్యా హరిం భజేత్!!

వంద పనులు విడిచిపెట్టయినా వేళకు భోజనం చేయాలి. వేయి పనులు విడిచి స్నానం చేయాలి . లక్ష పనులు విడిచి దానం చేయాలి. కోటి పనులు విడిచి దైవ ప్రార్ధన చేయాలి…

Monday 16 August 2010

ఏందిరా భాయ్ ఈ సెల్లు లొల్లి




నమస్తే ! మీ నంబర్ ఏంటి?... ఇది ఒక వ్యక్తీ పరిచయం కాగానే అడిగే మొదటి మాట . ముందు అతని నంబర్ సేవ్ చేసుకుని తర్వాత మిగతా ముచ్చట్లు. ఇంతకూ ముందు ఐతే ఇంటికో ఫోన్ ఉండేది. దానికి కాల్ చేస్తే ఇంట్లో ఉంటే మాట్లాడతాడు లేకుంటే వచ్చాక మాట్లాడొచ్చు అని ఉండేది. కాని ఇపుడు ఏ వ్యక్తినైనా ఏ సమయంలో అయినా పట్టుకునే సులువైన మార్గం మొబైల్ ఫోన్. అవసరానికి పనికొచ్చే వస్తువుగా ప్రారంభమైన ఈ సెల్లు వాడకం ఇపుడు అత్యవసరం ఐపోయింది. ఎంతగా అంతే బాత్ రూం లోకి కూడా తీసుకెళ్తున్నారు. గుళ్ళో దేవుడికి పూజ చేసే పంతులు మంత్రాలకు మధ్యలో తన మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. ప్రదక్షిణాలు చేస్తున్న వ్యక్తి మధ్యలో ఫోన్ వస్తే మాట్లాడుతూనే తిరుగుతూ ఉంటాడు. అదేం భక్తో మరి? స్కూలు పిల్లలకు కూడా మొబైల్ అవసరమే అంటున్నారు కొందరు బడాబాబులు, అమ్మలు. కాలేజీ పిల్లలకైతే అన్నం లేకున్నా సెల్లు ఉంటే చాలు. ఒకటే ముచ్చట్లు. మనిషి మనిషికి మధ్య దూరాన్ని తగ్గించడానికి ఈ సాధనం కనుక్కున్నారు .కాని అది ఆ దూరాన్ని మరింత పెంచుతుంది. పక్క రూం లో, క్యాబిన్ లో ఉన్న వ్యక్తితో మాట్లాడాలంటే సులువైన మార్గం మొబైల్. నడిచి వెళ్లి అతనితో మాట్లాడే ఓపిక లేదో,సమయం లేదో, బద్ధకమో మరి..


ఈ అవసరాన్ని తమ వ్యాపార సూత్రంగా మార్చుకున్నాయి కంపీనీలు. పుట్టగొడుగుల్లా రోజుకో కొత్త మొబైల్ కంపెనీ,మాడలు. వాటికి దీటుగా రింగ్ టోన్లు, కాలర్ ట్యూన్లు. ఈ వ్యాపారంలో పేరు, డబ్బు సంపాదించుకోవడానికి కొత్త ఆఫర్లు. ఒకడిని చూసి ఇంకోడు బట్టలిప్పుకుంటున్నాడు. ఈ మధ్య ఫోన్ రెట్లు, కాల్ రెట్లు ఒకరిని చూసి ఇంకొరు తగ్గించేస్తున్నారు. ఈ కాల్ రెట్లు, మెసేజుల రెట్లు ఎంతగా ప్రభావితం చేసాయంటే పనిమనుష్యులు, బిచ్చగాళ్ళు, కూరగాయల బండి వాడు కూడా సెల్ మెయింటైన్ చేస్తున్నాడు. నాకు సెల్ లేదు అన్నవాడు పిచ్చోడు ఈరోజుల్లో. సేల్ ఫోన్ మోడల్ బట్టి అతని గౌరవం విలువ కడతారు కొందరు మహానుభావులు. ఉద్యోగాలు,వ్యాపారస్తులకు ఈ సెల్లు చాలా ఉపయోగకరమే. కాని అది ఎంతో మంది చేతుల్లో దుర్వినియోగం అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఎన్నెన్నో..

ఓ చిన్న జోకు..
"హలో!"
"హలో! ఇది ఫలానా కస్టమర్ కేర్. మీకే విధమైన సేవ చేయగలం?"
"హలో! నేనో కంప్లెయింట్ చేయాలి"
"చెప్పండి"
"నా నంబర్ కి కాల్ చేయకండి. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.మా అమ్మకు తెలిస్తే అది కాన్సిల్ చేయిస్తుంది.మీరు చేయొద్దు"
"సరే చేయం కాని. ఏ నంబర్ అండి?"
"అమ్మా! నంబర్ చెప్తే మీరు కాల్ చేస్తారు. మా అమ్మకు తెలిస్తే చంపేస్తుంది.మీరు చేయనపుడు ఆ నంబర్ ఎందుకు చెప్పాలి?"
"ఏదైనా ఆఫర్ ఉంటే కాల్ చేస్తాము, బిల్ కట్టకుంటే కాల్ చేస్తాము అంతే"
"వద్దు.. చేయొద్దు.మీరు కాల్ చేసి మా అమ్మకు కంప్లెయింట్ చేస్తే నేను మీ ఆఫీసుకు వచ్చి కంప్లెయింట్ చేస్తాను."
" సరే చేయనులెండి"
ఇలా ఒక అమాయకుడు ఇంగ్లీషులో చేసిన సెల్లు లొల్లి వినండి మరి.



ఇది వింటుంటే మన తెలుగు న్యూస్ చానెల్స్ లో యాంకరమ్మలు తెలుగు మాట్లాడడానికి బలవంతంగా పడుతున్న పాట్లు గుర్తొస్తాయి. కాదంటారా?


ఈ సందర్భంగా ఓ గీతోపదేశం కాదు కాదు.. సెల్లోపదేశం..(మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా స్టైలులో పాడుకోండి)

మత్తు వదలరా సెల్ ఫోన్ మత్తు మదలరా
ఆ మత్తులోన పడితే అడ్డంగా బుక్కవుదువురా.. //మత్తు//


జీవితమున సగభాగం ఫోన్ సోల్లుకే సరిపోవు
మిగిలిన ఆ సగభాగం బిల్లు కట్టుతకే సరిపోవు.
సెల్లుఫోన్ లేనివారు పనికిరాని మూర్ఖులు
వద్దురా అంటే చెడామడా తిడతారు ... // మత్తు //

రింగ్ టోన్స్, కాలర్ ట్యూన్స్ పిచ్చిగా వాడకురా
పాటలు వింటూ రోడ్డు మాత్రం దాతకురా (చస్తావుర్రోయ్)
బుద్ధి చెప్పడం మావంతు తప్పు తెలుసుకోవడం నీ వంతు
సెల్లు లేకున్నా నడిచే కాలం చూడు మారకుంటే నీ ఖర్మం.. //మత్తు //

( ఈ టపా రాస్తుంటే రేడియోలో ఈ పాట వచ్చింది. అప్పటికపుడు ఇలా రాసేసాను. సరదాగా.. )

Sunday 8 August 2010

జై శ్రీరామ్




పువ్వు పుట్టగానే పరిమళిస్తుందా? ఏమో కాని కృషి ఉంటే సాధన చేస్తే తప్పకుండా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతున్న ఒక యువకుడు ఈరోజు సంగీత ప్రపంచపు సింహాసనానికి చేరువలో నిలిచాడు. అతని ప్రతిభను ఎన్నో వారాలుగా సోనీ టేవీలో చూస్తూనే ఉన్నాం. సుమారు రెండులక్షలమంది ఔత్సాహికులలో ఎన్నికైన 120 మంది పోటీదారులలో తలపడి ఇండియన్ ఐడల్ కిరీటాన్ని అందుకోవడానికి అతి చేరువలో ఉన్న శ్రీరామచంద్ర. గతంలో ఈటీవీ వారు నిర్వహించిన ఒక్కరే పాటల పోటీలో గెలిచిన శ్రీరాం తన స్వరప్రస్థానాన్ని జాతీయ స్థాయిలో మొదలుపెట్టి ఎందరో ప్రముఖుల అభినందనలు, ఆశీస్సులు అందుకుంటూ ఉన్నాడు. మనవాడైన , హైదరాబాదు వాసుడైన శ్రీరాం ఇండియన్ ఐడల్ పోటీ గెలవడానికి అక్కడి న్యాయనిర్ణేతలే కాక మనందరి సహకారం తప్పకుండా అవసరమున్నది. ప్రజల సందేశాల (SMS) ల ద్వారానే అతని గెలుపు స్వాతంత్ర్య దినోత్సవం రోజు సాకారమవుతుంది. అతను తెలుగువాడు అని మాత్రమే కాకుండా అతని ప్రతిభను చూసి గెలిపించాలి. దాదాపు చాలా పోటీలలో ఉత్తరాదివారే పాల్గొంటారు. హిందీ చానెళ్లు దక్షిణాదివారు తక్కువగా చూస్తారు అందుకే ఈ పోటీల గురించి అంతగా తెలీదు. ఈ పోటీ గెలిస్తే అతనికి డబ్బు, పేరు వస్తుంది మనకేంటి అంటారా? అలా అనుకుంటే మాత్రం నేనేమి చెప్పలేను. ఈ పాటలు చూసి అతనికి ఓటేస్తారని అనుకుంటున్నాను. అతను పాడే బాలు , ఘంటసాల, రఫి, కిషోర్, శంకర్ మొదలైన వారి పాటలు వింటుంటే ఆ గాయకులే అతనిలో పరకాయ ప్రవేశం చేసారేమో అనిపిస్తుంది. బాలుకి వారసుడు ఈ శ్రీరాం అవుతాడా??


మా అబ్బాయి తన క్లాస్‌మేట్ ఐన శ్రీరాం గురించి నా స్నేహితులకు చెప్పమంటే ఈ టపా పెడుతున్నా.. కాని నిజంగా అతను ప్రతిభావంతుడే..

రేపటినుండి ఇండియన్ ఐడల్ షో సోనీ టీవీలో ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారమవుతుంది. శ్రీరాం పాటలు నచ్చితే ...

SREERAM అని టైప్ చేసి 52525 కి SMS చేయండి.

Friday 6 August 2010

సృష్టిధర్మంలో పావులం! ఆగస్ట్ 2010 కంప్యూటర్ ఎరా సంపాదకీయం

ఏదైనా ఒక పని జరిగినా, ఇద్దరు మనుషులు కలిసినా, మరో సంఘటన ఏదైనా తటస్థించినా ఈ సృష్టిలో ప్రతీ దానికీ ఓ లక్ష్యం, గమ్యం నిర్దేశించబడి ఉంటాయి. ఇద్దరు వ్యక్తుల స్థాయి నుండి యావత్‌ ప్రపంచపు స్థాయి వరకూ ప్రతీదీ మన అంచనాకంటూ అందని ఓ లయబద్ధమైన అమరికలో నడిచిపోతూ ఉంటుంది. మన వరకూ మనం ఈ క్షణం మనకు ఎదురైన అనుభవాన్ని విశ్లేషించి కుంగిపోవడమో, పొంగిపోవడంతోనో సరిపెట్టుకుంటూ ఉంటాం తప్ప.. ఈ సంఘటన ఓ గొలుసుకట్టు చర్యల క్రమంలో ఒక భాగమని గ్రహించం! అన్నింటికన్నా ముఖ్యంగా మన జీవితంలో ఎదురైన ఓ సంఘటన పూర్తిగా మనల్ని ఒక్కరినే ప్రభావితం చేస్తోందని గుడ్డిగా భ్రమిస్తుంటాం. అలాంటి సంఘటనలు పునరావృతం అవకుండా వాటి దశా, దిశలను మార్చడానికి ప్రయత్నిస్తాం.. అందులో ఒక్కోసారి కొంతవరకూ కృతకృత్యులమవుతాం. ఇలాంటి మానవ ప్రయత్నాల ఫలితాలే ‘‘అన్నీ మన చేతిలోనే ఉన్నాయనే అహంభావం!’’, ‘‘అస్సలు మనమేమీ చెయ్యలేమనే నిస్సహాయతా!’’.


ఇలా ప్రతీ సంఘటననూ మన ఒక్కరికే ఆపాదించుకోవడం వల్ల తలెత్తే భావావేశాలు ఇవి. ఈ రెండిరటిలోనూ వాస్తవం లేదు. అలాగని మునీశ్వరుల్లా ఏ ప్రయత్నమూ చెయ్యకుండా కూర్చోవడానికీ వీలవదే! మన నుండి మనం విడిపడి దూరంగా ప్రేక్షకుల్లా మన జీవితంలో చోటుచేసుకునే పరిణామాలూ, వాటి పర్యవసానాలూ, అవి ఇతరుల పై చూపించే ప్రభావాలూ, ఆ ఇతరులు మన ద్వారా సంక్రమించిన భావనాస్రవంతి ఆధారంగా మరికొందరిపై, పరోక్షంగా యావత్‌ సమాజంపై ప్రదర్శించే ప్రవర్తనలు.. వీటన్నింటినీ అంచనాకు అందినంత వరకూ విశ్లేషించడానికి పూనుకుంటే మనదని మనం విర్రవీగుతున్న ‘మనదైన ప్రపంచం’ ఎంత ఇరుకైనదో.. మన ఆలోచనలు ఎంత విస్తృతం అవాలో అర్థమవుతుంది. చిన్నతనంలో జీవించడం నేర్చుకుంటాం, ఆ తర్వాత జీవితంతో పోరాడతాం.. ఆ పోరాటంలో గెలుస్తాం. ఆ గెలుపు అన్నీ మన చేతిలోనే ఉన్నాయనే భ్రాంతిని కలిగిస్తుంది. ‘ఏదీ నీ చేతిలో లేదు’ అని నిరూపించడానికి వెంటనే ఏదో వైఫల్యం ఎదురవుతుంది. దాన్ని అర్థం చేసుకుని మన ఆలోచనల్లో పరివర్తన సాధిస్తే జీవితాంతం ఒద్దికగా ఉంటాం. ఆ వైఫల్యాన్ని జీర్ణించుకోలేక కుంగిపోతే, సృష్టి ధర్మానికి ఎదురీదాలని విశ్వప్రయత్నం చేస్తే అలసిపోతాం. ఇది ఆశావాదమన్పించినా, నిరాశావాదమన్పించినా ఈ ప్రపంచంలో మన ఉనికి పరమాణువంతే! మన ఉనికిని బ్రహ్మాంఢమంత పెంచుకోవడానికి మనం చేసే ప్రయత్నాలన్నీ మన జీవితంపై మనకు ఆశని కాపాడేటందుకే. మన ఉనికి ద్విగుణీకృతం అవుతున్నట్లు పరిస్థితులు గోచరించినా అదీ సృష్టి కార్యంలోని భాగమే తప్ప మన విజయం కాదు. మన విజయం కాకపోయినా మన విజయంగా భ్రమించేలా చేయాలి.. లేకపోతే మనం తదుపరి కర్మలను కొనసాగిస్తూ ముందుకు సాగిపోం! అందుకే సృష్టి మనకు ఉత్తేజాన్నిచ్చే ఎన్నో ఆనందాలనూ, పూడ్చుకోవలసిన ఎన్నో విచారాలనూ మన ముందుంచుతుంది. బుద్ధిమంతుల్లా వాటిని చక్కదిద్దుకునే పనిలో తలమునకలై జీవితాన్ని అర్థవంతంగా గడుపుతున్నామన్న భ్రమలో ముందుకు సాగిపోవడమే మనం చేయవలసిన, చేస్తున్న పనులు!


మీ
నల్లమోతు శ్రీధర్

Monday 2 August 2010

అందరూ అందరే...ముఖస్తుతి

మనకు సాయం చేసినవారిని, మంచిపనులు చేసేవారిని పొగడడం మంచిదే. అలా అని వేరేవాళ్ళని తక్కువ చేసి మాట్లాడ్డం ఎంతవరకు సబబు. భీమేశ్వర వరప్రసాది ఐన వేములవాడ భీమకవి చోడగంగు అనే రాజును పొగిడాడంట. కాని ఎంత శాపమిచ్చే శక్తి ఉంటే మాత్రం ఆ రాజును పొగడడానికి వేరేవాళ్ళని తక్కువ చేసి మాట్లాడం ఏం బావుంటుంది చెప్పండి. కాని వేములవాడ భీమకవి చమత్కార చాటువు. గమనించండి..

ఉ.
భోజుడు మంకు, ధర్మజుడు బొంకు, శచీపతి రంకు, కల్వ పూ

రాజు కళంకు, దైవత ధరాజము డొంకు, పయోధి యింకు అం

భోజ భవుండు పంకు, ఫణి భూషణ దేవుడు సంకు, పద్మినీ

రాజ హితుండు క్రుంకు , సరిరారు గుణంబుల నీకు ధారుణిన్.



ఎంత శపించే శక్తి ఉంటే మాత్రం ఈ కవి ఇలా తిడుతున్నాడేంటి అనుకుంటున్నారా? చమత్కారమంటే అదే మరి..



భోజుడు మంకు మనిషి. మొండి పట్టు వదలని విక్రమార్కుడు.

ధర్మజుడు బొంకు తాడు. అశ్వద్ధామ విషయంలో బొంకినవాడు కదా..

శచీపతి ఇంద్రుడు అహల్యతో రంకు నడిపినవాడు.

కలువల రాజు చంద్రుడు కళంకుడు. మచ్చ కలవాడు.

దైవత ధరాజాము అంటే కల్పవృక్షం కోరిన కోరికలు తీరుస్తుంది. కాని అది కూడా డొంకు తుంది. అంటే ఎండిపోతుంది అన్నమాట.

సముద్రం రత్నాలకు నిలయమైనా ఆతుపోతుల్లో వెనక్కిపోయి యింకు తుంది. కాదంటారా?

అంభోజ భవుడు అదేనండి బ్రహ్మదేవుడు పంకు తాడు. వృదాప్యం వాళ్ళ తల వణుకుతూ ఉంటుందని కవి భావన.

ఫణి భూషణ దేవుడు శంకరుడు సంకు (శంఖం లాగా తెల్లగా పాలిపోయి ఉంటాడు)

పద్మినీ రాజహితుడు (సూర్యుడు) రోజూ క్రుంకు తూ, అస్తమిస్తూ ఉంటాడుగా..



కనుక ఓ రాజా పైవాళ్ళందరూ నీలాగా సంపదలు కలిగి, వరాలివ్వగల వాళ్ళే అయినా, నీ గొప్పతనంతో, సుగుణాలతో ఏ మాత్రమూ సరిరారు. ..



ఇలా అంటే ఎవరు మాత్రం ఉబ్బి తబ్బిబ్బైపోరూ. :)

Sunday 1 August 2010

నేస్తమా నేనున్నాను.....


బ్లాగ్ మిత్రులందరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు ....


స్నేహమంటే మీరు చెప్పే నిర్వచనం ఏంటీ??

అరమరికలు లేకుండా మనసు విప్పి మాట్లాడుకునే తోడు స్నేహం. ఆడ మగ అన్న తేడాలు , వయసు అంతరాలు లేకుండా తప్పు చేస్తే నిలదీసి సరియైన మార్గం చూపేవాళ్లే అసలైన మిత్రులు. శ్రేయోభిలాషులు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మేమున్నామంటూ ధైర్యాన్ని ఇస్తూ ఓదార్చే స్నేహితులను పొందినవాళ్లు నిజంగా అదృష్టవంతులు, మిక్కిలి ధనవంతులు . ఒక్కోసారి కుటుంబ సభ్యులకు కూడా చెప్పుకోలేని విషయాలు మనసు తెలిసిన స్నేహితులతో పంచుకుని సేదతీరతాము. వాళ్లు ఇచ్చే సలహా, ధైర్యం మనను బాధనుండి ఉపశమనం ఇస్తుంది. మన జీవితంలో తోడు, నీడా, ధైర్యం, ధీమా, ఆప్యాయత ఇవ్వగల స్నేహితులు ఉంటే అంతకంటే గొప్ప ఐశ్వర్యం వేరొకటి ఉండదు. ఇటువంటి ఆత్మీయ మిత్రులను ప్రత్యక్షంగా కలిసే పని లేదు. తరచూ మాట్లాడుకోవాల్సిన పని అస్సలు లేదు. ఒక్క మాట , నా గురించి ఆలోచించే ఆత్మీయ స్నేహితులు ఉన్నారనే ఒక్క భావన చాలు... కాని ఈ స్నేహానికి ఎటువంటి అపనమ్మకం, అనుమానం, అసూయ అనేది ఉండకూడదు. ప్రతీ బంధం యాంత్రికమైన ఈ రోజుల్లో స్పటికమంటి స్వచ్చమైన స్నేహాన్ని అందివ్వండి. అందిపుచ్చుకోండి. భద్రంగా చూసుకోండి.

చిన్నప్పటినుండి దాదాపు ఒంటరిగానే పెరిగిన నాకు ఈ అంతర్జాలంలోనే పరిచయమై ఆత్మీయులుగా మారిన నా స్నేహితులు ఎప్పుడూ నా సంతోషాన్ని పంచుకుంటూ , నన్ను ప్రోత్సహిస్తూ, నా తప్పులు ఎత్తిచూపిస్తూ, బాధను కూడా అర్ధం చేసుకుని ఓదార్చి మామూలు మనిషిగా చేసేస్తారు. మరి ఆ ప్రియనెచ్చెలులకు ఏమివ్వగలను?? నావంతు సంతోషాన్ని వాళ్లకు రాసివ్వడం తప్ప..

THANK YOU MY DEAR FRIENDS.....

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008