Monday 23 August 2010

అంకెలలో పద్య సంకెలలు

బ్లాగు మొదలెట్టిన తొలిరోజులలో రాసిన వ్యాసం ఇది. దాదాపు మూడేళ్ల క్రింద అనుకుంటా పొద్దులో ప్రచురించబడింది. పాత మెయిల్స్ చూస్తుంటే ఈ వ్యాసం కనపడింది. సరే మరోసారి చదువుకుందామని ఇలా టపాయించేస్తున్నాను. ఆచార్య తిరుమలగారి నవ్వుటద్దాలు పుస్తకంలోని ఒక రచన ఆధారంగా ఈ వ్యాసం రాసాను.


అంకెలతో సాహిత్యానికి చాలా సంబంధం ఉంది. ఈ మహా సృష్టిని అంకెల ఆధారంతోనే గుర్తిస్తాము . జ్ణానానికి సంఖ్య ఆధారం. కాని అంకెకు ప్రత్యేక అస్థిత్వమంటూ లేదు.అసలు అంకెల ఆధారిత పేర్లు ఎన్నో . ఏకావ్రతుడు, త్రివిక్రముడు,చతుర్ముఖుడు, పాంచాలి, సప్తాశ్వుడు, అష్టావక్రుడు, నవనాధుడు, దశకంఠుడు మొదలైనవి. మన కవులు కవితలల్లడానికి ఇదీ అని ఒక వస్తువు కాని విషయం కాని ఆలోచించరు. కనపడ్డ ప్రతి దానిపై చమత్కార పద్యాలల్లగల్ల ధీమంతులు .


ఆధ్యుడున్న యప్పు డందరు పూజ్యులే
లెక్క మీద సున్న లెక్కినట్లు
అతడు పోవు వెనుక నంద రపూజ్యులే
లెక్కలేక సున్న లేగినట్లు!!

అని ఓ కవి గొప్పవాడిని అనుసరించే జనులను సున్నాతో పోల్చాడు. సున్నాకి ఎదైనా అంకెతో కూడినప్పుడే తప్ప ప్రత్యేకంగా విలువ లేదు కదా !


మేమేమి తక్కువ తిన్నాం అంటూ ఇంకో కవి హనుమత్సందేశాన్ని అంకెల్లో దాచి మరీ గంభీరంగా చెప్పాడు.


అంచిత చతుర్ధ జాతుడు
పంచమ మార్గమున నేగి ప్రధమ తనూజన్
గాంచి తృతీయం బక్కడ
నుంచి ద్వితీయంబుదాటి యొప్పుగ వచ్చెన్!!

ఈ పద్యాన్ని పంచభూతములతో అన్యయించుకొని చెప్పుకోవాలి.1.భూమి 2. నీరు 3. అగ్ని 4. వాయువు 5. ఆకాశాలు .

చతుర్ధజాతుడు అనగా వాయుపుత్రుడైన హనుమంతుడు పంచమ మార్గమున(ఆకాశ మార్గాన ) వెళ్ళి, ప్రధమ తనూజను(భూమిపుత్రి సీత) చూసి , తృతీయంబు(అగ్ని)నక్కడ నుంచి అంటే లంకా దహనం చేసి ద్వితీయంబు( నీరు-సముద్రం) దాటి తిరిగొచ్చాడు అని అర్ధం. ఒప్పుకుంటారా కవి సామర్ధ్యాన్ని .


గద్వాల సోమరాజుని పొగడుతూ ఓ కవి ఎంత గమ్మత్తుగా ఆకాశానికెత్తేసాడో చూద్దామా!!

నలుగురు బలికిరి సరియని
నలుగురు బలి కిరి సురూప నయ దాన ధరా
వలయ ధురా చరణోన్నతి
పొలుపుగ గద్వాల సోమ భూపాల నకున్!!

గద్వాల రాజు (సురూప) అందంలో నలుడు , (నయ) బుద్ధిలో గురుడు అంటే బృహస్పతి, దానంలో 'బలి " చక్రవర్తి, ధరావలయాని(భూమిని) మోయటంలో (కిరి) వరహావతారంగా అని అంటే నలు-గురు- బలి-కిరి ట.


ఇలాంటి వాళ్ళని చూసి ఒళ్ళు మండిన ఆడిదం సూరకవి దేవుడితో మొర పెట్టుకున్నాడంట..


దేవునాన మున్ను దేశాన కొకరుండు
ఇప్పుడూర నూర నింట నింట
నేడ్వు రార్వు రేడ్వు రెనమండ్రు తొమ్మండ్రు
పదువు రైరి కవులు పద్మనాభ!!


ఇదివరకు దేశానికొక్క కవి ఉంటే నేడు ఇంటికి పదిమంది తయారయ్యారు భగవంతుడా!!


భావ కవిత్వాన్ని అభావ కవిత్వంగా జమ కట్టి హేళన చేస్తూ అనంత పంతుల రామలింగస్వామిగారు ఇలా అన్నారు.

రెండు కాకులు కూర్చుంటె బండ మీద
నొండెగిరిపోయె నంత నందొండు మిగిలె
రెండవది పోయె పిదప నందొండు లేదు
బండ మాత్రము పాప మందుండి పోయె!!

కాని ఇది చూస్తూ ఊరకుండని కొందరు ప్రబుద్ధులు ఈ హేళనలోనుండి కూడా వేదాంత పరమైన అర్ధాన్ని చెప్పి భావ కవిత్వానికి కూడా ఒక అర్ధం ఉంటుందని ఋజువు చేశారు . ఇందులో జీవాత్మ, పరమాత్మ అనే కాకులు బండ అనే శరీరంలో ఉన్నాయి. జీవాత్మ ఎగిరిపోయి పరమాత్మలో కలియగానే పాపం బండ లాంటి శరీరం మిగిలిపోయిందంట .


ఇక ఈ కవులు సుందర సుకుమారి స్త్రీని కూడా వదలకుండా అంకెలతో ఆటలాడారు. ఎలా అంటారా ?? ఆమె ముఖం మీదె లెక్కలేసారు మన శృంగార ప్రియులు.

అనువై నెన్నుదు రొంటు గాఁ బదునొకండై బొమల్ జంటగా
ఘనతం బోల్పగ రెండు రెండు తొమ్ముదులునై కర్ణద్వయం బొప్పగా
గ పూర్ణస్థితి బర్వులీల నెసగంగా నింతయుంగూడ దా
దిన సంఖ్యం దిలకింప నిండు నెలగా దీపించు మో మింతికిన్!!


ఆమె నుదురు ఒకటిలా, కనుబొమలు పదకొండులా చెవులు రెండు తొమ్మిదుల్లా వుండి పూర్ణిమ నాటి చంద్రునిలా ముఖం ప్రకాశిస్తుందని ఆయన గారి వెర్రి సంబరం. అర్ధం కాలేదు కదా!


1 2 3 4 5 6 7 8 9 10

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦


ఆమె నుదురు 1 , కనుబొమలు 11 , చెవులు 99 లా ఉన్నాయి .
1+11+9+9 = 30 అయి పూర్ణిమ నాటి చంద్రునిలా ఉందని కవి చమత్కారం .


పెళ్ళికాని యువకులకు కవి కస్తూరి రంగనాధుడు ఎటువంటి కన్యను చూసి వివాహం చేసుకోవాలో చెప్తున్నారు.


కన్యకునైదు జంఘలును కన్యకు నేడు విశాల నేత్రముల్
కన్యకు నాల్గు కన్బొమలు కన్యకు నారు కుచద్వయంబులున్
కన్యకు ద్వాదశంబరయగా వర మధ్యము గల్గినట్టి యా
కన్యకు నీకునుం బదియు గావలె కస్తూరి రంగ నాయకా!!



ఈ పద్యం ఖగోళశాస్త్ర పరిజ్ణానంతో అర్ధం చేసుకోవాలి. ఖగోళంలో 12 రాశులున్నాయి . 1. మేషం 2. వృషభం 3. మిధునం 4 . కర్కాటకం 5. సింహం 6. కన్య 7. తుల 8. వృశ్చికం 9. ధనుస్సు ౧10. మకరం 11. కుంభం 12 మీనం. ఇప్పుడు 'కన్య' రాశి నుండి మొదలుపెడితే ఐదో రాశి మకరం (మొసలి వంటి పిక్కలు), ఏడో రాశి మీనం ( చేపల్లాంటి కళ్ళు), నాలుగో రాశి ధనుస్సు( విల్లు వంటి కనుబొమలు), ఆరో రాశి కుంభం ( కుంభాల వంటి కుచాలు), పన్నెండో రాశి సింహం(నడుము ), పదో రాశి మిధునం (జంట). ఈ లక్షణాలు కలిగిన కన్య నీకు జంట కావాలని కోరిన కవి ఇలా 'రాశి' పోశాడు.


మేము మాత్రం తక్కువ తిన్నామా అంటూ తిరుపతి వేంకట కవులు తమ 'శ్రవణానందం ' కావ్యంలో ఒక స్త్రీకి ఎంత విలువ కట్టారో చూడండి.

పలుకొక్కటియే సేయు పదివందల వరాలు
వాలు చూపులు రెండు వేలు సేయు
నగవొక్కటియెసేయు నాల్గువేల వరాలు
విర్రవీగుట లారువేలు సేయు
పదమొక్కటియె సేయు పదివేల వరహాలు
లావణ్యమది యొక లక్ష సేయు
బలుసోయగమె సేయు పది లక్షల వరాలు
కులుకు నడక తీరు కోటి సేయు
ముద్దు గుల్కెడు నెమ్మోము మూడుకోట్లు
నాస సొబగెన్న డెబ్బది నాల్గు కోట్లు
నుదుటి సింధూర నామమ్ము నూరు కోట్లు
నీకు వెల జెప్ప శక్యమే నీలవేణి!!


సంఖ్యాగత శ్లోకాలు కొన్ని చూద్దాం!

లాల యేత్ పంచవర్షాణి - దశ వర్షాణి తాడయేత్
ప్రాప్తేత్తు షోడశే వర్షే - పుత్రం మిత్రవ దాచరేత్!!

కొడుకుని ఐదేళ్ళవరకు బుజ్జగించాలి. పదేళ్ళ వరకు కొట్టి బుద్ధి చెప్పాలి . పదహారో ఏటి నుండి స్నేహితునిలా చూడాలని పై శ్లోకం చెప్తుంది. ఎందుకంటే పుట్టినవాడు శూరుడో, పండితుడో , మహా వక్తో,దాతో కావాలి గాని పరమ శుంఠ కాకూడదు కదా! కాని అది కూడా దుర్లభమంటుంది ఈ శ్లోకం …..


శతేషు జాయతే శూరః సహస్రేషు చ పండితః
వక్తా దశ సహస్రేషు దాతా భవతి వా నవాః


అంటే వందమందిలో ఒక పండితుడు, పదివేల మందిలో ఒక మహావక్త పుడతారేమో గాని దాత అనేవాడుంటో లేదో అని సందేహ పడుతున్నా అటువంటి కోవకు చెంది వుండాలంటే మనిషికి కొన్ని నియమాలు ఉండాలి .అవి ఏవంటే….


శత విహాయ భోక్తవ్యం - సహస్రం స్నాన మాచరేత్
లక్షం విహాయ దాతవ్యం - కోటిం త్యక్త్యా హరిం భజేత్!!

వంద పనులు విడిచిపెట్టయినా వేళకు భోజనం చేయాలి. వేయి పనులు విడిచి స్నానం చేయాలి . లక్ష పనులు విడిచి దానం చేయాలి. కోటి పనులు విడిచి దైవ ప్రార్ధన చేయాలి…

2 వ్యాఖ్యలు:

Unknown!!!

aha..excellent post jyothi gaaru..telugu chadvatam..koncham kastam aindhi kaani.. okkokati chaduvuthundhe..balega anipinchindhi.....last lo aa daiva prardhana..point naaku baaga nachindhi..

okka doubt..paina tab page lo kaani..browser lo kaani.. J ani image undhi...adhi ela andi vachedhi? chala bagundhi

అసంఖ్య

మంచి టపా!

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008